- గ్రీవెన్స్లో తిమ్మసముద్రం గ్రామవాసి ఫిర్యాదు
- చేతబడి నెపంతో మా కుటుంబంపై వేధింపులు… న్యాయం చేయాలని వినతి
- రెవెన్యూ రికార్డుల మాయాజాలం… సంబంధం లేని వ్యక్తికి అక్రమంగా భూమి కట్టబెట్టే కుట్ర
- అసైన్డ్ భూమిలో అక్రమంగా వెంచర్లు.. బరితెగించిన రియల్టర్లు
- అర్జీలు స్వీకరించిన కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్, ఏపీ వడ్డెర వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్
- చైర్మన్ మల్లెల ఈశ్వరరావు
- సమస్యల పరిష్కారానికి కృషి చేసిన నేతలు
మంగళగిరి (చైతన్యరథం): మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో శనివారం ప్రజా వినతుల పరిష్కార వేదిక నిర్వహించారు. రాష్ట్రం నలుమÖలల నుంచి విచ్చేసిన వారి నుంచి రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్, ఏపీ వడ్డెర వెల్ఫేర్, డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మల్లెల ఈశ్వరరావు వినతులు స్వీకరించి వాటి పరిష్కారానికి కృషి చేశారు.
శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా జలదంకి మండలం తిమ్మసముద్రం గ్రామానికి చెందిన వెంకటసురేష్ అర్జీ… 1993 సంవత్సరంలో ప్రభుత్వ అధికారులు నా తండ్రి శ్రీనివాసులుకి సర్వే నెం.40-1లో 2.34 ఎకరాలు (సెంట్లు), సర్వే నెం.658-1లో 1.03 ఎకరాలు భూమిని అసైన్డ్మెంట్ పట్టా కింద మంజూరు చేసి పట్టాదారు పాస్ పుస్తకం కూడా ఇచ్చారు. అప్పటి నుంచీ మా కుటుంబం ఆ భూమిని సాగు చేసుకుంటోంది. నా తండ్రి మరణానంతరం ఆ భూమి నా తల్లి తోటకూర జయలక్ష్మి పేరిట రెవెన్యూ రికార్డుల్లో నమోదైంది. 2023లో జరిగిన రీ సర్వేలో స్థానిక వైపీపీ నాయకులు రాజకీయ కక్షతో నా కుటుంబాన్ని ఇబ్బంది పెట్టాలని అధికారులపై ఒత్తిడి తెచ్చారు. దీంతో అధికారులు ఉద్దేశపూర్వకంగా.. 40-1 సర్వే నెంబర్లో ఉన్న 2.34 ఎకరాల భూమికి సంబంధించిన ఎల్పీఎం నెంబరు 2827ను.. పక్కనే ఉన్న 40-2 సర్వే నెంబరుకు చెందిన దివి మాల్యాద్రి, దివి సుబ్బరత్నం పేరిట తప్పుగా నమోదు చేశారు. దివి మాల్యాద్రి, సుబ్బరత్నం కావలి పట్టణంలో నివాసం ఉంటారు.
వారెప్పుడూ ఆ పొలం (40-2) వద్దకు రాలేదు. కానీ రీ సర్వే రికార్డుల్లో మా పేరు రావడంతో వారు ఆ అసైన్డ్ భూమిని దానికి దక్షిణాన ఉన్న ఓ నగల వ్యాపారికి చట్టవిరుద్ధంగా అమ్మేశారు. ఆ నగల వ్యాపారి ఆ భూమిని తన పొలంలో కలుపుకోవడానికి దౌర్జన్యానికి దిగాడు. కావలికి చెందిన గంజాయి స్మగ్లర్ గంధం ప్రసన్నాంజనేయులు… అతడి అనుచరులను రంగంలోకి దించి.. మా భూమిలో (40-1లో) వేసిన పంటను జేసీబీతో అత్యంత దారుణంగా నాశనం చేయించాడు. దీనిపై పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా ఎలాంటి న్యాయం జరగలేదు. కావున వారిపై చర్యలు తీసుకుని సమస్యను పరిష్కరించాలని విన్నవించాడు.
