- కంపెనీలకు ఇచ్చే భూమికంటే రాష్ట్రానికి కలిగే ప్రయోజనం చాలాపెద్దది
- కష్టకాలంలో వెన్నంటి నిలచిన పవన్ కళ్యాణ్ నాకు జీవితాంతం పెద్దన్నే
- తిరుమల లడ్డూ కల్తీ బాధ్యులు చట్టంనుంచి తప్పించుకోలేరు
- రెడ్ బుక్లో జగన్ పేరు ఉందో, లేదో త్వరలో తెలుస్తుంది
- ఐడియాస్ ఆఫ్ ఇండియా -2026 సదస్సులో మంత్రి నారా లోకేష్
ముంబయి (చైతన్య రథం): “అభివృద్ధి చెందిన రాష్ట్రాలే దేశాన్ని బలంగా తయారుచేస్తాయి. నైతికత, విలువలు లేని అభివృద్ధికి అర్థంలేదు. వృద్ధిరేటు, పెట్టుబడులతోపాటు తదుపరి తరం విద్య కీలకపాత్ర పోషిస్తుందని నేను బలంగా నమ్ముతాను” అని రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. ముంబయిలో ఎబిపి నెట్వర్క్ ఆధ్వర్యాన ‘ఐడియాస్ ఆఫ్ ఇండియా -2026’ పేరిట నిర్వహించిన సదస్సుకు మంత్రి నారా లోకేష్ అతిధిగా హాజరయ్యారు. కార్యక్రమానికి ఎబిపి జర్నలిస్టు మేఘప్రసాద్ వ్యాఖ్యాతగా వ్యవహరించారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ… “2047నాటికి ఆంధ్రప్రదేశ్ను 2.4 ట్రిలియన్ డాలర్ల ఆర్థికవ్యవస్థగా తీర్చిదిద్దాలన్నది మా లక్ష్యం. మా ముఖ్యమంత్రి చంద్రబాబు మాట ఇస్తే అది జరిగి తీరుతుంది.
ఆయన నిర్దేశించిన లక్ష్యాన్ని అధిగమించడమే నా ముందున్న కర్తవ్యం. మాపై ఎటువంటి వత్తిడి లేదు. ఎందుకంటే, సవాళ్లను ఇష్టంగా స్వీకరిస్తాం” అన్నారు. ఫైర్ సైడ్ చాట్లో మోడరేటర్ అడిగిన ప్రశ్నలకు మంత్రి లోకేష్ సమాధానమిస్తూ… “కష్టకాలంలో వెన్నంటి నిలచిన పవన్ కళ్యాణ్ నా బిగ్ బ్రదర్. జీవితాంతం ఆయన నాకు పెద్దన్నే. ఇప్పుడు అమరావతి అనేది భవిష్యత్తు. పారిశ్రామికవేత్తలు ఇప్పుడు ఏపీకి రాలేకపోతే తర్వాత ఎందుకు రాలేకపోయామని బాధపడతారు. ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్ విషయంలో కూడా అదే జరిగింది. మీరు ప్రతి వందరోజులకోసారి అమరావతిని సందర్శించండి. అక్కడ రాజధాని నిర్మాణం ఎంతవేగంగా జరుగుతుందో చూడండి. భారతదేశం గర్వించేలా పనులు శరవేగంగా సాగుతున్నాయి” అని మంత్రి లోకేష్ స్పష్టం చేశారు.
మేం పారిశ్రామిక క్లస్టర్ల నిర్మాణం చేపడుతున్నాం
“రాజధాని పేరిట మేము కేవలం నగరాన్ని మాత్రమే నిర్మించడం లేదు. ఎకనమిక్ క్లస్టర్లను నిర్మిస్తున్నాం. విశాఖపట్నం, అమరావతి, తిరుపతి ఎకనమిక్ రీజియన్ల నిర్మాణం చేపడుతున్నాం. ఆయా రీజియన్ల పరిధిలో పారిశ్రామిక క్లస్టర్లను అభివృద్ధి చేస్తున్నాం. క్లస్టర్ అంటే ఒక సెక్టార్ను తీసుకురావడం. ఉదాహరణకు… ఎలక్ట్రానిక్స్ తయారీ. అంటే ఒక కంపెనీని తీసుకురావడం కాదు. ఫ్యాక్స్కాన్ ఐఫోన్ అసెంబుల్ చేయడంతోపాటు అవసరమైన అన్ని కాంపోనెంట్ తయారీదారులను ఒకచోటకు తీసుకురావడం. దీనిని నేను వర్టికల్ అంటాను. హారిజంటల్ అంటే నేను ప్రాతినిధ్యం వహిస్తున్న విద్యాశాఖ. ఏపీ పారిశ్రామికాభివృద్ధిలో ఈ వైబ్రంట్ క్లస్టర్లు కీలకపాత్ర వహిస్తున్నాయి. ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని, అభివృద్ధి వికేంద్రీకరణ అనే నినాదాన్ని మేం బలంగా నమ్ముతాం. క్లస్టర్ బేస్డ్ విధానం ద్వారా అభివృద్ధి వికేంద్రీకరణ సుసాధ్యం చేయవచ్చు” అని లోకేష్ ఉద్ఘాటించారు.
