- విద్యావ్యవస్థలో మార్పునకు ఉపాధ్యాయులు నాయకత్వం వహించాలి
- కష్టపడి మంచి ఫలితాలు సాధించే ఉపాధ్యాయులకు గుర్తింపునిస్తాం
- విద్యావ్యవస్థలో సంస్కరణల వల్లే ప్రైవేటునుంచి లక్షమంది చేరిక
- అందరం కలిసికట్టుగా ఏపీ మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్ సాధిద్దాం
- విద్యారంగంలో ఆంధ్రప్రదేశ్ను నెం.1గా నిలబెడదాం
- సింగపూర్ అధ్యయన యాత్రకు వెళ్లిన టీచర్లతో మంత్రి లోకేష్ భేటీ
అమరావతి (చైతన్య రథం): రాష్ట్రంలో చంద్రబాబు నాయుడి ప్రజా ప్రభుత్వం టీచర్లను లీడర్లుగా భావిస్తోందని, కష్టపడి మంచి ఫలితాలు సాధించే ఉపాధ్యాయులకు ప్రత్యేక గుర్తింపునిస్తామని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. ఇటీవల సింగపూర్ అధ్యయన యాత్రకు వెళ్లిన 37మంది ఉత్తమ ఉపాధ్యాయులతో మంత్రి లోకేష్ ఉండవల్లి నివాసంలో సమావేశమయ్యారు. సింగపూర్ అధ్యయన యాత్రలో తాము తెలుసుకున్న అంశాలు, రాష్ట్రంలో వాటిని అమలు చేయడానికి అవకాశాలను వారు మంత్రికి వివరించారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ… ఉపాధ్యాయులు సమాజంలో మార్పునకు నాయకత్వం వహించే లీడర్లని అన్నారు. విద్య ద్వారానే సమాజంలో మార్పు సాధ్యమవుతుంది. అందుకోసమే నేను పట్టుదల, కమిట్మెంట్తో విద్యాశాఖను తీసుకున్నాను. ప్రపంచంలో అత్యుత్తమ మోడల్ విద్యావిధానం కోసం అధ్యయనం చేస్తున్నాం అని చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆశించిన స్వర్ణాంధ్ర సాధనలో విద్యాశాఖ కీలకపాత్ర వహిస్తుంది. క్వాంటమ్, ఏఐవంటి అధునాతన సాంకేతికతలు అమలు చేయడం విద్యాశాఖ ద్వారా మాత్రమే సాధ్యమన్నారు. నేను చిన్న వయసులోనే అమెరికా వెళ్లి స్టాన్ఫోర్డ్లో విద్యనభ్యసించాను. అక్కడ 100 దేశాల విద్యార్థులతో కలిసి ఐడియాస్, నాలెడ్జి, కల్చర్ పంచుకునే అవకాశం లభించిందని తెలిపారు.
విదేశాల్లో శిక్షణ పొందిన ఉపాధ్యాయులంతా ఛేంజ్ మేకర్లుగా తయారు కావాలి. సింగపూర్ అధ్యయన యాత్రలో మీరు నేర్చుకున్న అంశాలను స్కూలు, క్లస్టర్, మండలాల్లో అమలు చేసేందుకు నాయకత్వం వహించండి. సహ టీచర్లకు మెంటరింగ్ చేయండి. టీచర్ -స్టూడెంట్ -సబ్జెక్ట్ రిలేషన్షిప్ ముఖ్యం. ప్రస్తుతం మనం మౌలిక సదుపాయాలపై దృష్టిపెట్టి, సాఫ్ట్వేర్ మర్చిపోతున్నాం. రాష్ట్రంలో లీప్ మోడల్ విద్యావ్యవస్థ సాధనకు కలిసికట్టుగా పనిచేయాలి. టీచర్లు బోధనపైనే శ్రద్ధ వహించాలని దిశానిర్దేశం చేశారు. విద్యావ్యవస్థలో ఆశించిన మార్పు తేవడం వెనువెంటనే సాధ్యం కాదు, ఇందుకు కొంత సమయం పడుతుంది. రాష్ట్రంలో మనం చేపట్టిన సంస్కరణల కారణంగా ఈ ఏడాది లక్షమందికి పైగా విద్యార్థులు ప్రైవేటు స్కూళ్లనుంచి ప్రభుత్వ పాఠశాలలకు మారారు, ఇది శుభపరిణామం. ప్రభుత్వ ఉపాధ్యాయులకు మించిన టీచర్లు ప్రైవేటు స్కూళ్లలో లేరు. ఆదర్శవంతమైన విద్యావ్యవస్థ (ఏపీ మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్) సాధనకు మీ సహకారం కావాలి, కలిసికట్టుగా పనిచేసి అత్యుత్తమ ఫలితాలు సాధించాలి, లక్షలాది మంది బిడ్డల భవిష్యత్తు మనపై ఆధారపడి ఉంది” అని పిలుపునిచ్చారు.
ఈరోజు దేశవ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ విద్యావ్యవస్థ గురించి చర్చ జరుగుతోంది. ఇప్పుడు మనం ఇతర రాష్ట్రాలతో కాదు, ఇతర దేశాలతో పోటీపడాలి. ఉపాధ్యాయులకు నా మద్దతు ఎల్లప్పుడూ ఉంటుందని మంత్రి లోకేష్ భరోసానిచ్చారు. ఎటువంటి పైరవీలకు తావులేకుండా టీచర్ ట్రాన్స్ఫర్ యాక్ట్ తెచ్చి సీనియారిటీ ప్రాతిపదికన పారదర్శకంగా ప్రమోషన్లు ఇచ్చాం. మీకు అత్యంత శక్తి, సామర్థ్యాలున్నాయి, ఏపీ మోడల్ ఎడ్యుకేషన్ను ప్రపంచానికి చాటిచెప్పాలి, ఇందులో భాగంగా ఇప్పుడు తొలి అడుగు వేశాం… అభ్యసన ఫలితాలు, ఎనలిటికల్ థింకింగ్పై దృష్టిసారించాలి. విద్యావ్యవస్థలో అన్ని సమస్యలను ఒకే రోజు పరిష్కరించడం సాధ్యం కాదు. ప్రాధాన్యత క్రమంలో అన్నింటినీ పరిష్కరిస్తాం, ప్రజాప్రభుత్వం మీ వెంట ఉంది, విద్యారంగంలో ఏపీని నెం.1గా తయారుచేసేందుకు సమష్టిగా కృషిచేద్దాం” అని మంత్రి లోకేష్ పిలుపునిచ్చారు. సింగపూర్ టూర్ ద్వారా ఉపాధ్యాయులు వివిధ అంశాలపై కెపాసిటీ బిల్డింగ్పై శ్రద్ధ వహించాలి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 75 ఏళ్ల వయసులో ఇప్పటికీ నేర్చుకుంటూనే ఉంటారు. ఇటీవల ఆయన సింగపూర్ వెళ్లి ప్రధాని, ఇతర మంత్రులను కలిసి పలు కొత్త విషయాలపై అధ్యయనం చేశారు. గత కొంతకాలంగా ప్రభుత్వ టీచర్లకు గౌరవం పెరిగింది. మీరు లీడర్లుగా, ఛేంజ్ మేకర్స్గా తయారుకండి. మీకు అండగా మేముంటామని మంత్రి లోకేష్ భరోసా ఇచ్చారు. సమావేశంలో విద్యాశాఖ కమిషనర్ తమీమ్ అన్సారియా, ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ ఎం. వెంకటకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.













