కుట్రలు, విద్వేషాలు, వర్గాల మధ్య చిచ్చు పెట్టడం, అమాయకులను రాజకీయ ప్రయోజనాలకు ఉపయోగించుకోవడం ప్రజాస్వామ్యానికి ప్రమాదకరం. ఏ వర్గాన్నీ రాజకీయ పావులుగా ఉపయోగించకూడదు. అయితే రాష్ట్రంలో 2024 ఎన్నికల తరువాత కుల, మత, ప్రాంతాల మధ్య విభేదాలు సృష్టించి రాజకీయ లబ్ధి పొందడం వైసీపీ రాజకీయాలకు ట్రేడ్మార్క్గా మారింది. ముఖ్యంగా దళితులను భావోద్వేగాల పేరుతో రెచ్చగొట్టి, చట్టపరమైన ఇబ్బందుల్లోకినెట్టి తన గుప్పెట్లోకి తెచ్చుకోవాలని జగన్రెడ్డి దళితులను రాజకీయ పావులుగా వాడుకుంటున్న ఘట్టాలు లెక్కలేనన్ని.
జగన్ అధికారంలో ఉన్నప్పుడు కుల, మత, ప్రాంతాల మధ్య చిచ్చు పెడుతూ పాలన కొనసాగించి రాష్ట్రాభివృద్ధిని అడ్డుకున్నారు. అధికారం కోల్పోయిన తర్వాతా అదే వైఖరి కొనసాగిస్తూ రాజకీయ పబ్బం గడుపుతున్నారు. అరాచకమే ఆయుధంగా చేసుకొని విష ప్రచారాలు చేస్తూ రాజకీయ లాభాలు పొందుతున్నారు. అధికారం కోసం ఎన్ని కుట్రలకైనా దిగజారడం, సొంతవారిని కూడా పావులుగా వాడుకోవడం జగన్రెడ్డికి అలవాటుగా మారింది. ఇందులో భాగంగానే ఏలూరు దళిత క్రైస్తవుల సభతోపాటు, తన యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ వేదికలుగా కులాలు, మతాల మధ్య చిచ్చు పెట్టేలా బచ్చలకూర జోసెఫ్ అలియాస్ ప్రశ్న రావణ్ అనే వ్యక్తిని రాజకీయ పావుగా ఉపయోగించుకొని జగన్రెడ్డి కుల, మతాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేశారు. రోడ్డు ప్రమాదంలో మరణించిన పాస్టర్ ప్రవీణ్ మృతిని రాజకీయ లబ్ధి కోసం వైసీపీ నాయకులు హత్యగా, క్రైస్తవులపై దాడిగా చిత్రీకరించి, మత విద్వేషంతో ముడిపెట్టి రాజకీయంగా వాడుకునేందుకు కుట్రలు చేశారు.
కూటమి ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని, క్రైస్తవుల్లో అసంతృప్తి రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందాలని ప్రయత్నించడం రాష్ట్ర ప్రజలకు తెలీంది కాదు. చిత్తూరు జిల్లా దేవళంపేటకు చెందిన వైసీపీ సర్పంచ్ గోవిందయ్య, కూటమి ప్రభుత్వంపై బురద జల్లే ఉద్దేశంతో అంబేద్కర్ విగ్రహానికి నిప్పంటించి కులాల మధ్య చిచ్చు పెట్టే కుట్రకు పాల్పడటం వెలుగులోకి రావడం తెలిసిందే. ప్రభుత్వంపై బురద చల్లి, మత విద్వేషాలు రెచ్చగొట్టేందుకు పాస్టర్ అభినయ్ దర్శన్ అల్లూరి జిల్లా వేదికగా ఆడిన ‘దాడి’ డ్రామా రాష్ట్రం మొత్తాన్ని నివ్వెరపరిచింది. 2024 ఎన్నికల ప్రచారం సందర్భంగా విజయవాడలో గులకరాయి డ్రామాకు దిగారు జగన్. ఇందులో దళితులను బలిచేశారన్న విమర్శలు లేకపోలేదు. అంతకుముందు, 2019 ఎన్నికలకు ముందు కోడికత్తి డ్రామాతో దళిత యువకుడు శ్రీనుని ఐదేళ్లపాటు జైల్లో పెట్టి అతని జీవితాన్ని నాశనం చేశారన్న ఆరోపణలూ ఉన్నాయి.
