- అందుకు డ్రైవర్ను చంపిన ఎమ్మెల్సీని వెనకేసుకొస్తున్నారు
- సామాజిక సంక్షేమ బోర్డు చైర్మన్ పోతుల బాలకోటయ్య
మంగళగిరి (చైతన్యరథం): ‘మహాభారత కాలంలో ఏకచక్రపురం పొలిమేరల్లో నివసించే బకాసురుడు అనే రాక్షసుడు ఆ ఊరి ప్రజలను భయభ్రాంతులకు గురిచేసేవాడు. ప్రతిరోజూ ఒక మనిషిని, బండెడు అన్నాన్ని ఆహారంగా తీసుకునేవాడు. ఊరి జనం ప్రాణభయంతో వాడికి తలవంచి తమవారిని బలి ఇచ్చేవారు. నేడు ఆంధ్ర రాష్ట్రంలో సరిగ్గా అదే పరిస్థితి పునరావృతమవుతోంది’ అని రాష్ట్ర సామాజిక సంక్షేమ బోర్డు చైర్మన్ పోతుల బాలకోటయ్య అన్నారు. తన వద్ద డ్రైవర్గా పనిచేసిన సుబ్రహ్మణ్యాన్ని కిరాతకంగా చంపి మృతదేహాన్ని ‘డోర్ డెలివరీ’ చేసిన ఎమ్మెల్సీ అనంతబాబు ఆధునిక బకాసురుడిలా తయారయ్యారని విమర్శించారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో శనివారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘గత వారం రోజులుగా టీవీలు, పత్రికలు, న్యాయస్థానాల్లో సుబ్రహ్మణ్యం రక్తచరిత్ర మార్మోగుతున్నా జగన్రెడ్డి ఏమీ ఎరగనట్టు చూస్తున్నారు.
ఆయన పార్టీ ఎమ్మెల్సీ ఒక నిరుపేద దళితుడిని హత్య చేస్తే అది రాష్ట్రానికి సంబంధం లేని విషయమా? అనంతబాబు ఒక ‘శుద్ధపూస’ అని జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నారా? తాడేపల్లిలోనో, యలహంక ప్యాలెస్లోనో లేక లోటస్ పాండ్లోనో సేదతీరుతున్న జగన్ రెడ్డికి బాధితుల ఆర్తనాదాలు వినిపించడం లేదా? హత్య చేసిన వ్యక్తిని గౌరవప్రదమైన శాసనమండలికి ఎలా పంపిస్తారని ప్రజలు ప్రశ్నిస్తుంటే వైసీపీ నేతల వద్ద సమాధానం లేదు. బాధ్యతాయుతమైన పదవిలో ఉండి చట్టాన్ని చుట్టచుట్టిన వ్యక్తిని వెనకేసుకురావడం ప్రజాస్వామ్యానికే గొడ్డలిపెట్టు. ఏకచక్రపురంలో బ్రాహ్మణ కుటుంబం పడుతున్న బాధను చూసి కుంతీదేవి తన కుమారుడైన భీమసేనుడిని పంపి ఆ బకాసురుడిని ఎలా అంతం చేయించిందో.. నేడు ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా అదే ధైర్యంతో ఉన్నారు. అధికార మదంతో సామాన్యులను బలితీసుకుంటున్న బకాసురులకు కాలం చెల్లింది. చట్టం రూపంలోనో, ప్రజాక్షేత్రంలో భీమసేనుడి లాంటి పాలకుల రూపంలోనో వీరికి శిక్ష తప్పదు.’ అన్నారు.