డేటా సెంటర్ పాలసీతో యావత్ దేశానికి ప్రయోజనం
“మేం కలెక్టివ్ ఫెడరలిజం గొప్పతనాన్ని విశ్వసిస్తాం. మేము రాజకీయంగా ప్రాంతీయ పార్టీ అయినప్పటికీ మా హృదయంలో భారతదేశం ఉంది. మా ముఖ్యమంత్రి చంద్రబాబు తన సుదీర్ఘ ప్రయాణంలో దేశాభివృద్ధికి తమవంతు సహకారాన్ని అందిస్తూ వచ్చారు. నాడు టెలికాం డీ రెగ్యులరైజేషన్ ద్వారా ప్రజలకు మేలు జరిగింది. అదేతరహాలో నేడు ఏవియేషన్ సెక్టార్లో పీపీపీ విధానానికి మా వంతు సహకారాన్ని అందిస్తున్నాం. అదేతరహాలో డాటా సెంటర్ పాలసీ కోసం మేం తీవ్రంగా ప్రయత్నించి సఫలీకృతమయ్యాం. కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్, అశ్వనీ వైష్టవ్, ప్రధాని కార్యాలయ సహకారంతో యావత్ భారతదేశానికి ప్రయోజనం చేకూర్చే ఫ్రేమ్ వర్క్ను మేం రూపొందించాం. కలెక్టివ్ ఫెడరలిజంలో ఒక రాష్ట్రంగా మేం మా వాటా హక్కులు, ఇన్సెంటివ్స్ పొందుతాం. 2024 ఎన్నికల్లో మేం తెలుగు ప్రజల హక్కులను కాపడతామని మాత్రమే చెప్పాం.
ఇచ్చిన మాట ప్రకారమే విశాఖ స్టీల్ ప్లాంట్ను కాపాడాం. స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి సుమారు 16వేలకోట్ల మేర ఆర్థికసాయం అందించాయి. మేం చేపట్టిన నిర్మాణాత్మక కృషి కారణంగా ఇప్పుడు విశాఖ స్టీల్ ప్లాంట్ లాభాల్లో పయనిస్తూ దేశాభివృద్ధికి సహకరిస్తోంది. ఇప్పుడు పారిశ్రామికవేత్తలు ఏపీని ఎంచుకోవడానికి మూడు ప్రధాన కారణాలున్నాయి. ఒకటి అద్భుతమైన ట్రాక్ రికార్డు కలిగిన, అనుభవజ్జుడైన ముఖ్యమంత్రి మా వద్ద ఉండటం. రెండవది స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. కేవలం 17 నెలల్లో దేశంలోనే అతిపెద్దదైన ఆర్సెలర్ మిట్టల్ స్టీల్ ప్లాంట్కు అన్ని అనుమతులూ ఇచ్చాం. మార్చి 3వవారంలో ఆ స్టీల్ ప్లాంట్కు శంకుస్థాపన చేయబోతున్నాం. మూడవది డబుల్ ఇంజన్ బుల్లెట్ ట్రైన్ సర్కార్. ఢిల్లీలో ప్రధాని మోడీ, ఆంధ్రప్రదేశ్లో నాయుడు. వారిద్దరి కాంబినేషన్ను నేను నమో (నాయుడు-మోడీ) అని పిలుస్తాను. ఫలితంగా మేం పెద్దఎత్తున పెట్టుబడులను రాబట్టగలుగుతున్నాం. మొత్తం భారతదేశానికి వచ్చిన పెట్టుబడుల్లో 25.3శాతం ఏపీకి రావడానికి వారి నాయకత్వమే ప్రధాన కారణం” అని మంత్రి లోకేష్ విశదీకరించారు.
