- ఇచ్చిన ప్రతి హామీని అమలు చేయడం హర్షణీయం
- సంక్షేమం, అభివృద్ధి, ఉపాధి కల్పనే లక్ష్యంగా రెండేళ్ల పాలన
- విజయోత్సవ సభలో మంత్రి కొల్లు రవీంద్ర
మచిలీపట్నం (చైతన్య రథం): రాష్ట్రాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ప్రతి క్షణం పని చేస్తోందని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. మచిలీపట్నంలోని రెవెన్యూ కల్యాణ మండపంలో నిర్వహించిన రెండేళ్ల నమ్మకం-అభివృద్ధి-సంక్షేమం కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి మాట్లాడుతూ… రాష్ట్రాన్ని అరాచకం నుండి కాపాడుకుని సంక్షేమం, అభివృద్ధి వైపు అడుగులు వేస్తున్నందుకు ఆనందంగా ఉంది. గత ఐదేళ్ల అరాచకం నుండి ఇప్పుడిప్పుడే బయట పడుతున్నాం. గత ప్రభుత్వ గాయాల నుండి బయటపడి ప్రజలకు కొత్త పాలన చూపించాం. ఈ నెల 12న తిరుపతిలో విధ్వంసం నుండి వికాసం కార్యక్రమం నిర్వహించాం. రాష్ట్రంలోని ప్రజలందరినీ చైతన్యపరచడమే లక్ష్యంగా ప్రతి నియోజకవర్గంలో కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం.
2014లో రాష్ట్రం విడగొట్టి, రాజధాని కూడా లేకుండా చేశారు. 16 వేల కోట్ల లోటు బడ్జెట్లోనూ ఐదేళ్లు పాటు సంక్షేమ పథకాలు పకడ్బందీగా అమలు చేశాం. రాజధాని అమరావతి, పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం నుండి రావాల్సిన నిధులు రప్పించుకున్నాం. 2019 ఎన్నికల్లో జగన్ రెడ్డి అనేక అలవికాని హామీలిచ్చి, ప్రజల్ని తప్పుదోవ పట్టించి అధికారంలోకి వచ్చాడు. ఫలితంగా రాష్ట్రం నష్టపోయింది. సంక్షేమాన్ని గాలికి వదిలేశారు. అభివృద్ధిని దెబ్బతీశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల అభ్యున్నతిని నాశనం చేశారు. కార్పొరేషన్ నిధులు దారి మళ్లించారు. ప్రభుత్వ ఆస్తుల్ని అమ్మేశారు. ప్రజావేదిక కూల్చివేతతో పాలన మొదలుపెట్టి మొత్తం వ్యవస్థను అస్తవ్యస్తం చేశాడు.
ఎన్నికలకు ముందు వరకు అమరావతే రాజధాని అన్నాడు. అధికారంలోకి వచ్చాక మూడు ముక్కలాటతో భూములిచ్చిన రైతుల్ని అవమానించాడు. న్యాయం కోరిన రైతుల్ని లాఠీలతో చితక్కొట్టాడు. పోలవరం ఎత్తు తగ్గించేశాడు. గ్రావిటీ ద్వారా రావాల్సిన నీళ్లు రాకుండా చేశాడు. రాష్ట్రానికి జీవనాడిలా నిలిచే పోలవరం ప్రాజెక్టుని తెలంగాణకు తాకట్టు పెట్టాడు. ఆంధ్రుల హక్కు నినాదంతో సాధించుకున్న విశాఖ ఉక్కును అమ్మేయాలనుకున్నాడు.
రెవెన్యూ వ్యవస్థలో చేసిన దుర్మార్గాలకు అంతే లేదు. ప్రజల భూముల్ని కబ్జా చేసేందుకు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొచ్చాడు. భూమి పత్రాలపై తన బొమ్మ వేయించుకున్నాడు. రూ. 700 కోట్ల వ్యయంతో సర్వే రాళ్లపై తన బొమ్మలు వేయించుకున్నాడు. స్కూల్ భవనాలకు, పంచాయతీ కార్యాలయాలకు పార్టీ రంగులేసి రూ. 1,600 కోట్లు, తీయడానికి మరో రూ. 1,600 కోట్లు ఖర్చు చేశాడు. ప్రజా ధనాన్ని ఎంత దారుణంగా దుబారా చేశాడో చెప్పడానికి ఇంత కంటే నిదర్శనం ఏముంటుంది.
చంద్రబాబు నాయుడు రాష్ట్రానికి పరిశ్రమలు ఎలా తేవాలి, పెట్టుబడి ఎలా పెట్టించాలి, యువతకు ఎలా ఉద్యోగాలివ్వాలని ఆలోచించి పరిశ్రమలు తీసుకొచ్చారు. వాటన్నింటినీ జగన్ వెనక్కి తరిమేశాడు. అమరరాజా, లులూ మాల్ లాంటి ప్రఖ్యాత పెట్టుబడుల్ని తరిమేశాడు. ఏపీలో పెట్టుబడి పెట్టొద్దని యూసుఫ్ అలీ లాంటివారు బహిరంగంగా చెప్పే పరిస్థితి దాపురించింది. ప్రజలు నోరెత్తాలంటేనే భయపడే పరిస్థితి కల్పించారు. ప్రశ్నించే ప్రతి ఒక్కరిపైనా కేసులు పెట్టారు. అవినీతిని ప్రశ్నించిన ప్రతి ఒక్కరిని జైళ్లలో పెట్టించారు.
