- మూడు దశాబ్దాల నిరీక్షణకు తెర
- వెలిగొండ జలకళకు శ్రీకారం
- సాగు, తాగునీటికి శాశ్వత భరోసా
- ఆగస్టు 31న వెలిగొండ తొలిదశ ప్రారంభం
- 4.47 లక్షల ఎకరాలకు సాగునీరు
- 15.25 లక్షలమందికి తాగునీరు
30 మండలాలు.. 4.47 లక్షల ఎకరాలకు సాగునీరు.. 15.25 లక్షల మందికి తాగునీరు.. మార్కాపురం, ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాలకు జలభాగ్యం అందించనున్న వెలిగొండ ప్రాజెక్టు. తొలిదశలోనే 1.19 లక్షల ఎకరాలు, 4 లక్షల మందికి తక్షణ ఊరట లభించనుండగా, దశాబ్దాలుగా వేధిస్తున్న ఫ్లోరైడ్ సమస్యకు ఈ జలాలు శాశ్వత పరిష్కారం చూపనున్నాయి. వ్యవసాయ ఆర్థిక వ్యవస్థకు కొత్త ఊపునిస్తూ, నాలుగు జిల్లాల ప్రజల జీవితాల్లో శాశ్వత మార్పు తీసుకురానున్న వెలిగొండ కౌంట్డౌన్ సిరీస్లో ఇది ఆరో కథనమిది.
బాక్స్ ఐటెమ్
వెలిగొండ ప్రాజెక్టు ప్రారంభోత్సవాన్ని ప్రకటిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన సోషల్ మీడియా పోస్ట్లో భావోద్వేగంగా స్పందించారు. 30 ఏళ్ల క్రితం తాను తీసుకున్న సంకల్పం ఇప్పుడు నెరవేరిందని పేర్కొంటూ, 1996 మార్చి 5న తానే ఈ ప్రాజెక్టుకు తొలి శంకుస్థాపన చేసినట్టు గుర్తు చేసుకున్నారు. వెలిగొండ ఫేజ్-1 ద్వారా 1.19 లక్షల ఎకరాలకు, ఫేజ్-2తో 3.283 లక్షల ఎకరాలకు సాగునీరు అందించడంతోపాటు లక్షలాది మందికి తాగునీరు అందించడమే లక్ష్యమని స్పష్టం చేశారు. ఆగస్టు 31న 10.7 టీఎంసీ నీటిని నల్లమల సాగర్కు విడుదల చేయనున్నట్టు ప్రకటించిన సీఎం, మార్కాపురం జిల్లాను ఏర్పాటు చేయడం ద్వారా పశ్చిమ ప్రకాశం ప్రజల ఆకాంక్షను నెరవేర్చినట్టు తెలిపారు. దుర్భిక్ష ప్రాంతమైన మార్కాపురానికి వెలిగొండ ఒక వెలుగుల దండ అవుతుందని అభివర్ణించారు. కేవలం సాగునీరే కాకుండా ఇంటింటికీ కుళాయి కనెక్షన్ ద్వారా స్వచ్ఛమైన తాగునీరు అందించి, పశ్చిమ ప్రకాశాన్ని పట్టిపీడిస్తున్న ఫ్లోరైడ్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతామని కూడా చంద్రబాబు హామీ ఇచ్చారు.
కరవు నుంచి సస్యశ్యామలానికి.. నాలుగు జిల్లాలకు జలసిరుల వరం ..వెలిగొండతో ఆర్థిక పరివర్తన ఖాయం
వెలిగొండ ప్రాజెక్టును రెండు దశల్లో అమలు చేస్తున్నారు. తొలి దశలో ప్రధానంగా మార్కాపురం ప్రాంతానికి సాగునీరు, తాగునీరు అందించడమే లక్ష్యం. తొలిదశ పూర్తయితే సుమారు 1.19 లక్షల ఎకరాలకు సాగునీరు, దాదాపు 4 లక్షల మందికి తాగునీరు అందనుంది. ఆగస్టు 31న ప్రారంభమయ్యే జలప్రవాహం తొలుత ఈ ప్రాంతానికే చేరుతుంది కాబట్టి, మార్కాపురం ప్రజలకు ఇది తక్షణ ఊరట. శ్రీశైలం జలాశయం నుంచి 10.7 టీఎంసీ కృష్ణా వరద జలాలను నేరుగా నల్లమలసాగర్ రిజర్వాయర్కు తరలించడం ద్వారా ఈ ప్రయోజనానికి మార్గం సుగమమవుతుంది.
