- విశాఖలో ఓపీఎస్ ఉద్యోగుల కృతజ్ఞతాభివందన సభ
- పాల్గొన్న ప్రభుత్వ విప్ వేపాడ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు
విశాఖపట్నం (చైతన్య రథం): మంచి చేసిన వారికి కృతజ్ఞతలు తెలిపే గొప్ప సంప్రదాయానికి ఉత్తరాంధ్ర ఉద్యోగులు తెరతీసి రాష్ట్రానికి ఆదర్శంగా నిలిచారని శాసనమండలి ప్రభుత్వ విప్ డాక్టర్ వేపాడ చిరంజీవిరావు అన్నారు. సీపీఎస్ నుంచి ఓపీఎస్కు మారిన ఉత్తరాంధ్ర ఉద్యోగుల ఆధ్వర్యంలో ఆదివారం విశాఖపట్నంలోని స్వర్ణభారతి ఇండోర్ స్టేడియంలో కృతజ్ఞతాభివందన సభ ఘనంగా నిర్వహించారు. రాష్ట్రంలోని వేలాది మంది ప్రభుత్వ ఉద్యోగుల చిరకాల ఆకాంక్షను నెరవేర్చుతూ పాత పెన్షన్ విధానాన్ని అమలు చేసినందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ఉద్యోగులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శాసనమండలి ప్రభుత్వ విప్ డాక్టర్ వేపాడ చిరంజీవిరావు, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు, విశాఖ తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు, విశాఖ ఉత్తర ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు, పట్టభద్రుల ఎమ్మెల్సీలు ఆలపాటి రాజా, కంచర్ల శ్రీకాంత్, పేరాబత్తుల రాజశేఖర్ పాల్గొన్నారు. ఏపీ డీఎస్సీ ఫోరం, నోబుల్ టీచర్స్ అసోసియేషన్, పీఆర్టీయూ, ఏపీటీఎఫ్ తదితర ఉద్యోగ సంఘాల ఆధ్వర్యంలో ఓపీఎస్ లబ్ధి పొందిన ఉద్యోగులు తొలుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం చేసి కృతజ్ఞతలు తెలిపారు. ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి ఉద్యోగులు తమ కుటుంబ సభ్యులతో కలిసి సుమారు 15 వేల మంది సభకు హాజరయ్యారు. ‘థాంక్యూ సీఎం సార్’ అంటూ ఉద్యోగులు చేసిన నినాదాలతో సభా ప్రాంగణం మార్మోగింది.
ఉద్యోగుల కుటుంబాలకు ఆర్థిక భద్రత
శాసనమండలి ప్రభుత్వ విప్ డాక్టర్ వేపాడ చిరంజీవిరావు మాట్లాడుతూ ఉద్యోగులకు పదవీ విరమణ ఉన్నా, వారి కుటుంబాలకు పదవీ విరమణ ఉండదన్నారు. పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయడం ద్వారా 11 వేల కుటుంబాలకు కూటమి ప్రభుత్వం ఆర్థిక భద్రత కల్పించిందని తెలిపారు. 2019-24 మధ్య రాష్ట్రంలో పాలన అస్తవ్యస్తంగా సాగిందని విమర్శించారు. గత ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ ఉద్యోగులు డీఏలు, వైద్య బిల్లుల కోసం ఇబ్బందులు ఎదుర్కొన్నారన్నారు. ఉపాధ్యాయుల వేతనాలను రెవెన్యూ ఉద్యోగులతో సమానంగా పెంచిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుదేనని పేర్కొన్నారు. 2004 నోటిఫికేషన్ ద్వారా ఉద్యోగాలు పొంది, సాంకేతిక కారణాలతో 2004 తర్వాత విధుల్లో చేరిన ఉద్యోగులకు ఓపీఎస్, ఫ్యామిలీ పెన్షన్, గ్రాట్యుటీ కల్పించిన ఘనత కూడా చంద్రబాబు నాయుడుకే దక్కుతుందని అన్నారు. రాష్ట్రం సింగపూర్ తరహాలో అభివృద్ధి చెందాలంటే సిరమైన పాలన అవసరమని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ సర్వతోముఖాభివృద్ధి సాధించేందుకు కూటమి ప్రభుత్వానికి ఉద్యోగులు, ఉపాధ్యాయులు అండగా నిలవాలని కోరారు. ప్రభుత్వ ఉద్యోగులు ప్రభుత్వంలో భాగస్వాములని, రాష్ట్ర అభివృద్ధిలో తమ వంతు పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు.
ఉద్యోగుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది
టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రజల కోసం సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల అమలులో ఉద్యోగులు, ఉపాధ్యాయుల భాగస్వామ్యం కీలకమన్నారు. ఉద్యోగుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. పరిపాలనలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు అపారమైన అనుభవం ఉందని, భవిష్యత్ తరాలకు మెరుగైన రాష్ట్రాన్ని అందించేందుకు ఉద్యోగులు, ఉపాధ్యాయులు ప్రభుత్వానికి సహకరించాలని కోరారు. విశాఖ ఉత్తర ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో ఉపాధ్యాయులను మద్యం దుకాణాల వద్ద క్యూలైన్ల నియంత్రణకు వినియోగించి అవమానించారని అన్నారు. విశాఖ తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు మాట్లాడుతూ ఉద్యోగులకు మేలు చేసే ప్రతి కార్యక్రమానికి కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు. ఉత్తరాంధ్ర ప్రజాప్రతినిధులుగా తామంతా సమన్వయంతో పనిచేస్తూ ఉద్యోగులకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటామని అన్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీలు ఆలపాటి రాజా, కంచర్ల శ్రీకాంత్, పేరాబత్తుల రాజశేఖర్ మాట్లాడుతూ ఉద్యోగులు, ఉపాధ్యాయుల సమస్యలను ప్రభుత్వ విప్ డాక్టర్ వేపాడ చిరంజీవిరావు నాయకత్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు.
‘చంద్రబాబు మాకు పునర్జన్మ ఇచ్చారు’
పలువురు ఓపీఎస్ ఉద్యోగులు మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తమకు పాత పెన్షన్ విధానం ద్వారా పునర్జన్మ ఇచ్చారని కృతజ్ఞతలు తెలిపారు. సభలో ఓ ఉద్యోగి ఆరేళ్ల కుమార్తె మాట్లాడుతూ, ‘పెన్షన్ రావడంతో మా నాన్న చాలా సంతోషంగా ఉన్నారు. రోజూ పెన్షన్ ఇస్తే బాగుంటుంది’ అని అమాయకంగా చెప్పడంతో సభా ప్రాంగణం చప్పట్లతో మార్మోగింది. ఈ సందర్భంగా ఉద్యోగులు అతిథులను శాలువాలు, జ్ఞాపికలతో సత్కరించారు. ఉద్యోగ సంఘాల నేతలు ఎం. శ్రీనివాసరావు, గోపినాథ్, ఆర్. అప్పలరాజు, కేఎల్ ప్రసాద్, బలగ శ్రీనివాస్, సుబ్బారెడ్డి, డాక్టర్ బి. గోవింద నాయుడు తదితరులు పాల్గొని ముఖ్యమంత్రి, కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.















