- బార్, బెంచిలు ప్రత్యర్థులు కారు, న్యాయానికి రెండు చేతులు
- వాదనలు బాగుంటేనే.. స్పష్టమైన తీర్పులు వస్తాయి
- సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ అభిభాషణ
- తిరుపతిలో 16 కోర్టు భవనాల సముదాయానికి శంకుస్థాపన
తిరుపతి (చైతన్య రథం): కోర్టుల్లో వాదనలు సరిగ్గా ఉన్నప్పుడే జడ్జీలనుంచి నాణ్యమైన తీర్పులు వస్తాయని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ సూర్యకాంత్ అన్నారు. అలాంటి తీర్పులతో న్యాయ వ్యవస్థపై ప్రజల్లో నమ్మకం పెరుగుతుందని వ్యాఖ్యానించారు. ఆదివారం తిరుపతి రూరల్ మండలం దామినేడు వద్ద సీజేఐ జస్టిస్ సూర్యకాంత్, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ జెకె మహేశ్వరి, జస్టిస్ పిఎస్ నరసింహ, జస్టిస్ ప్రశాంత్కుమార్ మిశ్రా, జస్టిస్ ఎస్విఎన్ భట్టి, జస్టిస్ జాయ్ మాల్య బాగ్చీ, ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, న్యాయమూర్తులతో కలసి 16 కోర్టు భవనాల నూతన భవన నిర్మాణానికి భూమి పూజ చేసి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జస్టిస్ సూర్యకాంత్ మాట్లాడుతూ న్యాయం అందించేందుకు నిర్దేశిత గడువు ఉండాలని అభిప్రాయపడ్డారు. కోర్టు నూతన భవనంలో న్యాయవాదులకు మంచి సౌకర్యాలు కల్పించాలని, మెడికల్ సెంటర్ ఉండాలని సూచించారు. కోర్టు సముదాయాలు ఆసుపత్రుల్లా పనిచేయాలని ఎప్పటి నుంచో చెబుతున్నాని, ఆసుపత్రికి వెళ్లిన రోగికి మొదట ప్రాథమిక చికిత్స అందించినట్టే.. కోర్టుకు వచ్చే ప్రతి వ్యక్తికీ భద్రత, న్యాయం లభిస్తుందనే నమ్మకం కలగాలన్నారు.
ఈ బాధ్యత బార్, బెంచ్ రెండింటిపై సమానంగా ఉందన్నారు. కొత్త న్యాయస్థాన సముదాయం “న్యాయ దేవాలయం”గా మారాలని ఆకాక్షిస్తున్నానని అంటూ.. ఇక్కడికి వచ్చే ప్రతి వ్యక్తి న్యాయం పొందిన ఆనందంతో వెళ్లాలన్నారు. తిరుపతి బార్కు ఉన్న మేధస్సు, చారిత్రాత్మక వారసత్వం, మేధో సంపత్తితో మరింత వికసించాలని ఆకాంక్షించారు. న్యాయ వ్యవస్థలో బార్ అసోసియేషన్ ఒక అవిభాజ్య భాగమని, న్యాయం అందించడం కేవలం బెంచ్ బాధ్యత మాత్రమేననే భావన అపోహన్నారు. బార్, బెంచ్ ప్రత్యర్థులు కావని, ఒకే సంస్థకు చెందిన రెండు చేతులన్నారు. బలమైన బార్ అసోసియేషన్ మంచి వాదనలను అందిస్తుందని, మంచి వాదన న్యాయమూర్తులను మరింత లోతుగా ఆలోచించడానికి, జాగ్రత్తగా విశ్లేషించడానికి, స్పష్టంగా తీర్పులు రాయడానికి ప్రేరేపిస్తుందన్నారు. బార్ అసోసియేషన్ అందించే సహకారం ఎంత నాణ్యమైనదైతే, న్యాయమూర్తి పనితీరు కూడా అంతే మెరుగ్గా ప్రతిఫలిస్తుందన్నారు. మీరు ఎంత బాగా వాదిస్తే, తీర్పుల నాణ్యత అంత మెరుగ్గా ఉంటుందన్నారు. మంచి కారణాలతో ఇచ్చిన తీర్పులు ప్రజల్లో న్యాయవ్యవస్థపై విశ్వాసాన్ని పెంచుతాయని, త్వరలో నిర్మాణం పూర్తి చేసుకోనున్న కొత్త కోర్టు సముదాయం న్యాయవాదులకు తగిన పని వాతావరణాన్ని కల్పిస్తుందని జస్టిస్ సూర్యకాంత్ ఆకాంక్షించారు. కోర్టు భవన నిర్మాణం పూర్తై అన్నీ అమరిన తరువాతే అసలు సవాళ్లు ప్రారంభమవుతాయన్నారు.
