- అనకాపల్లిని మరో రంగారెడ్డి జిల్లాగా మారుస్తాం
- 160 గిగా వాట్ల ఆరఈ ఉత్పత్తి లక్ష్యంలో 50శాతం సాధించాం
- విద్యుత్ భారాన్ని భరిస్తున్నాం… విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తున్నాం
- నాడు ప్రొక్లెయిన్లతో కూల్చివేతలు… నేడు అభివృద్ధి పనులు
- అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్ధి లక్ష్యంగా పని చేస్తున్నాం
- కిల్లర్ పార్టీని దూరంగా పెట్టండి
- రాంబిల్లిలో రెన్యూ ఎనర్జీ గ్లోబల్కు చెందిన రెండు ప్లాంట్లకు సీఎం చంద్రబాబు భూమిపూజ
అనకాపల్లి (చైతన్య రథం): ప్రజలపై విద్యుత్ భారాన్ని వేయకుండా… ఆ భారాన్ని ప్రభుత్వం భరిస్తోందని, అలాగే విద్యుత్ ఛార్జీలను తగ్గించేందుకు కృషి చేస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెల్లడించారు. జాతి నిర్మాణంలో భాగంగా రెన్యూవబుల్ ఎనర్జీ రంగాన్ని ప్రొత్సహిస్తున్నామని సీఎం చెప్పారు. అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలం జెడ్ చింతువలో రెన్యూ ఎనర్జీ గ్లోబల్ సంస్థకు చెందిన రెండు ప్లాంట్ల ఏర్పాటుకు సీఎం చంద్రబాబు గురువారం భూమిపూజ నిర్వహించారు. రూ.5,400 కోట్లతో రెన్యూ ఎనర్జీ గ్లోబల్ సంస్థ రాంబిల్లి పెట్టుబడులు పెట్టనుంది. సోలార్ ఇంగాట్-వేఫర్ తయారీ యూనిట్, హైబ్రిడ్ క్యాప్టివ్ రెన్యువబుల్ పవర్ ప్రాజెక్టు పనులకు సీఎం చంద్రబాబు భూమి పూజ చేశారు.
రూ.4,200 కోట్లతో 6.5 గిగావాట్ల సోలార్ ఇంగాట్-వేఫర్ తయారీ యూనిట్, రూ.1200 కోట్లతో 125 మెగావాట్ల హైబ్రిడ్ క్యాప్టివ్ రెన్యూవబుల్ పవర్ ప్రాజెక్టును రెన్యూ ఎనర్జీ గ్లోబల్ సంస్థ ఏర్పాటు చేయనుంది. ఈ రెండు ప్రాజెక్టులను రెండేళ్లలో పూర్తి చేసేలా లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ ప్రాజెక్టుల ద్వారా 2100 మందికి ఉద్యోగ అవకాశాలు రానున్నాయి. భూమిపూజ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ…“అనకాపల్లి జిల్లా భారీ పెట్టుబడులతో అభివృద్ధిని ఆకర్షిస్తోంది. పెట్టుబడుల్లో ఈ జిల్లా భారత్లోనే అగ్రస్థానానికి చేరుతుంది. ఇటీవలే ఆర్సెలార్ మిట్టల్ నిప్పాన్ ఇండియా స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు శంకుస్థాపన జరిగింది. ఇప్పుడు రూ.5,400 కోట్ల పెట్టుబడులతో రెన్యూ ఎనర్జీ సంస్థ 6.5 గిగావాట్ల ఇన్ గాట్ సోలార్ వేఫర్ ప్లాంట్ ఏర్పాటు చేస్తోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రంగారెడ్డి జిల్లా వెనుకబడిన ప్రాంతం.
కానీ ఇప్పుడు ఆ జిల్లానే అత్యంత సంపద కలిగిన ప్రాంతంగా మారింది. విశాఖ సమీపంలోని అనకాపల్లి మరో రంగారెడ్డి జిల్లాగా తయారవుతుంది. కేంద్ర మాజీమంత్రి యశ్వంత్ సిన్హా కుమారుడు సుమంత్ సిన్హా ఈ సోలార్ వేఫర్ ప్లాంట్ను ఏర్పాటు చేస్తున్నారు. వేగంగా అభివృద్ధి చెందుతున్న రంగాన్ని ఎంచుకుని వ్యాపారం మొదలు పెట్టారు. ఇప్పుడు పెట్టుబడులు పెట్టడానికి ఏపీని ఎంచుకున్నారు. రెన్యూ ఎనర్జీ కేంద్ర కార్యాలయాన్నీ ఇక్కడే ఏర్పాటు చేయాలని ఆ సంస్థను కోరుతున్నాను. రెన్యూ ఎనర్జీనే కాదు… జాతీయ అంతర్జాతీయ సంస్థలను ఏపీలో పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానిస్తున్నాం. ఏపీలో పెట్టుబడులు పెడితే సురక్షితంగా ఉంటాయి. ఏపీ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని పారిశ్రామికవేత్తలను కోరుతున్నా. గడచిన 22 నెలల్లో 802 ఎంఓయూలు చేసుకున్నాం. వాటిపై నిరంతరం సంప్రదింపులు చేస్తున్నాం. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ నుంచి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ద్వారా అనుమతులు ఇస్తున్నాం. స్పీడ్ ఆఫ్ డెలివరింగ్ గవర్నెన్స్ ద్వారా సుపరిపాలన అందిస్తున్నాం.
