- వాళ్లు లేకపోతే మనంలేము, మన పదవులు కూడా లేవు!
- కూటమి మధ్య చిచ్చుపెట్టేందుకు గొడ్డలి పార్టీ కుట్రలు
- 11సీట్లకు పరిమితం చేసినా వైసీపీ బుద్ధి మారలేదు
- పనిచేసిన కార్యకర్తలను శాస్త్రీయంగా గుర్తిస్తాం, పదవులిస్తాం
- అనంతపురం కార్యకర్తల సమావేశంలో యువనేత నారా లోకేష్
అనంతపురం (చైతన్య రథం): “అనంతపురం ఎమ్మెల్యేకి ఒకటి చెబుతున్నా. కార్యకర్తలు ఐదేళ్లు ఎన్నో కష్టాలు పడ్డారు. పాదయాత్రలో నాకు అండగా నిలబడింది ప్రాణసమానమైన కార్యకర్తలే. వారందరినీ గుండెల్లో పెట్టుకుని కాపాడాల్సిన బాధ్యత మీపై ఉంది” అని తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు నారా లోకేష్ అన్నారు. అనంతపురంలో జరిగిన కార్యకర్తల సమావేశంలో యువనేత లోకేష్ మాట్లాడుతూ… “కార్యకర్తలు లేకపోతే మీరు, నేను లేము. పదవుల్లో ఎవరూ శాశ్వతం కాదు. పనితీరు సరిగా లేకపోతే చంద్రబాబు పీకి పడేస్తారు. క్షేత్రస్థాయి ఫీడ్బ్యాక్ తీసుకుని కరెక్టు చేసుకుని ముందుకు వెళ్తున్నారు. ఇప్పటికే చాలావరకు కార్పొరేషన్ ఛైర్మన్ పదవులిచ్చాం. ఇంకా ఇవ్వాల్సినవి ఉన్నాయి. పద్దతి ప్రకారం న్యాయం చేస్తూ ముందుకెళ్తున్నాం. మనమధ్య సోషల్ మీడియాలో చిచ్చుపెట్టేందుకు గొడ్డలి పార్టీ ఫేక్ వాళ్లు ప్రయత్నిస్తారు. పార్టీ కేడర్ అప్రమత్తంగా ఉండాలి. కడపలో హిందూ, ముస్లింల మధ్య చిచ్చుపెట్టేందుకు వైసీపీ సైకోలు కుట్రపన్నారు. వారి చరిత్ర తెలుసుకనుకనే ఎవరూ స్పందించలేదు. సొంత బాబాయిని లేపేసి నారాసుర రక్తచరిత్ర అని సాక్షిలో రాశారు. దానివల్ల మనం తీవ్రంగా నష్టపోయాం. ట్రైనింగ్కు వచ్చినపుడు మీలో చాలామందిని నేను కలిశాను. కాఫీ కబుర్లలో క్షేత్రస్థాయి సమస్యలు తెలసుకుని సరిచేసుకుంటూ వెళ్తున్నా. ఇంకా సమస్యలున్నాయి. సమస్యలు పరిష్కరించే దిశగా ముందుకెళ్తున్నాం” అన్నారు.
కార్యకర్తల కష్టంవల్లే మనకు అధికారం
“మేం మంత్రిపదవుల్లో కూర్చోవడం వెనుక కార్యకర్తల కష్టం, త్యాగం ఉన్నాయి. 2019-24 నడుమ వేలాదిమంది కార్యకర్తలపై కేసులు పెట్టారు, ఇబ్బంది పెట్టారు. ఏకంగా చంద్రబాబు ఇంటి గేటుకు తాళ్లుకట్టారు. ఎంత వేధింపులకు గురిచేసినా ఎత్తిన పసుపుజెండా దించకుండా పోరాడింది కార్యకర్తలే. పౌరుషాలగడ్డ అనంతపురం జిల్లా. ఈరోజు ధర్మవరంలో ఆర్డిటి ఆసుపత్రికి వెళ్లా. అక్కడ పెద్దఎత్తున ప్రజలు తరలివచ్చారు. వాళ్లను చూశాక మళ్లీ పాదయాత్ర రోజులు గుర్తుకు వచ్చాయి. మీలో చాలామంది నాతో పాదయాత్ర చేశారు. ఆనాడు ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై మీతో చర్చించా. అధికారంతో సంబంధం లేకుండా మీరు మా కుటుంబంపై ఎప్పుడూ ప్రేమ, అభిమానం చూపుతానే ఉన్నారు. ఎన్టీఆర్ను మూడుసార్లు గెలిపించింది, మా మామ హరికృష్ణను శాసనసభకు పంపింది, మరో మామ బాలయ్యను మూడుసార్లు శాసనసభకు పంపిన గడ్డ అనంతపురం. అందుకే ఎంతచేసిన మీ రుణం తీరదు. మీకోసం అహర్నిశలు కష్టపడతా. అనంతపురం జిల్లాను నెం.1 చేసే బాధ్యత తీసుకుంటా. అనంతపురం ప్రజలు కష్టాన్ని నమ్ముకునేవారు, చంద్రబాబు హార్టికల్చర్ కు మారమంటే వెంటనే మారారు. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే నేను బాధ్యత తీసుకుంటా” అని స్పష్టం చేశారు.