దళితులపట్ల జగన్ ప్రేమ ఎలాంటిది?
“అధికారం కోసమే జగన్రెడ్డికి దళితులు కావాలి. అధికారంలోకి రాగానే వారిని అంటరాని వారిగా చూస్తారు” అని విమర్శకులు ఆరోపిస్తున్నారు. జగన్రెడ్డికి నిజంగా దళితులపై ప్రేమ ఉంటే, ఆయన పాలనలో డ్రైవర్ సుబ్రమణ్యం హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న ఎమ్మెల్సీ అనంతబాబుకు ఎందుకు అండగా నిలుస్తున్నారన్న ప్రశ్నకు సమాధానం లేదు. మాస్క్ అడిగినందుకు డాక్టర్ సుధాకర్ను వేధించి ఆత్మహత్యకు పురిగొల్పారన్న ఆరోపణలపైనా ప్రభుత్వం మౌనం వహించింది. జగన్ సొంత జిల్లాలో దళిత మహిళ నాగమ్మపై అత్యాచార ఘటన జరిగినా స్థానిక ఎమ్మెల్యేగా పట్టించుకోలేదు. పైగా ప్రశ్నించిన దళితులపైనే ఎస్సీ, ఎస్టీ కేసులు నమోదు చేయించిన ఉదంతాలు లేకపోలేదు. రాజమండ్రిలో 16 ఏళ్ల బాలికపై గ్యాంగ్రేప్ ఘటనలో నిందితులపై తీసుకున్న చర్యలపైనా ప్రశ్నలు తలెత్తుతున్నాయి. దళిత జాతిపై అంత ప్రేమ ఉంటే వారికి అందాల్సిన 27 పథకాలను జగన్ ఎందుకు రద్దు చేశారు? ఎస్సీ కార్పొరేషన్ను నిర్వీర్యం చేసి దళితులకు అన్యాయం చేసిన మాట వాస్తవం కాదా? వైసీపీ ఐదేళ్ల పాలనలో దళితులపై 56,981 దాడులు, 192 హత్యలు జరిగాయన్నది వాస్తవం కాదా? దళితులపట్ల జగన్ చూపిస్తున్న ప్రేమ, తన పిల్లలనే తినే పాము ప్రేమలా ఉందని విమర్శకులు వ్యాఖ్యానిస్తున్నారు. జగన్ మాయమాటలు నమ్మి మోసపోవద్దని దళితులకు విజ్ఞప్తి చేస్తున్నారు.
దళితులకు విజ్ఞప్తి
మీ జీవితమే మీ కుటుంబానికి ఆస్తి. రాజకీయ కుట్రల్లో బలికావద్దు. ఎవరైనా విద్వేషాలు రెచ్చగొట్టినా, చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవాలని ప్రేరేపించినా, అలాంటి ప్రయత్నాలను తిరస్కరించండి. ప్రజాస్వామ్యంలో మీ ఓటు, మీ ఆలోచన, మీ భవిష్యత్తు అత్యంత విలువైనవి. రాజకీయ ప్రయోజనాల కోసం మిమ్మల్ని ఉపయోగించుకునే ప్రయత్నాలను గుర్తించండి. విద్య, ఉపాధి, స్వాభిమానం, అభివృద్ధి వైపు అడుగులు వేయండి. శాంతి, సామరస్యం, సామాజిక న్యాయం, చట్టబద్ధమైన ప్రజాస్వామ్య మార్గమే దళిత సమాజ పురోగతికి నిజమైన బాట అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
మంగినపల్లి ఎలీషా,
అనలిస్ట్, టీడీపీ నాలెడ్జ్ సెంటర్
















