- ఎమ్మెల్సీల రాజీనామాలను ఆమోదించకుండా ఏడాది పాటు పెండింగులో ఉంచడం రాజకీయ దురుద్దేశమే
- పార్టీ మారే ముందు యాంటీ డిఫెక్షన్ బిల్లు ప్రకారం తన ఎమ్మెల్సీ పదవికి స్వచ్ఛందంగా రాజీనామా చేసిన వెంకటరమణ
- వెంకటరమణ ఇచ్చిన రాజీనామాలో ‘సహేతుక కారణాలు లేవు’ అంటూ చైర్మన్ తిరస్కరించడం చట్టవిరుద్ధం
- హైకోర్టులో కౌంటర్ దాఖలు చేయనందుకు ఒక చైర్మన్కు కోర్టు పెనాల్టీ విధించడం దేశ చరిత్రలోనే మొదటిసారి
- మాజీ ఎమ్మెల్సీ పర్చూరి అశోక్బాబు
మంగళగిరి (చైతన్యరథం): ఏపీ లెజిస్లేటివ్ కౌన్సిల్ చైర్మన్ మోషేన్రాజు గత రెండు రోజులుగా తీసుకుంటున్న నిర్ణయాలు ప్రజాస్వామ్యానికే గొడ్డలిపెట్టు అని మాజీ ఎమ్మెల్సీ, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పర్చూరి అశోక్బాబు మండిపడ్డారు. జయమంగళ వెంకటరమణ వంటి ఎమ్మెల్సీలు తమ పదవులకు రాజీనామా చేసి ఏడాది గడుస్తున్నా వాటిని ఆమోదించకుండా తొక్కిపెట్టడం వెనుక ఉన్న రాజకీయ కుట్రలను ఆయన ఎండగట్టారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో శనివారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘ఎమ్మెల్సీ పదవి వద్దని స్వచ్ఛందంగా రాజీనామా ఇస్తే దానిని ఏడాది పాటు పెండింగులో ఉంచడం కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే. చైర్మన్ వ్యవస్థను పార్టీ కార్యాలయంగా మార్చడం విచారకరం. హైకోర్టు ఆదేశించినా కౌంటర్ దాఖలు చేయకపోవడంతో ఒక చట్టసభ చైర్మన్కు కోర్టు పెనాల్టీ విధించింది. ఇది దేశ చరిత్రలోనే మొదటిసారి. ఇది మోషేన్రాజు వ్యక్తిగతంగా తెచ్చుకున్న కళంకం.’
రాజీనామాను ఆమోదించకపోవడం దారుణం
‘మోషేన్ రాజు గతంలో చాలా హుందాగా ఉండేవారు. నేను ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు కూడా సభను చాలా నిష్పక్షపాతంగా నడిపేవారని మాకు మంచి అభిప్రాయం ఉండేది. ఆయన గతంలో కేవలం 15 రోజులు మాత్రమే టీడీపీలో ఉండి ఆ తర్వాత వైసీపీలో చేరారు. అక్కడ ఆయనకు ఎమ్మెల్సీ ఇచ్చి చైర్మన్ పదవి కూడా అప్పగించారు. కొందరు ఎమ్మెల్సీలు రాజీనామా చేసి ఏడాది గడిచినా చైర్మన్ వాటిని ఆమోదించకుండా పెండింగులో పెట్టడం రాజకీయ దురుద్దేశమే. రాజీనామాలను ఆమోదించినంత మాత్రాన తెలుగుదేశం పార్టీకి అప్పట్లో మెజారిటీ వచ్చే అవకాశం లేదు. వైసీపీకే స్పష్టమైన మెజారిటీ ఉన్నప్పటికీ రాజీనామాలను ఆమోదించకుండా కాలయాపన చేయడం వెనుక ఉన్న కారణం ఏంటో అర్థం కావట్లేదు. రాజీనామాల విషయంపై గతంలో నేను స్వయంగా ఆయనతో చర్చించినప్పుడు “దీనిపై ఆలోచించి నిర్ణయం తీసుకుంటాను” అని చెప్పారు. కానీ ఆయన చెప్పి ఏడాది గడిచినా ఇంతవరకు ఎటువంటి నిర్ణయం తీసుకోకపోవడం విచారకరం. గతంలో తెలుగుదేశం ఎమ్మెల్యేగా పనిచేసిన వెంకటరమణ… ఆ తర్వాత వైసీపీ ఎమ్మెల్సీ అయ్యారు. ఇప్పుడు ఆయన జనసేనలోకి వెళ్లాలని నిర్ణయించుకుని పదవికి రాజీనామా చేశారు. కానీ ఆయన రాజీనామాను ఆమోదించకుండా అడ్డుకోవడం సరికాదు’ అన్నారు.