సామాన్యులను సైతం పొలిట్ బ్యూరోకి తెచ్చాం
“మొన్న జరిగిన మహానాడులో ఆరు శాసనాలు తీసుకున్నా. అందులో నా హృదయానికి దగ్గరైంది కార్యకర్తే అధినేత. వైకాపా మూకలు బెదిరిస్తున్నా మీసాలు మెలిపెట్టి నామినేషన్ వేసిన అంజిరెడ్డి తాత, జై తెలుగుదేశం అంటూ ప్రాణాలు విడిచిన తోట చంద్రయ్య ధైర్యం మనందరికీ ఆదర్శం నమ్ముకున్న సిద్ధాంతం కోసం ప్రాణాలు సైతం పణంగా పెట్టే కార్యకర్తలే మన బలం. గతపాలనలో ఎంతోమంది కార్యకర్తలను చంపారు, అంతకుముందు పరిటాల రవిని కూడా హతమార్చారు. ఎన్నికష్టాలు ఎదురైనా మీరు పార్టీకి అండగా నిలబడ్డారు. అందుకే టిడిపిలో కార్యకర్తే అధినేత. కష్టపడి కేడర్ ను గుర్తించేందుకే టెక్నాలజీతో అనుసంధానం చేస్తున్నాం. సామాన్య కార్యకర్తను పొలిట్ బ్యూరోకి తీసుకెళ్లిన ఘనత తెలుగుదేశం పార్టీది. మండల పార్టీ అధ్యక్షురాలు, క్లస్టర్ ఇన్ చార్జిని పొలిట్ బ్యూరో సభ్యులను చేశాం. ఇంకా చేయాల్సింది చాలా ఉంది” అని పేర్కొన్నారు.
నమ్మిన సిద్ధాంతం కోసం రాజీలేని పోరాటం
“తెలుగుదేశం పార్టీ కోటిమంది సభ్యులు గల అతిపెద్ద కుటుంబం. ఇంత పెద్ద ఫ్యామిలీలో సమస్యలు ఉంటాయి. పార్టీలో సంస్కరణలు తేవడానికి నాకు రెండు సంవత్సరాలు పట్టింది. నమ్మిన సిద్ధాంతం కోసం నేను రాజీలేని పోరాటం చేస్తా. మనపార్టీలో కోవిడ్ కన్నా ప్రమాదకరమైన జబ్బుపేరు అలక. కోపమొస్తే మనం వేరే నాయకుడుకి జైకొట్టం, అలిగి ఇంట్లో పడికుంటాం. దానివల్ల పార్టీ నష్టపోతుంది. అనుకున్నది సాధించుకోవడానికి ఒకటికి పదిసార్లు నాయకుల వద్దకు వెళ్లాలి. అలిగి ఇంటిలో పడుకోవద్దు. భారతదేశ చరిత్రలో ప్రమాదబీమా కింద రూ.5లక్షలు ఇచ్చే పార్టీ తెలుగుదేశం మాత్రమే. సామాన్య కార్యకర్తను పొలిట్ బ్యూరో చేసే ఘనత మనదే. పార్టీ కార్యక్రమాలను విజయవంతం చేసేందుకే మై టిడిపి యాప్ తెచ్చాం. అందులో జల్లెడబట్టి ప్రతిభ కనబర్చిన వారికి నామినేటెడ్ పదవులు ఇస్తాం” అని ప్రకటించారు.