2019-24 మధ్య పెట్టుబడులు పెట్టడానికి పారిశ్రామికవేత్తలు భయపడ్డారు. వేధింపులు, అవినీతి పెద్దఎత్తున జరిగింది. 2024లో మీరు వేసిన ఒక్క ఓటుతో ప్రజల్లో అభద్రత, ఆందోళనను తొలగించాం. ఎన్డీఏ బ్రాండ్తో ఏపీలో విశ్వాసం తిరిగి వచ్చింది. పరిశ్రమలకు, పెట్టుబడులకు భరోసా వచ్చింది. పారిశ్రామికవేత్తలకు సహకరిస్తూ భూములు ఇచ్చిన వారికి ప్రభుత్వం అండగా ఉంటుంది. ఉత్తరాంధ్రలో ప్రతి రోజూ పెట్టుబడుల పండుగ. ఈనెల 28న 15 బిలియన్ డాలర్ల పెట్టుబడితో గూగుల్ ఏఐ డేటా సెంటర్కు శంకుస్థాపన చేయబోతున్నాం. జూలైలో భోగాపురం విమానాశ్రయం అందుబాటులోకి రాబోతోంది. లారస్ ల్యాబ్ రూ.5 వేల కోట్ల పెట్టుబడితో ముందుకు వస్తోంది. ప్రధాని మోదీ సహకారంతో విశాఖ ఉక్కును కాపాడుకున్నాం. రైల్వే జోన్ను కూడా ఏర్పాటు చేసుకున్నాం. విశాఖ-రాజమహేంద్రవరం మధ్య కార్గో కోసం నాలుగు రైల్వే లైన్ల స్పీడ్ రైల్ కారిడార్ వస్తోంది. ఉద్యోగ, ఉపాధి అవకాశాల కోసం వేరే రాష్ట్రాలకు వెళ్లాల్సిన అవసరం లేదు. ఇతర రాష్ట్రాలనుంచే ఇక్కడికి వచ్చి ఉపాధి పొందే పరిస్థితి తెస్తాం. ఈ రెన్యూ ఎనర్జీ ప్లాంట్తో నన్ను విశ్వసించిన యువతకు ఉద్యోగాలు వస్తున్నాయి” అని ముఖ్యమంత్రి అన్నారు.
రెన్యూవబుల్ ఎనర్జీతో జాతి నిర్మాణం
“అభివృద్ధి సూచికల్లో విద్యుత్ వినియోగం కూడా ఓ భాగం. ఎంత విద్యుత్ వినియోగిస్తే అంత అభివృద్ధి సాధించినట్టే. అందుకే రాష్ట్రంలో విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్లను పెద్ద ఎత్తున ఏర్పాటు చేసేలా ప్రొత్సహిస్తున్నాం. గత పాలకులు విధ్వంసం చేసిన ఆంధ్రప్రదేశ్ను పునర్నిర్మాణం చేయాలన్న లక్ష్యంతోనే కూటమి ప్రజా ప్రభుత్వం సుపరిపాలన అందిస్తోంది. సీఐఐ భాగస్వామ్య సదస్సులో రెన్యూ ఎనర్జీ వేలకోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చింది. అనంతపురం, కర్నూలు జిల్లాల్లో ఇప్పటికే సౌర, పవన విద్యుదుత్పత్తి జరుగుతోంది. రాంబిల్లిలో సౌర ఫలకాలు తయారవుతాయి. విద్యుత్ సంస్కరణల్ని ప్రారంభించింది మేమే. ఆ ఫలితాలు అందరికీ అందుతున్నాయి. ఏపీలో 160 గిగావాట్ల గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ఇప్పటికే 90 గిగావాట్ల మేర విద్యుత్ ఉత్పత్తి చేసేలా పనులు గ్రౌండ్ అయ్యాయి. రూ.5.95 లక్షల కోట్లు ఈ రంగంలో పెట్టుబడులు వచ్చాయి., ఎంఓయూలు సిద్ధమైపోయాయి. ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ రూ.1.85 లక్షల కోట్ల పెట్టుబడులతో ముందుకు వస్తోంది.