రూల్స్ పట్టించుకోరా!
‘పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం ప్రకారం ఒక పార్టీ నుంచి ఎన్నికైన వ్యక్తి మరో పార్టీలోకి వెళ్లాలనుకున్నప్పుడు నైతికంగా తన పదవికి రాజీనామా చేయాలి. గతంలో పోతుల సునీత కూడా ఇదే పద్ధతిని పాటించారు. ఆమె టీడీపీ ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి వైసీపీలో చేరారు. ఆ తర్వాత మళ్లీ వైసీపీ తరపున ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. ఆనాడు జరిగిన ఆ పద్ధతిని ఇప్పుడు ఎందుకు పాటించట్లేదు? ఇప్పుడు ఎమ్మెల్సీలు రాజీనామాలు ఇచ్చినా ఆమోదించకపోవడం వెనుక కేవలం రాజకీయ దురుద్దేశం మాత్రమే కనిపిస్తోంది. ఇది కావాలని చేస్తున్న వేధింపుగానే భావించాల్సి ఉంటుంది. జయమంగళ వెంకటరమణ కేవలం కాగితం మీద రాజీనామా ఇవ్వడమే కాదు, స్వయంగా సభలో నిలబడి “నా రాజీనామాను ఆమోదించండి” అని చైర్మన్ను కోరారు. సభలో నేరుగా చెప్పినప్పుడు చైర్మన్కు ఆమోదించడం తప్ప మరో మార్గం ఉండదు. మన లెజిస్లేటివ్ రూల్స్ లేదా పార్లమెంటరీ నిబంధనల ప్రకారం.. ఒక సభ్యుడు స్వచ్ఛందంగా రాజీనామా సమర్పించినప్పుడు దానిని వెంటనే ఆమోదించాలి. కానీ చైర్మన్ ఆ రూల్స్ను ఏమాత్రం పట్టించుకోవ ట్లేదు. తన రాజీనామా ఆమోదించాలని వెంకటరమణ గారు కోర్టుకు వెళ్లాల్సి వచ్చింది. కోర్టు ఈ విషయంపై సమాధానం (కౌంటర్) చెప్పమని అడిగినా చైర్మన్ స్పందించకపోవడం దారుణం.’
నిబంధనల ఉల్లంఘన ప్రజాస్వామ్యానికి చేటు
ప్రొటోకాల్ ప్రకారం అసెంబ్లీ స్పీకర్ కంటే కౌన్సిల్ చైర్మన్ పదవి పెద్దది. అలాంటి అత్యున్నత పదవిలో ఉన్న వ్యక్తి హైకోర్టు అడిగిన ప్రశ్నకు కౌంటర్ దాఖలు చేయలేదని కోర్టుతో పెనాల్టీ వేయించుకోవడం చాలా విచారకరం. భారతదేశ చరిత్రలో అటు లోక్సభ, రాజ్యసభలో గానీ, ఏ రాష్ట్ర అసెంబ్లీలో గానీ ఏ స్పీకర్కు, ఏ చైర్మన్కూ ఇటువంటి పరిస్థితి రాలేదు. “35 రోజుల్లోగా రాజీనామాలపై నిర్ణయం తీసుకో” అని కోర్టు గడువు విధించిన తర్వాతే చైర్మన్ స్పందించారు. అప్పటిదాకా ఆ ఫైళ్లను పట్టించుకోకుండా వదిలేశారు. రాజీనామా చేసిన వ్యక్తి చెప్పిన కారణాలు “సహేతుకంగా లేవు” అని చెప్తూ రాజీనామాను తిరస్కరించడం హాస్యాస్పదం. బిజినెస్ రూల్స్ ప్రకారం.. రాజీనామా ఇచ్చే వ్యక్తి కారణాలు చెప్పాల్సిన అవసరం లేదు, నిర్ణీత ఫార్మాట్లో లేఖ ఇస్తే చైర్మన్ కచ్చితంగా ఆమోదించాలి. అక్కడ చైర్మన్కు మరో ఆప్షన్ లేదు. చైర్మన్ తనకు రాజకీయ ఒత్తిళ్లు ఉన్నాయని బయటకు చెప్పలేక, లోపల మాత్రం ఆ విధంగానే నడుచుకుంటున్నారు. ఆయన వైసీపీ ద్వారా ఎమ్మెల్సీ అయ్యి చైర్మన్ అయ్యారు కాబట్టి ఆ పార్టీ నాయకుడు చెబితేనే ఏదైనా చేస్తారనేది స్పష్టంగా కనిపిస్తోంది. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండి నిష్పక్షపాతంగా ఉండాల్సిన వ్యక్తి, తన పార్టీ పట్ల లాయల్టీ చూపించడం కోసం చట్టసభల నిబంధనలను పక్కన పెట్టడం ప్రజాస్వామ్యానికి చేటు అని విమర్శించారు.
మోషేన్రాజుకి రాజకీయాల్లోను, సొంత జిల్లాలోను ‘పెద్ద మనిషి’ అని, నిష్పక్షపాతంగా ఉంటారని మంచి పేరు ఉంది. కానీ నేడు రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గి రాజీనామాలను అడ్డుకోవ డం వల్ల ఆ మంచి పేరుకు కళంకం చుట్టుకుంది. నిబంధనలు తెలిసిన వ్యక్తి అయి ఉండి కూడా ఇలా చేయడం దురదృష్టకరం. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు ఏ స్పీకర్కు లేదా మండలి చైర్మన్కు కోర్టు జరిమానా విధించిన దాఖలాలు లేవు. ఆ విధంగా దేశ చరిత్రలో కోర్టుతో పెనాల్టీ వేయించుకున్న మొదటి వ్యక్తిగా మోషేన్ రాజు నిలిచిపోవడం విచారకరం. స్పీకర్ లేదా చైర్మన్ కుర్చీలో కూర్చున్న తర్వాత ఆ వ్యక్తికి రాజకీయ పార్టీలతో సంబంధం ఉండదు. ఆ పదవికి ఉన్న ధర్మాన్ని పాటించాలే తప్ప పార్టీ ఆదేశాలను కాదు.
స్పీకర్ కుర్చీకే గౌరవం…
1989-91 కాలంలో స్పీకర్గా ఉన్న రబీరే.. “నేను స్పీకర్ అయ్యాక పార్టీతో సంబంధం లేదు, పార్టీ ఆదేశాలను ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు, కేవలం స్పీకర్ ఆఫీస్ నిబంధనల ప్రకారమే పనిచేస్తాను” అని చాలా స్పష్టంగా చెప్పారు. 2008లో అమెరికాతో అణు ఒప్పందం విషయంలో లెఫ్ట్ పార్టీలు కాంగ్రెస్ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకున్నాయి. అప్పుడు తన పార్టీ అయిన సీపీఎం ఆయన్ని స్పీకర్ పదవికి రాజీనామా చేయమన్నా ఆయన వినలేదు. పార్టీ తనను బహిష్కరించినా సరే “స్పీకర్ పదవిలో ఉన్నంత కాలం నేను పార్టీలకు అతీతంగానే పనిచేస్తాను” అని సోమనాథ్ ఛటర్జీ నిరూపించారు. 50 ఏళ్ల రాజకీయ జీవితం ఉన్నా పార్టీ కంటే స్పీకర్ పదవి బాధ్యతకే ఆయన ప్రాధాన్యత ఇచ్చారు. సోమనాథ్ ఛటర్జీని పార్టీ బహిష్కరించినా ఆయన బాధపడలేదు. ఎందుకంటే, “పార్టీ కంటే నేను కూర్చున్న స్పీకర్ కుర్చీ గౌరవమే నాకు ముఖ్యం” అని ఆయన నమ్మారు. అందుకే దేశంలోని అన్ని రాజకీయ పార్టీలు ఆయన్ని అభినందించాయి. స్పీకర్ లేదా చైర్మన్ పదవి వేరు, రాజకీయ పార్టీ వేరు అనే సంప్రదాయాన్ని ఆయన కాపాడారు.