ఇంకా వెనకేసుకొస్తారా…
అంబేద్కర్ నామస్మరణ చేస్తూనే దళితుల రక్తం ఏరులై పారుతుంటే మౌనంగా ఉండటం ఏ రకమైన రాజకీయం? నాడు ఏకచక్రపురంలో బకాసురుడు తిని వదిలేస్తే.. ఆంధ్రప్రదేశ్లో అధికార మదంతో గత ఐదేళ్లు కొందరు నేతలు మనుషులను వేటాడి చంపుతుంటే ‘తాడేపల్లి ప్యాలెస’ ఎందుకు స్పందించడం లేదు? డాక్టర్ సుధాకర్ మాస్క్ అడిగితే పిచ్చోడిని చేసి చంపారు. చీరాలలో కిరణ్బాబు, నంద్యాలలో నాగమ్మ, పులివెందులలో మహాలక్ష్మి.. ఇలా చెప్పుకుంటూపోతే ఈ ఐదేళ్ల పాలనలో దళితులపై జరిగిన దాడులు అన్నీ ఇన్నీ కావు. శిరోముండనం లాంటి అనాగరిక చర్యలను కూడా ఈ రాష్ట్రం చూసింది. కానీ వీటన్నింటికీ పరాకాష్ట.. ఎమ్మెల్సీ అనంతబాబు చేసిన డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య. కారంచేడు, చుండూరు నుంచి కంచికచర్ల వరకు దళితులపై దాడులు జరిగిన మాట వాస్తవమే. కానీ ఒక దళితుడిని చంపి అదే శవాన్ని సొంత కారులో తీసుకెళ్లి బాధితుడి ఇంటి వద్దే ‘డోర్ డెలివరీ’ చేసిన కిరాతకం ఈ తెలుగు నేల మీద, దేశంలో ఎప్పుడైనా విన్నామా? సాక్షాత్తు ఎస్పీ ఆఫీస్ సాక్షిగా, పత్రికల సాక్షిగా “నేనే చంపాను” అని అనంతబాబు ఒప్పుకున్నాక కూడా అతడిని ఎమ్మెల్సీ పదవి నుంచి తొలగించకపోవడం వెనుక ఉన్న రహస్యం ఏంటి?
నేర పరిశోధనలో ఎ1గా అనంతబాబు, ఎ2గా లక్ష్మీదుర్గ దొరికిపోయినా.. వైసీపీ వారిని కాపాడటానికి ప్రయత్నించడం సిగ్గుచేటు కాదా? సాక్ష్యాలు లేవని, ఫోన్ సంభాషణలు పనికిరావని, సీసీ ఫుటేజీలు మార్చేసి.. కోట్లు ఖర్చు పెట్టి కేసును తారుమారు చేస్తుంటే సుప్రీంకోర్టు సైతం ఆశ్చర్యపోయింది. సాక్షులను కొనవచ్చు, పోలీసులను మేనేజ్ చేయవచ్చు.. కానీ ప్రజల మనసుల్లో రగులుతున్న సెగను ఆపగలరా? కోర్టులకు దొడ్డిదారిన వచ్చి తప్పించుకోవచ్చేమో కానీ ప్రజా కోర్టులో శిక్ష తప్పదు జగన్ గారూ. అంబేద్కర్ పేరు చెప్పుకుని పదవులు అనుభవిస్తున్న జూపూడి ప్రభాకర్, మేరుగు నాగార్జున, ఆదిమూలపు సురేష్ వంటి నేతలకు ఈ రక్త చరిత్ర కనిపించడం లేదా? మీ జాతి బిడ్డను చంపి డోర్ డెలివరీ చేస్తే, మీ నోళ్లలో తడి ఎందుకు ఆరిపోయింది? పదవుల కోసం ఆత్మగౌరవాన్ని బలిపెడతారా?’ అన్నారు.
ఇదేనా విలువల పాత్రికేయం!
‘అతడు’ సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది “శివారెడ్డి చస్తే నువ్వు ముఖ్యమంత్రి అవుతావు.. కానీ శివారెడ్డిని చంపితే నువ్వు హంతకుడివి అవుతావు” అని. జగన్ మోహన్ రెడ్డి గారూ ఈ మాట మీకు సరిగ్గా సరిపోతుంది. నాడు వివేకానందరెడ్డి హత్యను చంద్రబాబునాయుడు మీదకు నెట్టేసి, సాక్షి పేపర్లో గ్రాఫిక్స్ ఫొటోలు వేసి ప్రజలను నమ్మించి గద్దెనెక్కారు. కానీ మీ కళ్లముందే.. మీ ఎమ్మెల్సీ అనంతబాబు ఒక దళితుడిని చంపి ‘డోర్ డెలివరీ’ చేస్తే దానిని ఏమని సమర్థించుకుంటారు? చరిత్ర చెబుతున్న సత్యం ఒక్కటే-ఏ రోజైతే పాలకుడికి దళితుల రక్తపు మరకలు అంటుతాయో ఆ రోజే ఆ ప్రభుత్వ పతనం మొదలైనట్లు. సుబ్రహ్మణ్యంను చంపి మీరు ముఖ్యమంత్రిగా ఎలా కొనసాగుతారు? మీరు ఇప్పటికే ప్రజల మనసుల్లో నుంచి దిగిపోయారు. నైతికత లేదు. మీ పత్రికల్లో, ఛానళ్లలో అనంతబాబు అనే పేరు వినిపించదు. దళితుడైన సుబ్రహ్మణ్యం పేరు ఉండదు. అరెస్ట్ వార్తను కప్పిపుచ్చుతారు. సాక్షులను కొంటుంటే మౌనంగా ఉంటారు. విచారణ సంస్థలే “సాక్షులకు ఎర వేస్తున్నారు” అని మొత్తుకుంటున్నా మీ పత్రికకు అది వార్త కాదు.