భూమి విలువకంటే కంపెనీల రాకతో రాష్ట్రానికి అధిక ప్రయోజనం
“కాంపిటీటివ్ అడ్వంటేజ్లో భాగంగా మేం ఎకరా 99 పైసలకే ప్రధాన కంపెనీలకు భూములిస్తున్నాం. ఫార్చ్యూన్ 500 కంపెనీలను తీసుకొచ్చేందుకు ప్రత్యేక పాలసీ రూపొందించాం. మేము ఇచ్చే భూమికంటే ఆ కంపెనీలు సృష్టించే ఎకోసిస్టమ్ చాలా రెట్లు పెద్దది. ఉదాహరణకు కాగ్నిజెంట్ సిఇఓ రవికుమార్ను నేను దావోస్లో కలిసి మాట్లాడాను. రెండోసారి దావోస్ వెళ్లేటప్పటికీ విశాఖలో ఆ కంపెనీ భూమిపూజ చేసింది. వచ్చే ఏడాది మూడోసారి దావోస్కు వెళ్లే సమయానికి భవనాలు కూడా పూర్తవుతాయి. దీనిద్వారా విశాఖపట్నంలో మా యువతకు సుమారు 25,000 ఉద్యోగాలు వస్తాయి. ఆ కంపెనీ రాకతో ఏటా 1500 కోట్ల ఆర్థిక కార్యకలాపాలు వస్తాయి. భూమి విలువకంటే ఆ కంపెనీ ద్వారా రాష్ట్రానికి లభించే ప్రయోజనం ఖచ్చితంగా పెద్దదే. అది నా కాంపిటిటివ్ అడ్వాంటేజ్. ఎకో సిస్టమ్లు నిర్మించాలంటే కంపెనీలు, ఆసుపత్రులు, ఎంటర్టైన్మెంట్, విద్యాసంస్థలు తీసుకురావాలి. ఆంధ్రప్రదేశ్లో అలాంటి వైబ్రెంట్ ఎకోసిస్టమ్ నిర్మించాలని నేను కోరుకుంటున్నాను” అన్నారు.
ఏఐ సదస్సులో కాంగ్రెస్ తీరు సరికాదు
“ఢిల్లీలో ఏఐ సమ్మిట్లో కాంగ్రెస్ అనుసరించిన వైఖరి భారతదేశ ఇమేజ్ను మసకబార్చేలా ఉంది. ప్రపంచవ్యాప్తంగా 21దేశాల అధినేతలు అక్కడున్నారు. ప్రతిష్టాత్మక గ్లోబల్ ఫోరంపైకి రాజకీయాలను తీసుకురావడం చాలా తప్పు. కాంగ్రెస్ అలా చేసి ఉండాల్సింది కాదు. రాజకీయ పార్టీగా మేం ఖండించాం. ఆంధ్రప్రదేశ్కు పెట్టుబడులు వస్తే, మునుపటి ప్రభుత్వాల సమయంలో కూడా మేము వ్యతిరేకించలేదు. మేము ఎవరికీ లెటర్లు రాయలేదు. ఎల్లప్పుడూ పరిశ్రమలను స్వాగతించాం. ప్రభుత్వం తెచ్చిన వివిధ పాలసీలు, ఫ్రేమ్వర్క్లపై భిన్నాభిప్రాయాలుంటే పార్లమెంట్లో పోరాడవచ్చు. కానీ గ్లోబల్ ఫోరంలో దేశ ప్రతిష్టను దిగజార్చడం మంచి పద్ధతి కాదు. యుఎస్ ట్రేడ్ డీల్లో ఏర్పడిన గందరగోళం నేపథ్యంలో మేం సంక్షోభంనుంచి అవకాశాలను వెదుక్కున్నాం. ట్రేడ్ వార్ కొనసాగుతున్న నేపథ్యంలో ప్రధానమంత్రి అన్ని రాష్ట్రాలు రెగ్యులేటరీ ఫ్రేమ్ వర్క్లో మార్పులు చేసుకోవాల్సిందిగా సూచించారు. ప్రపంచంలో అతిపెద్ద ఆక్వా ఎగుమతిదారుగా ఉన్న మేము… ట్రేడ్ వార్ సందర్భంగా రైతులకు మద్దతుగా నిలిచి, కొత్త మార్కెట్లను అన్వేషించాం. రష్యా, ఉక్రెయిన్, ఆస్ట్రేలియా మార్కెట్లకు ద్వారాలు తెరిచాం. ఆ తర్వాత ట్రేడ్ డీల్ వచ్చింది. అది మొత్తం ఎకోసిస్టమ్ ఇంకా వేగంగా పెరగడానికి దోహదపడింది. అదే ఇరు ప్రాంతాలకు ప్రయోజనం కలిగించే విన్-విన్ విధానానికి దారితీసింది” అని మంత్రి లోకేష్ విశ్లేషించారు.