రాజ్యాం ధర్మాలు పాటించాలి
చైర్మన్కి తన నాయకుడి మీద అభిమానం ఉండొచ్చు, ఆయన రుణం తీర్చుకోవాలని అనుకోవచ్చు. అలాంటప్పుడు చైర్మన్ పదవికి రాజీనామా చేసి ఆ నాయకుడితో కలిసి పాదయాత్రలోనో, ప్రచారంలోనో పాల్గొంటే ఎవరికీ అభ్యంతరం ఉండదు. కానీ చైర్మన్ కుర్చీలో ఉండి పార్టీ కోసం పనిచేయడం సరికాదు. ఒక ఎమ్మెల్సీ స్వచ్ఛందంగా రాజీనామా చేస్తానంటే.. “సరైన కారణాలు లేవు” అని తిరస్కరించడం అన్యాయం. చైర్మన్ పదవిలో ఉండి ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం ప్రజాస్వామ్య విలువలకే విరుద్ధం. చైర్మన్కి ‘విచక్షణ అధికారం’ ఉందని, ఆయన ఏదైనా చేయొచ్చని అనుకోవడం పొరపాటు. ఆ అధికారానికి కూడా రాజ్యాంగం కొన్ని హద్దులు విధించింది. విచక్షణ అంటే నిబంధనలకు లోబడి సరైన నిర్ణయం తీసుకోవడం తప్ప ఇష్టానుసారంగా వ్యవహరించడం కాదు. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, స్పీకర్ లేదా చైర్మన్.. ఎవరైనా సరే రాజ్యాంగం నిర్దేశించిన విధులను, ధర్మాలను పాటించాల్సిందే. పదవిలో ఉన్నప్పుడు తన వ్యక్తిగత ఇష్టాయిష్టాల కంటే, ఆ కుర్చీకి ఉన్న బాధ్యతలే ముఖ్యం.
ఏకపక్ష నిర్ణయం తగదు
గతంలో లోక్సభ స్పీకర్ జీఎంసీ బాలయోగి తన విచక్షణ అధికారాన్ని ఉపయోగించి ఒక ఎంపీకి తన ఇష్ట ప్రకారం ఓటు వేసుకోమని చెప్పారు. ఆ ఒక్క ఓటుతోనే నాడు ప్రభుత్వం పడిపోయింది. అంటే విచక్షణ అధికారం అనేది చట్టబద్ధమైన పరిమితులకు లోబడి ఉండాలి తప్ప ఏకపక్ష నిర్ణయం కాకూడదు. జూలై 2026 నుంచి అంటే ఈ నెల నుంచే కౌన్సిల్లో మార్పులు మొదలవుతున్నాయి. గవర్నర్ కోటా ఎమ్మెల్సీలు ప్రభుత్వం మారినప్పుడు మారతారు. 2027 నాటికి మండలిలో మాకు పూర్తి మెజారిటీ వస్తుంది. ఇది తెలిసిన విషయమే. మరి ఈ కొద్ది కాలం కోసం మీరు ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం అవసరమా? రాష్ట్ర ప్రొటోకాల్లో గవర్నర్ తర్వాత అత్యున్నత స్థానంలో ఉండే వ్యక్తి మండలి చైర్మన్. అటువంటి గొప్ప పదవిలో ఉండి చివరకు అగౌరవంగా పదవి నుంచి దిగిపోవాల్సిన పరిస్థితిని మీరే తెచ్చుకుంటున్నారు. ఇది మీ వ్యక్తిత్వానికే విరుద్ధం. కర్ణుడు గొప్ప వీరుడు, దానశీలి.. కానీ కేవలం స్నేహ ధర్మం కోసం అధర్మం వైపు నిలబడి చివరికి ఓడిపోయాడు. మీరు కూడా ఇప్పుడు పార్టీ పట్ల కృతజ్ఞత కోసం అధర్మం వైపు నిలబడితే చరిత్రలో కర్ణుడిలాగే మిగిలిపోతారు. మీరు సోమనాథ్ ఛటర్జీ, రబీరే లాంటి మహనీయుల్లా పదవీ ధర్మాన్ని కాపాడి గొప్ప వ్యక్తిగా నిలుస్తారా? లేక పార్టీ ప్రయోజనాల కోసం చట్టాన్ని పక్కన పెట్టిన వ్యక్తిగా మిగిలిపోతారా? అనేది మీ విజ్ఞతకే వదిలేస్తున్నాం.
