- ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం
- ఉద్యోగాల కేటాయింపునకు ఆమోదం
- సింగిల్ టైంలో పన్ను సెటిల్మెంట్లు
- పీఎన్జీ కనెక్షన్ల పెంపునకు నిర్ణయం
- వడ్డెరలకు ఖనిజ లీజులు
- జలవనరుల శాఖలో వివిధ ప్రాజెక్టుల ఆధునీకరణ
- రాజధాని చరిత్రను ప్రజలకు చెప్పాలన్న సీఎం చంద్రబాబు
అమరావతి (చైతన్య రథం): రాష్ట్ర రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే దిశగా రాష్ట్ర మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన గురువారం మంత్రిమండలి సమావేశమైంది. రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ.. ఏపీ పునర్విభజన చట్టం 2014లోని సెక్షన్-5ను సవరించాల్సిందిగా మంత్రివర్గం తీర్మానం చేసింది. కొత్త రాజధాని స్థానంలో అమరావతి పేరును చేర్చాలని ప్రభుత్వం భావిస్తోంది. అంతేకాకుండా నీరుకొండలో ఎసఆరఎం వర్సిటీ, 60 మీటర్ల ఎత్తువరకు అకడమిక్ భవనాల నిర్మాణానికి క్యాబినెట్ అనుమతి ఇచ్చింది. మంత్రిమండలి ఆమోదించిన సమావేశ వివరాలను సమాచార, పౌర సంబంధాల మంత్రి కొలుసు పార్థసారథి బ్రీఫింగ్ ఇచ్చారు. సీఆర్డీఏ పరిధిలోని అమరావతిని రాష్ట్ర రాజధానిగా చేర్చాలని మంత్రివర్గం తీర్మానించింది. భవిష్యత్తులో ఎవరూ రాజకీయ కారణాలతో రాజధానిని మార్చకుండా ఉండేందుకు అసెంబ్లీలో కూడా ప్రత్యేక తీర్మానం చేయాలని నిర్ణయించింది. గత వైసీపీ ప్రభుత్వం మూడు రాజధానుల పేరుతో అమరావతిని దెబ్బతీసిందని విమర్శించిన మంత్రి, ఇప్పుడు శాశ్వత రాజధానిగా అమరావతిని అభివృద్ధి చేయడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. అమరావతిని రాష్ట్ర ఆర్థిక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు.
ఉద్యోగాల కేటాయింపునకు ఆమోదం
ఇక న్యాయ వ్యవస్థ బలోపేతానికి హైకోర్టు సూచనల మేరకు 96 కొత్త కోర్టుల ఏర్పాటు, 1730 ఉద్యోగాల కేటాయింపునకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఈ నియామకాలను జాబ్ క్యాలెండర్లో చేర్చాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. వడ్డెర సొసైటీలకు 15 శాతం క్వారీ లీజులు కేటాయిస్తూ, సీనరేజీపై 50 శాతం రాయితీ ఇవ్వాలని నిర్ణయించారు. కుప్పంలో మహాత్మా జ్యోతిబా పూలే రెసిడెన్షియల్ స్కూల్లో సిబ్బంది నియామకానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
సింగిల్ టైం సెటిల్మెంట్
పట్టణాల్లో పెండింగ్ పన్ను బకాయిల పరిష్కారానికి సింగిల్ టైం సెటిల్మెంట్ విధానానికి ఆమోదం తెలిపారు. అదే సమయంలో పోలవరం ప్రాజెక్ట్కు సంబంధించి పునరావాస భూముల విలువ పెంపుతోపాటు, ఎకరాకు పరిహారం రూ.10 లక్షలనుంచి రూ.12 లక్షలకు పెంచారు. ఇందుకు రూ.565 కోట్లు అవసరమవుతాయని అంచనా వేశారు. అలాగే పోలవరం లిఫ్ట్ స్కీమ్ పనుల కొనసాగింపుకు అనుమతి ఇచ్చిన మంత్రివర్గం, కర్నూలు జిల్లా గురు రాఘవేంద్ర ప్రాజెక్ట్లో లిఫ్ట్ ఇరిగేషన్ పథకాలకు నిధులు మంజూరు చేసింది.
పీఎన్జీ కనెక్షన్లు పెంపు
పట్టణాల్లో పైప్డ్ నేచురల్ గ్యాస్ కనెక్షన్లను 9 లక్షల వరకు పెంచేలా చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది. పీఎన్జీ వినియోగదారులకు దీపం పథకం కింద రాయితీలు కొనసాగించనున్నారు. రాష్ట్రంలో పెరుగుతున్న బస్సు ప్రమాదాలపై కూడా క్యాబినెట్ చర్చించి రోడ్ల నాణ్యత, వాహనాల అనుమతులపై కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు.
