- అరాచకానికి.. ఐదేళ్ల వైసీపీ పాలన నిలువుటద్దం
- జగన్ది ‘రూల్ ఆఫ్ ఫియర’.. కూటమిది ‘రూల్ ఆఫ్ లా’
- రాజధాని విషయంలో జగన్ ఊసరవెల్లి
- ఇప్పుడు ‘మావిగన’ పేరిట కొత్త డ్రామా
- ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ ధ్వజం
మంగళగిరి (చైతన్య రథం): వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తాజా ప్రెస్మీట్లో చేసిన వ్యాఖ్యలు దెయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉన్నాయని పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రకుమార్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. 2019-24 మధ్య ఐదేళ్ల వైసీపీ పాలనలో రాష్ట్రంలో అరాచకాలకు, దోపిడీకి, అక్రమాలకు, దౌర్జన్యాలకు ఆ పార్టీ పేటెంట్ హక్కులు పొందిందని, అధికారంలోకి వచ్చిన వెంటనే రాజకీయ ప్రేరేపిత ఉగ్రవాదానికి జగన్ తెరలేపారని బుధవారం టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆరోపించారు. నాణ్యత లేని మద్యంపై ప్రశ్నించినందుకు ఓం ప్రకాష్ అనే వ్యక్తిని దారుణంగా పొట్టనబెట్టుకున్నారని, కల్తీ మద్యం తాగి జంగారెడ్డిగూడెంలో 16మంది ప్రాణాలు కోల్పోతే నాటి ముఖ్యమంత్రి జగన్ కనీసం స్పందించలేదని, బాధితులను పరామర్శించలేదని గుర్తు చేశారు. తన అక్కను వేధిస్తున్నారని ప్రశ్నించినందుకు విద్యార్థి అమర్నాథ్ గౌడ్పై పెట్రోల్ పోసి తగులబెడితే, దాన్ని సూసైడ్గా చిత్రీకరించేందుకు స్థానిక వైసీపీ నాయకత్వం ప్రయత్నించిందని, ప్రజలు తిరగబడితేనే అది హత్యగా తేలిందని, అయినా ఏ ఒక్క అధికారిపైనా చర్యలు తీసుకోలేదని నిలదీశారు.
మాస్క్ పెట్టుకోలేదన్న నెపంతో పోలీసులు హింసించడంతో చీరాలలో కిరణ్ కుమార్ అనే యువకుడు చనిపోయాడని, మాస్కులు ఇవ్వమని అడిగినందుకు డాక్టర్ సుధాకర్ను సస్పెండ్ చేయడమే కాకుండా పిచ్చోడి ముద్ర వేసి వైజాగ్ నడిరోడ్డుపై చేతులు కట్టేసి హింసించారని గుర్తు చేశారు. వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు తన దళిత డ్రైవర్ను హత్య చేసి శవాన్ని ఇంటికే డోర్ డెలివరీ చేస్తే, జగన్ ఆయనను బహిరంగ సభల్లో పక్కన పెట్టుకుని తిరిగారని, “అధికార పక్షం, పోలీసుల కుమ్మక్కు వల్లే అనంతబాబుకు డిఫాల్ట్ బెయిల్ వచ్చింది” అని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించిన విషయాన్ని జగన్ మర్చిపోయారా? అని ప్రశ్నించారు. కర్నూలు జిల్లాలో అబ్దుల్ రసూల్ కుటుంబం వైసీపీ నేతల ఒత్తిడి, పోలీసుల వేధింపులు తట్టుకోలేక రైలు కింద పడి చనిపోయినా స్పందించని జగన్కు, ఇవాళ శాంతిభద్రతల గురించి మాట్లాడే నైతిక హక్కు ఎక్కడిదని ప్రశ్నించారు. చట్టాలను చుట్టాలుగా మార్చుకుని దౌర్జన్యకాండ సాగించిన వైసీపీ నాయకులను కాపాడిన చరిత్ర జగన్దని, ఐదేళ్లపాటు రక్తం ఏరులై పారించిన వారు ఇవాళ ప్రజాస్వామ్యం గురించి మాట్లాడటం హాస్యాస్పదమని మండిపడ్డారు.
