- నిర్మాణ పర్యవేక్షణకు రాష్ట్రస్థాయి కమిటీ
- ప్రాంతాల అభివృద్ధికి టెంపుల్ టౌన్ డెవలప్మెంట్ ప్లాన్
- దేవాదాయ శాఖ సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు
అమరావతి (చైతన్య రథం): శ్రీవాణి నిధులతో రాష్ట్రవ్యాప్తంగా నిర్మించనున్న 5 వేల దేవాలయాలను వచ్చే రెండేళ్లలో పూర్తి చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఈ ఆలయాల నిర్మాణ పర్యవేక్షణకు రాష్ట్రస్థాయి కమిటీ వేయాలని సీఎం సూచించారు. గురువారం రాష్ట్ర సచివాలయంలో దేవాదాయ శాఖపై సీఎం చంద్రబాబు సమీక్షించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. “శ్రీవాణి నిధులతో రాష్ట్రవ్యాప్తంగా ఆలయాలు నిర్మించాలని గతంలోనే నిర్ణయించాం. ఈ ఆలయాల నిర్మాణ బాధ్యత జిల్లా యంత్రాంగానికి అప్పగించాలని ఆలోచన చేస్తున్నాం. రాష్ట్రవ్యాప్తంగా ఒక్కో నియోజకవర్గంలోనూ 25-30 వరకూ ఆలయాలను నిర్మించే అవకాశం ఉంటుంది. స్థానిక ప్రజాప్రతినిధులతో సమన్వయం చేసుకుని ఆలయాల నిర్మాణాన్ని చేపట్టాలి. వారినుంచి ప్రతిపాదనలు తీసుకుని నిర్మాణం చేపట్టండి. ఆలయాల నిర్మాణానికి సంబంధించి మూడురకాల డిజైన్లతో పైలెట్ ప్రాజెక్టుగా నిర్మించాలి. వీటి నిర్మాణానికి సంబంధించి త్వరితగతిన అనుమతులిచ్చేలా చర్యలు తీసుకోవాలి. ప్రతీ దేవాలయానికీ ప్రహరీ నిర్మాణం చేపట్టాలి” అని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.
పవిత్రతతోపాటు పారిశుద్ధ్యమూ ముఖ్యం
“రాష్ట్రంలోని 22 ప్రముఖ దేవాలయాలకు మాస్టర్ ప్లాన్లు రూపొందించాలి. ఇప్పటి వరకు సింహాచలం, అన్నవరం, ద్వారకా తిరుమల, పెనుగంచిప్రోలు, శ్రీకాళహస్తి, కాణిపాకం దేవాలయాలకు మాస్టర్ ప్లాన్లు సిద్ధంగా ఉన్నాయి. మిగిలిన దేవాలయాలకూ మాస్టర్ ప్లాన్లను త్వరితగతిన రూపొందించాలి. ఈ మాస్టర్ ప్లాన్ల ద్వారా భక్తులకు మెరుగైన సదుపాయాలు, ట్రాఫిక్ నిర్వహణ, పార్కింగ్, నివాస సౌకర్యాలు, పరిశుభ్రతవంటి అంశాలను సమగ్రంగా అభివృద్ధి చేయాలి. దేవాలయాల్లో పవిత్రతోపాటు పారిశుద్ధ్యానికి ప్రాధాన్యమివ్వాలి. దేవుణ్ణి దర్శించుకోవడానికి వచ్చే భక్తులు భక్తిభావంతో దర్శనం చేసుకునే వాతావరణం ఉండేలా చేయడంతో పాటు.. ఆలయ పరిసరాలు పరిశుభ్రంగా ఉంటే భక్తులు సంతృప్తితో తిరిగి వెళ్తారు. గతంతో పోల్చుకుంటే రాష్ట్రంలోని దేవాలయాలకు భక్తుల సందర్శన పెద్దఎత్తున పెరుగుతోంది. ప్రధాన దేవాలయాల్లో భక్తుల రద్దీ గణనీయంగా పెరిగింది. 2025-26 సంవత్సరంలో శ్రీశైలం, విజయవాడ కనకదుర్గమ్మ దేవాలయాల్లో 1.2 కోట్లకుపైగా భక్తులు దర్శించుకున్నారు. శ్రీకాళహస్తిలో 83.88 లక్షలు, సింహాచలంలో 65.48 లక్షలు, అన్నవరంలో 57.87 లక్షలు, ద్వారకా తిరుమలకు 55.15 లక్షలమంది భక్తులు సందర్శించారు. దేవాలయాలకు వచ్చే భక్తులకు అన్నిరకాల సౌకర్యాలూ కల్పించాల్సిన బాధ్యత దేవాదాయ శాఖపైనే ఉంది. భక్తులకు తాగు నీటి సౌకర్యం మొదలుకుని అన్నదానం వరకూ అన్ని రకాల సేవలను అందించాలి” అని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు.
