- అభివృద్ధి, సంక్షేమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే బాధ్యత మీదే
- గొడ్డలి పార్టీ ఫేక్ ప్రచారాన్ని సమర్థంగా తిప్పికొట్టండి
- ‘సర’ కారణంగా ఇంటింటికీ ప్రచారం జులై 10కి వాయిదా
- కూటమి బంధం సుదీర్ఘకాలం కొనసాగుతుంది
- టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్
- ఉత్సాహంగా అవనిగడ్డ కార్యకర్తల సమావేశం
మోపిదేవి, అవనిగడ్డ (చైతన్య రథం): గొడ్డలి పార్టీ నేతలు, గత ప్రభుత్వంలో బూతు మంత్రులు కృష్ణా జిల్లా పరువు ఎలా తీశారో, ప్రస్తుతం విషప్రచారాలు ఎలా చేస్తున్నారో ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత కేడర్పై ఉందని తెలుగుదేశం పార్టీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ కార్యకర్తలకు విజ్ఞప్తి చేశారు. మోపిదేవిలో నిర్వహించిన టీడీపీ కార్యకర్తల సమావేశంలో లోకేష్ మాట్లాడుతూ… మహనీయులు జన్మించిన ఈ జిల్లాలో గత ప్రభుత్వంలో బూతుల మంత్రి ఉండేవారు, ఒకడు కార్యకర్తలను ఇబ్బంది పెట్టేవాడు. మరొకడు భువనేశ్వరమ్మను అవమానించేవాడు. నేను ఆనాడే చెప్పా, వారి పేర్లు ఎర్రబుక్కులో రాస్తున్నా అని. వారి విషయంలో ఎవరికీ ఎటువంటి అనుమానాలు అవసరం లేదు, రెడ్ బుక్ తన పని తాను చేస్తుంది. తెలుగుదేశం పార్టీ కంచుకోట ఉమ్మడి కృష్ణా జిల్లా, ఎన్టీఆర్ జన్మించిన నేల ఇది, తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి అవనిగడ్డలో ఆరుసార్లు టీడీపీ, ఒకసారి కూటమి విజయం సాధించాయి. తెలుగుదేశం కార్యకర్తల రెక్కల కష్టంతోనే ఇది సాధ్యమైంది.
పార్టీకోసం అహర్నిశలు కష్టపడి పనిచేయాలి
కడపలో గత ఏడాది మహానాడులో ఐడియాలజీలో మార్పుకోసం ఆరు శాసనాలు తీసుకున్నాం. అందులో తొలి శాసనం కార్యకర్తే అధినేత. మొన్న ఆవిర్భావ దినోత్సవం రోజున జాతీయ అధ్యక్షుడి పక్కన టీడీపీ సాధారణ కార్యకర్తలు కూర్చున్నారు. మార్పు మన వద్ద నుంచే మొదలు కావాలి. మనం ఎవరం శాశ్వతం కాదు, తెలుగుదేశం పార్టీ శాశ్వతం. వ్యవస్థను బలోపేతం చేసేందుకు అందరం అహర్నిశలు కష్టపడాలి. తోట చంద్రయ్యను గత ప్రభుత్వంలో ప్రత్యర్థులు వారి నాయకుడికి జైకొట్టమని మెడపై కత్తిపెడితే జై తెలుగుదేశం, జై చంద్రబాబు అని ప్రాణాలు వదిలారు. గొడ్డలి పార్టీ అడ్డంకులు సృష్టించినా చట్టాన్ని సవరించాం. తోట చంద్రయ్య కుమారుడికి శాశ్వత ఉద్యోగం ఇచ్చాం. ఒక అంజిరెడ్డి తాత, మంజుల, విజయవాడలో చెన్నుపాటి గాంధీ, అనేక ప్రత్యర్థులతో అనేక అవమానాలు, వేధింపులు ఎదుర్కొన్నారు, అయినా ఎదురొడ్డి నిలబడ్డారు. గత అరాచక పాలనలో చంద్రబాబును సైతం జైలుకు పంపారు, నాపై హత్యాయత్నం, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీతో సహా 23 కేసులు పెట్టారు. తగ్గకుండా అంతా కలిసి పోరాడాం. అధికారంలోకి వచ్చాం. ప్రతిపక్షంలో ఉన్నపుడు పోరాడతాం, యుద్ధం చేస్తాం. అధికారంలోకి వచ్చాక రిలాక్స్ అయిపోతాం. కష్టకాలాన్ని మర్చిపోకూడదు. చిన్నపాటి పొరపాటు జరిగినా అలిగి ఇంట్లో పడుకుంటున్నారు. ఇది కోవిడ్ కన్నా ప్రమాదకరమైన జబ్బు. దానివల్ల నష్టపోయేది తెలుగుదేశం పార్టీ, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు.