గ్రీన్ ఈవీ వాహనాలు తీసుకువచ్చేలా చర్యలు చేపట్టాం. ఆర్టీసీ కూడా 1,050 బస్సులు తీసుకువస్తోంది. భవిష్యత్తులో ఆర్టీసీ బస్సులన్నీ ఈవీ బస్సులే. పేదలకు కూడా ఆర్టీసీ బస్సుల్లో తిరిగే సౌకర్యాన్ని అందుబాటులోకి తెస్తాం. రాష్ట్రంలో 5 వేల ఛార్జింగ్ స్టేషన్లను రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేయబోతున్నాం. ప్రతీ ఇంటిపైనా విద్యుత్ ఉత్పత్తి కోసం పీఎం సూర్యఘర్ కింద సౌర ఫలకాలు ఏర్పాటు చేసుకోవాలి. 40 లక్షల ఇళ్లకు సోలార్ రూఫ్ టాప్ ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. అటు రైతులు కూడా పీఎం కుసుమ్ కింద సోలార్ పంపు సెట్లు ఏర్పాటు చేసుకోవాలి. ఎక్కడ ఉత్పత్తి చేసిన విద్యుత్ అక్కడే వాడుకునే పరిస్థితి ఉంటే ట్రాన్స్ మిషన్ నష్టాలు కూడా ఉండవు. రెన్యూవబుల్ ఎనర్జీ ఉత్పత్తి అంటే… జాతి నిర్మాణమే. అలాంటి మంచి కార్యక్రమానికి సహకరిస్తున్న రెన్యూ సంస్థను అభినందిస్తున్నాను. ప్రస్తుతం యుద్దం జరుగుతోంటే… గ్యాస్ కోసం ఇబ్బందులు పడాల్సి వస్తోంది. దేశీయంగానే విద్యుత్ ఉత్పత్తి సహా ఇతర అంశాల్లో మనం ముందంజలో ఉంటే… అంతర్జాతీయంగా వచ్చే ఇబ్బందులను తట్టుకునే పరిస్థితి ఉంటుంది. అందుకే ప్రధాని మోదీ రెన్యూవబుల్ ఎనర్జీని ప్రొత్సహిస్తున్నారు” అని సీఎం చంద్రబాబు చెప్పారు.
గత ప్రభుత్వ తప్పులను సరి చేస్తున్నాం…
“పేదల ప్రయోజనాల కోసమే ప్రభుత్వం కట్టుబడి ఉంది. ప్రజలకు సుపరిపాలన అందేలా చర్యలు తీసుకుంటున్నాం. విద్యుత్ రంగం సహా వివిధ వ్యవస్థల్లో గత ప్రభుత్వ తప్పిదాలు సరి చేస్తున్నాం. 2019-24లో పీపీఏలు రద్దు చేసి, నిర్వహణా లోపంతో అధిక ధరకు విద్యుత్ కొనుగోలు చేసి విద్యుత్ వ్యవస్థను ధ్వంసం చేశారు. పీపీఏల రద్దు కారణంగా విద్యుత్ వాడుకోకుండానే రూ.9 వేల కోట్ల ప్రజాధనం కట్టాల్సి వచ్చింది. ప్రజలపై రూ. 32 వేల కోట్ల భారాన్ని గత పాలకులు వేశారు. ట్రూ ఆప్ ఛార్జీలు పేరుతో భారీగా ప్రజల నుంచి డబ్బులు వసూలు చేశారు. గత పాలకులు వేసిన ట్రూ ఆప్ ఛార్జీలను… మేం చరిత్రలో తొలిసారిగా ట్రూ డౌన్ అమలు చేశాం.