తల్లి, చెల్లిని సైతం ఇంట్లో నుండి గెంటేసిన జగన్ రెడ్డి సొంత బాబాయిని హత్య చేయించి తొలుత గుండెపోటు అన్నారు, తర్వాత గొడ్డలిపోటు అన్నారు. సొంత చెల్లి పోరాటం చేయడంతో ఆమెపైనే నెపం నెట్టి అవమానించాడు. హత్య జరిగినపుడు సీబీఐ విచారణ కావాలన్నాడు. అధికారంలోకి వచ్చాక సీబీఐ విచారణ వద్దు అన్నాడు. నిందితులను వెనకేసుకొచ్చాడు. ఉపాధ్యాయ నియామకాల స్పోర్ట్స్ కోటాలో ఒక సామాజిక వర్గానికే ఉద్యోగాలిచ్చారంటూ రాష్ట్రంలో అరాచకాలు చేస్తున్నాడు. గతంలో ఏమరపాటుగా ఉన్నందున రాష్ట్రం పాతికేళ్లు వెనక్కి పోయింది. ఇప్పుడు అదే తప్పు చేయడానికి వీల్లేదు.
రాష్ట్రానికి వచ్చే ఆదాయం మొత్తం జీతాలు, పెన్షన్లకే సరిపోతున్నప్పటికీ కేంద్రం నుండి వచ్చే నిధులతో సంక్షేమ పథకాలు అమలు చేసుకుంటున్నాం. పరిపాలనా దక్షత కలిగిన నాయకుడు ముఖ్యమంత్రిగా ఉండడంతో రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారు. దాదాపు 63 లక్షల మందికి రూ. 4 వేల చొప్పున రెండేళ్లలో రూ. 65 వేల కోట్లు పెన్షన్ల రూపంలో అందించాం. మరో 8 లక్షల పెన్షన్లు త్వరలోనే మంజూరు చేయబోతున్నాం. తల్లికి వందనం పథకం ద్వారా 68 లక్షల మందికి అందిస్తున్నాం. ఇంట్లో ఎంత మంది ఉంటే అందరికీ తల్లికి వందనం ఇస్తున్నాం. రైతులకు రూ. 20 వేలు అందిస్తున్నాం. పంట అమ్ముకున్న 24 గంటల్లోనే వారి ఖాతాల్లో డబ్బు జమ చేస్తున్నాం. ఉచిత బస్సు పథకం, ఉచిత గ్యాస్ సిలిండర్లు అందిస్తున్నాం.
గత ఐదేళ్లు జగన్ రెడ్డి సుమారు 9 సార్లు విద్యుత్ చార్జీలు పెంచి రూ. 32 వేల కోట్లు ప్రజలపై భారం వేస్తే, నేడు ట్రూ డౌన్ ద్వారా ప్రజలపై భారం తగ్గిస్తున్నాం. సోలార్ వినియోగాన్ని పెంచడం కోసం కేంద్రం ద్వారా సబ్సిడీ అందిస్తున్నాం. బీసీలకు కేంద్రం రూ. 78 వేలు సబ్సిడీ ఇస్తే రాష్ట్రం రూ. 20 వేలు ఇస్తోంది. ఎస్సీ, ఎస్టీలకు ఉచితంగా అందిస్తున్నాం.
గతంలో రాష్ట్రంలో పెట్టుబడి పెట్టడానికి భయపడిన వారు ఇప్పుడు క్యూ కడుతున్నారు. దాదాపు 28 పాలసీలు తీసుకొచ్చాం. ఫలితంగా దేశానికి వచ్చిన పెట్టుబడుల్లో 25 శాతం ఏపీకి వచ్చాయి. రాష్ట్రంలో 20 లక్షల ఉద్యోగాలు కల్పించే లక్ష్యంతో పని చేస్తున్నాం. కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే తొలి సంతకం మెగా డీఎస్సీపై పెట్టాం. 16 వేల ఉపాధ్యాయ ఉద్యోగాలు భర్తీ చేశాం. 260కి పైగా కేసులు వేస్తే అన్నీ పరిష్కరించి ఉద్యోగాలిచ్చాం. అందరూ ఉద్యోగాల్లో చేరిపోయిన తర్వాత ఇప్పుడు ఏదో జరిగిపోయిందంటూ కుట్రలు చేస్తున్నాడు. కానిస్టేబుల్ నియామకాలు కూడా పకడ్బందీగా చేశాం.
