- కేంద్రం ప్రతిపాదించినదే మెరుగైన డీలిమిటేషన్ ఫార్ములా
- మాతృభాషను గౌరవిద్దాం… ఇతర భాషలపై ద్వేషాన్ని వదిలేద్దాం
- చెన్నైలో మీడియా సమావేశంలో సీఎం చంద్రబాబు
- కేంద్రమంత్రి పీయూష్ గోయల్తో కలిసి సీఎం ప్రెస్కాన్ఫరెన్స్
చెన్నై (చైతన్య రథం): తమిళనాడు రాష్ట్రానికి ఎన్డీయేతోనే పూర్వ వైభవం వస్తుందని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. అభివృద్ధి కావాలన్నా.. ఉద్యోగాలు రావాలన్నా… సంక్షేమం అందాలన్నా అది ఎన్డీఏతోనే సాధ్యమని ముఖ్యమంత్రి తేల్చి చెప్పారు. తమిళనాడులో రెండు రోజుల ఎన్నికల ప్రచారంలో భాగంగా కేంద్రమంత్రి పీయూష్ గోయల్తో కలిసి సీఎం చంద్రబాబు చెన్నైలో మంగళవారం ప్రెస్మీట్ నిర్వహించారు. ఏపీకి, తమిళనాడుకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేశారు. తమిళనాడు పూర్వ వైభవాన్ని వివరించారు. తమిళనాడునుంచి వచ్చిన ఎంతోమంది ప్రముఖులు, ఐఏఎస్ అధికారులు దేశానికి ఎలాంటి సేవలు అందించారో వివరించారు. ఇదే సందర్భంలో రాజకీయ కారణాలతో తమిళనాడు రాష్ట్రానికి ఇప్పుడు జరుగుతున్న నష్టాన్ని ముఖ్యమంత్రి మీడియాకు వివరించారు. గతంలో మొత్తం దక్షిణ భారతదేశానికే కేంద్రంగా ఉండే తమిళనాడు, చెన్నై… ఇప్పుడు బెంగళూరు, హైదరాబాద్వంటి నగరాలతో పోటీ పడగలుగుతున్నాయా?
అనే విషయాన్ని తమిళ ప్రజానీకం ఆలోచించాలన్నారు. తమిళ ప్రజలు ప్రోగ్రెసివ్ ఆలోచనలు చేస్తారని… ఇప్పుడు కూడా తమిళ ప్రజలు ఆ దిశగానే ఆలోచించి ఓట్లు వేయాలని ఏపీ సీఎం కోరారు. అర్థంపర్థం లేని వ్యతిరేకతతో మహిళలకు, దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం చేసిన డీఎంకే, కాంగ్రెస్వంటి పార్టీలను ఈ ఎన్నికల్లో దూరం పెట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు తమిళ ఓటర్లకు సూచించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ… “తిరువళ్ళూర్ నుంచి అబ్దుల్ కలాం వరకు ఎంతోమంది ప్రముఖులు ఈ గడ్డనుంచి వచ్చారు. తమిళనాడుకు చెందిన ఎంతోమంది ఉన్నతాధికారులు దేశానికి సేవ చేశారు, చేస్తున్నారు. తమిళ ప్రజలకు మాతృభాష అంటే ఎంతో ప్రేమ. కష్టించి పని చేసే మనస్తత్వం వారిది. ఘనమైన వారసత్వం, సంపద కలిగిన రాష్ట్రం తమిళనాడు. ఏపీ, తమిళనాడు రాష్ట్రాల ప్రజలది అన్నదమ్ముల బంధం. చెన్నై దాహార్తిని తీర్చేందుకు నాడే ఎన్టీఆర్ తెలుగు గంగ ప్రాజెక్టు ద్వారా తాగు నీరు అందించారు. ఇప్పుడు నదుల అనుసంధానం సాకారమైతే తమిళనాడుకు నీళ్లు సమృద్ధిగా అందుతాయి. ఇలాంటివి ఎన్డీఏతోనే సాధ్యం.