పోలవరం జిల్లా గంగవరం మండలం లొద్దిపాలేనికి చెందిన నాగమణి వినతి… మా గ్రామానికి చెందిన బూరుగు నూకరాజు ఆత్మహత్య చేసుకుంటే దానికి నేను చేసిన చేతబడే కారణమని అతని కుటుంబ సభ్యులు (పుల్లయ్యదొర, అప్పలకొండ) దుష్ప్ర చారం మొదలుపెట్టారు. గ్రామంలో ఏ అరిష్టం జరిగినా నాపైనే నిందలు వేస్తూ మానసిక, భౌతిక దాడులకు దిగుతున్నారు. ఉపాధి హామీ పనులు, వ్యవసాయ పనులకు వెళ్లకుండా గొడవలు చేసి అడ్డుకున్నారు. చివరకు రొయ్యల ఫ్యాక్టరీలో పనిలో చేరితే అక్కడ కూడా యాజమాన్యానికి తప్పుడు సమాచారం ఇచ్చి పనిలో నుంచి తీయించారు. శుభకార్యాలకు వెళ్లనివ్వకుండా సామాజిక బహిష్కరణ చేశారు. మా కుటుంబం నిర్మించుకున్న గంగలమ్మ గుడిలో క్షుద్రపూజలు చేస్తున్నారనే నెపంతో ఆ గుడిని తగులబెట్టారు. కూతురి పెళ్లి కోసం చేసిన రూ.6లక్షల అప్పు తీర్చడానికి ఉన్న భూమిని కుదవపెడదామన్నా ఎవరూ రాకుండా అడ్డుకుంటున్నారు. దీనిపై పలుమార్లు పోలీసులకు ఫిర్యాదు చేసినా ఎలాంటి న్యాయం జరగలేదు.
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వేదాయపాళేనికి చెందిన శిరీష అర్జీ… నెల్లూరు రూరల్ మండల పరిధిలోని నెల్లూరు బిట్-1, సర్వే నెం.1903/2లో గ్రామ సమిష్టి కింద మొత్తం 185.64 ఎకరాల భూమి ఉంది. ఇందులో పాపసాని వెంకటసుబ్బానాయుడు వాటా (1 1/2 భాగం) కింద 13.10 ఎకరాలు ఉండగా.. ఆయన తమ్ముడు పాపసాని మస్తాన్నాయుడు వాటా కింద 6.55 ఎకరాల భూమి వచ్చింది. ఈ మస్తాన్నాయుడు వాటాలోని 6.55 ఎకరాల వ్యవసాయ భూమిని ఆయన కుమారులు పాపసాని పిచ్చయ్యనాయుడు, పాపసాని రాధాకృష్ణయ్య నాయుడు 1971 మార్చి 15న నా తండ్రి నెట్టెం వెంకయ్యకి ‘విక్రయ స్వాధీన పత్రం’ ద్వారా విక్రయించారు. అప్పటి నుంచీ ఆ 6.55 ఎకరాల భూమి పూర్తిగా మా అనుభవంలోనే ఉంటూ వస్తోంది. 2008 జనవరి 4న నా తండ్రి వెంకయ్య మరణించారు. అనంతరం ఆ భూమికి చట్టబద్ధమైన వారసురాలిగా నా పేరిట పట్టా చేయాలని నెల్లూరు రూరల్ తహసీల్దారు కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్నాను. అయితే నెల్లూరు రూరల్ తహసీల్దారు నాకు పట్టా ఇవ్వకుండా నిరాకరిస్తున్నారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే… ఈ భూమితో ఏమాత్రం సంబంధం లేని తూమాటి సరోజనమ్మ అనే మహిళకు అక్రమంగా పట్టా కట్టబెట్టేందుకు అధికారులు తెర వెనుక ఏర్పాట్లు చేశారు. దీనిపై నేను రెవెన్యూ అధికారులకు ఎన్నిసార్లు అర్జీలు పెట్టుకున్నా ఎవరూ సమాధానం ఇవ్వట్లేదు. కనీసం పట్టించుకోవట్లేదు.
గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు మండలం వింజనంపాడుకు చెందిన నాగేశ్వరరావు విన్నపం… 1973 డిసెంబరు 12న అప్పటి గుంటూరు తహసీల్దారు పీవీ కృష్ణారెడ్డి (=c. చీశీ. దీ3-6482/93 ఉత్తర్వుల ప్రకారం) నా తండ్రి నిరుపేద అయిన గోగుల నరసయ్యకు విజనంపాడు పరిధిలో 25 సెంట్ల పోరంబోకు భూమిని అసైన్మెంట్ కింద మంజూరు చేశారు. నాటి నుంచి నా తండ్రి ఆ భూమిని సాగు చేసుకుంటూ వచ్చారు. 1980లో ఆయన మరణానంతరం వారసులమైన నా సోదరులు, సోదరి ఆ భూమిలో వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాం. 2020లో మా వ్యవసాయ భూమి పక్కన ఉన్న పొలాన్ని కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు వెంచర్గా వేసి ప్లాట్లుగా మార్చారు. ఈ క్రమంలో మా కుటుంబ భూమిపై కన్నేసిన ఆ అక్రమార్కులు దౌర్జన్యంగా 25 సెంట్ల భూమిని ఆక్రమించుకున్నారు. ఏకంగా మా వ్యవసాయ భూమిలోనే రోడ్లు వేసి, పైపులైన్లు ఏర్పాటుచేసి మమ్మల్ని పొలంలోకి అడుగుపెట్టని వ్వకుండా, వ్యవసాయం చేసుకోనివ్వకుండా అడ్డుకుంటున్నారు. దీనిపై పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా ఎలాంటి న్యాయం జరగలేదు.
అన్నమయ్య జిల్లా పెద్దతిప్పసముద్రం మండలం పులికల్లుకు చెందిన చంద్రశేఖర్రెడ్డి అర్జీ… మా గ్రామ పరిధిలో సర్వే నెం.90-5, 89-4, 88-1ల్లో వారసత్వ భూమి ఉంది. అన్నదమ్ముల భాగ పంపకాల్లో భాగంగా నాకు సర్వే నెం.90-5 లో 0.28 సెంట్లు, 89-4లో 0.23 సెంట్లు రాగా, అన్న వెంకటరమణారెడ్డికి 90-5 లో 0.08 సెంట్లు, 89-4 లో 0.06 సెంట్లు, 88-1 లో 0.37 సెంట్లు వచ్చాయి. మేము ఈ భూమిని ఏళ్ల తరబడి సాగు చేసుకుంటున్నాం. అయితే సర్వే నెం.88-1లో ఎలాంటి హక్కు, సంబంధం లేని మబ్బు అంజనమ్మ, మబ్బు సిద్ధారెడ్డి తదితరులకు రీ సర్వేలో ఏకంగా LPవీ చీశీ. 2015 ద్వారా భూమిని కేటాయించారు. ఈ తప్పిదం కారణంగా అసలైన హక్కుదారుల భూమికి కోత పడింది.
సర్వే నెం.90-5లో 0.28 సెంట్లకు బదులు 0.17.7 సెంట్లు, సర్వే నెం.89-4లో 0.23 సెంట్లకు బదులు 0.18 సెంట్లు మాత్రమే ఆన్లైన్ చేశారు. మొత్తంగా 0.15 సెంట్లు నష్టపోయాం. సర్వే నెం.90-5లో 0.08 సెంట్లకు బదులు 0.17.8 సెంట్లు, సర్వే నెం. 88-1లో 0.37 సెంట్లకు బదులు 0.17.10 సెంట్లు నమోదు చేశారు. మొత్తంగా 0.11.4 సెంట్లు నష్టపోయాం. నంద్యాల జిల్లా శిరివెళ్ల మండలం వీరారెడ్డిపల్లెకి చెందిన కోటిరెడ్డి వినతి… మాకు సంబంధించిన భూమిలో ‘కుంట’ ఉందనే సాకుతో రెవెన్యూ అధికారులు మా దరఖాస్తును ఉద్దేశపూర్వకంగా తిరస్కరిస్తున్నారు. వాస్తవానికి ఆ భూమిలో ఎలాంటి కుంట లేదు. ఈ విషయాన్ని ధ్రువీకరిస్తూ గతంలో స్వయంగా తహసీల్దారే లిఖితపూర్వకంగా స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. కుంట లేదని రిపోర్ట్ ఇచ్చినప్పటికీ ఇప్పుడు అదే రెవెన్యూ శాఖ కుంట ఉందనే నెపంతో దరఖాస్తు తిరస్కరిస్తున్నారు. దీనిపై పలుమార్లు రెవెన్యూ అధికారుల చుట్టూ తిరిగినా న్యాయం జరగలేదు.