అందుబాటులో ఉండే ఖర్చుతో న్యాయాన్ని ప్రజలకు చేరవేయడం ఒకటైతే.. నిర్దుష్ట కాలపట్టికతో ముందుగా ఊహించగలిగే విధంగా న్యాయ నిర్ణయ వ్యవస్థను అమలు చేయడం రెండో సవాలు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు వందేళ్ల భవిష్యత్ అవసరాలు దృష్టిలో పెట్టుకొని న్యాయ మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలని సూచించారు. దేశం అభివృద్ధి చెందుతోందని, జనాభా పెరుగుతోందని, పట్టణీకరణ వేగంగా జరుగుతోందని, భవిష్యత్తులో న్యాయ మౌలిక సదుపాయాల కోసం పెద్ద భూభాగాలు లభించడం కష్టతరం కానున్న నేపథ్యంలో దూరదృష్టితో ఆలోచించి భూమిని కేటాయించిన ఏపీని ప్రభుత్వాన్ని అభినందించారు. కోర్టు సముదాయంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. భవన సముదాయం సమయానికి పూర్తవుతుందని నాకు పూర్తి విశ్వాసం ఉందని, మళ్లీ తాను వెంకటేశ్వర స్వామి దర్శించడానికి వచ్చినప్పుడు, ఈ న్యాయ సముదాయం విజయవంతంగా పనిచేస్తుండడం చూసి గర్వపడతానన్నారు. ఏపీ హైకోర్టు సీజే జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ మాట్లాడుతూ గతంలో చాలా కోర్టుల్లో జడ్జీల ఛాంబర్లు సరిగా ఉండేవి కాదన్నారు. గతంలో కశ్మీర్ వరదలు వచ్చినప్పుడు హైకోర్టు భవనం పూర్తిగా మునిగిపోయిందని, టెంట్లకింద కోర్టు కార్యకలాపాలు నిర్వహించామని గుర్తు చేశారు. న్యాయవ్యవస్థపై నమ్మకం కలిగేలా సిబ్బంది వ్యవహరించాలని హైకోర్టు సీజే పేర్కొన్నారు.
జస్టిస్ జెకె మహేశ్వరి మాట్లాడుతూ తిరుమల కొండ కేవలం ఆధ్యాత్మికతకే కాదు, ధర్మానికి ప్రతీకగా అభివర్ణించారు. న్యాయ సంప్రదాయంలో కోర్టును “న్యాయ దేవాలయం”గా పేర్కొంటామని, తిరుపతిలో దేవాలయం, న్యాయస్థానంమధ్య ఉన్న భావన మరింత దగ్గరగా అనిపిస్తుందన్నారు. రెండింటి పునాది సత్యాన్వేషణ, సమాజంలో సమతుల్యతను పునరుద్ధరించడమేనన్నారు. కోర్టు గొప్పదనం దాని నిర్మాణంలో కాదని, దాని లోపల జరిగే న్యాయ ప్రక్రియ నిష్పక్షపాత తీర్పులలో ఉంటుందన్నారు. న్యాయం అధికారానికి సాధనంగా కాకుండా సమానత్వానికి రక్షకుడిగా ఉండాలన్నారు. అభివృద్ధితోపాటు బలమైన సంస్థాగత వ్యవస్థ అవసరమని, కోర్టు బలహీనులకు చివరి ఆశ్రయం, హక్కులను రక్షించుకోవాలనుకునేవారికి మొదటి ఆశ్రయం కావాలన్నారు.
తిరుపతికి సమీపంలో సుమారు 14.49 ఎకరాల విస్తీర్ణంలో జిల్లా కోర్టు నూతన న్యాయ సముదాయం నిర్మితమవుతోంది. మొత్తం 2,40,904 చదరపు అడుగుల నిర్మాణంలో కేవలం 9శాతం మాత్రమే భవన నిర్మాణానికి ఉపయోగిస్తున్నారు. 57శాతం భవిష్యత్ విస్తరణకు కేటాయించారు. 16.6 శాతం పార్కింగ్ సదుపాయాలకు కేటాయించారు. నిర్మాణ శైలి తిరుపతి గోపురం స్ఫూర్తితో రూపొందించబడింది. న్యాయ శాఖ, సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం 16 కోర్టు హాళ్లు, మెడికల్ రూమ్వంటి సౌకర్యాలు, భవనం గ్రౌండ్ ఫ్లోర్ మరియు ఐదు అంతస్తులతో నిర్మించనున్నారు. దేశంలో మొదటిసారిగా కోర్టు సముదాయంలో ఎస్కలేటర్లు ఏర్పాటు చేయడం ద్వారా ప్రజల రాకపోకలను సులభతరం చేస్తున్నారు. కేంద్ర ప్రాంగణం చుట్టూ కోర్టు హాళ్లు ఏర్పాటు చేయడం ద్వారా సహజ కాంతి, గాలి ప్రసరణకు ప్రాధాన్యత ఇచ్చారు.
ఐదవ అంతస్తులో గ్రంథాలయం, ఆడిటోరియం, సమావేశ మందిరాలు ఏర్పాటు కానున్నాయి. ఈ వివరాలను వీడియో ద్వారా సభలో ప్రదర్శించారు. కార్యక్రమంలో హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నినాల జయసూర్య, తిరుపతి జిల్లా బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ జి.గజేంద్ర తదితరులు మాట్లాడారు. కార్యక్రమానికి హాజరైన హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ డొనాది రమేష్, జస్టిస్ మహేశ్వరరావు కుంచం, జస్టిస్ టిసిడి శేఖర్, డిఐజీ షిమోజి బాయ్, అడిషనల్ జిల్లా జడ్జి గురునాథం, తిరుపతి జిల్లా కలెక్టర్ ఎస్ వెంకటేశ్వర్, జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు, బార్ అసోసియేషన్ సభ్యులు, న్యాయాధికారులు, న్యాయవాదులు, అధికారులకు ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రినిసిపల్ జడ్జి అరుణ సారిక ధన్యవాదాలు తెలిపారు. అందరినీ శాలువాలతో సత్కరించి పూలమాలలు వేసి శ్రీవారి ప్రతిమలను బహూకరించిన సత్కరించారు.














