- భోగాపురం విమానాశ్రయంతో నాంది
- ఇకపై ఉత్తరాంధ్ర.. ఉత్తమ ఆంధ్ర
- నాడు ఎయిర్పోర్టుకు కొబ్బరికాయ కొట్టాం..
- నేడు గుమ్మడికాయ కట్టాం
- రైతులే కొత్త చరిత్రకు శ్రీకారం చుట్టారు
- రైట్ టైమ్.. రైట్ ప్లేస్..రైట్ మ్యాన్ మోదీ
- ఆయన నాయకత్వంలో రాష్ట్ర పునర్నిర్మాణానికి
- ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నాం
- ఉత్తరాంధ్రలో 8 ప్రాధాన్య ప్రాజెక్టులను పూర్తి చేస్తాం
- వంశధార-గోదావరి నదులను అనుసంధానిస్తాం
- అభివృద్ధిని అడ్డుకున్న పార్టీ అడ్రస్ లేకుండా పోయింది
- మోదీ లాంటి నాయకుడు దేశానికి లభించడం అదృష్టం
- 2047 వికసిత్ భారత్ ఆయనతోనే సాధ్యం
- ఆయన చేతులమీదుగానే పోలవరం, అమరావతి
- భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవ సభలో సీఎం చంద్రబాబు
- విమానాశ్రయాన్ని ప్రారంభించిన ప్రధాని మోదీ
- రాష్ట్రాభివృద్ధికి చంద్రబాబు శ్రమిస్తున్నారని ప్రశంసలు
భోగాపురం (చైతన్యరథం): ఉత్తరాంధ్ర ఇకపై అభివృద్ధిలో ఉత్తమ ఆంధ్రగా ఉండబోతోంది.. భోగాపురం అల్లూరి సీతారామ రాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవంతో ఉత్తరాం ధ్ర దశ, దిశ మారబోతోందని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. ఉత్తరాంధ్ర అభివృద్ధి చరిత్రలో కొత్త అధ్యాయానికి నాంది పలికినట్టేననని పేర్కొన్నారు. విజయనగరం జిల్లా భోగాపురంలో శనివారం ప్రధానమంత్రి నరేంద్రమోదీ చేతుల మీదుగా అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభమైంది. అనంతరం జరిగిన బహిరంగ సభలో సీఎం ప్రసంగించారు. భోగాపురం విమానాశ్రయం కోసం భూములు ఇచ్చిన రైతులే ఉత్తరాంధ్ర కొత్త చరిత్రకు శ్రీకారం చుట్టారు..భోగాపురం విమానాశ్రయం ఉత్తరాంధ్రకు మణిహారం.. స్వాతంత్య్ర సమర యోధుడు అల్లూరి సీతారామరాజు పేరును విమానాశ్రయానికి పెట్టడం గర్వకారణమని ప్రశంసిం చారు. ఉత్తరాంధ్రకు చెందిన జీఎంఆర్ సంస్థ నిర్మించిన ఈ విమానాశ్రయం ప్రాంత సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటుతోంద న్నారు. ఈ ప్రాజెక్టుకు పునాది వేసిన మాజీ కేంద్రమంత్రి పూసపాటి అశోక్ గజపతిరాజు, ప్రస్తుతం కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్నాయుడు ఇద్దరూ ఉత్తరాంధ్ర వారేనని గుర్తు చేశారు. సముద్రం, కొండల నడుమ నిర్మితమైన భోగాపురం విమానాశ్రయం దేశంలోనే ప్రత్యేక గుర్తింపు పొందుతుందని చెప్పారు. విశాఖ నుంచి భోగాపురం వరకు బీచ్ కారిడార్ నిర్మిస్తున్నామని, శంషాబాద్ విమానాశ్రయం తెలంగాణ రూపురేఖలు మార్చినట్లే భోగాపురం విమానాశ్రయం ఉత్తరాంధ్ర దశ, దిశను మార్చబోతోందని తెలిపారు.
