అమరావతి(చైతన్యరథం): పీఎస్యూలు, కార్పొరేషన్లు, సొసైటీల ఉద్యోగులకు సంబంధించిన పదవీ విరమణ వయసుపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఉన్న 60 ఏళ్ల పదవీ విరమణ వయసును 62 ఏళ్లకు పెంచుతూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. గతంలో రాష్ట్ర మంత్రిమండలి ఆమోదించిన తీర్మానానికి అనుగుణంగా సర్కార్ గురువారం ఉత్తర్వులు ఇచ్చిం ది. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం ఈ నిర్ణయం 2022 జనవరి 1 నుంచి రిట్రోస్పెక్టివ్గా అమలు కానుంది. అలాగే 60 ఏళ్ల వయసులో పదవీ విరమణ పొందిన అర్హులైన ఉద్యోగులను తిరిగి విధుల్లోకి తీసుకునే అవకాశం ఉంది. మళ్లీ జాబ్లో చేరే వరకు ఉన్న గ్యాప్ పీరియడ్కు జీతం ఉండదని ప్రభుత్వం స్పష్టం చేసింది. గ్యాప్ పీరియడ్ను సీనియారిటీ, ప్రమోషన్ల కోసం పరిగణనలోకి తీసుకోరని పేర్కొంది. కోర్టు ఆదేశాల మేరకు 62 ఏళ్ల వరకు పనిచేసిన ఉద్యోగులకు పూర్తిస్థాయి సర్వీస్ బెనిఫిట్స్ అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే 60 ఏళ్లకు పదవీ విరమణ పొంది తిరిగి విధుల్లో చేరేందుకు ఆసక్తి లేని ఉద్యోగులకు పాత నిబంధనల ప్రకారమే రిటైర్మెంట్ వర్తిస్తుందని ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ నిర్ణయాన్ని అమలు చేసేందుకు సర్వీస్ రూల్స్లో అవసరమైన సవరణలు చేయాలని సంస్థలకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అయితే ప్రతి సంస్థ తమ ఆర్థిక పరిస్థితి ని దృష్టిలో ఉంచుకుని నిర్ణయాలు తీసుకోవాలని సూచించింది. అన్ని శాఖలు తమ పరిధిలోని పీఎస్యూలు, కార్పొరేషన్లు, సొసైటీలకు వెంటనే ఉత్తర్వులను పంపాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది.















