- త్యాగానికి మానవరూపం పొట్టి శ్రీరాములు
- ఆయన విగ్రహం తెలుగుజాతి గొప్పతనానికి నిదర్శనం
- నేను తెలుగువాడినని గర్వంగా చెప్పుకుంటున్నా
- ఆ గౌరవం మనందరికీ ఇచ్చింది పొట్టి శ్రీరాములే
- అమరావతిలో విగ్రహం ఏర్పాటుతో యువగళం హామీ నిలబెట్టుకున్నా
- పొట్టి శ్రీరాములు కాంస్య విగ్రహావిష్కరణలో మంత్రి లోకేష్
అమరావతి (చైతన్య రథం): ఆంధ్రప్రదేశ్ గౌరవం ‘స్టాచ్యూ ఆఫ్ శాక్రిఫైస’. త్యాగానికి మానవరూపం పొట్టి శ్రీరాములు. ఆయన విగ్రహం ఏర్పాటు తెలుగుజాతి గొప్పతనాన్ని అమరావతినుంచి అంతర్జాతీయస్థాయికి తీసుకెళ్లిందని విద్య, ఐటీ మంత్రి నారా లోకేష్ ఉద్ఘాటించారు. అమరజీవి పొట్టి శ్రీరాములు 125వ జయంతి సందర్భంగా ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోసం 58 రోజుల ఆమరణ నిరాహార దీక్షకు గుర్తుగా ప్రజారాజధాని అమరావతిలో ‘స్టాచ్యూ ఆఫ్ శాక్రిఫైస’ పేరిట ఏర్పాటు చేసిన 58 అడుగుల అమరజీవి పొట్టి శ్రీరాములు కాంస్య విగ్రహావిష్కరణ మహోత్సవంలో సీఎం చంద్రబాబునాయుడుతో కలిసి విద్య, ఐటీ మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమరజీవి పొట్టి శ్రీరాములు కాంస్య విగ్రహాన్ని సీఎం ఆవిష్కరించారు.
పొట్టి శ్రీరాములు 125వ జయంతిని పురస్కరించుకుని అమరజీవి త్యాగ శిల్పంవద్ద మంత్రి లోకేష్ నివాళి అర్పించారు. అమరావతి ప్రాంతంలోని శాఖమూరులో కూటమి ప్రభుత్వం 6.8 ఎకరాల్లో అమరజీవి పొట్టి శ్రీరాములు స్మృతివనాన్ని ఏర్పాటుచేస్తోంది. 6 నెలల రికార్డు సమయంలోనే ప్రాజెక్ట్ మొదట దశ పనులు పూర్తిచేయడం జరిగింది. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో మంత్రి లోకేష్ మాట్లాడుతూ.. “జై వాసవీ మాత. ఒక మనిషి త్యాగం.. ఒక జాతి గౌరవం. ఒక దీక్ష.. ఒక రాష్ట్రం. అమరజీవి.. చిరంజీవి. మరణంలేని గొప్ప శక్తి. త్యాగానికి మానవరూపం. ఆంధ్రప్రదేశ్ రూపంలో జీవించే ఉన్నారు. అమరజీవి పొట్టి శ్రీరాములు 125వ జయంతి రోజు 58 అడుగుల విగ్రహం రూపంలో మనకోసం మళ్లీ జన్మించారు. ఆంధ్రప్రదేశ్ ఆత్మగౌరవం ఈ ‘స్టాచ్యూ ఆఫ్ శాక్రిఫైస’. డూండి రాకేష్ నా దగ్గరకు వచ్చి ఏంపేరు పెట్టాలనేదానిపై సలహా అడిగారు. అప్పుడు నా మనసులో తోచింది ఒక్కటే ఆ విగ్రహం చూస్తే ఆయన త్యాగం గుర్తుకురావాలి. అందుకే ‘స్టాచ్యూ ఆప్ శాక్రిఫైస’ అని పెడదామని చెప్పాను. అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహం తెలుగుజాతి గొప్పతనాన్ని అమరావతినుంచి అంతర్జాతీయస్థాయికి తీసుకువెళ్లింది” అని అన్నారు.
నేను తెలుగువాడినని గర్వంగా చెప్పుకుంటున్నా
“నేను తెలుగువాడిని, నేను ఆంధ్రప్రదేశ్ పౌరుడినని గర్వంగా చెప్పుకుంటున్నా. ఆ గర్వం మనందరికీ ఇచ్చింది పొట్టి శ్రీరాములు. ఆయన ఒక వ్యక్తి కాదు తెలుగు గౌరవం. ఆయన ప్రాణత్యాగం.. మన రాష్ట్రం. ఆ మహనీయుడి జయంతి.. మన ఆంధ్రులకు పండుగ. అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా ఘన నివాళి అర్పిస్తున్నా” అన్నారు.