ఉత్తరాంధ్రకే వలస వచ్చే రోజులొచ్చాయి
ప్రధాని మోదీ సహకారంతో కేంద్రం అందిస్తున్న తోడ్పాటుతో గత రెండేళ్లలో ఉత్తరాంధ్రలో 189 ప్రాజెక్టులకు రూ.6.13 లక్షల కోట్ల పెట్టుబడులు సమీకరించామని, వాటి ద్వారా 5.57 లక్షల ఉద్యోగాలు వస్తాయని తెలిపారు. ఆంధ్రుల హక్కు విశాఖ ఉక్కు సెంటిమెంట్ నిలబెట్టింది ప్రధాని నరేంద్ర మోదీనే. అలాగే విశాఖ రైల్వే జోన్ ఏర్పాటుకు ప్రత్యేక ఆర్థిక వెసులుబాటు కలిగించి.. స్టీల్ ప్లాంట్ పునర్ వైభవం సాధించేలా ప్రధాని సహకరిస్తున్నారని చెప్పారు. విశాఖ రైల్వేజోన్ ఏర్పాటుకు సహకరించారు.. మూడేళ్ల లో రూ.2,784 కోట్లతో 8 సాగునీటి ప్రాజెక్టులు పూర్తిచేస్తాం.. 65 ఏళ్లుగా పెండింగులో ఉన్న నేరడి. బ్యారేజీకి అనుమతులు తీసు కొచ్చి నిధులు కేటాయించామని తెలిపారు. ఈ నెల 14న గోదా వరి నీటిని అనకాపల్లికి తీసుకువస్తామని, వంశధార-గోదావరి అనుసంధానం కూడా చేపడతామని వెల్లడించారు. పర్యాటకం, ఫార్మా, రేర్ ఎర్త్ ఖనిజాలు, జాతీయ రహదారులు, ఆధ్యాత్మిక పర్యాటకానికి ఉత్తరాంధ్ర కేంద్రంగా మారుతుందని చెప్పారు. ఉపాధి కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లే పరిస్థితి మారి, భవిష్యత్తు లో ఉత్తరాంధ్రకే వలసలు వచ్చే రోజులు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు.
ప్రధాని చేతులమీదుగానే పోలవరం, అమరావతి
విశాఖ ఉక్కు పరిరక్షణ, విశాఖ రైల్వేజోన్, పోలవరం, అమరా వతికి కేంద్ర సహకారం అందించిన ప్రధాని మోదీకి సీఎం కృతజ్ఞతలు తెలిపారు. 2027 నాటికి పోలవరం పూర్తిచేసి ప్రధాని చేతులమీదుగా జాతికి అంకితం చేస్తామని, అలాగే 2028 నాటికి అమరావతి తొలి దశను పూర్తి చేసి ప్రధానితో ప్రారంభింప చేస్తా మని ప్రకటించారు. రెండేళ్ల క్రితం విధ్వంసమైన రాష్ట్రాన్ని ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో తాను, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కలిసి పునర్నిర్మిస్తామని ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నా మని చెప్పారు. ఒకప్పుడు “ఎర్రబస్సే రాదు” అని వెక్కిరించిన చోట నేడు ప్రపంచస్థాయి ఎయిర్బస్ దిగుతోందని, అభివృద్ధిని అడ్డుకున్న వారు అడ్రస్ లేకుండా పోయారని వ్యాఖ్యానించారు.
మోదీ విధానం ‘నేషన్ ఫస్ట్’
ప్రపంచం ఐటీ నుంచి ఏఐ వైపు అడుగులు వేస్తున్న సమయంలో దేశానికి ప్రధాని మోదీ లాంటి సమర్థ నాయకుడు అవసరం. డిజిటల్ ఇండియా, ఆత్మనిర్భర్ భారత్, ఆయుష్మాన్ భారత్, జల్ జీవన్ మిషన్ వంటి కార్యక్రమాలతో దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించారని, ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారత్ను నాలుగో స్థానానికి తీసుకొచ్చారు. ప్రపంచదేశాల ముందు భారతదేశ ఔన్నత్యాన్ని చాటి చెప్పిన నాయకుడు. ప్రపంచంలో వివిధ ప్రాంతాల్లో జరుగు తున్న యుద్దాల వల్ల భారతదేశంపై ఆ ప్రభావం పడకుండా చూడటంలో ప్రధాని మోదీ సక్సెస్ అయ్యారని గుర్తు చేశారు. వివిధ దేశాల ప్రజలు సరైన నాయకత్వం కోసం.. సరైన నాయకు డు కోసం ఎదురుచూస్తున్న తరుణంలో భారతదేశానికి మోదీ రూపంలో అద్భుతమైన నాయకత్వం లభించిందని.. ఇది దేశ ప్రజల అదృష్టమన్నారు. క్లిష్టకాలంలో కూడా 144 కోట్ల భారత ప్రజల ఆశలు, ఆశయాలను ముందుకు తీసుకెళ్లడం ప్రధాని మోదీ ఒక్కరి వల్లే సాధ్యమవుతుందని కితాబిచ్చారు. మోదీని విమ ర్శించే వారికి కూడా ఆయన చేసిన మంచి.. దేశానికి చేసిన సేవలు తెలుసని చెప్పారు. ప్రధాని మోదీకి దేశ ప్రజలందరూ అండగా నిలవాల్సిన అవసరం ఉందని కోరారు. తన ఐదు దశాబ్దాల రాజకీయ జీవితంలో నరేంద్ర మోదీ వంటి నాయకుడిని చూడలేదని, “రైట్ టైమ్.. రైట్ ప్లేస్..రైట్ మ్యాన్” మోదీయేనని వ్యాఖ్యానించారు.
