మరిన్ని పెట్టుబడులు వచ్చేందుకు ఇలాంటి అవార్డులు రావాలి: సీఎం చంద్రబాబు
ఈ అవార్డును టీమ్ ఏపీకి అంకితమిస్తున్నట్టు ప్రకటన
అమరావతి (చైతన్య రథం): బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ద ఇయర్ -2025 అవార్డు సాధించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు 7వ కలెక్టర్ల కాన్ఫరెన్స్ అభినందనలు తెలిపింది. గురువారం కలెక్టర్ల కాన్ఫరెన్స్ సమావేశానికి హాజరైన సీఎం చంద్రబాబుకు మంత్రులు, వివిధ శాఖల ఉన్నతాధికారులు, జిల్లా కలెక్టర్లు స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ… “మంత్రులు, సీఎస్ మొదలుకుని… గ్రామస్థాయి అధికారి వరకు పని చేయడంవల్లే ఈ అవార్డు దక్కింది. బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ద ఇయర్ పురస్కారం మనందరి సమష్టి కృషి. రెండేళ్ల క్రితం రాష్ట్రం గురించి ఏం మాట్లాడారు… ఇప్పుడు ఏం మాట్లాడుకుంటున్నారు అనే దానికి ఈ అవార్డు ఉదాహరణ. గతంలో ఇలాంటి అవార్డులు తీసుకోవడానికి ఇష్టపడేవాడిని కాదు. కానీ ఇప్పుడు ఇలాంటి అవార్డులు మరిన్ని రావాలని కోరుకుంటున్నాను. ఎన్ని అవార్డులు వస్తే, రాష్ట్రానికి అంత గుర్తింపు దక్కుతుంది. మరిన్ని పెట్టుబడులు వస్తాయి. అందుకే మరిన్ని అవార్డులను మనం సాధించాలని కోరుకుంటున్నాను. ఈ అవార్డును టీమ్ ఏపీకి అంకితమిస్తున్నాను” అని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు.