రెండేళ్లలో ఎంతో సంక్షేమం చేశాం
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయింది. భారతదేశంలో ఎక్కడా లేనివిధంగా 4 వేల పెన్షన్ అందిస్తున్న ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్, వెస్ట్ బెంగాల్లో కేవలం వెయ్యి మాత్రమే ఇస్తున్నారు. జులై మూడో వారంలో తల్లికి వందనం రెండో విడత నగదు జమచేయబోతున్నాం. స్త్రీశక్తి కింద మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించాం, దీపం పథకం కింద ప్రతి ఏటా 3 సిలిండర్లు అందజేస్తున్నాం. అన్నదాత సుఖీభవ, అన్న క్యాంటీన్, మత్స్యకారుల సేవలో, ఆటో డ్రైవర్ల సేవలో, చేనేతలకు ఉచిత విద్యుత్ వంటి పథకాలు అందించాం. మెగా డీఎస్సీ ద్వారా పారదర్శకంగా 16 వేల టీచర్ పోస్టులు భర్తీ చేశాం. 10 వేల ఉద్యోగాలతో జాబ్ క్యాలెండర్ విడుదల చేశాం. గొడ్డలి పార్టీ అయిదేళ్ల పాలనలో కనీసం రోడ్లపై గుంతలు పూడ్చలేదు. ఆ గోతులు పూడ్చేందుకే 2 వేల కోట్లు ఖర్చయింది. కూటమి ప్రభుత్వంలో సంక్షేమం, అభివృద్ధిని జోడెద్దుల బండిలా ముందుకు తీసుకెళ్తున్నాం. యువతకు ఉద్యోగాలు కల్పించేందుకు పెట్టుబడులు, పరిశ్రమలు తెస్తున్నాం.
కార్యకర్తే అధినేత నినాదానికి కట్టుబడి ఉన్నాం
కార్యకర్తే అధినేత అనే నినాదానికి కట్టుబడి దేశంలో ఏ పార్టీ చేయని విధంగా కార్యకర్తల సంక్షేమం అమలు చేస్తున్నాం. చనిపోయిన కార్యకర్తలకు 5 లక్షల సాయం అందిస్తున్నాం. తప్పుడు కేసులన్నీ తీసివేసే బాధ్యత నేను తీసుకున్నాను. కార్యకర్తల సంక్షేమం కోసం 160 కోట్లు ఖర్చుపెట్టిన ఏకైక పార్టీ తెలుగుదేశం. కార్యకర్తలు సొంత కాళ్లపై నిలబడాలన్నదే మా ధ్యేయం. మిమ్మల్ని నిలబెట్టే బాధ్యత తెలుగుదేశం పార్టీది. క్లస్టర్ ఇన్చార్జి, యూనిట్ ఇన్చార్జిల శిక్షణా తరగతుల సందర్భంగా వైద్య పరీక్షలు నిర్వహిస్తే, 75 శాతం మందికి షుగర్, హైపర్ టెన్షన్ ఉన్నాయి. క్లస్టర్, యూనిట్, బూత్ నాయకులందరికీ పరీక్షలు చేయమని సీఎం చెప్పారు, ఆ కార్యక్రమం కూడా చేపడతాం. మీ ఆరోగ్యాన్ని మెరుగుపర్చే బాధ్యత తీసుకుంటాం. యోగాంధ్రలో చంద్రబాబు ఎంతో చురుగ్గా పాల్గొన్నారు. ఆయన స్పీడ్ అందుకోవడం కష్టం. ఆయన ప్రతిరోజూ యోగా చేస్తారు. తెలుగుదేశం పార్టీ కుటుంబం లాంటిది, చిన్నచిన్న సమస్యలు ఉంటాయి, కూర్చుని మాట్లాడుకుందాం. పార్టీలో సంస్కరణల కోసం నేను ఎంతో పోరాడాను. సమస్య ఎదురైతే పరిష్కారమయ్యేవరకు వందసార్లు పోరాడదాం. కష్టపడిన కార్యకర్తలను గుర్తించేందుకు ఇప్పుడు మై టీడీపీ యాప్ తెచ్చాం. మీరు చేస్తున్న కష్టం ఈ యాప్ ద్వారా తెలియజేయండి, యాక్టివ్గా ఉండండి. గ్రామస్థాయి నాయకుడ్ని పొలిట్ బ్యూరోలో కూర్చోబెట్టేవరకూ పోరాడాను. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈసారి క్లస్టర్ ఇన్చార్జి, మండల పార్టీ అధ్యక్షుడు పొలిట్ బ్యూరో సభ్యులు అయ్యారు. గ్రామస్థాయి నుంచి మార్పు రావాలన్నది నా లక్ష్యం. పార్టీ మనది, దీనిని కాపాడుకోవడం మన బాధ్యత. కలసికట్టుగా ముందుకు తీసుకెళ్లాలి.