ఎయిర్పోర్ట్ టెర్మినల్లో కళాకృతులను తిలకించిన మోదీ
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అల్లూరి సీతారామరాజు అంతర్జా తీయ విమానాశ్రయ టెర్మినల్ను ప్రారంభించిన అనంతరం చెక్-ఇన్ హాల్, ఆధునిక ప్రయాణికుల సదుపాయాలు, సాంకేతిక వ్యవస్థలను పరిశీలించారు. విమానాశ్రయ మాస్టర్ ప్లాన్, ఏవియే షన్ హబ్, ఏవియేషన్ ఎడ్యుసిటీ నమూనాలను జీఎంఆర్ ప్రతి నిధులు వివరించారు. టెర్మినల్లో ఏర్పాటు చేసిన భారీ వీడియో వాల్లో ప్రదర్శించిన ఉత్తరాంధ్ర చరిత్ర, ప్రముఖ పుణ్యక్షేత్రాలు, ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక వైభవాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రధానమంత్రికి వివరించారు. విమానాశ్రయ ప్రాంగణంలోని తెలుగు కళా సంపదను ప్రతిబింబించే కళాఖండాలను ప్రధాని ఆసక్తిగా తిలకించారు.
థింసా నృత్యంతో మోదీకి స్వాగతం టెర్మినల్ నుంచి ఓపెన్ టాప్ జీపులో సభావేదికకు చేరుకునే మార్గ మధ్యలో గిరిజన మహిళలు.. విద్యార్థినులు చేసిన థింసా నృత్యం తో ప్రధాని నరేంద్రమోదీకి స్వాగతం పలికారు. సభా ప్రాంగణాని కి చేరుకున్న ప్రధానమంత్రికి ప్రజలు
జాతీయ జెండాలు ఊపుతూ కరతాళ ధ్వనులతో స్వాగతం పలికారు. సభా వేదికపై ముఖ్యమం త్రి చంద్రబాబు పొందూరు ఖాదీ శాలువాతో మోదీని ఘనంగా సత్కరించారు. అనంతరం సీఎం చంద్రబాబు, ఉప ముఖ్య మంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ కలిసి ఉత్తరాంధ్ర కళా వైభవానికి ప్రతీక అయిన బొబ్బిలి వీణను ప్రధానమంత్రికి జ్ఞాపికగా అందజేశారు. ఓపెన్ టాప్ జీపులో ప్రధాని మోదీ వెంట ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ ఉన్నారు. వేదికపై గవర్నర్ అబ్దుల్ సజీర్, గోవా గవర్నర్ పూసపా టి అశోక్ గజపతి రాజు, కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు, శ్రీనివాస వర్మ, పెమ్మసాని చంద్రశేఖర్, రాష్ట్ర మంత్రులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
చంద్రబాబు కృషితోనే పెట్టుబడులు: మోదీ ప్రశంసలు
రాత్రింబవళ్లు కష్టపడి పరిశ్రమలను ఆకర్షించేందుకు సీఎం చంద్రబాబు చేస్తున్న కృషిఫలితంగానే రాష్ట్రానికి భారీ పెట్టుబ డులు వస్తున్నాయని సభలో ప్రధాని ప్రశంసించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు కేంద్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుంద న్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో మరింత వేగంగా ముందుకు తీసుకెళ్లేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు డబుల్ ఇంజిన్ సర్కార్ కీలక భాగస్వాములుగా ఉన్న సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యామ్లతో సమన్వయం చేసుకుంటూ పనిచేస్తున్నామని స్పష్టం చేశారు. పెట్టుబడులు-ఉపాధి-అభివృద్ధి అనే లక్ష్యంతోనే ఎన్డీఏ ప్రభుత్వం ముందుకు సాగుతోందని తెలిపారు. పెట్టుబడులు పెరిగితే ఉత్పత్తి పెరుగుతుంది.. ఉత్పత్తి పెరిగితే ఎగుమతులు పెరుగుతాయి.. ఎగుమతులు పెరిగితే ఉపాధి అవకాశాలు విస్తరి స్తాయి.. ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయని పేర్కొన్నారు. అదే అభివృద్ధి నమూనాను ఆంధ్రప్రదేశ్లో అమలు చేస్తున్నా మని తెలిపారు. సీఎం చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రం వేగ వంతమైన అభివృద్ధి దిశగా దూసుకుపోతోందని ప్రశంసించారు.













