- హ్యాపీనెస్ట్ నిర్మాణ వ్యయం చదరపు అడుగుకు రూ.3,393 మాత్రమే
- కేంద్ర ప్రభుత్వ రెసిడెన్షియల్ కాంప్లెక్స్కంటే తక్కువ ఖర్చు
- గెజిటెడ్ అధికారుల నివాసాల నిర్మాణ వ్యయం చదరపు అడుగుకు రూ.3,684 మాత్రమే
- మున్సిపల్ మంత్రి నారాయణ స్పష్టీకరణ
- కొండవీటి వాగు, పాలవాగులపై బ్రిడ్జి పనులను పరిశీలించిన మంత్రి
అమరావతి (చైతన్య రథం): అమరావతి రాజధాని నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయని, నిర్మాణ వ్యయాలపై కొందరు చేస్తున్న ఆరోపణలు పూర్తిగా అసత్యమని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ స్పష్టం చేశారు. శనివారం అమరావతిలో పర్యటించిన మంత్రి కొండవీటి వాగు, పాలవాగులపై నిర్మిస్తున్న బ్రిడ్జిల నిర్మాణ పనులను పరిశీలించారు. వర్షాకాలంలో ఆయా బ్రిడ్జిల వద్ద నీటి ప్రవాహానికి ఇబ్బంది లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు మంత్రి ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అమరావతి నిర్మాణాలపై వైసీపీ నాయకులు ఉద్దేశపూర్వకంగా ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. వాస్తవ గణాంకాలను పరిశీలిస్తే రాజధానిలో నిర్మిస్తున్న భవనాల వ్యయం పూర్తిగా సహేతుకంగానే ఉందని చెప్పారు.
అమరావతిలో నిర్మిస్తున్న హ్యాపీనెస్ట్ నివాస సముదాయాలకు రూ.984 కోట్లతో టెండర్ ఖరారైందని, నిర్మాణ వ్యయం చదరపు అడుగుకు కేవలం రూ.3,393 మాత్రమే అవుతోందని తెలిపారు. అలాగే గెజిటెడ్ అధికారుల నివాసాల నిర్మాణానికి రూ.1,003 కోట్లతో టెండర్ ఖరారైందని, చదరపు అడుగుకు రూ.3,684 మాత్రమే వ్యయం అవుతోందని పేర్కొన్నారు. ఇటీవల కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిన కేంద్ర ప్రభుత్వ రెసిడెన్షియల్ కాంప్లెక్స్ నిర్మాణానికి రూ.1,234 కోట్లతో టెండర్ ఖరారైందని, దాని నిర్మాణ వ్యయం చదరపు అడుగుకు రూ.3,945గా ఉందని మంత్రి వెల్లడించారు. ఈ గణాంకాలను పోల్చి చూస్తే అమరావతిలో నిర్మిస్తున్న హ్యాపీనెస్ట్, గెజిటెడ్ అధికారుల నివాసాల నిర్మాణ వ్యయం కేంద్ర ప్రభుత్వ రెసిడెన్షియల్ కాంప్లెక్స్ కంటే తక్కువగా ఉందని స్పష్టమవుతోందన్నారు.
రాజధానిలో నిర్మిస్తున్న అనేక భవనాలు సాధారణ భవనాలు కాదని, రాష్ట్ర ప్రతిష్ఠను చాటే ఐకానిక్ నిర్మాణాలని మంత్రి తెలిపారు. భవిష్యత్తు అవసరాలు, ఆధునిక సౌకర్యాలు, అంతర్జాతీయ ప్రమాణాలు, దీర్ఘకాలిక వినియోగాన్ని దృష్టిలో ఉంచుకొని నిర్మాణాలు చేపడుతున్నామని చెప్పారు. అందువల్ల కొన్ని ప్రత్యేక భవనాలకు వ్యయం ఎక్కువగా కనిపించినా, వాటి నాణ్యత మరియు ప్రయోజనాలను కూడా పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
దేశంలో పార్లమెంట్ భవనం నిర్మాణం, తెలంగాణ సచివాలయం నిర్మాణం వంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల విషయంలో కూడా మొదట పిలిచిన టెండర్ల అంచనాలతో పోలిస్తే పనులు పూర్తయ్యే సమయానికి వ్యయం పెరిగిన విషయాన్ని గుర్తుచేశారు. అయితే అమరావతి నిర్మాణాల విషయంలో ప్రభుత్వం అత్యంత పారదర్శకంగా వ్యవహరిస్తోందని తెలిపారు.
ఈ సందర్భంగా కొండవీటి వాగు, పాలవాగులపై జరుగుతున్న పనులను పరిశీలించిన మంత్రి, రాజధాని నిర్మాణంలో వరద నీటి నిర్వహణకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పారు. కొండవీటి వాగు, పాలవాగులపై మొత్తం 69 బ్రిడ్జిలు నిర్మిస్తున్నామని, అందులో వాగులపై 43 బ్రిడ్జిలు, ఎల్పీఎస్ లేఅవుట్లలో మరో 26 బ్రిడ్జిలు నిర్మిస్తున్నట్లు వివరించారు. వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని బ్రిడ్జిల నిర్మాణం, డ్రైనేజీ వ్యవస్థలు, నీటి ప్రవాహ మార్గాలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నామని, ఎక్కడా వర్షపు నీరు నిల్వ ఉండకుండా చర్యలు చేపడుతున్నామని చెప్పారు. నీటి ప్రవాహానికి ఎలాంటి ఆటంకం కలగకుండా అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు. బ్రిడ్జిల నిర్మాణం వల్ల నీటి ప్రవాహ సామర్థ్యం తగ్గకుండా అన్ని సాంకేతిక ప్రమాణాలు పాటిస్తున్నామని పేర్కొన్నారు.
అమరావతిలో కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిన నేపథ్యంలో రాజధాని అభివృద్ధి మరింత వేగవంతం కానుందని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు ఒకే ప్రాంతంలో పనిచేసే విధంగా అవసరమైన మౌలిక సదుపాయాలన్నీ కల్పిస్తున్నామని తెలిపారు. వైసీపీ నాయకులు అమరావతి నిర్మాణాలపై ఆధారాలు లేని ఆరోపణలు చేయడం మానుకోవాలని మంత్రి హితవు పలికారు. ప్రజలకు వాస్తవాలు తెలుసునని, అభివృద్ధిని అడ్డుకునే విధంగా అసత్య ప్రచారాలు కొనసాగిస్తే ప్రజల నుంచి మరింత తిరస్కరణ ఎదుర్కోవాల్సి వస్తుందని అన్నారు. అమరావతి నిర్మాణం రాష్ట్ర భవిష్యత్తుతో ముడిపడి ఉన్న అంశమని, ప్రపంచ స్థాయి రాజధానిగా తీర్చిదిద్దే లక్ష్యంతో ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని మంత్రి నారాయణ స్పష్టం చేశారు.