మన దేశానికి ఓ సంస్కరణవాది ప్రధానిగా ఉన్నారు. రాష్ట్రాలమధ్య అభివృద్ధి పోటీ ఉంది. దీనికి కేంద్ర ప్రోత్సాహం కూడా ఉంది. కానీ తమిళనాడులోని డీఎంకే, పశ్చిమ బంగాలోని టీఎంసీ, యూపీలోని సమాజ్ వాదీ, ఇక జాతీయస్థాయిలో కాంగ్రెస్ వంటి పార్టీలు మహిళా రిజర్వేషన్ బిల్లుపై కేంద్రాన్ని ఓడించామని భావిస్తున్నాయి. కానీ వారంతా కలిసి ఈ దేశ మహిళలను ఓడించారు. దక్షిణాది రాష్ట్రాలకు తీరని నష్టం చేకూర్చారు. జనాభాతో సంబంధం లేకుండా 50శాతం మేర నియోజకవర్గాలను పెంచాలనే కేంద్రం ప్రతిపాదన వల్ల జరిగే నష్టమేంటో డీఎంకే పార్టీ చెప్పగలదా..? కేంద్ర ప్రతిపాదనవల్ల దక్షిణాదికి ఎలాంటి నష్టం లేదని తెలిసినా… రాజకీయ కారణాలతో రెండు బిల్లులను వ్యతిరేకించారు. కొత్త సెన్సస్ ప్రకారం అయితే దక్షిణాది నష్టపోతుంది.
ప్రస్తుతం ఉన్న సీట్లపై 50 శాతం అదనంగా సీట్ల సంఖ్య పెరిగితే దానిపై మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు వచ్చేవి. దీనికన్నా మంచి ఫార్ములా మరొకటి ఉంటుందా..? మహిళలకు, పురుషులకు దక్షిణాది రాష్ట్రాలకు ఎలాంటి నష్టమూ లేదు. బిల్లులను అడ్డుకున్న రాహుల్ గాంధీ, స్టాలిన్ ఏం సాధించారు…? మహిళా రిజర్వేషన్లను అడ్డుకోవడం ద్వారా డీఎంకేకు ఏం కలిసి వచ్చింది…? రాజకీయాల కోసం బిల్లులను అడ్డుకోవడం సరికాదు. మహిళా, డీలిమిటేషన్ బిల్లులను గుడ్డిగా వ్యతిరేకించడం వల్ల మహిళలకు, దక్షిణాది రాష్ట్రాలకే నష్టం. నేను ఇలా మాట్లాడుతోంటే దక్షిణాదికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నానని నాపై ముద్ర వేస్తున్నారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న నేను… దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరిగేలా ఎందుకు చేస్తాను.? నేను దక్షిణాది రాష్ట్రాలవైపే మాట్లాడుతున్నాను. 2001లో వాజ్పేయి హయాంలో డీలిమిటేషన్ ప్రతిపాదన వస్తే జనాభా ప్రాతిపదికన డీలిమిటేషన్ చేస్తే దక్షిణాది రాష్ట్రాలకు నష్టమని చెప్పి ఆపించాను. ఈ విషయం ఇండి కూటమి పార్టీలు గుర్తుంచుకోవాలి” అని ముఖ్యమంత్రి చెప్పారు.
తమిళనాడుకు గత వైభవమేదీ..?
“తమిళనాడులో అభివృద్ధి ఆగింది. చెన్నైలాంటి నగరాలనుంచి ఇతర ప్రాంతాలకు వలస వెళ్తున్నారు. శాంతి భద్రతలు, మహిళలపై నేరాలు, కస్టోడియల్ మరణాలు, డ్రగ్స్ పెరిగాయి. గతంలో తమిళనాడుకు ఓ ఘన చరిత్ర ఉంది. ఇతర రాష్ట్రాలు తమిళనాడు నుంచి చాలా నేర్చుకున్నాయి. కానీ ఇప్పుడు పరిస్థితి ఏమిటి..? తమిళనాడు, చెన్నై దక్షిణాదిలో అభివృద్ధి చెందిన బెంగళూరు, హైదరాబాద్ వంటి నగరాలతో పోటీ పడగలుగుతున్నాయా..? ఒకప్పుడు దక్షిణాది ప్రాంతానికి చెన్నై నగరం కేంద్రంగా ఉండేది. కానీ ఇప్పుడా పరిస్థితి ఉందా..? గతంతో పోల్చుకుంటే తమిళనాడులో అభివృద్ధి లేదు. జరిగిన కాస్తో కూస్తో అభివృద్ధి కూడా కేంద్రం ఇస్తున్న నిధుల వల్లే జరుగుతోంది. చెన్నై రైల్వే స్టేషన్ ఆధునీకరణకు పెద్ద