చైర్మన్ పదవికి మచ్చ తెస్తున్నారు
తెలుగుదేశం పార్టీగా మేము ఎప్పుడూ మిమ్మల్ని గౌరవించాం. రాజ్యాంగబద్ధమైన నిర్ణయాలు తీసుకోమని మాత్రమే కోరుతున్నాం. పార్టీకి విధేయుడిగా ఉండటంలో తప్పు లేదు కానీ అది రాజ్యాంగ బాధ్యతను మరిచిపోయేలా ఉండకూడదు. మేము ప్రభుత్వంలో ఉన్నా మీకు ఎక్కడా ఇబ్బంది కలిగించలేదు. 2019 మార్చిలో మీ మంత్రులు మండలిలో చేసిన రచ్చ, అరాచకం మీకు గుర్తే ఉండి ఉంటుంది. మేము అలా చేయదలుచుకుంటే మీకంటే ఎక్కువే చేయగలం. అసెంబ్లీలో మీకు కనీసం సభ్యులే లేరు, మాకు తిరుగులేని మెజారిటీ ఉంది. మేము ఏదైనా చేసినా ప్రజలు కూడా ఆమోదిస్తారు. ఎందుకంటే ఆ రోజు మీరు చేసింది అంత అధర్మం. కానీ అలాంటి పద్ధతులు తెలుగుదేశం పార్టీకి లేవు. ప్రొటోకాల్లో స్పీకర్ కంటే పెద్ద స్థానంలో ఉన్న మీరు.. ఇలాంటి నిర్ణయాలతో ఆ పదవికి మచ్చ తెస్తున్నారు. దేశ చరిత్రలోనే కోర్టు ద్వారా పెనాల్టీ వేయించుకున్న వ్యక్తిగా మిగిలిపోవడం మీ రాజకీయ భవిష్యత్తుకు ఏమాత్రం మంచిది కాదు. పార్టీకి నమ్మకంగా ఉండటంలో తప్పు లేదు.
కానీ మీకు పార్టీనే ముఖ్యం అనుకుంటే, గౌరవంగా చైర్మన్ పదవికి రాజీనామా చేసి వెళ్లిపోండి. అంతే తప్ప, ఆ కుర్చీలో కూర్చుని పార్టీ ప్రయోజనాల కోసం చట్టాలను తుంగలో తొక్కకండి. మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీ ప్రభుత్వం వచ్చిన మొదటి ఏడాదిలో మీరు చాలా హుందాగా వ్యవహరించారు. మీ నాయకుడు మీకు చైర్మన్ పదవి ఇవ్వడం మంచిదే, మేము దాన్ని కాదనడం లేదు. కానీ పదవి ఇచ్చినందుకు మీరు రుణం తీర్చుకోవాల్సింది రాజ్యాంగబద్ధంగానే తప్ప ఇలా అప్రజాస్వామికంగా కాదు. గతంలో యూపీఏ ప్రభుత్వానికి లెఫ్ట్ పార్టీలు మద్దతు ఉపసంహరించుకున్నప్పుడు, తన పార్టీ రాజీనామా చేయమన్నా సోమనాథ్ ఛటర్జీ గారు వినలేదు. ఎందుకంటే ఆయనకు పార్టీ కంటే స్పీకర్ పదవి ధర్మమే గొప్పది అనిపించింది. బెంగాల్లో అంత కరుడుగట్టిన కమ్యూనిస్ట్ నాయకుడే పదవి కోసం పార్టీ మ్యాండేట్ను కాదన్నప్పుడు, మీరు కూడా ఆ దిశగా ఎందుకు ఆలోచించకూడదు?