అగ్ని ప్రమాదాలపై విచారణ
ఇక అమరావతిలో ఇటీవల జరిగిన అగ్ని ప్రమాదాలపై ప్రభుత్వం అనుమానం వ్యక్తం చేస్తూ విచారణకు ఆదేశించింది. కొన్ని ఘటనలు ఉద్దేశపూర్వకంగా జరిగి ఉండొచ్చని భావిస్తున్నట్టు మంత్రి పేర్కొన్నారు. మొత్తానికి, అమరావతిని శాశ్వత రాజధానిగా నిలబెట్టడమే కాకుండా, రాష్ట్ర అభివృద్ధికి కేంద్రంగా మార్చడంపై ప్రభుత్వం దృష్టి సారించినట్లు స్పష్టం చేశారు.
కేబినెట్లోని ముఖ్య నిర్ణయాలు:
రాష్ట్రంలో 96 జూనియర్, సీనియర్ సివిల్ జడ్జిల కోర్టుల ఏర్పాటుకు ఆమోదం
వడ్డెర సంఘాలకు ప్రాధాన్యక్రమంలో ఖనిజ లీజులు కేటాయింపులపై చర్చ
ఖనిజ లీజుల కేటాయింపులో ప్రీమియం, సీనరేజ్ ఫీజుల్లో 50శాతం రాయితీ
కుప్పం బాలికల పాఠశాలలో పీఈటీ, నర్సు, రికార్డు అసిస్టెంట్ పోస్టుల మంజూరుకు ఆమోదం
2025-26 ఆర్థిక సంవత్సరానికి ఆస్తి పన్ను బకాయిలపై వడ్డీ మాఫీ
జలవనరుల శాఖలో వివిధ ప్రాజెక్టుల ఆధునికీకరణ, మరమ్మతులకు పరిపాలన అనుమతులు
వివిధ సంస్థలకు భూ కేటాయింపులపై నిర్ణయం తీసుకున్న రాష్ట్ర మంత్రివర్గం
ఎలక్ట్రిక్ ఛార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయాలని మంత్రి వర్గం నిర్ణయం.
కొత్త రాజధానిగా సీఆర్డీఏ చట్టం పరిధిలోని అమరావతి పేరు చేర్చాలని క్యాబినెట్ తీర్మానించింది. శనివారం అసెంబ్లీలో 4 గంటలపాటు చర్చించి తీర్మానించాలని నిర్ణయించింది. రాజధాని చరిత్రను ప్రజలకు తెలియజేయాలని సీఎం చంద్రబాబు క్యాబినెట్కు సూచించారు. క్యాబినెట్ సమావేశంలో భాగంగా విద్యుత్ వ్యవస్థపై ఆయన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఏప్రిల్ 5నుంచి 14 లోపు ప్రతి నియోజకవర్గంలో 2 వేల చొప్పున సూర్యఘర్ కనెక్షన్లు ఇవ్వాలని నిర్ణయించారు. పీఎం కుసుమ్ ద్వారా పవర్ లాస్లు తగ్గించేలా చూడాలని దిశానిర్దేశం చేశారు. బ్యాటరీ స్టోరేజ్ వ్యవస్థల్ని 33/11 కేవీ సబ్ స్టేషన్లవద్ద ఏర్పాటు చేయాలని ఆదేశించారు. సాంకేతికతను అందిపుచ్చుకుంటూ సంస్కరణలు తీసుకొస్తూ విద్యుత్ శాఖ ముందుకెళ్లాలని సూచించారు. ఆదాయంలో 99శాతం జీతాలకే సరిపోతోంది. కేంద్ర సాయం అప్పులు, వడ్డీలు కట్టేందుకే సరిపోతోంది. క్లిష్టపరిస్థితుల్లోనూ సంక్షేమం అందిస్తూ అభివృద్ధి దిశగా నడిపిస్తున్నాం. కేంద్ర పథకాలను ఎక్కువగా మనం ఉపయోగించుకుంటున్నాం. ఈ పార్లమెంట్ భేటీలోనే రాజధానిగా అమరావతి చట్టబద్ధత సవరణ బిల్లు పెడతారు” అని సీఎం చంద్రబాబు అన్నారు.