ఇదా మీరు చెప్పే విలువలతో కూడిన పాత్రికేయం? చంద్రబాబునాయుడుని విమర్శించే ముందు, మీ చుట్టూ ఉన్న హంతక ముఠాలను ఒక్కసారి చూడండి. సుబ్రహ్మణ్యం చనిపోయేటప్పుడు అతని భార్య నిండు గర్భిణి. ఒక పక్క భర్త శవం డోర్ డెలివరీ అయి వస్తే.. ఆ చులాలు పడ్డ ఆవేదన మీకు అర్థమవుతుందా? సాక్ష్యాలను తారుమారు చేస్తూ, కోట్లు ఖర్చు పెట్టి హంతకుడిని కాపాడటం ఏ రకమైన న్యాయం? అనంతబాబు వెనుక ఉన్న నేర చరిత్ర సామాన్యమైనది కాదు. ఎంతమంది ఎమ్మెల్యేలను, ఎంపీటీసీలను భయపెట్టి లోబరుచుకున్నాడు? ఎంతోమంది మహిళల జీవితాలతో ఆడుకున్నాడు? ఇతని తండ్రి చక్రధారరావు కూడా ఇలాగే అరాచకాలు చేస్తే, నాడు నక్సలైట్లు ప్రజాకోర్టులో శిక్షించారు. తండ్రి చావు కూడా ఈయనకు బుద్ధిని నేర్పలేదా? ఎన్ని తాళిబొట్లు తెంచారు, ఎన్ని అరాచకాలు చేశారు అనే దానిపై సిట్టింగ్ జడ్జితో పూర్తిస్థాయి విచారణ జరగాల్సిందే.
హంతకుడిని చంకన పెట్టుకుంటారా!
తాడేపల్లి ప్యాలెస్లో వైసీపీ ఎస్సీ సెల్ విస్తృత స్థాయి సమావేశం జరుగుతోంది. సుధాకర్బాబు, మీరు నిజంగా దళిత బిడ్డలే అయితే, అంబేద్కర్ వారసులే అయితే.. ఈ సమావేశంలో ఒకే ఒక్క తీర్మానం చేయండి. “డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని చంపిన ఎమ్మెల్సీ అనంతబాబును పార్టీ నుంచి బహిష్కరిస్తున్నాం, అతని ఎమ్మెల్సీ పదవిని రద్దు చేయాలని మండలి చైర్మన్కు లేఖ రాస్తున్నాం” అని ప్రకటించే ధైర్యం మీకు ఉందా? మాజీ మంత్రులు మేరుగు నాగార్జున, ఆదిమూలపు సురేష్.. మీరు నోరు తెరిస్తే అంబేద్కర్ అంటారు. మరి మీ కళ్లముందే ఒక దళిత బిడ్డను చంపి ‘డోర్ డెలివరీ’ చేసిన అనంతబాబును పదవిలో ఎలా కొనసాగిస్తారు? జైలు నుంచి బయటకు రాగానే ఎమ్మెల్యేలు వెళ్ళి గజమాలతో ఊరేగించడం దళిత సమాజానికి మీరు ఇచ్చే గౌరవమా? ఏ1కు పాలాభిషేకాలు చేస్తారా? హంతకుడికి ఎసఐలు, ఎస్పీలు సలాం కొట్టాలా? ఇంతకంటే దౌర్భాగ్యం ఈ తెలుగు నేల మీద ఎక్కడైనా ఉందా? బొజ్జా తారకం, కత్తి పద్మారావు, శివసాగర్ వంటి మహనీయులు దళిత హక్కుల కోసం గర్జించిన నేల ఈ రాష్ట్రం. “సముద్రం ఒకరి వద్ద తలవంచదు.. అలలు తలలు దించవు” అని పోరాడిన చరిత్ర మనది. అటువంటి గడ్డపై ఒక హంతకుడిని చంకన పెట్టుకుని, కూటమి ప్రభుత్వం కక్ష కడుతోందని మొసలి కన్నీరు కార్చడం సిగ్గుచేటు. అనంతబాబు నేర సామ్రాజ్యం కేవలం హత్యలతో ఆగలేదు. ఏజెన్సీ ప్రాంతాల్లో జరుగుతున్న రంగురాళ్ల వ్యాపారం, రాష్ట్రవ్యాప్తంగా సాగుతున్న గంజాయి మాఫియాలో అనంతబాబు పాత్రపై ముఖ్యమంత్రి చంద్రబాబు తక్షణం ఉన్నత స్థాయి విచారణ జరపాలి.