భోగాపురం విమానాశ్రయం పనులు చేస్తే ఎర్రబస్సులు కూడా తిరగని చోట ఎయిర్పోర్టులు అవసరమా అన్న జగన్ రెడ్డి ఇప్పుడు నేనే తీసుకొచ్చానంటున్నాడు. అర్సెలార్ మిట్టల్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు శంకుస్థాపన చేస్తే మేమే మాట్లాడానంటున్నాడు. అమెరికా తర్వాత రెండో గూగుల్ డేటా సెంటర్ విశాఖలో ఏర్పాటు చేస్తే అదో గోదాం అని అవమానించారు. ఇప్పుడు అది కూడా మా క్రెడిట్ అంటున్నాడు. భవిష్యత్తును ఊహించి పాలన సాగిస్తాడనడానికి క్వాంటం కంప్యూటింగ్ సెంటర్ ప్రత్యక్ష నిదర్శనం.
మంత్రి నారా లోకేష్ దేశ విదేశాలకు వెళ్లి ఏపీకి పెట్టుబడులు తీసుకురావాలి, పరిశ్రమలు పెట్టాలనే లక్ష్యంతో పని చేస్తున్నారు. ఈ విద్యా సంవత్సరంలో పదో తరగతి విద్యార్థులతో భారీ ప్రకటన ఇచ్చే స్థాయికి రావడం విద్యా వ్యవస్థలో తీసుకొచ్చిన మార్పులకు నిదర్శనం. ఎప్పుడూ లేని విధంగా ప్రభుత్వ స్కూళ్ల ముందు నో అడ్మిషన్ బోర్డులు వెలిశాయంటే ఏ స్థాయిలో అభివృద్ధి సాధించామో అర్థం చేసుకోవాలి.
కేంద్ర ప్రభుత్వం నుండి రాష్ట్రానికి రావాల్సిన నిధుల విషయంలో చిత్తశుద్ధితో కూటమి ప్రభుత్వంలోని ప్రతి నాయకుడు పని చేస్తున్నారు. మున్సిపాలిటీకి రూ. 300 కోట్ల నిధులు రప్పించుకున్నాం. రుద్రవరంలోని ఇళ్లు మొత్తం పూర్తి చేస్తాం. కరగ్రహారంలో 19 వేల ఇళ్లున్నాయి. వాటన్నింటి సమస్యలు పరిష్కరించి ప్రజలకు అందిస్తాం.
రాష్ట్రంలో నిత్యం జగన్ రెడ్డి కుట్రలు చేస్తున్నాడు. కులం, మతం, ప్రాంతం పేరుతో రాజకీయం చేయాలనుకుంటున్నాడు. దేశంలోనే అతిపెద్ద మద్యం కుంభకోణానికి పాల్పడి దోపిడీ నుండి ప్రజల దృష్టి మరల్చేందుకు నానా యాగీ చేస్తున్నాడు. ప్రతి నాలుగు బాటిళ్లలో ఒకటి కల్తీ అని ఆరోపించిన జగన్ రెడ్డి సవాల్ చేస్తే పారిపోయాడు. 2019లో జరిగిన పొరపాటు మళ్లీ చేయడానికి వీల్లేదు. ప్రభుత్వ కార్యక్రమాల్లో పార్టీ భాగస్వామ్యం అత్యంత కీలకం. ప్రభుత్వం అమలు చేసే ప్రతి కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలి. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి సత్తా చాటి చెప్పాలి. సర కార్యక్రమం ద్వారా రాష్ట్రంలోని ప్రతి ఓటును గుర్తించాలి. ఈ నెల 15 నుండి వచ్చే నెల 14 వరకు ప్రతి ఓటరుని కలిసి సంరక్షించాలి. 2029 ఎన్నికల నాటికి రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రస్థానంలో నిలిపేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని మంత్రి కొల్లు రవీంద్ర పిలుపునిచ్చారు.
కార్యక్రమంలో జనసేన పట్టణాధ్యక్షులు గెడ్డం రాజు, బీజేపీ నాయకులు పంతం గజేంద్ర, టీడీపీ సీనియర్ నాయకులు గొర్రెపాటి గోపీచంద్, జిల్లా టీడీపీ ప్రధాన కార్యదర్శి గోపు సత్యన్నారాయణ, మాజీ మున్సిపల్ ఛైర్మన్ బాబాప్రసాద్, ఏఎంసీ ఛైర్మన్ కుంచె దుర్గాప్రసాద్, మండల పార్టీ అధ్యక్షులు కాగిత వెంకటేశ్వరరావు, పట్టణాధ్యక్షులు స్వామి, సెక్రటరీ బచ్చుల అనిల్, నారాయణప్రసాద్, బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ ఫణికుమార్, మైనారిటీ కార్పొరేషన్ ఛైర్మన్ హసీం భేగ్, పల్లపాటి సుబ్రహ్మణ్యం, జనసేన రూరల్ అధ్యక్షులు తిమోతి, సీనియర్ నాయకులు పొట్టె వెంకట్రావు, జిల్లా కార్యదర్శి గంపల భవాని, సమీర్ తదితర నాయకులు, కార్యకర్తలు, క్లస్టర్ ఇన్చార్జిలు పాల్గొన్నారు.