తిరుమల తరహాలో అన్న ప్రసాద వితరణ చేపట్టాలి
“రాష్ట్రంలోని 111 దేవాలయాల్లో అన్న ప్రసాదాన్ని అందిస్తుంటే… 65 దేవాలయాల్లో నిత్యాన్నదానం అందిస్తున్నాం. తిరుమల తరహాలోనే ఇతర దేవాలయాల్లోనూ అన్న ప్రసాదం అందించాలి. ప్రస్తుతం రాష్ట్రంలోని దేవాలయాల్లో రోజుకు సుమారు 80 వేలమంది భక్తులకు అన్న ప్రసాదం అందుతోంది. దీనికోసం ఏడాదికి రూ.157.85 కోట్లు వ్యయం అవుతోంది. ఆయా దేవాలయాల్లో పాకశాలల్లో పని చేసేవారికి శిక్షణ ఇప్పించాలి. దేవాలయాల అభివృద్ధికి కామన్ గుడ్ ఫండ్ ద్వారా జరుగుతున్న పనులను త్వరితగతిన పూర్తి చేయాలి. నిర్దిష్టమైన గడువులోకా సీజీఎఫ్ నిధులతో చేపట్టే దేవాలయాల నిర్మాణాలను పూర్తి చేయాలి. అన్ని ప్రధాన ఆలయాల్లో వాట్సాప్ ద్వారా సేవలు అందుబాటులోకి తీసుకురావాలి. అన్ని రకాల సేవలను ఆన్ లైన్లో అందుబాటులో ఉంచాలి. అన్ని ఆలయాలకూ ప్రత్యేక వెబ్సైట్లు రూపొందించాలి. సమగ్ర వివరాలతో డ్యాష్బోర్డ్ కూడా అందుబాటులోకి తీసుకురావాలి. ఆగమ సలహా మండలి, ఎండోమెంట్ ట్రిబ్యునల్ చైర్మన్, స్టాండింగ్ కౌన్సిల్ నియామకాన్ని త్వరితగతిన చేపట్టండి. ఇంకా పెండింగులో ఉన్న దేవాలయాల పాలక మండళ్లను వెంటనే నియమించాలి” అని సీఎం సూచించారు.
దేవాలయాల సమీప ప్రాంతాల అభివృద్ధిపై దృష్టి
“ఆధ్యాత్మిక టూరిజం ప్రమోట్ చేసేలా ప్రణాళికలు సిద్ధం చేయాలి. అన్ని దేవాలయాల వద్ద వసతి సౌకర్యాలు మెరుగవ్వాలి. ప్రముఖ దేవాలయాలున్న ప్రాంతాలన్నీ అభివృద్ధి జరిగేలా చూడాలి. దీనికోసం టెంపుల్ టౌన్ డెవలప్మెంట్ ప్లాన్ సిద్ధం చేయాలి. భక్తుల రద్దీ నియంత్రణ విషయంలో టీటీడీ అనుసరిస్తున్న విధానాన్ని అధ్యయనం చేయండి. కేవలం భద్రత ఆధారంగా కాకుండా సంప్రదాయం ప్రకారం దేవాలయాల్లో నిబంధనలుండాలి. దేవాదాయ భూముల రక్షణకు బ్లాక్ చైన్ టెక్నాలజీని వినియోగించాలి. దేవాదాయ ఆస్తుల పరిరక్షణకు చర్యలు తీసుకోవాలి. ఈవోలు బదిలీపై వెళ్లే సమయంలో కొత్తగా వచ్చే అధికారులకు ముఖ్యమైన వివరాలను అందించి వెళ్లాలి” అని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఈ సమీక్షలో మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.