చట్టసభలకు నేరగాళ్లను పంపిస్తారా…
ఆంధ్ర రాష్ట్రంలో ఈ మధ్య జరుగుతున్న దారుణాలు చూస్తుంటే రక్తం మరుగుతోంది. తప్పు చేసిన వారు భయంతోనో, పశ్చాత్తాపంతోనో చెరువుల్లో పడి చస్తుంటే.. ఎమ్మెల్సీ అనంతబాబు మాత్రం దళితుడిని చంపి, సాక్ష్యాలను కొనే ధైర్యం ఎలా చేస్తున్నాడు? కిడ్నాప్ చేసి బెదిరించిన వల్లభనేని వంశీ పరిస్థితి ఏమైందో మనం చూశాం. మరి అనంతబాబుకు ఎందుకు ఆ గతి పట్టడం లేదు? జగన్ గారూ.. రేపు మీరు మళ్లీ ప్రజల్లోకి వచ్చి ఏ ముఖం పెట్టుకుని పాదయాత్ర చేస్తారు? “నేను మీ మేనమామను” అని చెప్పుకుంటారు కదా.. సుబ్రహ్మణ్యం మీకు మేనల్లుడు కాదా? ఆ బిడ్డ బొడ్డు మీరు కోయలేదా? దళితుడిని హత్య చేసిన వాడిని అక్కున చేర్చుకుని, రేపు పాదయాత్రలో అనంతబాబు బొమ్మను జెండా మీద పెట్టుకుంటారా? హంతకుడిని కాపాడుతూ మీరు ఇచ్చే భరోసా ఎవరి కోసం? మీ సొంత చెల్లెలు షర్మిలమ్మకు, సునీతమ్మకు వివేకా హత్య కేసులో గొడ్డలిపోటు ఏంటో, గుండెపోటు ఏంటో తెలుసు. ఇప్పుడు సుబ్రహ్మణ్యం విషయంలో ఏ కన్ను ఏ కన్నును పొడిచిందో ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు.
తన కొడుకు శవాన్ని కళ్లముందు చూసి అల్లాడిపోతున్న ఆ తల్లి లక్ష్మమ్మకు.. “నీ కొడుకు శవాన్ని తెచ్చా.. రెండు లక్షలు ఇస్తాను దహనం చేసుకో” అని అనంతబాబు అన్న మాటలు వింటే ఏ మనిషికైనా ఒళ్లు గగుర్పొడుస్తుంది. ఇంతటి భీకరమైన నేర ప్రవృత్తి ఉన్న వ్యక్తిని మీరు నెత్తిన పెట్టుకుంటారా? ఇదా మీరు చెప్పే ‘రావాలి జగన్ – కావాలి జగన’ అంటే? అంబేద్కర్ విగ్రహాల సాక్షిగా ప్రమాణం చేసే వైసీపీ దళిత నేతలారా.. మీకు నిజంగా ఆత్మగౌరవం ఉంటే, ఈ 24 గంటల్లో అనంతబాబుపై చర్యలు తీసుకోవాలని మీ అధినేతను నిలదీయండి. ఎమ్మెల్సీ పదవి రద్దు చేయాలని డిమాండ్ చేయండి. పార్టీ నుంచి బహిష్కరించే వరకు పట్టుబట్టండి. లేదంటే, మీరు కూడా ఆ హంతకుడికి వత్తాసు పలికిన వారే అవుతారు. వచ్చే ఎన్నికల్లో ఇలాంటి 10 మంది అనంతబాబులను పంపి, మరో 10 మంది సుబ్రహ్మణ్యంలను బలి తీసుకుంటారా? నేరగాళ్లను చట్టసభలకు పంపి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తారా? ఒక నిరుపేద దళితుడి ప్రాణం కంటే మీకు అనంతబాబు రాజకీయ అండ ముఖ్యం అయిపోయిందా?