గత ఐదేళ్ల వైసీపీ పాలనలో “రాజకీయ ప్రేరేపిత ఉగ్రవాదాన్ని” నడిపిన జగన్, ఈ రోజు రాష్ట్రంలో భయాందోళనలు (రూల్ ఆఫ్ ఫియర్) ఉన్నాయంటూ మాట్లాడటం హాస్యాస్పదమన్నారు. నాడు విపక్షాల గొంతు నొక్కిన జగన్, నేడు హెలికాప్టర్లలో పర్యటనలు చేస్తూ సభలు నిర్వహిస్తుంటే ప్రభుత్వం ఎక్కడైనా అడ్డుకుందా? అని ప్రశ్నించారు. అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర వంటి తెలుగుదేశం నాయకులను అక్రమ కేసులతో వేధించి జైళ్లకు పంపిన చరిత్ర జగన్దని, ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు నాయుడు పర్యటనలకు అడుగడుగునా ఆటంకాలు సృష్టించారని, పల్నాడు వెళ్లకుండా ఆయన ఇంటి గేట్లకు పోలీసులు తాళ్లు కట్టారని ఆరోపించారు. అప్పటి మంత్రి జోగి రమేష్ వందల మంది రౌడీ షీటర్లతో చంద్రబాబు నివాసంపైకి దాడికి వస్తే జగన్ వారించకపోగా వెనుక ఉండి ప్రోత్సహించారని, తెలుగుదేశం కేంద్ర కార్యాలయంపై వైసీపీ రౌడీ మూకలు మూడు గంటల పాటు విధ్వంసం సృష్టిస్తే పోలీస్ యంత్రాంగం కళ్లకు గంతలు కట్టుకుందని, ఆ దాడిని సమర్థిస్తూ జగన్ ప్రెస్ మీట్ పెట్టడం అరాచకత్వానికి పరాకాష్ట అని అన్నారు.
తమ పార్టీ ఎంపీ రఘురామకృష్ణంరాజును అక్రమంగా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో థర్డ్ డిగ్రీ ఉపయోగించి కొట్టారని, ఐదేళ్ల పాటు ఆయన సొంత రాష్ట్రంలో అడుగు పెట్టలేనంత భీకరమైన పాలన సాగించారని ఆరోపించారు. ప్రభుత్వ అరాచకాలను బట్టబయలు చేస్తున్నారనే కక్షతో మీడియా సంస్థల యాజమాన్యాలపై రాజద్రోహం కేసులు పెట్టి వేధించారని, అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి రథాన్ని తగులబెడితే “పోతే పోయింది, కొత్త రథం చేయిస్తాం” అంటూ జగన్ బాధ్యతారాహిత్యంగా మాట్లాడారని, శ్రీరామచంద్రుడి విగ్రహం తల నరికిన దుర్మార్గమైన సంఘటన కూడా జగన్ పాలనలోనే జరిగిందని, ఇది రాష్ట్ర చరిత్రకే సిగ్గుచేటని అన్నారు. దేవాలయాలు, చర్చిలు, మసీదులపై దాడులు జరిగినా నాటి ప్రభుత్వం ఒక్కరినైనా అరెస్ట్ చేయలేదని, చట్టాన్ని చుట్టాలుగా మార్చుకుని రాజ్యాంగాన్ని అవహేళన చేసిన వైసీపీకి భిన్నంగా నేడు రాష్ట్రంలో చట్టబద్ధమైన పాలన సాగుతోందని, అందుకే ఓడిపోయినా జగన్ స్వేచ్ఛగా పర్యటనలు చేయగలుగుతున్నారని అన్నారు. ఇప్పటికైనా జగన్ తన గత పాపాలను గుర్తు తెచ్చుకుని మాట్లాడాలని హితవు పలికారు.
రాష్ట్ర ప్రజలు అపారమైన మెజారిటీతో కూటమి ప్రభుత్వానికి విజయాన్ని అందించింది పేదవాడి కన్నీళ్లు తుడిచి భరోసా ఇచ్చేందుకేనని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. నేడు రాష్ట్రంలో ‘రూల్ ఆఫ్ ఫియర’ లేదని, కేవలం ‘రూల్ ఆఫ్ లా’ మాత్రమే నడుస్తోందని, ఆ భయం జగన్కు, వైసీపీ నేతలకు మాత్రమే పట్టుకుందని ఎద్దేవా చేశారు. విజయవాడలో సాయికృష్ణకు సంబంధించిన అంశం చంద్రబాబు దృష్టికి రాగానే తక్షణమే స్పందించి బాధితులను పిలిపించి, ప్రత్యేక దర్యాప్తు బృందంతో కేసును వేగవంతంగా ఛేదించారని అన్నారు. సొంత బాబాయ్ వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో నిందితుడైన అవినాష్ రెడ్డిని సీబీఐ అరెస్ట్ చేయడానికి వస్తే జగన్ తన అధికార బలంతో 200 మంది పోలీసులను కర్నూలు నడిబొడ్డున కాపలా పెట్టి, వైసీపీ కార్యకర్తలను పోగుచేసి రెండు రోజుల పాటు
సీబీఐని అడ్డుకున్న చరిత్ర గుర్తు చేశారు.
గత ఐదేళ్ల వైసీపీ పాలనలో వ్యాపారాలను, ప్రజల ఆస్తులను లాక్కున్నారని, ప్రజాప్రతినిధులు కమిషన్లు, లంచాలు అడగడం వల్లే ‘జాకీ’ లాంటి ప్రతిష్టాత్మక పరిశ్రమలు రాష్ట్రం వదిలి పారిపోయాయని, జగన్ తరిమేసిన పరిశ్రమలను చంద్రబాబు మళ్లీ రప్పిస్తున్నారని, దానికి నిదర్శనం ‘హీరో’ పరిశ్రమ తిరిగి రావడమని పేర్కొన్నారు. జగన్ ఆంధ్రప్రదేశ్కు కేవలం ‘విజిటింగ్ రెసిడెంట’ మాత్రమేనని, అత్యధిక కాలం కర్ణాటకలోనే నివాసం ఉంటారని, ప్రజలు మర్చిపోతారనే భయంతో వచ్చినప్పుడల్లా కులం, మతం పేరుతో విద్వేషాలు రెచ్చగొట్టాలని చూస్తున్నారని ఆరోపించారు.
