- ఎకనమిక్ టైమ్స్ బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు స్వీకరించనున్న సీఎం
- రేపు ముంబయికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు
అమరావతి (చైతన్య రథం): ప్రతిష్ఠాత్మక మీడియా సంస్థ ఎకనమిక్ టైమ్స్ ప్రకటించిన బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్ 2025 అవార్డును ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అందుకోనున్నారు. ముంబయిలో శనివారం సాయంత్రం జరిగే కార్యక్రమంలో పాల్గొనేందుకు సీఎం అమరావతినుంచి బయల్దేరి వెళ్లనున్నారు. శనివారం మధ్యాహ్నం 12.50 గంటలకు సీఎం క్యాంప్ ఆఫీసునుంచి బయలుదేరి వెళ్తారు. 2.40 గంటలకు ముంబై విమానాశ్రయం చేరుకుంటారు. అనంతరం సాయంత్రం 5.25 గంటలకు జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్కు చేరుకుంటారు. రాత్రి 9.30 వరకు ఎకనమిక్ టైమ్స్ నిర్వహించే అవార్డుల కార్యక్రమంలో పాల్గొంటారు. రాత్రి 9.50 గంటలకు ముంబైనుంచి తిరుగు ప్రయాణం అవుతారు.
విప్లవాత్మక విధానాల అమలుకు దక్కిన గుర్తింపు
నేడు సాయంత్రం 5.30 నుంచి 7.30 గంటల వరకూ జరిగే కార్యక్రమంలో ఆయన ఈ అవార్డు అందుకోనున్నారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సహా దిగ్గజ పారిశ్రామిక దిగ్గజాల సమక్షంలో ఎకనమిక్ టైమ్స్ సంస్థ ఈ అవార్డును ముఖ్యమంత్రికి ప్రదానం చేయనుంది. ఏపీలో స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ సహా స్పీడ్ ఆఫ్ డెలివరింగ్ గవర్నెన్సులాంటి విప్లవాత్మక విధానాలు అమలుకుగాను ఎకనామిక్ టైమ్స్ ఈ అవార్డుకు సీఎం చంద్రబాబును ఎంపిక చేసింది. గతంలో అరుణ్ జైట్లీ, పీయూష్ గోయల్, నితీష్ కుమార్, అశ్వినీ వైష్ణవ్, జై శంకర్ తదితర ప్రముఖులకు బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు వరించింది.
సీబీఎన్ బ్రాండ్ ఇమేజ్తో ఏపీకి పెట్టుబడులు
రాష్ట్రంలో పెట్టుబడులకు అనుకూలమైన వాతావరణాన్ని కల్పించడం, పారిశ్రామిక విధానాల్లో విప్లవాత్మక మార్పులు-పారిశ్రామిక అనుకూల పాలసీలు తీసుకురావడంలో చంద్రబాబు పోషిస్తున్న పాత్రను ఎకనమిక్ టైమ్స్ జ్యూరీ కొనియాడింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అతి తక్కువ సమయంలోనే ఏపీకి రూ.20 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులను రాష్ట్రానికి తీసుకు రావడంలో విజయవంతం కావడం, పారిశ్రామిక అనుమతుల ప్రక్రియను సరళతరం చేస్తూ అమలు చేస్తున్న సంస్కరణలు, టెక్నాలజీ, ఇన్నోవేషన్, ఐటీ, ఎలక్ట్రానిక్స్, గ్రీన్ ఎనర్జీ రంగాల్లో ఏపీని అగ్రగామిగా నిలపాలనే లక్ష్యంతో ఆయన చేస్తున్న కృషికిగాను ఈ ప్రతిష్టాత్మక అవార్డు వరించింది. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా హైదరాబాద్ను ఐటీ హబ్గా మార్చిన అనుభవంతోపాటు, ప్రస్తుతం అమరావతి, విశాఖపట్నంవంటి నగరాలను ఆర్థిక కేంద్రాలుగా తీర్చిదిద్దడంలో సీఎం చంద్రబాబు కీలక పాత్ర పోషిస్తున్నారు.
















