- పౌల్ట్రీ, హర్టీకల్చర్ రంగాల్లో సంక్షోభం తలెత్తకుండా కార్యాచరణ
- గల్ఫ్లోని ప్రవాసాంధ్రుల క్షేమ సమాచారాలపై నిరంతర ఆరా
- ఉగాదికి 2.5 లక్షల సామూహిక గృహ ప్రవేశాలు
- సీసీ కెమెరా నెట్వర్క్ ద్వారా నేర నియంత్రణ ప్రణాళిక
- రియల్ టైమ్ గవర్నెన్స్పై సీఎం చంద్రబాబు సమీక్ష
అమరావతి (చైతన్య రథం): ఇరాన్ యుద్ధ ప్రభావంపై ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటూ తగిన నిర్ణయాలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. గల్ఫ్ దేశాలతో ఉన్న అన్ని అంశాలూ ప్రభావితమయ్యే అవకాశం ఉంటుందని, వాటివల్ల సంక్షోభం తలెత్తకుండా ముందస్తుగా చర్యలు చేపట్టాలని ఆయన స్పష్టం చేశారు. సచివాలయంలోని ఆర్టీజీఎస్ కేంద్రంలో మంగళవారం వివిధ అంశాలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఎల్పీజీ, గుడ్లు, అరటి వంటి వాటి ఎలాంటి ప్రభావం ఉందోననే అంశంపై నిరంతరం పరిశీలించాలని సీఎం సూచించారు. యుద్ధ ప్రభావిత దేశాలతోపాటు ఇతర ప్రాంతాల్లో తెలుగువారున్న చోట పరిస్థితిని ఎప్పటికప్పుడు గుర్తించి తగిన చర్యలు చేపట్టాలన్నారు. విదేశాంగ వ్యవహారాల శాఖతో సంప్రదించి ప్రవాసాంధ్రుల క్షేమంగా ఉండేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. దీనికి సంబంధించి రియల్ టైమ్ గవర్నెన్సు కేంద్రంతోపాటు ఉన్నతాధికారులు ఓ బృందంగా ఏర్పడి ఎప్పటికప్పుడు పరిస్థితిని అంచనా వేయాలని సూచించారు.
అంతకుముందు రాష్ట్రవ్యాప్తంగా విద్యుత్ పంపిణీ సంస్థలు అందిస్తున్న పౌర సేవలు, విద్యుత్ సరఫరా, పాఠశాల, ఉన్నత విద్య, ఇసుక సరఫరాలాంటి అంశాలపై ముఖ్యమంత్రి అధికారులతో సమీక్షించారు. ప్రస్తుత ఏడాదిలో విద్యుత్ వినియోగం గరిష్టంగా 14,013 మెగావాట్లకు చేరుకుందని అధికారులు వివరించారు. విద్యుత్ విషయంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు ఎనర్జీ ఆడిట్ నిర్వహించి నివేదిక ఇవ్వాలని ముఖ్యమంత్రి డిస్కంలను ఆదేశించారు. ఈ విషయంలో వినియోగదారులకు పూర్తి సమాచారం ఇచ్చేలా చర్యలు చేపట్టాలని డిస్కంలకు సూచించారు. అటు పాఠశాల, కళాశాల విద్యకు సంబంధించిన అంశాల్లో సిలబస్, మధ్యాహ్న భోజనం, పరిశుభ్రమైన తరగతి గదులువంటి అంశాలపై దృష్టి పెట్టాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. తృణ ధాన్యాలతో చిక్కీలాంటి పౌష్టికాహారం అందించే అంశాన్ని ప్రయోగాత్మకంగా చేపట్టాలని అధికారులకు సూచించారు.
