- ఎర్ర బస్సు రాని చోటికి ఎయిర్ బస్సా అన్నవారికి ‘భోగాపురం’ ఒక సమాధానం
- ఈ అభివృద్ధి కోసమే 2024 ఎన్నికల్లో తపనపడ్డాను..
- సెలవు లేకుండా కష్టపడుతున్న ప్రధానిని ఇష్టానుసారం మాట్లాడడం బాధించింది
- మూడవసారి ప్రధానిగా దేశాన్ని అన్ని రంగాల్లోనూ ముందుకు తీసుకెళ్తున్నారు
- మోదీ వెనుక బలంగా నిలబడదాం..
- అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవంలో డిప్యూటీ సీఎం పవన్
భోగాపురం (చైతన్య రథం): “2024 సాధారణ ఎన్నికల్లో రాష్ట్రంలో కూటమి కోసం ఎందుకు తపనపడ్డానంటే దేశ అభివృద్ధికి బలమైన నాయకత్వం అవసరం. ‘ఎర్ర బస్సు రాని చోట ఎయిర్ పోర్ట్ కడతారంట’ అంటూ అభివృద్ధిని అపహాస్యం చేసి, ఉత్తరాంధ్ర ప్రజల మనోభావాలను దెబ్బతీసిన నాయకులకు గట్టిగా సమాధానం చెప్పాలనే కూటమిలో కచ్చితంగా మూడు పార్టీలుండాలని తపనపడ్డాను. 2024 తర్వాత రాష్ట్రానికి ఎన్నో పెట్టుబడులు, పలు పరిశ్రమలు రావడానికి ఇది ఓ దారి చూపింది. భోగాపురం ఎయిర్పోర్ట్ లాంటి అతిపెద్ద అంతర్జాతీయ విమానాశ్రయం రావడానికి కారణమైంది” అని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. జాతి ఎవరికీ తల వంచదు, ఈ గుండె దేనికి భయపడదు అని చాటిన మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పేరు ఎయిర్పోర్టుకు పెట్టడం గర్వంగా ఉందన్నారు. భోగాపురంలో నిర్మించిన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవ. కార్యక్రమంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రసంగించారు.
పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ “ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఇది నూతన అధ్యాయం. రూ.17,435 కోట్ల అభివృద్ధి పనులు ప్రధాని చేతుల మీదుగా ప్రారంభం కావడం గొప్ప విషయం. ఈ పనులవల్ల రోడ్ల అనుసంధానం మరింత పెరుగుతుంది. ఎనర్జీ సెక్టార్లలో పరిశ్రమలకు అనువైన ఇంధన సరఫరా జరిగి, యువతకు మరింతగా ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. ఒక దేశం ఎప్పుడూ ప్రకటనలతో అభివృద్ధి చెందదు. మౌలిక సదుపాయాల కల్పన, సౌకర్యాలను మరింత విస్తృతం చేయడం ద్వారా దేశం ప్రగతి ప్రయాణంలో ముందుకు సాగుతుంది. ప్రధాని నరేంద్ర మోదీ వికసిత్ భారత్, ఆత్మనిర్భర భారత్ ప్రణాళికల్లో భారత్ను అన్ని రంగాల్లో ముందుకు తీసుకువెళ్లే గొప్ప దార్శనికత ఉంది. కచ్చితంగా చరిత్ర మనం నిర్మించే కట్టడాలను కాదు, ఆ కట్టడాలతో నిర్మించే భవిష్యత్ను గుర్తుంచుకుంటుంది” అని వ్యాఖ్యానించారు.
అభివృద్ధి బాటలు
కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత విశాఖపట్నంలో రూ.2 లక్షల కోట్ల రూపాయల అభివృద్ధి పనులను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రారంభం చేశారు. ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్ట్, జాతీయ రహదారుల ప్రాజెక్టులు, రూ.50 వేల కోట్లతో అమరావతి పనులు, రాయలసీమ అభివృద్ధికి రూ.13,400 కోట్ల ప్రాజెక్టులు రాష్ట్ర నిర్మాణానికి బలమైన పునాదులుగా నిలుస్తాయి. విశాఖలో సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ద్వారా ప్రజల ఆకాంక్షలు తీరనున్నాయి. దేశానికి నిస్వార్థంగా సేవ చేసినవారిని గౌరవించాలి పళ్ళున్న చెట్టుకే రాళ్ల దెబ్బలు అంటారు.. రాజకీయాల్లోకి వచ్చాక నన్ను కూడా చాలామంది అనరాని మాటలు అన్నారు. ఎన్నో నిందలు పడ్డాను. అయితే భారతదేశాన్ని ప్రగతి పథంలో నడిపిస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఇష్టానుసారం కొందరు తూలనాడుతుంటే గుండె కదిలిపోయింది. భారతదేశం ఒకప్పుడు ఖజానా దగ్గర ఉన్న బంగారాన్ని విదేశాలకు తరలించి తాకట్టు పెట్టి, రోజువారీ కార్యకలాపాలు నిర్వర్తించే దుస్థితి ఉండేది. ఆ పరిస్థితి నుంచి ఈనాడు ప్రపంచంలోనే బలమైన ఆర్థిక శక్తిగా మన దేశం రూపొందడంలో మూడోసారి ప్రధానిగా తన బాధ్యతలను ఎంతో నిబద్ధతగా నిర్వర్తిస్తున్న నరేంద్ర మోదీని అనరాని మాటలు అనడం బాధించింది. కన్నీళ్లు వచ్చాయి, బాధ పడ్డాను. దేశం కోసం నిస్వార్ధంగా కష్టపడే వారికి ఇవా బహుమతులు అనిపించింది?