పూర్తి ప్రాజెక్టు: నాలుగు లక్షల ఎకరాలకు పైగా
ప్రాజెక్టు పూర్తిస్థాయిలో అమల్లోకి వస్తే సుమారు 4.47 లక్షల ఎకరాలకు సాగునీరు, 15.25 లక్షలమందికి తాగునీరు అందించాలన్నది ప్రధాన లక్ష్యం. దాదాపు 30 మండలాల్లోని కరవు, ఫ్లోరైడ్ ప్రభావిత ప్రాంతాలకు ఇది ప్రయోజనం చేకూర్చనుంది. రెండో దశలో సుమారు 3.28 లక్షల ఎకరాలకు సాగునీరు, 11.25 లక్షలమందికి తాగునీరు అందేలా ప్రణాళిక రూపొందించారు. అంటే తొలి దశతో పోలిస్తే, రెండోదశ పూర్తయ్యేనాటికి ప్రయోజనం పొందే ప్రాంతాల విస్తీర్ణం, జనాభా గణనీయంగా పెరుగుతాయి.
జిల్లాల వారీగా ప్రయోజనం
మార్కాపురం: తొలిదశలో ప్రధాన లబ్ధిదారు ఈ ప్రాంతమే. సుమారు 1.19 లక్షల ఎకరాలకు సాగునీరు, నాలుగు లక్షలమందికి తాగునీరు అందించాలన్న లక్ష్యం ఈ ప్రాంత వ్యవసాయ, తాగునీటి సమస్యలకు కీలక పరిష్కారం కానుంది. దుర్భిక్ష ప్రాంతంగా పేరున్న మార్కాపురానికి వెలిగొండ జలాలు కొత్త వెలుగును తీసుకువస్తుందన్న కాంక్ష ప్రభుత్వానిది, ప్రజలది. ఇక్కడి ప్రజల చిరకాల ఆకాంక్షను నెరవేర్చేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా మార్కాపురం జిల్లాను కూడా కొత్తగా ఏర్పాటు చేసింది. తద్వారా పరిపాలనాపరంగానూ ఈ ప్రాంతానికి ప్రాధాన్యం లభించింది.
ప్రకాశం (పశ్చిమ ప్రాంతం): వెలిగొండ ఈ ప్రాంతానికి జీవనాడిగా మారనుంది. కరవు తీవ్రత తగ్గడంతోపాటు వ్యవసాయ భూములకు స్థిరమైన నీటి వనరు లభిస్తుంది. జిల్లాలోని ఎగువ ప్రాంతాల్లో తాగునీటి సమస్య కూడా తగ్గే అవకాశముంది. దశాబ్దాలుగా ఈ ప్రాంతాన్ని పట్టిపీడిస్తున్న ఫ్లోరైడ్ సమస్యకు వెలిగొండ జలాలు శాశ్వత పరిష్కారం చూపుతాయని ప్రభుత్వం భరోసా ఇస్తోంది. ఇంటింటికీ కుళాయి కనెక్షన్ ద్వారా స్వచ్ఛమైన తాగునీరు అందించడం ద్వారా ప్రజారోగ్యపరంగా కూడా ఈ ప్రాంతానికి దీర్ఘకాలిక ప్రయోజనం చేకూరనుంది.
నెల్లూరు: ప్రాజెక్టు రెండో దశ ద్వారా నెల్లూరు జిల్లాలోని ఎగువ, కరవు ప్రభావిత మండలాలకు సాగు, తాగునీటి ప్రయోజనం అందుతుంది. శ్రీశైలం ఎగువ ప్రాంతం నుంచి తరలించే జలాలు, పోలవరం ద్వారా కృష్ణా డెల్టాకు అందే నీటితో కలిపి చూస్తే, భవిష్యత్తులో నెల్లూరువంటి దిగువ జిల్లాలకూ నీటి భద్రత మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.