ఈ విగ్రహం ఆయన త్యాగాన్ని నిత్యం గుర్తుచేస్తుంది
“యువగళం పాదయాత్రలో నేను ఆర్యవైశ్య సోదరులను అనేకసార్లు కలిశాను. వాళ్లకున్న సమస్యల గురించి చర్చించాం. అధికారంలోకి వచ్చిన వెంటనే కొన్ని పరిష్కరించాం, ఇంకొన్ని సమస్యలున్నాయి. అవీ పరిష్కరిస్తాం. అమరావతిలో అమరజీవి విగ్రహం ఏర్పాటు చేస్తామని యువగళం పాదయాత్రలో హామీ ఇచ్చాను. ఇచ్చిన హామీని తక్కువ సమయంలోనే నిలబెట్టుకోవడం ఆనందంగా ఉంది. ‘స్టాచ్యూ ఆఫ్ శాక్రిఫైస’ 58 అడుగులు అమరజీవి ఆమరణ దీక్షచేసిన 58 రోజులకు సంకేతం. ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటుకు ఆయన చేసిన త్యాగాన్ని మనకు ప్రతిరోజూ గుర్తుచేస్తుంది. మనం ఒకరోజు ఉపవాసం ఉండాలి అంటే ఇబ్బంది పడతాం. అలాంటిది ఒక రాష్ట్ర ఏర్పాటుకోసం ఆయన 58 రోజులు దీక్ష చేసి ప్రాణత్యాగం చేశారు. ఈ చరిత్ర భావితరాలకు అందించడం మన బాధ్యత. 2025 సెప్టెంబర్ 3న విగ్రహ ఏర్పాటుకు శంకుస్థాపన చేశాం. 194 రోజుల్లోనే విగ్రహ ఏర్పాటు పూర్తిచేసిన కూటమి ప్రభుత్వం, ట్రస్ట్, అధికారులు, సిబ్బంది, భవన నిర్మాణ కార్మికులు అందరినీ అభినందిస్తున్నాను. మా రౌడీ డూండీని ఎప్పుడూ స్పీడ్ పెంచాలి అంటూ ఉంటాను. విగ్రహ ఏర్పాటుమాత్రం జెట్ స్పీడ్లో చేశారు. ఇంత స్పీడ్గా చేస్తారని నేను ఊహించలేదు” అని మంత్రి లోకేష్ ఆనందం వ్యక్తం చేశారు.
అమరజీవి శ్రీరాములు నిత్యపోరాటయోధుడు
“పొట్టి శ్రీరాములు స్వార్థంలేని ఉద్యమం చేశారు. సమాజాభివృద్ధికి ఒక కార్యకర్తలా పనిచేశారు. రాజకీయాలు చేయలేదు. పదవులు ఆశించలేదు. గాంధీ సబర్మతి ఆశ్రమంలో చేరారు. స్వాతంత్య్రం కోసం పోరాడారు. సత్యాగ్రహ ఉద్యమంలో పాల్గొని జైలుకెîళ్లారు. నెల్లూరులో దళితులకు ఆలయప్రవేశం కోసం ఉద్యమించారు. అంటరానితనంపై పోరాడారు. ఐదుసార్లు నిరాహార దీక్షలు చేశారు. నాడు ఆంధ్రుల ఇబ్బందులు ప్రత్యక్షంగా చూశారు. ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాటం చేయకపోవడం మహాపాపమని ప్రకటించారు. కొందరి స్వార్థం కోసం ఆంధ్రుల ఆత్మగౌరవం బలికాకూడదన్నారు. వస్తే ప్రత్యేక రాష్ట్రం.. పోతే తన ప్రాణం అనుకున్నారు. దీక్షకు ఎవరూ స్థలం ఇవ్వకపోతే రోడ్డుమీదే ఆమరణదీక్ష చేస్తానన్నారు. ఆయన నిత్యపోరాటయోధుడు. ఆయన నా యువగళం పాదయాత్రకు స్ఫూర్తి. అప్పటి ప్రభుత్వం నా నైట్ బస్ పెట్టుకోవడానికి ఎవరైనా భూమి ఇస్తే 22-ఏలో పెడతామని బెదిరించారు. అప్పుడు నేను ఒకటే చెప్పేవాడిని. ఎవరూ స్థలం ఇవ్వకపోతే నేను రోడ్డుమీద పడుకుంటా అని” అని లోకేష్ గుర్తు చేసుకున్నారు.
ప్రాణత్యాగంతో ఆంధ్ర రాష్ట్ర సాధన
“మద్రాసులో బులుసు సాంబమూర్తి ఇంట్లో 1952 అక్టోబర్ 19న ఆమరణ దీక్ష ప్రారంభించారు. దీక్ష మొదటి రోజు 53.9 కేజీల బరువున్న పొట్టి శ్రీరాములు 58వ రోజు 38.1 కేజీలకు తగ్గారు. పొట్టి శ్రీరాములు స్థానంలో ఏ ఒక్కరున్నా దీక్ష విరమించేవారు. అమరజీవి తాను అనుకున్నట్టే వస్తే రాష్ట్రం.. పోతే ప్రాణం అనుకుని దీక్ష విరమించలేదు. 58 రోజులపాటు దీక్ష చేసి తన ప్రాణాలను త్యాగం చేశారు. ఆంధ్ర రాష్ట్రాన్ని సాధించారు. ఒక్క ప్రాణత్యాగం కోట్లమందిని కదిలించింది. ఢిల్లీ దిగివచ్చింది. కర్నూలు రాజధానిగా 1953 అక్టోబర్ 1న ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది” అని లోకేష్ పేర్కొన్నారు.
