- ప్రతిష్టాత్మక ప్రాజెక్టులో భాగమైనందుకు గర్వించండి
- నిర్దేశిత గడువులోగా రాజధాని నిర్మాణాలు పూర్తి కావాలి
- రాజధాని పనులపై ప్రతీ 2 నెలలకు ఒకసారి సమీక్ష
- అమరావతి నిర్మాణ కాంట్రాక్టు సంస్థలతో సీఎం చంద్రబాబు
అమరావతి (చైతన్య రథం): యావత్ దేశం గర్వించే రాజధాని నగరంగా అమరావతిని నిర్మిస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. హైదరాబాద్ ప్లస్గా అమరావతి నిర్మాణం జరగాలన్నారు. ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నగర నిర్మాణంలో కాంట్రాక్టు సంస్థలు కూడా భాగస్వాములు కావాలని సీఎం పిలుపునిచ్చారు. రాజధాని నిర్మాణ పనుల్లో మరింత వేగం పెంచాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు. అమరావతిలో నిర్మాణ పనుల పురోగతిపై సచివాలయంలో కాంట్రాక్టు సంస్థలతో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. నిర్దేశిత గడువుకంటే ముందే నిర్మాణ పనులు పూర్తి చేయాలని సూచనలు ఇచ్చారు. ప్రస్తుతం రూ.50,999 కోట్ల విలువైన పనులు కాంట్రాక్టు సంస్థలకు అప్పగించామని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. హౌసింగ్, ట్రంక్ ఇన్ ఫ్రా, ఎల్పీఎస్ ఇన్ ఫ్రా, సహా అసెంబ్లీ, హైకోర్టు, సచివాలయ టవర్లలాంటి ఐకానిక్ భవనాల నిర్మాణ ప్రాజెక్టులు వేగంగా జరుగుతున్నాయని తెలిపారు. పనులు వేగంగా చేసేందుకు అవసరమైన మానవ వనరులు, యంత్రాలు ఇతర సామాగ్రిని ముందుగానే సిద్ధం చేసుకోవాలని సీఎం స్పష్టం చేశారు. ప్రస్తుతం 26,924 మంది కార్మికులు, 5,140కి పైగా భారీ యంత్రాలు నిర్మాణ పనుల్లో నిమగ్నమైనట్టు మంత్రి నారాయణ సీఎంకు వివరించారు. నిర్మాణ పనులకు ఎలాంటి ఆటంకమూ లేకుండా కొండవీటి వాగు, పాలవాగు ప్రవాహాలు సజావుగా సాగేందుకు వీలుగా వాటిని వెడల్పు చేస్తున్నామని మంత్రి తెలియచేశారు. దీనిపై స్పందించిన సీఎం భవిష్యత్ నగరంగా నిర్మిస్తున్న అమరావతి నిర్మాణంలో పని చేశామన్న బ్రాండ్ను కాంట్రాక్టర్లు సంపాదించేలా పనులు చేపట్టాలని సూచించారు. కొందరు వ్యక్తులు కావాలని లిటిగెంట్లుగా మారి రాజధాని పనుల్ని అడ్డుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నారని..
రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ముందుకెళ్లాలని సీఎం స్పష్టం చేశారు. కార్యదర్శులు, ప్రధాన కార్యదర్శుల నివాసాలు, రహదారులు, మౌలిక సదుపాయాలతోపాటు అసెంబ్లీ, హైకోర్టు, సచివాలయ టవర్ల నిర్మాణాలపై ముఖ్యమంత్రి పలు సూచనలు చేశారు. దేశవ్యాప్తంగా వివిధ పుణ్య క్షేత్రాలు, నదులనుంచి పవిత్రమైన మట్టి, నీళ్లు తీసుకువచ్చి ఈ ప్రాంతాన్ని పునీతం చేశామని.. గత పాలకులు ఐదేళ్లపాటు రాజధాని నిర్మాణాన్ని ఆపేశారని సీఎం అన్నారు. గడచిన రెండేళ్లుగా అమరావతి నిర్మాణాన్ని మళ్లీ గాడిలో పెట్టామన్నారు. అత్యుత్తమ నివాసయోగ్య నగరంగా నిర్మాణం చేస్తున్న అమరావతిలో భాగస్వాములయ్యామన్న ఆలోచనతో కాంట్రాక్టు సంస్థలు పనిచేయాలని సీఎం సూచించారు. పనులు పూర్తి అయ్యాక రాజధాని నిర్మాణాల ప్రారంభోత్సవానికి ప్రధాని మోదీని ఆహ్వానిస్తామని సీఎం తెలిపారు. నిర్మాణ పనుల వేగంతోపాటు నాణ్యతపైనా ఎక్కడా రాజీ లేకుండా చేపట్టాలని సీఎం స్పష్టం చేశారు. అసెంబ్లీ, హైకోర్టు, సచివాలయ భవనాలు ఐకానిక్ నిర్మాణాలుగా ఉండాలన్నారు. అమరావతికి పేరు తెచ్చేలా భవనాలను నిర్మించాలన్నారు. రాజధాని నిర్మాణంలో చిన్న ఇబ్బందులు కూడా లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ప్రతీ రెండు నెలలకు ఒకసారి నిర్మాణాల పురోగతిపై సమీక్షిస్తానని సీఎం స్పష్టం చేశారు. ఎల్ అండ్ టీ, షాపూర్ జీ పల్లోంజి, మెగా ఇంజినీరింగ్, ఎన్సీసీ, బీఎసఆర్, కేఎంవీ సహా వేర్వేరు కాంట్రాక్టు సంస్థలు చేపట్టిన పనులకు సంబంధించిన అంశాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఆయా సంస్థల ప్రతినిధులకు సీఎం దిశానిర్దేశం చేశారు. సమీక్షకు పురపాలక మంత్రి పి.నారాయణ, సీఆర్డీఏ అధికారులు, వివిధ కాంట్రాక్టు సంస్థల ప్రతినిధులు హాజరయ్యారు.