రాజధాని అమరావతి గురించి జగన్ మాట్లాడుతున్న తీరు చూస్తుంటే ఊసరవెల్లి కూడా సిగ్గుపడుతుందని దుయ్యబట్టారు. 2014లో అమరావతికి అనుకూలమన్న జగన్, 2019 ఎన్నికల ముందు బొత్సా, ఉమ్మారెడ్డి, రోజా, వెల్లంపల్లితో ఇక్కడే రాజధాని ఉంటుందని చెప్పించి ఓట్లు వేయించుకుని, ఆ తర్వాత వెన్నుపోటు పొడిచారని ధ్వజమెత్తారు. అమరావతిని మార్చొద్దని పోరాడిన 3000 మంది రైతులపై అక్రమ కేసులు పెట్టారని, వేడుకున్న మహిళలను పోలీసులు బూటుకాళ్లతో తన్నించిన అమానుషాన్ని ప్రజలు మర్చిపోలేరని, జగన్ ముఖ్యమంత్రిగా వందల మంది పోలీసుల పహారాతో, పరదాలు కట్టుకుని అసెంబ్లీకి వెళ్లిన భయస్తుడని ఎద్దేవా చేశారు.
వైసీపీ తప్ప కూటమి పార్టీలతో పాటు సీపీఐ, సీపీఎం కూడా మొదటి నుంచి అమరావతికే అనుకూలమని, ఎన్నికల్లో కూటమికి 164 సీట్లు ఇచ్చి జగన్ పార్టీని 11 సీట్లకు పరిమితం చేయడమే ప్రజా తీర్పు అని అన్నారు. 2019-24లో మూడు రాజధానులంటూ, విశాఖే రాజధాని అంటూ ఉత్తరాంధ్ర ప్రజలను మోసం చేసిన జగన్, ఇప్పుడు విశాఖను వదిలేసి ఉత్తరాంధ్ర వాసులకూ వెన్నుపోటు పొడిచారని విమర్శించారు. అమరావతికి, సొంత తల్లికి వెన్నుపోటు పొడవడం, బాబాయ్ని చంపిన వారికి రక్షణ కల్పించడం జగన్ రక్తంలోనే ఉందని, కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో చట్టం చేసి అమరావతిని శాశ్వత రాజధానిగా ప్రకటించిందని గుర్తు చేశారు. ప్రతిపక్షంగా ప్రజా సమస్యలపై స్పందిస్తే తప్పులేదని, కానీ విధ్వంసం సృష్టించి రాజకీయ లబ్ధి పొందాలని వైసీపీ చూస్తే ఆ కుట్రలను కూటమి ప్రభుత్వం ఉక్కుపాదంతో అణచివేస్తుందని స్పష్టం చేశారు.
గోవా గవర్నర్ అశోక్ గజపతిరాజు కుటుంబం ప్రజలకు దానం చేసిన స్థలాన్ని కూడా వదలకుండా వైసీపీ నేతలు కబ్జా చేసి పార్టీ ఆఫీస్ కట్టారని, కబ్జాకు సహకరించిన అధికారులపై చర్యలు తీసుకుని ఆ భూమిని తిరిగి అప్పగించాలని డిమాండ్ చేశారు. రూ.3,470 కోట్ల లిక్కర్ కుంభకోణంపై విచారణ వేగంగా జరుగుతుండటంతో, కారుమూరి నాగేశ్వరరావు, రాజ్ కసిరెడ్డి వంటి వారి పాత్రలు బయటపడటంతో వైసీపీ నాయకత్వం పోలీసు అధికారులను బ్లాక్ మెయిల్ చేస్తోందని ధ్వజమెత్తారు. సాయికృష్ణ కేసులో ప్రభుత్వం వేగంగా స్పందిస్తే అభినందించాల్సింది పోయి అధికారుల మనోధైర్యాన్ని దెబ్బతీసేలా ఆరోపణలు చేయడం దుర్మార్గమన్నారు. రామతీర్థంలో శ్రీరామచంద్రుడి విగ్రహం తల నరికినప్పుడు స్పందించని జగన్, ఇవాళ ‘హే రామ’ అంటూ నీతులు పలుకుతున్నారని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. గత ఐదేళ్లలో వ్యాపారాలను బెదిరించి లాక్కున్న చరిత్ర వైసీపీదని, కూటమి ప్రభుత్వంలో అవినీతిపరులు, కబ్జాదారుల ఆటలు సాగవని, చట్టం తన పని తాను చేసుకుపోతుందని ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ స్పష్టం చేశారు.















