- మోదీజీ వికసిత్ భారత్… సీబీఎన్ విజన్… ప్రతిరూపమే భోగాపురం ఎయిర్పోర్ట్
- ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి గ్రోత్ ఇంజన్ ఉత్తరాంధ్ర
- అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవ సభలో మంత్రి లోకేష్
విశాఖపట్నం (చైతన్యరథం) ‘కొందరు ఎర్ర బస్సు రాని ఊరికి విమానాశ్రయం అవసరమా అన్నారు.
ఉత్తరాంధ్రను తక్కువగా అంచనా వేసి ఇక్కడి ప్రజలను అవమానించిన వాళ్లకి ఈరోజు దిమ్మ తిరిగే సమాధానమే అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవం. ఎర్ర బస్సు రాదు అన్నచోటకి ఎయిర్పోర్ట్ వచ్చింది. ఎర్ర బస్సు రాదు అన్నచోటకి ఎయిర్ బస్ వచ్చింది. ఎర్ర బస్సు రాదు అన్నచోటకి ఏకంగా మన నమో వచ్చారు. ఇదీ ఉత్తరాంధ్ర దెబ్బ… అర్థమైందా రాజా’ అంటూ రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ ఉత్తేజభరితంగా ప్రసంగించారు. భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవ సభలో ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తో కలసి మంత్రి లోకేష్ పాల్గొన్నారు.
ఉత్తరాంధ్ర కలలకు రెక్కలిచ్చిన నమో
ఎయిర్పోర్టు ఆవరణలో ఏర్పాటుచేసిన సభలో మంత్రి లోకేష్ మాట్లాడుతూ… స్వాతంత్య్రం కోసం పోరాడిన మహావీరుడు అల్లూరి సీతారామరాజు నడయాడిన గొప్ప నేల ఉత్తరాంధ్ర. ఈ రోజు నుంచి ఈ నేల చరిత్ర, పౌరుషం గురించి ప్రపంచం మొత్తం మాట్లాడుతుంది. ఈ రోజు కేవలం ఒక ఎయిర్పోర్ట్ ప్రారంభం మాత్రమే కాదు. మన నమో వికసిత్ భారత్, మన సీబీఎన్ విజన్ కలిసిన రోజు. ఉత్తరాంధ్ర భవిష్యత్తు మారే రోజు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో దూసుకెళ్లే రోజు. ఈ నేలపై స్వాతంత్య్రం కోసం పోరాడింది అల్లూరి సీతారామరాజు అయితే ఉత్తరాంధ్ర కలలకు రెక్కలు ఇచ్చింది మన నమో. రైతుల త్యాగం, కార్మిక కష్టం, మన సీబీఎన్ విజను ప్రతిరూపం ఈ విమానాశ్రయం. అల్లూరి సీతారామరాజుకి ఉన్న పట్టుదల, పౌరుషం, దేశ భక్తి నాకు మన నమోలో కనిపిస్తుంది. నమో అంటే ధైర్యం, నమో అంటే విశ్వాసం, నమో అంటే సురక్షిత భారత్. నమో అంటే శత్రువు గుండెల్లో భయం, అభివృద్ధి, పేదల సంక్షేమం, భవిష్యత్తుకు భరోసా
కోరుకునే వారికి ఒకే ఒక సమాధానం నమో.
డబుల్ ఇంజన్ బుల్లెట్ ట్రైన్ సర్కారు వల్లే అభివృద్ధి
రాష్ట్ర విభజన వల్ల మనం కట్టుబట్టలతో ప్రయాణం ప్రారంభించాం. అలాంటి రాష్ట్రాన్ని ఆదుకుంది మన నమో. దేశం మొత్తం నమో అంటే గౌరవ ప్రధాని నరేంద్ర మోదీజీ. ఏపీలో నమో అంటే నాయుడుజీ – మోదీజీ జోడీ. ఆ ఇద్దరి కలయికే డబుల్ ఇంజన్ బుల్లెట్ ట్రైన్ సర్కార్. మన రాష్ట్రంలో అతి పెద్ద ఎయిర్పోర్ట్ను రికార్డ్ టైమ్లో పూర్తి చేశారు. ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరం, అమరావతి పూర్తి చెయ్యడానికి నిధులు ఇచ్చారు. విశాఖ రైల్వే జోన్ ఏర్పాటు చేశారు. ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చి విశాఖ ఉక్కుని కాపాడారు. కర్నూలులో హైకోర్టు బెంచ్ కూడా ఏర్పాటు చేస్తున్నారు. గూగుల్ డేటా సెంటర్, ఆర్సెలర్ మిట్టల్ స్టీల్ ప్లాంట్, ఫైటర్ జెట్ ప్రాజెక్ట్స్ మన రాష్ట్రానికి రావడానికి కారణం మన నమో.