లడ్డూ కల్తీ బాధ్యులు తప్పించుకోలేరు
“తిరుమల లడ్డూలో 2019-24 మధ్య పెద్దఎత్తున కల్తీ జరిగిన మాట వాస్తవం. లడ్డూ తయారీలో వివిధరకాల కెమికల్ కాంపౌండ్స్ వినియోగించారు. అప్పట్లో మేం అధికారంలో లేము. జగన్ హయాంలో జరిగిన అపచారానికి రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రిగా నేను ప్రపంచవ్యాప్తంగా విస్తరించివున్న హిందూ సమాజానికి క్షమాపణ చెబుతున్నాను. తిరుమల లడ్డూతో ప్రపంచవ్యాప్త హిందూ భక్తులకు ఎమోషనల్ కనెక్టివిటీ ఉంది. ఈ ప్రసాదాన్ని స్వీకరించేటప్పుడు కూడా చెప్పులు వదిలి తీసుకుంటాం. కల్తీకారకులపై మేం కఠిన చర్యలు తీసుకుంటాం. సిట్ నివేదిక ప్రకారం మాజీ టీటీడీ చైర్మన్తో సహా ఏ ఒక్కరూ చట్టంనుంచి తప్పించుకోలేరు. రేపు ఎవరైనా ఇలాంటి క్రైమ్ చేయాలనుకుంటే వెయ్యిసార్లు ఆలోచించాలి. తిరుమలలో వరల్డ్-క్లాస్ టెస్టింగ్ ఫెసిలిటీ నిర్మిస్తున్నాం” అని వివరించారు.
రెడ్బుక్లో జగన్ పేరు ఉందో లేదో త్వరలో తెలుస్తుంది
గత ఐదేళ్లలో మా పార్టీ కార్యకర్తలు, ప్రజలపై తప్పుడు కేసులు పెట్టి వేధించారు. అలా చేసినవారి పేర్లు రెడ్ బుక్లో ఉంటాయి. లా బ్రేక్ చేసినవాళ్లు, దాన్ని ప్రేరేపించిన రాజకీయ నాయకులు, టార్చర్ చేసినవాళ్ల పేర్లు ఉంటాయి. అందులో జగన్ పేరు ఉందో, లేదో త్వరలో తెలుస్తుంది. చంద్రబాబునాయుడు టఫ్ టాస్క్మాస్టర్. 10 కేజీలు లిఫ్ట్ చేయగలిగితే 14 కేజీల టార్గెట్ ఇస్తారు. 14కిలోలు మోస్తే 18కిలోలు ఇస్తారు. దీనికి అంతం ఉండదు. ఆయన ఇచ్చిన టాస్క్ పూర్తిచేయడమే మా పని. చంద్రబాబు నాయుడు 75 ఏళ్ల యంగ్ మ్యాన్. ఆయన ఇప్పటికీ 25 ఏళ్ల యువకుడిలా పనిచేస్తారు. అతను టేబుల్కు తీసుకువచ్చే ఎనర్జీ అది. క్వాంటమ్ వ్యాలీపై మొదటిసారి నన్ను మీటింగ్కు పిలిచి దాని గురించి అడిగారు. నేను సెల్ ఫోన్లో టేబుల్ కింద చాట్ జిపిటిలో సెర్చ్ చేస్తున్నాను.
క్వాంటమ్ కంప్యూటింగ్మీద వన్-పేజ్ నోట్ ఇవ్వాలని కోరారు. స్టాన్ఫోర్డ్ ఎంబిఏ చదివినా నాకు దానిపై అవగాహన లేదు. కానీ చంద్రబాబు నాయుడుకు ఉంది. ఆయన ఆలోచనలను అందుకోవడం చాలాకష్టం. 11 ఏళ్లలోపు చిన్నారులకు సోషల్ మీడియా అందుబాటులో ఉండకూడదు. 16ఏళ్ల లోపువారికి ఏజ్-అప్రొప్రియేట్ కంటెంట్ మాత్రమే డిసెమినేట్ అవ్వాలి. ఇప్పుడు ప్రాపర్ ఫ్రేమ్వర్క్ లేకపోవడంవల్ల దీనిని అమలుచేసేందుకు సవాళ్లు ఎదురవుతున్నాయి. దీనిపై మేము పేరెంట్స్, ప్లాట్ఫామ్ ప్లేయర్స్తో మాట్లాడుతున్నాము. స్ట్రాంగ్ సేఫ్గార్డ్స్ ఉండాలి. నా సన్ నా ఫేస్బుక్ అకౌంట్ తీసుకుని బ్రౌజ్ చేయకూడదు. స్ట్రాంగ్ గార్డ్రైల్స్ క్రియేట్ చేయాలి. లేకపోతే చాలా డేంజరస్. దీనిపై మేంచేస్తున్న కసరత్తు 90 రోజుల్లో పూర్తవుతుందని నేను నమ్ముతున్నాను” అని మంత్రి లోకేష్ పేర్కొన్నారు.














