- మంత్రులు, అధికార్లు, ఉద్యోగులవల్లే సాధ్యమైంది
- అందరి సహకారంతోనే అభవృద్ధి.. సంక్షేమం
- పాలనా ప్రారంభంలో పరిస్థితిని చూసి కష్టమేమో అనుకున్నా
- టీం సహకారంతోనే అసాధ్యాన్ని సుసాధ్యం చేశాం
- ‘ఆత్మీయ విందు’లో సీఎం చంద్రబాబు నాయుడు
అమరావతి (చైతన్య రథం): తనకు ప్రతిష్టాత్మక బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్-2025 అవార్డు రావడం సమష్టి విజయానికి నిదర్శనమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. ఈ అవార్డు మంత్రులు, అధికార్లు, ఉద్యోగులు సమష్టి కృషితో సాధించుకున్నదేనని పునరుద్ఘాటించారు. ‘బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ద ఇయర్-2025’ అవార్డును సీఎం చంద్రబాబు అందుకున్న సందర్భంగా మంత్రులు, కార్యదర్శులు, విభాగాధిపతులకు అమరావతి రాజధానిలోని సీఆర్డీయే కార్యాలయంలో ‘డిన్నర్ విత్ ద రియల్ విన్నర్స’ పేరిట ఆత్మీయ విందు ఇచ్చారు. ఈ సందర్భంలో ఆహూతులను ఉద్దేశించి సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. “అవార్డులే కాదు, అంతకుమించి అభివృద్ధి, సంక్షేమం మీ అందరి సహకారంతోనే సాధ్యమవుతుందని సీఎం చంద్రబాబు అన్నారు. “రాజకీయాల్లో ఎన్నో విజయాలను చూశాను కానీ, 2024 ఎన్నికల్లో వచ్చిన విజయం గతంలో ఎప్పుడూ చూడలేదు.
22 నెలల క్రితం పాలన ప్రారంభించినప్పుడు వ్యవస్థలను సరి చేయడం సాధ్యం కాదేమోనని అనుకున్నా. కానీ టీమ్ ఏపీ సహకారం వల్లే వ్యవస్థలను గాడిలో పెట్టగలిగాం… ఆ టీమ్వల్లే ఈ అవార్డు వచ్చింది. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానాన్ని ప్రవేశపెట్టాం. అధికారులు అద్భుతంగా పనిచేశారు. పారిశ్రామికవేత్తలు ప్రభుత్వం వెంట పడడం కాదు, ప్రభుత్వమే పారిశ్రామికవేత్తల వద్దకు వెళ్లి మాట్లాడాలి. ఇలా చేయడంవల్లే అభివృద్ధి సాధించగలిగాం. నా సుదీర్ఘ రాజకీయ జీవితంలో చాలామంది ప్రధానులను చూశాను. సరైన సమయంలో సరైన ప్రధానిగా నరేంద్ర మోదీ ఉన్నారు. గూగుల్ సంస్థ ఏపీకి రాగలిగిందంటే ప్రధాని మోదీనే కారణం. గూగుల్ సంస్థ ఏపీకి వచ్చేందుకు అవసరమైన నిబంధనలు చేశారు. ఆర్సెలార్ మిట్టల్ సంస్థ ఏర్పాటుకూ ప్రధాని చొరవే కారణం. ఆర్సెలార్ మిట్టల్ సంస్థ కోరిన విధంగా ముడి సరుకు రవాణాకు పైప్లైను ఏర్పాటు చేసుకునేందుకు అనుమతులివ్వాలని అధికారులను ఆదేశించి సహకరించారు. పెట్టుబడులు వచ్చాయి. ఉద్యోగాలు పెద్ద ఎత్తున వస్తున్నాయి.
తక్కువ ధరకే విద్యుదుత్పత్తికి ప్రయత్నిస్తున్నాం. విద్యుత్ కొనుగోళ్ల ఛార్జీలను గతేడాది 30 పైసలు తగ్గించాం. ఈ ఏడాది 30 పైసలు తగ్గించేలా లక్ష్యం పెట్టుకున్నాం. రాజకీయంగా నష్టం జరుగుతుందని చెప్పినా… ప్రజలకు మేలు చేయడానికి విద్యుత్ సంస్కరణలు చేపట్టాం. ఇప్పుడు వన్ నేషన్- వన్ గ్రిడ్ అనే వ్యవస్థను ఏర్పాటు చేసిన ప్రధాని దేశానికి అతిపెద్ద మేలు చేశారు. డ్వాక్రా సంఘాల ఉత్పత్తులకు స్వయం బ్రాండ్ ఏర్పాటు చేశాం. ఏపీ ఉత్పత్తులకు గ్లోబల్ బ్రాండ్ రావాలి. రాజకీయంగానూ… పరిపాలనాపరంగానూ నేను, పవన్ కళ్యాణ్ ఎలాంటి ఇగోలకు వెళ్లకుండా ప్రజల కోసం పని చేస్తున్నాం. అధికారులు, ఉద్యోగులు కూడా విధులు నిర్వహించే విషయంలో ఇగోలకు పోకుండా రాష్ట్రం కోసం పనిచేయాలి. గూగుల్ పెట్టుబడులను మించి రిలయన్స్ పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చింది. గూగుల్ 15 బిలియన్ డాలర్లు పెట్టుబడి పెడితే… రిలయన్స్ 17 బిలియన్ డాలర్లు పెట్టుబడులతో ముందుకు వస్తోంది. ఇది రాష్ట్రానికి శుభపరిణామం” అని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు.