నిజాలు బయటపడతాయని భయం
“నా ఎస్సీ, నా బీసీ, నా ఎస్టీ” అంటూ తేనెలొలికే మాటలు చెబుతూనే.. క్షేత్రస్థాయిలో దళిత, వెనుకబడిన వర్గాల రక్తం పారించడం జగన్కి అలవాటుగా మారింది. తాడేపల్లి ప్యాలెస్ పక్కనే ఉన్న సీతానగరం ఇసుక తిన్నెల్లో వరుడిని కట్టేసి, వధువుపై అత్యాచారం చేస్తే.. అందులో ఉన్న నిందితుడు వెంకటేశ్వరరెడ్డిని అరెస్ట్ చేసే దమ్ము లేని పాలన మనం చూశాం. మీ పత్రికలో ఆ వార్తలు రావు, మీ సోషల్ మీడియా ఆ తప్పులను ఒప్పుకోదు. డ్రైవర్ సుబ్రహ్మణ్యం తల్లిదండ్రుల విజ్ఞప్తి మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ‘సిట’ వేయగానే.. నిజాలు ఎక్కడ బయటపడతాయో అని అనంతబాబును అజ్ఞాతంలోకి పంపారు. అనంతబాబు ఆదాయం ఏంటి? ఆయనకు ఉన్న పరిశ్రమలు ఏంటి? ఆయన పండించేది వరి పంటా లేక ‘గంజాయి’ పంటా? దీనిపై విచారణ జరగాల్సిందే. గత ఐదేళ్ల వైసీపీ పాలనలో దళిత బిడ్డలపై జరిగిన ప్రతి దాడిపై, ప్రతి మరణంపై సమగ్ర విచారణ జరిపించాలని ముఖ్యమంత్రిని కోరుతున్నాం. ఎంతమంది ఎస్సీ, ఎస్టీ బాధితులకు ప్రభుత్వ పరిహారం అందింది? ఎంతమందిని మోసం చేశారు? అన్నదానిపై లెక్కలు తీయాలి. అనంతబాబు వంటి నేతలు గంజాయి, రంగురాళ్ల వ్యాపారంతో ఎంత సామ్రాజ్యాన్ని నిర్మించారో తేల్చాలి. సంక్షేమ బోర్డులను మళ్లీ బలోపేతం చేసి, దళితులకు నిజమైన ఆర్థిక భరోసా కల్పించాలి.
రాష్ట్రం మొత్తం సుబ్రహ్మణ్యం హత్యపై అట్టుడుకుతుంటే జగన్ నోరు ఎందుకు విప్పడం లేదు? మీ పార్టీలో ఉన్న దళిత నేతలు బెల్లంకొట్టిన రాయిలా ఎందుకు పడి ఉన్నారు? మండలి చైర్మన్ మోషేన్రాజు.. మీరు కూడా దళిత బిడ్డే కదా, ఒక హంతకుడిని మీ పక్కన కూర్చోబెట్టుకోవడానికి మీ మనసెలా ఒప్పుకుంటోంది? ఒక దళిత డ్రైవర్ను కిరాతకంగా చంపి ‘డోర్ డెలివరీ’ చేసిన వ్యక్తిని పార్టీ నుంచి తీసేయడానికి మీకు ఎందుకు అంత భయం? అనంతబాబుకు, జగన్ రెడ్డికి ఉన్న ఆ రహస్య సంబంధం ఏంటి? ఎంతటి నేరం చేసినా ఆయన్ని ఎందుకు వెనకేసుకొస్తున్నారు? హత్యలకు రాజకీయం జోడించి సాక్షులను బెదిరిస్తూ డబ్బుతో కేసులను అణచివేయాలని చూస్తే ప్రజలు చూస్తూ ఊరుకోరు. అమరావతి ఉద్యమంలో మహిళల కళ్లు ఎర్రబడి, రక్తం కళ్ళజూసినా కనికరించని ఈ ‘క్రిమినల్ పార్టీ’ తీరును మేం చూశాం. ఈరోజు అనంతబాబును కోర్టుకు తీసుకెళ్తున్నారు. న్యాయవాదులు బాధితుడి తరపున గట్టిగా వాదించాలి. అపరాత్రే వచ్చి డబ్బుతోనో, కత్తితోనో బెదిరిస్తామంటే ఇది పాత ప్రభుత్వం కాదు. సుబ్రహ్మణ్యం హత్య కేసులో మూలాలను వెలికితీసే వరకు ఈ ప్రభుత్వం విశ్రమించదు.