గొడ్డలిపార్టీకి ఇంకా బుద్ధిరాలేదు
వైసీపీ వాళ్లకు తెలిసింది గొడ్డలి, రప్పారప్పా. ప్రజలను గాలికొదిలేసి గొడ్డలి పట్టుకోవడం వల్లే ప్రతిపక్ష హోదా కూడా రాకుండా పోయింది. వాళ్లకు ఎండ్ కార్డు వేసేది పసుపు సైన్యమే. ఇప్పటికీ వాళ్లు బూతులు తిడుతూనే ఉన్నారు, వారికి ఇంకా బుద్ధిరాలేదు. ఆ 11 కూడా వద్దనుకుంటున్నట్లుగా ఉన్నారు. ప్రజలు అంతా గమనిస్తున్నారు. పాదయాత్ర సమయంలో రెడ్ బుక్ పట్టుకుని ఊరూరా తిరగా. చట్టాలు ఉల్లంఘించిన వారిని వదిలిపెట్టేది లేదు. డౌట్ కార్యకర్తకు అవసరం లేదు. అధికారం ఉంది కదా అని అహంకారం వద్దు, దానివల్లే గొడ్డలిపార్టీకి 151 సీట్లు 11 అయ్యాయి. ప్రజలు ప్రతి అడుగు గమనిస్తూనే ఉంటారు. పార్టీ కార్యకర్తలు, నాయకులు అనునిత్యం ప్రజలమధ్య ఉండాలి, సమస్యలు ఉంటే నాలుగు గోడల మధ్య పరిష్కరించుకోవాలి. కార్యకర్తలు, నాయకుల నడుక ఆత్మీయ కలయిక ఉండాలి. క్లస్టర్, యూనిట్, బూత్ కమిటీలు దశలవారీగా తెలుసుకొని పరిష్కరించే దిశగా పనిచేయాలి” అని దిశానిర్దేశం చేశారు.
సూపర్ -6 హామీలు నెరవేర్చేందుకు కష్టపడుతున్నాం
“గత ప్రభుత్వం అప్పులు చేసి, అభివృద్ధిని గాలికొదిలేసింది. కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన సూపర్ — 6 హామీలు నిలబెట్టుకునేందుకు ఆర్థికమంత్రి అహర్నిశలు కష్టపడుతున్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా 4వేల పెన్షన్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. ఇంట్లో ఉన్న పిల్లలందరికీ తల్లికి వందనం ఇస్తున్నాం. మహిళలకు ఉచిత బస్. మూడు గ్యాస్ సిలిండర్లు ఇచ్చాం. ఇదివరకెన్నడూ లేనివిధంగా 16వేల టీచర్ పోస్టులు, 6వేల కానిస్టేబుళ్లు భర్తీచేశాం. జాబ్ క్యాలెండర్ విడుదల చేశాం. ఇదంతా ప్రజలకు తెలియజేయాలి. చేసిన పని చెప్పుకోకపోతే పార్టీకి అన్యాయం చేసిన వారవుతారు. 2019లో కియా పెనుగొండకు తెస్తే అక్కడ కూడా ఓడాం. చేసింది చెప్పుకోక పోవడం వల్లే ఓటమి పాలయ్యాం. కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత కార్యకర్తలపై ఉంది” అని పిలుపునిచ్చారు.
అనంతపురానికి ఫైటర్ జెట్లు రాబోతున్నాయి
“అనంతపురానికి కార్లే కాదు… ఫైటర్ జెట్లు రాబోతున్నాయి. అభివృద్ధి, సంక్షేమాన్ని జోడెడ్ల బండిలా ముందుకు తీసుకెళతాం. ఏపీలో నమో జోడి ఉంది. నమో అంటే నాయుడు, మోడీజీ. ఎన్డీఏలో కీలకపాత్ర వహించడం వల్లే విశాఖ ఉక్కు కాపాడుకున్నాం. రైల్వే జోన్ తెచ్చుకోగలిగాం. అమరావతి, పోలవరం పనులు శరవేగంతో సాగుతున్నాయి. రాయలసీమకు హైకోర్టు బెంచి రాబోతోంది. ప్రస్తుత మంత్రివర్గంలో ఉన్న వాళ్లందరం మిసైల్ లాంటివాళ్లం. మమ్మల్ని నడిపించే జీపీఎస్ పేరు చంద్రబాబునాయుడు. ఆయనకు అనుభవం ఉంది. ఆయన నుంచి చాలా నేర్చకున్నాం. అన్ని విషయల్లో ఏకీభవించం. నాలుగు గోడల మధ్య చర్చించి, బయటకు వచ్చాక ఒకేమాటపై నిలుస్తాం” అని లోకేష్ పేర్కొన్నారు.