దీంతో పాటు ట్రూ అప్ భారాన్ని కూడా ప్రజలపై మోపకుండా ప్రభుత్వమే భరిస్తోంది. రూ.15,795 కోట్లు ఛార్జీల భారం పెంచకుండా ప్రభుత్వమే భరించేలా నిర్ణయం తీసుకున్నాం. విద్యుత్ ఛార్జీలు పెంచబోమని ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకే నిలబెట్టుకుంటున్నాం. ఇప్పుడు మళ్లీ చెబుతున్నాం… విద్యుత్ ఛార్జీలను ఎట్టి పరిస్థితుల్లోనూ పెంచం. గత పాలకులు ఎక్కువ వడ్డీలకు అప్పులు తెచ్చారు. వాటిని రీషెడ్యూలు చేస్తున్నాం. అన్ని ప్రాంతాలను సమగ్రంగా అభివృద్ధి చేస్తున్నాం. రాజధాని అమరావతి నిర్మాణంతో రాష్ట్ర దశాదిశ మారుతుంది. గోదావరి పుష్కరాల నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తిచేసి జాతికి అంకితం చేస్తాం. విశాఖ సహా 9 జిల్లాలు, అమరావతి కేంద్రంగా పశ్చిమగోదావరి నుంచి ప్రకాశం వరకూ, తిరుపతి కేంద్రంగా రాయలసీమ అంతటా వివిధ రీజియన్లుగా అభివృద్ధి చేస్తాం. 2047 స్వర్ణాంధ్రతో హెల్తీ వెల్తీ హ్యాపీ ఆంధ్రప్రదేశ్ సాధించడం ప్రజా ప్రభుత్వ లక్ష్యం” అని ముఖ్యమంత్రి వెల్లడించారు.
హత్యలు చేస్తారు… సాక్షుల్ని బెదిరిస్తారు…
“మంచి కార్యక్రమాలు… శుభ దినాల్లో కూడా తప్పుడు పనులు చేసే వారిని, దుర్మార్గులను గుర్తు చేసుకోవాలి. అలాంటివారి విషయంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలి కాబట్టి… చెప్పాల్సి వస్తోంది. నేరాలు ఘోరాలు చేసే ఓ పార్టీ రాష్ట్రంలో అరాచకాలు చేస్తోంది. వివేకా హత్య తరహాలోనే కడపలో దస్తగిరి అనే వ్యక్తిని హత్య చేశారు. జగన్మోహన్ రెడ్డి మేనమామకు ప్రధాన అనుచరుడు ఆస్తుల కోసం పెద్ద దస్తగిరిని చంపేశారు. డబ్బు కోసం, ఆస్తుల కోసం సొంత మనుషుల్ని సైతం కడతేర్చే కిల్లర్ పార్టీ అది. ఇలాంటి మోసగాళ్లపై నిరంతరం కన్నేసే ఉంచుతున్నాం. ప్రస్తుతం నేరస్థులతో రాజకీయం చేయాల్సిన పరిస్థితి తలెత్తింది. డ్రైవర్ను హత్యచేసి డోర్ డెలివరీ చేసిన వ్యక్తిని ఎమ్మెల్సీగా చేశారు. ఇప్పుడు మళ్లీ అతనే సాక్షుల్ని బెదిరించే స్థాయికి చేరాడు. అలాంటి రాజకీయ పార్టీ ఐడియాలజీని ప్రజలు అర్ధం చేసుకోవాలి. ఇలాంటి పార్టీలు సమాజానికి దూరం కావాలి. అధికారంలోకి వస్తే నరికేస్తాం, చంపేస్తాం, పెట్టుబడిదారులను తరిమేస్తాం అని బెదిరించే పార్టీలు మనకెందుకు..?
అయినా వాళ్ల బెదిరింపులకు కాలం చెల్లింది. ఫ్లెక్సీలకు రక్తాభిషేకాలు చేసి అభద్రతా భావం సృష్టించే వాళ్లు రాజకీయాల్లో అవసరమా…? రాష్ట్రంలో మంచి జరుగుతోంటే… కిల్లర్ పార్టీకి ఫ్రస్ట్రేషన్ పెరిగిపోతోంది. నాడు ఉత్తరాంధ్రలో ప్రొక్లయినర్తో కూల్చివేతలు జరిగేవి. నేడు అవే ప్రొక్లయినర్లతో అభివృద్ధి పనులు చేపడుతున్నాం. నాడు ఉత్తరాంధ్ర ప్రాంతంలో భూములను కబ్జాలు చేశారు. తప్పుడు రిజిస్ట్రేషన్లు చేశారు. కానీ నేడు అవే భూముల్లో ప్రపంచస్థాయి కంపెనీలు వస్తున్నాయి. రిజిస్ట్రేషన్లు చేసుకుంటున్నాయి. శంకుస్థాపన, ప్రారంభోత్సవ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ప్రకృతి వనరులు దోచిన పాలకులకు… ప్రకృతి వనరులను సంపదగా మార్చే ప్రభుత్వాలకు మధ్యనున్న తేడాను ప్రజలంతా గమనించాలి” అని సీఎం చంద్రబాబు అన్నారు. కార్యక్రమంలో స్పీకర్ అయ్యన్నపాత్రుడు, రెన్యూ ఎనర్జీ గ్లోబల్ సంస్థ ఛైర్మన్ సుమంత్ సిన్హా, జిల్లా ప్రజా ప్రతినిధులు, జిల్లా ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
