డీజీసీఏ సహకారంతో డ్రోన్ పైలట్ ట్రైనింగ్ సెంటర్
ఉగాది రోజున 2.5 లక్షలమంది లబ్దిదారుల సామూహిక నూతన గృహ ప్రవేశ కార్యక్రమం చేపడుతున్నామని, వారికి ప్రభుత్వం తరపునుంచి స్థానిక ప్రజాప్రతినిధులు అందించేలా అధికారిక లేఖ వెళ్లేలా చూడాలన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వం నిర్దేశించిన ధరకే ఇసుక సరఫరా జరగాలని సీఎం స్పష్టం చేశారు. దీనిపై ప్రజలనుంచి వచ్చిన ఫిర్యాదులను తక్షణం పరిష్కరించాలని సీఎం సూచించారు. ఇటీవల ఢిల్లీలోని ఏఐ ఇంపాక్ట్ ఇండియా సమ్మిట్లో కుదుర్చుకున్న ఒప్పందాలు సాకారమయ్యేలా త్వరితగతిన చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు. ఏఐ లివింగ్ ల్యాబ్స్ ఏర్పాటుకు భారత్ జెన్, నెక్స్ జెన్, ఐబీఎంలాంటి సంస్థలు ముందుకొచ్చాయని, వచ్చే విద్యా సంవత్సరంనుంచే కోర్సులు ప్రారంభమయ్యేలా చర్యలు చేపట్టాలని సీఎం ఆదేశించారు. అటు కాలిబో సంస్థ ఏర్పాటు చేయదలచిన ఏఐ శాండ్ బాక్స్ వచ్చే నాలుగు నెలల్లో స్టార్టప్ల కోసం అందుబాటులోకి వచ్చేలా చూడాలన్నారు. ఎన్విడియా సంస్థ రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్తో భాగసామ్యం వహించేలా చూడాలని ఆదేశించారు. రాష్ట్రంలో ప్రతీ రైతుకూ సహకారం అందించేలా ఏఐ ఆగ్రానమిస్ట్, విద్యా బోధనకు సహకారం అందించేలా ఏఐ ట్యూటర్, ప్రాథమికంగా వైద్య సలహాలు అందించేలా ఏఐ డాక్టర్ సేవలు అందేలా చర్యలు చేపట్టాలన్నారు.
పేషెంట్ ప్రిస్క్రిప్షన్ కూడా యాప్ ద్వారా వచ్చేలా చూడాలన్నారు. సీసీ టీవీ యాప్ ద్వారా రాష్ట్రవ్యాప్తంగా 14 వేల సీసీ కెమెరాలను అనుసంధానించి నేర నియంత్రణ చేపట్టేలా చూడాలన్నారు. నేరస్థులను గుర్తించి నేరాలకు అడ్డుకట్టే వేసేలా చర్యలు చేపట్టాలన్నారు. ఓర్వకల్లులో డ్రోన్ సిటీని త్వరితగతిన అందుబాటులోకి తేవటంతోపాటు.. డ్రోన్ ప్లైయింగ్ ట్రాక్ సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు. రిమోట్ పైలట్ ట్రైనింగ్ సెంటర్ కూడా ఏర్పాటుచేసి శిక్షణ ఇవ్వాలన్నారు. డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ సహకారంతో అత్యుత్తమ శిక్షణా కేంద్రాలను ఏర్పాటు చేయాలని సీఎం దిశానిర్దేశం చేశారు. ఏటీసీ తరహాలోనే డ్రోన్ ట్రాఫిక్ కంట్రోల్ వ్యవస్థను రూపొందించాలన్నారు. వాట్సాప్ గవర్నెన్సు వినియోగం మరింత పెంచేలా పౌరులకు శిక్షణనిచ్చే కార్యక్రమాన్ని చేపట్టాలని సీఎం సూచించారు. సమీక్షకు మంత్రి కొలుసు పార్థసారథి, సీఎస్ సాయిప్రసాద్, ఐటీ, ఆర్టీజీఎస్, గనులు, విద్య, ఆర్ధిక, ప్రణాళిక శాఖల అధికారులు హాజరయ్యారు.