దళిత సమాజంపై దాడి
ముఖ్యమంత్రి చంద్రబాబుని స్వయంగా కలిసి గత ఐదేళ్ల అరాచక పాలనలో నలిగిపోయిన దళిత బిడ్డల వేదనను వినిపించాము. డాక్టర్ సుధాకర్ నుంచి డ్రైవర్ సుబ్రహ్మణ్యం వరకు, శిరోముండనం బాధితుడు వరప్రసాద్ నుంచి కోడికత్తి శ్రీను వరకు ప్రతి ఒక్కరి గాయం ఈ రాష్ట్ర దళిత సమాజంపై జరిగిన దాడి. కేవలం అంగుళం మేర గీసుకుపోయిన గాయానికి, ఐదేళ్ల ఐదు నెలల పాటు జైలు శిక్ష అనుభవించాడు కోడికత్తి శ్రీను. నేటికీ ప్రతి వారం పోలీస్ స్టేషన్కు వెళ్లి సంతకం పెట్టాలి. ఒక్క వారం మిస్సయితే మళ్లీ జైలుకే. ప్రాణం తీసి, శవాన్ని ‘డోర్ డెలివరీ’ చేసినా 90 రోజుల్లోనే బయటకు వచ్చాడు. బయట ఉండి కూడా సాక్షులను బెదిరిస్తున్నాడు. ఇదా సామాజిక న్యాయం అంటే? ఇదా అంబేద్కర్ రాజ్యాంగం అంటే? అందుకే ఈ అన్యాయాలపై ముఖ్యమంత్రికి లిఖితపూర్వకంగా నివేదిక ఇచ్చాను. ఆయనమన ఆవేదనను అర్థం చేసుకున్నారు. బాధితులకు ఆర్థిక భరోసా ఇవ్వడమే కాకుండా, వారికి కొత్త ఉపాధి లేదా ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు కల్పించాలని మంత్రి డోలా వీరాంజనేయస్వామిని, ప్రిన్సిపల్ సెక్రటరీని ఆదేశించారు. బాధితుల కుటుంబాలు రోడ్డున పడకుండా చూడాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వంపై ఉంది.
న్యాయం జరిగే వరకు పోరాడతాం
“మళ్లీ మళ్లీ పుట్టిన చోటే చంపబడుతున్నాం” అన్న కలేకూరి ప్రసాద్ తాత్విక బోధనల నుంచి ఎదిగి వచ్చిన ఉద్యమకారులం మేం. మాకు కర్మ సిద్ధాంతాలు తెలియవు.. కానీ పోరాట సిద్ధాంతం తెలుసు. 30 ఏళ్లుగా ఈ తెలుగు నేలపై దళిత హక్కుల కోసం తెరలు తెరలుగా పోరాడుతూనే ఉన్నాం. ఏ దళిత బిడ్డ కంట కన్నీరు వచ్చినా, ఏ దళితుడి దేహంపై గాయం అయినా.. ఆ గాయం మా గుండెపై అయినట్లే. దానిని ఎదిరిస్తాం, పోరాటం చేస్తాం, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి న్యాయం జరిగే వరకు నిద్రపోం. కూటమి ప్రభుత్వం దళితులకు అండగా ఉంటుందని నేను హామీ ఇస్తున్నాను. నేరగాళ్లు భయపడే, బాధితులు భరోసా పొందే పాలనను మేం అందిస్తాం.’ అని సమావేశం ముగించారు.