ఇది పూర్తిగా అప్రజాస్వామికం
ఇప్పటికైనా పునరాలోచించండి. పదవులు ఏవీ శాశ్వతం కాదు. కానీ చరిత్ర పుటల్లో మీరు ఒక ‘కళంకిత చైర్మన’గా మిగిలిపోకూడదని మేము ఆశిస్తున్నాం. మీ నిర్ణయం రేపు మీ పొలిటికల్ కెరీర్కు మచ్చగా మారకూడదనేదే మా ఆవేదన. మీ పార్టీ నాయకుల్లాగా సభలో అల్లరి చేయడం, పేపర్లు చించి హంగామా చేయడం, దొమ్మీలకు దిగడం తెలుగుదేశం పార్టీ సంస్కృతి కాదు. మేము మిమ్మల్ని బెదిరించడం లేదు.. కేవలం ప్రజాస్వామ్యబద్ధంగా ప్రశ్నిస్తున్నాం. రాజీనామాలను తిరస్కరించడం అనేది పూర్తిగా అప్రజాస్వామికం. మీకు ఉన్న విచక్షణ అధికారాలను మీరు తప్పుగా వాడుకున్నారు. ఉన్నతమైన చైర్మన్ వ్యవస్థను మేమే ఇలా విమర్శించాల్సి రావడం మాకు కూడా బాధగానే ఉంది. కానీ మీరు చేసిన పని మమ్మల్ని మాట్లాడేలా చేసింది. నిన్న హైకోర్టులో ఒక కేసు సందర్భంగా జడ్జి గారు చాలా స్పష్టంగా చెప్పారు.. “ఒకవేళ మీరు రాజకీయ ఒత్తిళ్లను తట్టుకోలేకపోతే, మీ ఉద్యోగాలకు రాజీనామా చేసి వెళ్ళిపోండి” అని. ఉన్నత పదవుల్లో ఉన్నవారికి ఒత్తిళ్లు రావడం సహజం. కానీ వాటికి లొంగిపోకూడదు. గవర్నర్, చీఫ్ జస్టిస్, ముఖ్యమంత్రి తర్వాత రాష్ట్ర ప్రోటోకాల్ ప్రకారం అత్యున్నత వ్యక్తి మీరే. అంత గొప్ప స్థాయిలో ఉండి రాజకీయ విశ్వాసం పేరుతో ఆ కుర్చీకి మచ్చ తేవద్దు.
హుందాతనాన్ని కాపాడుకోండి….
రాజకీయాల్లో మార్పులు సహజం. ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి ఏడుగురు ఎంపీలు వెళ్ళిపోతే ఎవరైనా ఆపగలిగారా? అలాగే ఇక్కడ కూడా మార్పు జరుగుతుంది. దాన్ని అడ్డుకోవాలని చూసి మీ వ్యక్తిత్వాన్ని తగ్గించుకోవద్దు. ఒకప్పుడు మీతో కలిసి పనిచేసిన సహచరుడిగా, శ్రేయోభిలాషిగా చెప్తున్నాం… ఇప్పటికైనా మీ నిర్ణయాన్ని సరిదిద్దుకోండి. చైర్మన్ పదవికి ఉన్న హుందాతనాన్ని కాపాడండి. మీ నాయకుడితో మాట్లాడతారా లేదా మీ అంతట మీరు స్వతంత్రంగా నిర్ణయం తీసుకుంటారా అనేది మీ విజ్ఞతకే వదిలేస్తున్నాం. రాజ్యాంగ ధర్మాన్ని పాటించి చరిత్రలో మంచి వ్యక్తిగా మిగిలిపోతారని ఆశిస్తున్నాం’ అని అశోక్బాబు అన్నారు.