వైఎస్సార్ కడప: ఈ జిల్లాలోని కరవు, ఫ్లోరైడ్ ప్రభావిత ప్రాంతాలకు వెలిగొండ నీరు అత్యంత కీలకం. తాగునీటి భద్రత పెరగడంతోపాటు సాగు విస్తీర్ణం పెరిగే అవకాశముంది. ప్రాజెక్టు రూపకల్పనలోనే కడపను ప్రధాన లబ్ధిదారుగా చేర్చారు. రాయలసీమలోని ఈ జిల్లాకు వెలిగొండ జలాలు చేరడం, భవిష్యత్తులో రాయలసీమ మొత్తానికి విస్తరించే జల భద్రత విజన్లో ఒక కీలక అడుగుగా అధికారులు అభివర్ణిస్తున్నారు.
వ్యవసాయ ఆర్థిక వ్యవస్థలో మార్పు
నీరు వచ్చిన ప్రాంతంలో కేవలం పంటలు మాత్రమే పెరగవు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ మొత్తం మారుతుంది. పంటల విస్తీర్ణం పెరుగుతుంది, రైతుల ఆదాయానికి స్థిరత్వం వస్తుంది. పాడి పరిశ్రమ, వ్యవసాయ ఆధారిత ఉపాధి, చిన్న వ్యాపారాలు, రవాణా, మార్కెటింగ్వంటి రంగాలకు ఊతం లభిస్తుంది. ఇప్పటివరకు వర్షాధార వ్యవసాయంపైనే ఆధారపడిన రైతులు, నీటి లభ్యతతో పంటల ఎంపికలో మరింత స్వేచ్ఛ పొందే అవకాశం ఉంటుంది.
భూగర్భజలాలపై ఒత్తిడి తగ్గుదల
ఉపరితల జలాలు అందుబాటులోకి రావడంతో బోర్లు, భూగర్భ జలాలపై ఆధారపడటం తగ్గుతుంది. దీనివల్ల విద్యుత్ వినియోగంపై ఒత్తిడి కూడా తగ్గే అవకాశముంది. ముఖ్యంగా వేసవిలో బోర్లు ఎండిపోయే ప్రాంతాల్లో ఇది గణనీయమైన ఉపశమనం కలిగిస్తుంది.
ఫ్లోరైడ్ ప్రాంతాలకు ఆరోగ్య భరోసా
ఈ ప్రాంతాల్లో అనేకచోట్ల ఫ్లోరైడ్ ప్రభావిత భూగర్భజలాలే తాగునీటి ప్రధాన వనరుగా ఉన్నాయి. వెలిగొండ ద్వారా సురక్షితమైన ఉపరితల జలాలు అందుబాటులోకి వస్తే, ప్రజారోగ్యపరంగా దీర్ఘకాలిక ప్రయోజనం చేకూరనుంది. అందుకే వెలిగొండను కేవలం సాగునీటి ప్రాజెక్టుగా కాకుండా, తాగునీటి భద్రతకు, ప్రజారోగ్యానికి సంబంధించిన ప్రాజెక్టుగా కూడా చూడాల్సి ఉంటుంది.
జల్ జీవన్ మిషన్తో అనుసంధానం
మార్కాపురం జిల్లా పరిధిలోని ప్రతి ఇంటికీ జల్ జీవన్ మిషన్ ద్వారా నల్లా కనెక్షన్ ఇచ్చి సురక్షిత తాగునీరు అందిస్తామని ముఖ్యమంత్రి ఇప్పటికే హామీ ఇచ్చారు. వెలిగొండ జలాలను ఈ కేంద్ర పథకంతో అనుసంధానించడం ద్వారా, ప్రతి గ్రామీణ కుటుంబానికి కుళాయి ద్వారా నీరు అందించే లక్ష్యం మరింత సులభతరం కానుంది.
భవిష్యత్తు దృష్టితో ప్రణాళిక
కేవలం ప్రస్తుత అవసరాలే కాకుండా, భవిష్యత్తులో ఈ ప్రాంతాల జనాభా, వ్యవసాయ అవసరాలు పెరిగే అవకాశాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రాజెక్టును రెండు దశల్లో రూపొందించారు. తొలి దశ తక్షణ అవసరాలను తీరిస్తే, రెండో దశ దీర్ఘకాలిక భద్రతను కల్పిస్తుంది. మొత్తంగా చూస్తే, నాలుగు జిల్లాల్లోని 30 మండలాల ప్రజల జీవితాల్లో వెలిగొండ శాశ్వత మార్పు తీసుకురానుంది.