తిరుపతి జిల్లా డక్కిలి మండలం చాకలపల్లి గ్రామానికి చెందిన నారాయణ అర్జీ… సర్వే నెం.070-పిలో గల 21 ఎకరాల ఈనాం భూమి చుట్టూ వివాదం ముదిరింది. ఏళ్ల క్రితం వెంకటగిరి సంస్థానం వారు ఈ భూమిని గెరిటి వెంకటయ్య మా తాతకి ఈనాంగా ఇచ్చారు. నెల్లూరు అధికారులు దీనిపై విచారణ జరిపి నా తండ్రి గెరిటి పెంచలయ్య, సాటోకోటి రమణయ్య పేరిట జాయింట్ పట్టా మంజూరు చేశారు. అప్పటి నుంచీ పెంచలయ్య ఈ భూమిపై సర్వ హక్కులూ కలిగి సాగు చేసుకునేవారు. అయితే నా తండ్రి పెంచలయ్య అనారోగ్యంతో మరణించిన తర్వాత నేను ఆ భూమిని సాగుచేస్తుండగా.. సంగన్నపల్లి గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు దౌర్జన్యంగా ప్రవేశించి ఆక్రమించుకున్నారు. ఈ కబ్జాపై గతంలో ఉన్న తహసీల్దారు స్పందించి డక్కిలి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కానీ పోలీసులు ఎలాంటి చర్యలూ తీసుకోకపోవడంతో అక్రమార్కులు రెచ్చిపోయారు. ఇటీవల జిల్లా అధికారుల దృష్టికి ఈ సమస్యను తీసుకెళ్లగా, మండల స్థాయి అధికారులు క్షేత్రస్థాయిలో పూర్తి విచారణ జరపకుండా వారికి తోచిన విధంగా తప్పులతడక నివేదికలు పంపుతున్నారు.
మార్కాపురానికి చెందిన సుబ్బలక్ష్మి వినతి… సర్వే నెం.675/1లో మొత్తం 66 సెంట్ల భూమి కొనుగోలు చేశాం. అప్పట్లో నా భర్త పేరిట 33 సెంట్లు, నా పేరిట 33 సెంట్లు చొప్పున రిజిస్ట్రేషన్ చేయించుకున్నాం. అయితే కొన్నేళ్ల క్రితం నా భర్త మరణించారు. చట్టప్రకారం ఆ మొత్తం 66 సెంట్ల భూమికి నేనే ఏకైక వారసురాలు, సర్వహక్కురాలు అయ్యాను. ఇదే అదనుగా భావించిన కొండయ్య, వెంకటరెడ్డి తదితరులు నా భూమిలోకి ప్రవేశించి దౌర్జన్యంగా ఆక్రమించుకున్నారు. అంతే కాకుండా అధికారులను తప్పుదోవ పట్టించి రెవెన్యూ రికార్డుల్లో కూడా వారి పేర్లు నమోదు చేయించుకున్నారు. దీనిపై పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా ఎలాంటి న్యాయం జరగలేదు.
వైఎస్సార్ కడప జిల్లా ప్రొద్దుటూరు మండలం కొత్తపల్లె గ్రామానికి చెందిన పుల్లయ్య అర్జీ… మా తాత మొలక లింగడు కుటుంబం గతంలో నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మండలం బాచేపల్లె గ్రామంలో నివాసం ఉండేది. ఆరఎసఆర్ రికార్డుల ప్రకారం.. బాచేపల్లె గ్రామ పరిధిలోని సర్వే నెం.85లో మా తాత పేరిట 2.29 సెంట్ల (ఎకరాల) పట్టా భూమి ఉంది. ఆయన బతికున్న కాలంలో ఆ భూమిని సాగు చేసుకునేవారు. ఆయన మరణానంతరం ఆర్థిక ఇబ్బందుల కారణంగా మాకుటుంబం అక్కడి నుంచి వలస వెళ్లి కడప జిల్లాలో స్థిరపడింది. మా కుటుంబం ఊరు విడిచి వలస వెళ్లడాన్ని ఆసరాగా చేసుకున్న ‘బొందెల నరసింహుడు అనే వ్యక్తి ఆ భూమికి తప్పుడు దస్తావేజులు సృష్టించి, దౌర్జన్యంగా ఆక్రమించుకున్నాడు. ఈ విషయం తెలుసుకుని నా భూమి అప్పగించాలని కోరగా కబ్జాదారుడు దౌర్జన్యానికి దిగుతున్నాడు. దీనిపై పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా న్యాయం జరగలేదు.
పై వీటితో పాటు పలువురు పింఛన్, రేషన్, ఇళ్ల నిర్మాణాల సమస్యలపై అర్జీలు ఇచ్చి పరిష్కరించాలని కోరారు. మరికొందరు ఉద్యోగాల కోసం రెస్యూమ్ ఇచ్చారు. అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నాం ఆర్థిక తోడ్పాటు కల్పించాలని మరికొందరు అభ్యర్థనలు అందించారు.
