మోడీజీ పిలుపును అంతా పాటిద్దాం
“ప్రధాని నరేంద్ర మోడీ నా దేశం నా బాధ్యత అనే కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ప్రస్తుతం అమెరికా — ఇరాన్ మధ్య యుద్ధం జరుగుతోంది. స్ట్రైట్ ఆఫ్ హోర్మూజ్ నుంచి మనకు క్రూడాయిల్ వస్తుంది. యుద్ధం మొదలయ్యాక ఇరాన్ దానిని మూసేసింది. దానివల్ల ధరలు పెరిగాయి. అంతర్జాతీయ పరిణామాల వల్ల బంగారం ధరలు కూడా పెరిగాయి. ప్రధానమంత్రి పిలుపును బాధ్యతగా తీసుకొని అందరూ పొదుపు పాటించాలి. 2 కార్లు వాడేవారు ఒకటి వాడాలి. నేను రెండు కార్లు మాత్రమే వాడుతున్నా. బంగారు కొనుగోలు తగ్గించాలి. ప్రస్తుత పరిస్థితుల్లో పొదుపు చాలా అవసరం. ఇందుకోసమే ప్రధాని 7 అంశాలతో పిలుపునిచ్చారు. మనమంతా పాటించాలి. సింగపూర్ ప్రధాని మాట్లాడుతూ హోర్మూజ్ తెరిచినా సంవత్సరం ఇబ్బంది పడతామని చెప్పారు. ప్రధాని ముందుచూపుతో దేశప్రజలను అప్రమత్తం చేశారు. దీనిపై ఒక కార్యక్రమం చేపట్టబోతున్నాం, త్వరలో వివరాలు తెలియజేస్తాం. అందరూ కలసికట్టుగా కూటమి బలోపేతం కోసం పనిచేయాలి” అని పిలుపునిచ్చారు.
అభివృద్ధి సాధించాలంటే ప్రభుత్వ కొనసాగింపు అవసరం
“అనుకున్న అభfవృద్ధి సాధించాలంటే ప్రభుత్వ కొనసాగింపు అవసరం. గుజరాత్, ఒడిశా రాష్ట్రాలు ఒకే పార్టీ అధికారంలో ఉండటం వల్ల ఎంతో అభివృద్ధి చెందాయి. గత ప్రభుత్వంలో రోడ్లపై గుంతలు కూడా పూడ్చలేదు. ఆనాటి ముఖ్యమంత్రి రోడ్డుపై వస్తుంటే పరదాలు కట్టారు. దేవాలయం లాంటి తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడిచేశారు. అధికారం వచ్చింది కదా అని ఐదేళ్లలో పడిన కష్టాలను మర్చిపోకూడదు. ప్రతిపక్షంలో ఉన్నపుడు కొంతమంది మనలను ఇబ్బంది పెట్టారు. అటువంటి వారిని వదిలేది లేదు. నాడు నేడు ఎప్పుడూ కార్యకర్తలు, ప్రజలకు అండగా నిలబడతా. ఈరోజు ధర్మవరంలో ఆర్ డిటి ఆసుపత్రిని చూశా, మాంచో గారిని కలిశాం. 2020నుంచి వారు లైసెన్సు సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు. ఆ సమస్యను పరిష్కరించాం. ఆర్డిటికి అండగా నిలబడ్డాం” అని యువనేత లోకేష్ ఉద్ఘాటించారు.
సమావేశం అనంతరం దాదాపు 1500మంది కార్యకర్తలతో యువనేత లోకేష్ ఫోటోలు దిగారు. పెద్దఎత్తున తరలివచ్చిన ప్రజలు, కార్యకర్తలను కలిసి అర్జీలు స్వీకరించారు. ఇంటర్మీడియట్లో కంటిచూపు సమస్యతో బాధపడుతున్న విద్యార్థులకు సైన్సు కోర్సులు చదివేందుకు జీఓ నెం.35 విడుదలచేయడంతో వారు లోకేష్ను కలసి కృతజ్జతలు తెలిపారు. యువగళం పాదయాత్ర సందర్భంగా తమకు ఇచ్చిన హామీ నెరవేర్చారని ఆనందం వ్యక్తంచేశారు. సమావేశంలో అనంతపురం ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ, అనంతపురం పార్లమెంటు అధ్యక్షుడు పూల నాగరాజు, రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, రెవిన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్, అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్, జోనల్ కో ఆర్డినేటర్ దామచర్ల సత్య, ఎమ్మెల్సీ, భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి, అబ్జర్వర్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు, పార్లమెంటు జనరల్ సెక్రటరీ జి.శ్రీధర్ చౌదరి తదితరులు పాల్గొన్నారు.