ఆ నమ్మకమే భోగాపురాన్ని ప్రపంచపటంలో పెట్టింది
మోదీజీ విజన్-నాయుడుజీ ఎగ్జిక్యూషన్-ఇద్దరి ఏకైక లక్ష్యం వికసిత్ ఉత్తరాంధ్ర. మోదీ భారత్ను ముందుకు తీసుకెళ్తున్నారు. నాయుడు ఆంధ్రప్రదేశ్ను ముందుకు తీసుకెళ్తున్నారు. వారిద్దరిపై ఇక్కడి ప్రజల నమ్మకమే భోగాపురాన్ని ప్రపంచపటంలో పెట్టింది. ఎన్డీఏకి కంచుకోట ఉత్తరాంధ్ర. గత ఎన్నికల్లో ఉత్తరాంధ్ర ప్రజలు ఎన్డీయేకి క్లీన్ స్వీప్ ఇచ్చారు. ఇప్పుడు ఉత్తరాంధ్ర అభివృద్ధి మా బాధ్యత. నదులు, అడవులు, వనరులు, తీరప్రాంతం ఉత్తరాంధ్రకు వరం. ప్రజా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉత్తరాంధ్రను అభివృద్ధికి కేరాఫ్ అడ్రస్ గా మార్చింది.
జన్మభూమి రుణం తీర్చుకున్న జీఎంఆర్
రాజాం నుంచి పారిశ్రామికవేత్తగా ఎదిగిన వ్యక్తి గ్రంధి మల్లికార్జునరావు, రికార్డ్ టైమ్లో ఎయిర్పోర్ట్ నిర్మించి జన్మ భూమి రుణం తీర్చుకున్నారు. శ్రీకాకుళం ముద్దుబిడ్డ, నా తమ్ముడు కేంద్ర మంత్రి రాముని కూడా అభినందిస్తున్నాను. ఐదు నెలల ముందే ఎయిర్పోర్ట్ పూర్తి చేశాడు. అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ఉత్తరాంధ్రకి వరం. ఇది ఉద్యోగ, ఉపాధి కేంద్రంగా మారబోతుంది. ఎక్స్పోర్ట్, ఇంపోర్ట్ హబ్ కాబోతుంది. పరిశ్రమలు, ఐటీ, టూరిజం, హాస్పిటాలిటీ రంగాలకు ఈ విమానాశ్రయం వారధి కాబోతోంది. రోడ్డు, రైలు, విమాన, వాటర్ కనెక్టివిటీతో ఉత్తరాంధ్ర ఆంధ్రప్రదేశ్, గ్రోత్ ఇంజన్గా నిలుస్తుంది.
ఉత్తరాంధ్ర అంటే వలసలు ఒకప్పుడు.. ఇప్పుడు భవిష్యత్తు
ఒక్కప్పుడు ఉత్తరాంధ్ర అంటే వలసలు, వెనకబాటుతనం, చిన్నచూపు. ఇప్పుడు ఉత్తరాంధ్ర అంటే ఉద్యోగాలు, ఉపాధి, బంగారు భవిష్యత్తు. ఇప్పుడు ఉత్తరాంధ్ర యువత ఉద్యోగాల కోసం విమానాలు ఎక్కాల్సిన అవసరం లేదు. అవకాశాలే విమానం ఎక్కి ఉత్తరాంధ్రకి వస్తాయి. రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు అయ్యింది. ఈ రెండేళ్లలో మన నమో రాష్ట్రానికి ఐదుసార్లు వచ్చారు. ఆంధ్రప్రదేశ్ అన్నా, ఇక్కడ ప్రజలు అన్నా ఆయనకు ఎంతో ప్రేమ. రాష్ట్రం కోసం మనం అడిగినవన్నీ ఆయన ఇచ్చారు. గుజరాత్లో ఒకే ప్రభుత్వం దీర్ఘకాలంగా కొనసాగుతోంది కాబట్టే అభివృద్ధి చెందింది. ఆంధ్రప్రదేశ్క కూడా అభివృద్ధి కావాలంటే ప్రభుత్వ కొనసాగింపు చాలా ముఖ్యం. సంక్షేమం-అభివృద్ధి ప్రజా ప్రభుత్వానికి జోడెద్దుల బండి. ఇది ఈస్ట్ ఇండియా కంపెనీ కాలం కాదు… ఇది ఈస్ట్ కోస్ట్ ఇండియా యుగం. ఇప్పుడు ఈస్ట్కెస్ట్ ఇండియా ఉజ్వలంగా ప్రకాశిస్తోంది. సుందర్బన్ నుంచి శ్రీహరికోట వరకు, ఎన్డీఏ డబుల్ ఇంజన్ ప్రభుత్వం రాకెట్లో దూసుకుపోతూ అభివృద్ధి సాధిస్తోంది. ఇది నమో (నరేంద్ర మోదీ) శక్తి- అని మంత్రి లోకేష్ ప్రశంసించారు.