ఒక్క రోజు సెలవు తీసుకోని ప్రధాని
పదవి బాధ్యతలు తీసుకున్న తర్వాత ఒక్కరోజు కూడా సెలవు తీసుకోకుండా భారతదేశాన్ని ముందుకు నడిపిన వ్యక్తి మోదీ. కొత్త తరం మోదీ పడిన తపన, శ్రమ తెలుసుకోవాలి. భారతదేశానికి విదేశీ పెట్టుబడులు బలంగా వస్తున్నాయి. విదేశీ మారక నిల్వలు రికార్డు స్థాయిలో మన దగ్గర ఉన్నాయి. శత్రు దేశాలు మన అభివృద్ధిని చూసి ఈర్ష్య పడుతున్నాయి. ఒక పక్క దేశాన్ని ముందుకు నడిపిస్తూ, సరిహద్దుల వద్ద శత్రు దేశాలతో పోరాడాలి. అంతర్గత శత్రువులతోనూ పోరాటం చేయాలి. అలాంటి వ్యక్తికి మనం చేయాల్సింది ఏమైనా ఉంది అంటే- మేమంతా మీ వెనుక ఉన్నాం.. దేశం కోసం మీతో కలిసి నడుస్తాం అనే భరోసాను ప్రధానికి మనం కల్పించాలి. మీ మీద మాట పడితే యావత్ భారతదేశం మీద మాట పడినట్లే అనే బలం ఇవ్వాలి. నేను సభా వేదిక సాక్షిగా చెబుతున్నాను… భారతదేశంలో నరేంద్ర మోదీకి సాటిగల నాయకుడు మరొకరు లేరు. రారు రాబోరు. 144 కోట్ల భారతీయుల ఆకాంక్షలను, ఆశలను బలంగా ముందుకు తీసుకువెళ్తుంటే, ఎన్నో సవాళ్లను ఆయన చిరు మందహాసంతోనే స్వీకరిస్తున్నారు.. వాటిని పరిష్కరిస్తున్నారు.
యువత దేశానికి వనరు
25 సంవత్సరాలలోపు పిల్లలు ఉన్న తల్లిదండ్రులకు ముఖ్యంగా నేను చెప్పేది ఒక్కటే. పిల్లలకు సరైన సంస్కారం, సంప్రదాయం నేర్పడం మన బాధ్యత. వారిని దేశానికి ఉపయోగపడే గొప్ప వనరులుగా మార్చాల్సిన ప్రాథమిక బాధ్యత మనపైనే ఉంది. ఉదయం ప్రధాని నరేంద్ర మోదీ వీడియో చూశాను. ఆయనను ఇష్టానుసారం తిట్టిన, తూలనాడిన యువతను సైతం పెద్ద మనసుతో ఆయన క్షమించడం గొప్ప విషయం. ఆయన స్వచ్ఛమైన మనసుకు వందనం. దేశాన్ని ముందుకు నడిపించడం అంటే రామకార్యం. హనుమంతుడు. రామకార్యం నిమిత్తం లంకకు లంఘించినప్పుడు ఎన్నో అవాంతరాలను ఎదుర్కొన్నాడు. అలాంటిది 144 కోట్ల మంది భారతీయులను ముందుకు నడిపించడం అంటే సాధారణ విషయం కాదు. అది మహాకార్యం. అలాంటి మోదీకి మనం ఏం ఇవ్వగలం..? ఆయనకు బలమైన మన విధేయత ఇవ్వాలి. ఆయన వద్దు అనుకున్న రోజు అధికారం పోవాలి తప్ప, అప్పటివరకు మోదీయే దేశాన్ని ముందుండి నడిపించాలని కోరుకుంటున్నాను” అని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.