ఎత్తున నిధులు ఇచ్చారు. త్వరలో చెన్నై, బెంగుళూరు, అమరావతి లాంటి నగరాలను అనుసంధానించేలా హై స్పీడ్ రైలు కారిడార్ ను కేంద్రం ఆమోదించింది. గూగుల్ లాంటి కంపెనీలకు తమిళనాడు నుంచి వెళ్లిన సుందర్ పిచాయ్ నేతృత్వం వహిస్తున్నారు. తమినాడు యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కావాలి. డబుల్ ఇంజన్ సర్కార్ ద్వారా బులెట్ స్పీడ్ అభివృద్ధి వస్తుంది. డీఎంకేలాంటి రాజకీయ పార్టీలవల్ల అభివృద్ధి జరగటం లేదు. అభివృద్ధి కావాలంటే ఎన్డీఏకి ఓటు వేయాల్సిందే. దేశానికి వచ్చిన పెట్టుబడుల్లో 25 శాతం ఏపీకి వచ్చాయి. గూగుల్, ఆర్సెలార్ మిట్టల్లాంటి కంపెనీల నుంచి పెట్టుబడులు వస్తున్నాయి. మేము ఇతర రాష్ట్రాలతో పోటీ పడుతున్నాం. అభివృద్ధి కోసం పని చేస్తున్నాం. ఇదంతా కేంద్రం నుంచి వస్తున్న సహకారం వల్లే సాధ్యమైంది. డబ్బులు లేకున్నా వినూత్న విధానాలతో ల్యాండ్ పూలింగ్ పద్ధతిన భూమిని తీసుకుని రాజధాని నిర్మిస్తున్నాం. దానికి కేంద్రం సహకరిస్తోంది. ఇదేవిధంగా తమిళనాడు అభివృద్ధి కోసం పని చేసే అవకాశం ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలకు ఇవ్వాలి. జాతీయ ప్రయోజనాలతో పని చేస్తున్న ప్రధానికి మేం పూర్తి మద్దతు ఇస్తున్నాం. అదే విధంగా తమిళ ప్రజలు కూడా మద్దతివ్వాల్సి ఉంటుంది” అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.
“భిన్న సంస్కృతులున్నా.. మనమందరం భారతీయులం. తమిళ సంస్కృతి సంప్రదాయాలను ప్రధాని మోదీ ప్రమోట్ చేస్తున్నారు. ఒకే దేశంగా అన్ని రాష్ట్రాలూ కలిసి పని చేయాలి. కావేరి నది నీటి కోసం కర్ణాటక, తమినాడుల మధ్య వివాదం నడుస్తుంది. ఏపీలో కృష్ణా గోదావరి నదులు అనుసంధానం జరుగుతోంది. గంగా కావేరిల నదుల అనుసంధానం జరిగితే అన్ని రాష్ట్రాలకు నీటి భద్రత లభిస్తుంది. ఇది జరగాలంటే ప్రధానికి మరింత అండగా నిలవాల్సి ఉంటుంది. ప్రధాని మోదీపై వ్యతిరేకతతో భాషాపరమైన బేధాలు తీసుకురావడం సరికాదు. హిందీని కేంద్రం జాతీయ భాషగా ప్రకటించలేదు. మాతృభాషను గౌరవించాలి… మాతృ భాషతోనే మన సంస్కృతిని కాపాడుకోగలం. కానీ వివిధ భాషలు నేర్చుకోవడం వల్ల అభివృద్ధి సాధించగలం. మాతృభాషలోనే విద్యా బోధన జరగాలని ప్రధాన మంత్రి చెబుతున్నారు. ఏపీలో గత ప్రభుత్వం పాఠశాలల్లో బలవంతంగా ఇంగ్లీష్ అమలు చేయాలని చూస్తే.. కేంద్రమే అడ్డుకుంది. భాష అనేది ఇప్పుడు ఓ సమస్య కాదు. భాష కారణంగా అభివృద్ధిని అడ్డుకునేలా ఆలోచనలు చేయడం సరికాదు. భాషను అభివృద్ధి చేసుకోవాలి… రాష్ట్రాన్నీ అభివృద్ధి చేసుకోవాలి. దేశాభివృద్ధి కోసం రాష్ట్రం కూడా ప్రగతి మార్గంలో నడవాలి. అభివృద్ధి సాధిస్తేనే సంపద సృష్టి జరుగుతుంది సంక్షేమం సాధ్యం అవుతుంది. అది ఎన్డీఏ మాత్రమే చేయగలదు. రాజకీయాల్లోకి కొత్తగా వచ్చి పార్టీ పెట్టిన విజయ్ ఏ మేరకు రాణించగలడో ఇంకా చెప్పలేం” అని సీఎం చంద్రబాబు అభిప్రాయపడ్డారు.