తప్పుడు ప్రచారాన్ని సమర్థవంతంగా తిప్పికొట్టండి
సంక్షేమం చేపట్టినా ప్రజలకు దూరం కావడం వల్ల దేశంలో అనేక పార్టీలు ఇటీవల ఎన్నికల్లో ఓడిపోయాయి. సిద్ధాంతాలు మరిస్తే మనుగడ ఉండదు. గొడ్డలి పార్టీ సిద్ధాంతం విధ్వంసం, బూతులు, మహిళలను అవమానించడం, బలహీనులను చంపడం, దాడులు చేయడం. గొడ్డలి పార్టీకి ఎదురొడ్డి నిలబడే పార్టీ తెలుగుదేశం. వైసీపీ అబద్ధాన్ని కూడా నిజమని నమ్మించే ఫేక్ పార్టీ. డీఎస్సీ అత్యంత పకడ్బందీగా, పారదర్శకంగా నిర్వహిస్తే తప్పుడు ప్రచారం చేశారు. గతంలో డీఎస్పీ ప్రమోషన్లలో కూడా ఇదే తరహా తప్పుడు ప్రచారం చేశారు. వాళ్లు అబద్ధం చెప్పినట్లుగా మనం నిజం కూడా చెప్పలేకపోతున్నాం. అందరూ కలసికట్టుగా గొడ్డలి పార్టీ తప్పుడు ప్రచారాన్ని గ్రామ, మండల, నియోజకవర్గ స్థాయిలో సమర్థవంతంగా తిప్పికొట్టండి. ప్రతి విషయం పార్టీ చెప్పదు, మీ అంతట మీరే స్పందించాలి. ఏదైనా సమస్య నా దృష్టికి తీసుకొస్తే వింటా, సీరియస్గా తీసుకుంటా, తప్పును సరిదిద్దుకొని ముందుకెళ్తా. పార్టీ తీసుకునే నిర్ణయానికి అందరూ కట్టుబడి ఉండండి. పొరుగు జిల్లాలో గొడ్డలి పార్టీకి చెందిన మాజీ మంత్రి కొడుకుని కల్తీ మద్యం కేసులో ఈడీ అరెస్టు చేసింది. గొడ్డలి పార్టీ అయిదేళ్ల పాలనలో జే బ్రాండ్స్ కారణంగా లివర్ సిరోసిస్ 200 శాతం పెరిగింది, ఈ విషయాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లండి.
జులై 10 నుంచి ఇంటింటికీ ప్రచారం
ఇంటింటికీ ప్రచార కార్యక్రమాన్ని జులై 10వ తేదీ నుంచి ప్రారంభిస్తాం. సర్ ప్రక్రియ కొనసాగుతున్నందున ఈ కార్యక్రమాన్ని వాయిదా వేశాం. సర్ ప్రక్రియపై అలసత్వం వద్దు, ప్రతి ఓటు విలువైనది. అవనిగడ్డలో కమిటీలు పెండింగ్లో ఉన్నాయి, యుద్ధ ప్రాతిపదికన పూర్తిచేయండి. కొన్ని విషయాల్లో అధికారులు దురుసుగా ప్రవర్తిస్తున్నట్లు నా దృష్టికి వచ్చింది, 24 గంటల్లో సరిచేయాలని ఆదేశించాం. దొంగ కేసులను సహించబోను. మంత్రి, జోనల్ కోఆర్డినేటర్తో మాట్లాడాను. కార్యకర్తలను కాపాడుకోవాల్సిన బాధ్యత నాపై ఉంది. త్వరలో నియోజకవర్గానికి అందరికీ ఆమోదయోగ్యమైన ఇన్చార్జిని వేస్తా.
కూటమి బంధం దీర్ఘకాలం కొనసాగాలి
కూటమి అనేది దీర్ఘకాలంగా కొనసాగాలి, సమస్యలు పరిష్కరించే బాధ్యత మేం తీసుకుంటాం, నో మిస్ఫైర్, నో క్రాస్ఫైర్, నో విడాకులు. అంతా కూటమి ధర్మానికి కట్టుబడి ఉండాలి. ఎంత బాగా పనిచేసినా 1989లో అన్నగారిని ఓడించారు, బాబుగారిని కూడా పలుమార్లు ఓడించారు, కియా తెచ్చిన చోట ఓడిపోయాం. ఇప్పుడు టీడీపీ 3.0 నడుస్తోంది. కూటమి ప్రభుత్వం చేపట్టిన సంక్షేమం, అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్లాలి, వారితో మమేకం కావాలి. అధికారంలోకి వచ్చామన్న అహంకారం వీడాలి. కలసికట్టుగా పనిచేయాలి, ప్రజలకు అందుబాటులో ఉండాలి. పార్టీ సొంత ఇల్లు, ప్రభుత్వం కిరాయి ఇల్లు, ఇది మర్చిపోవద్దు. అందరం టీడీపీ దేవాలయానికే రావాలి, అది మర్చిపోవద్దు. ఈ సమావేశంలో కృష్ణా జిల్లా ఇన్చార్జి మంత్రి వాసంశెట్టి సుభాష్, పార్లమెంటు పార్టీ అధ్యక్షుడు వీరంకి గురుమూర్తి, సీఎంఓ కార్యక్రమాల సమన్వయకర్త, జోనల్ ఇన్చార్జి సత్యనారాయణరాజు పాల్గొన్నారు.