భారతదేశ చరిత్ర, భౌగోళిక స్వరూపంపై అమరజీవి ప్రభావం
“ప్రముఖ చరిత్రకారుడు రామచంద్ర గుహ.. అమరజీవి పొట్టి శ్రీరాములు గురించి ఒక వ్యాసం రాశారు. దురదృష్టం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ బయట పొట్టి శ్రీరాములును మర్చిపోయారని రాస్తూ.. ఆయన ఏం చెప్పారో తెలుసా? భారతదేశ చరిత్ర, భౌగోళిక స్వరూపంపై అమరజీవి తీవ్ర ప్రభావం చూపారు. ఆయన దీక్ష తరువాత.. భారతదేశ చిత్రపటంపై భాషాప్రయుక్త రాష్ట్రాల రేఖలు ఏర్పడ్డాయన్నారు. పొట్టి శ్రీరాములును భారతదేశ మెర్కాటర్గా రామచంద్ర గుహ అభివర్ణించారు. 1569లో ప్రపంచ పటాన్ని తయారు చేసిన జర్మన్-ఫ్లెమిష్ భౌగోళిక శాస్త్రవేత్త ఈ మెర్కాటర్. అంతటి గొప్ప వ్యక్తి మన పొట్టి శ్రీరాములు చరిత్ర దేశం మొత్తం గుర్తుపెట్టుకునేలా ఈ విగ్రహం ఏర్పాటు చేసుకోవడం మన అదృష్టం” అని లోకేష్ భావోద్వేగంతో పేర్కొన్నారు.
రాజకీయాలకు అతీతంగా పనిచేసిన గొప్ప వ్యక్తి రోశయ్య
“మీతో ఎప్పుడు సమావేశమైనా మొదట గుర్తొచ్చేది రోశయ్య తాత. ఆయన రాజకీయాల్లో స్టేట్స్ మ్యాన్. ఆయన అసెంబ్లీలో మాట్లాడితే అంతా నిశ్శబ్దం. అంత శ్రద్ధగా వినేవారు. ఆయన లేని లోటు కనిపిస్తోంది. రాష్ట్ర విభజన తర్వాత ప్రతి పుట్టిన రోజుకి నేను ఫోన్ చేసి మాట్లాడేవాడిని. రాజకీయాలకు అతీతంగా పనిచేసిన గొప్ప వ్యక్తి మాజీ సీఎం రోశయ్య” అని గుర్తు చేసుకున్నారు.
యువగళం హామీని నిలబెట్టుకున్నా
ఎన్ని కోరికలు తీర్చినా మన డూండి రాకేష్కు ఇంకో చివరి కోరిక ఉంటుంది. ఇప్పుడు పొట్టి శ్రీరాములు పేరు మీద స్మారక నాణెం విడుదల చేయాలని అడిగారు. కేంద్ర ప్రభుత్వంలో మాట్లాడి స్మారక నాణెం విడుదలకు ప్రయత్నం చేస్తున్నాం. ఆయన జయంతి రోజున నేను ఇచ్చిన హామీ నిలబెట్టుకోవడం నా అదృష్టం. భారతదేశమే ఆశ్చర్యపోయేలా విగ్రహావిష్కరణ జరిగింది. యువగళం హామీ నెరవేర్చిన బీసీ సంక్షేమ మంత్రి సవితకు, ట్రస్ట్కు, 10 రూపాయల దగ్గర నుంచి కోటి రూపాయలు విరాళమిచ్చిన వారున్నారు. విరాళం ఎంత అనేది కాదు.. మంచిపనిలో భాగస్వామ్యం అవ్వాలనే ఆలోచన గొప్పది. సీఆర్డీయే, అధికారులు, ఆర్యవైశ్య పెద్దలకు అందరికీ అభినందనలు. 12 నెలల్లోనే స్మృతివనం, ఫోటో గ్యాలరీ, మ్యూజియం, మినీ థియేటర్, ఆడిటోరియం, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ల నిర్మాణం పూర్తిచేయాలి” అని మంత్రి చెప్పారు. కార్యక్రమంలో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రులు ఎస్ సవిత, టీజీ భరత్, పి.నారాయణ, కందుల దుర్గేష్, నాదెండ్ల మనోహర్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్, ఆర్యవైశ్య కార్పొరేషన్ ఛైర్మన్ డూండి రాకేష్, ఎమ్మెల్యేలు శ్రీరామ్ రాజగోపాల్ (తాతయ్య), ఎమ్మెల్యేలు తెనాలి శ్రావణ్ కుమార్, కలెక్టర్ ఏ. తమీమ్ అన్సారియా, పొట్టి శ్రీరాములు కుటుంబ సభ్యులు, అమరజీవి పొట్టి శ్రీరాములు మెమోరియల్ ట్రస్ట్ సభ్యులు, ఆర్యవైశ్య సామాజికవర్గ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.















