- కాపు వర్గాలను రెచ్చగొట్టి లాభపడాలన్నదే ఆయన లక్ష్యం
- ఈ ఘటనపై వెంటనే స్పందించి చర్యలు తీసుకున్న ప్రభుత్వం
- తప్పు చేసిన పోలీసులను ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టబోమన్న సీఎం చంద్రబాబు
- విచారణ కొనసాగుతుండగానే జగన్ అసత్య ప్రచారం
- శవాల వద్ద రాజకీయాలు చేయడం ఆయనకు అలవాటే
- టీడీపీ పొలిట్బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య
అమరావతి (చైతన్యరథం): మునిగిపోతున్న నావలాంటి వైసీపీని నిలబెట్టుకునేందుకు ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి రోజురోజుకూ దిగజారిపోయి ప్రవర్తిస్తున్నారని టీడీపీ పొలిట్బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య విమర్శించారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం జరిగిన మీడియా సమావేళంలో వర్ల రామయ్య మాట్లాడుతూ నదిలో కొట్టుకుపోతున్న వాడు ఒడ్డుకు చేరడానికి ఏ గడ్డిపోచ దొరికినా పట్టుకోవాలని చూసే మాదిరిగానే ప్రస్తుతం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిస్థితి కూడా ఉందన్నారు. గత ఎన్నికల్లో ఘోర పరాజయంతో సర్వస్వం కోల్పోయి, రాజకీయంగా మునిగిపోతున్న జగన్ రెడ్డి.. ఏదో ఒక రకంగా తిరిగి నిలబడేందుకు ప్రతి విషయాన్ని రాజకీయం చేస్తున్నారని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కుల రాజకీయాలు చేస్తూ సమాజంలో అలజడులు సృష్టించాలని చూస్తున్నారంటూ మండిపడ్డారు. రాష్ట్రంలో కాపు వర్గానికి చెందిన ప్రజలు, కాపు నాయకులందరూ కూటమికి స్పష్టమైన తీర్పు ఇచ్చారు. చంద్రబాబు నాయుడు నాయకత్వాన్ని, పవన్ కళ్యాణ్ ఆశయాలను నమ్మి కూటమికి బ్రహ్మాండమైన మెజారిటీతో అధికారాన్ని కట్టబెట్టారు. ఈ చారిత్రాత్మక విజయాన్ని జగన్మోహన్ రెడ్డి జీర్ణించుకోలేకపోతున్నారు. అందుకే కావాలనే కాపు వర్గాలను రెచ్చగొట్టేందుకు సరికొత్త అబద్ధాల రాజకీయాన్ని తెరపైకి తెచ్చారు. ఒక దురదృష్టకర సంఘటనను పట్టుకుని జగన్ రెడ్డి ఆడుతున్న నాటకాలు అసహ్యం కలిగిస్తున్నాయని వర్ల రామయ్య పేర్కొన్నారు.
కులాల మధ్య చిచ్చుకు కుట్ర
గాదె సాయికృష్ణ అనే యువకుడిని పోలీసులు హింసించటంలో లాకప్ డెత్ జరిగిందని, ఆ మృత దేహాన్ని తీసుకెళ్లి దహనం చేసి బూడిద కూడా దొరక్కుండా మాయం చేశారని జగన్ రెడ్డి అడ్డగోలుగా అబద్ధాలు చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డీ… ఎందుకు ఈ కుల రాజకీయాలు? ఎందుకు కాపు వర్గాలను రెచ్చగొడుతున్నారు? మీ రాజకీయ లబ్ధి కోసం సమాజంలో కులాల మధ్య చిచ్చు పెట్టాలని చూస్తే ప్రజలు ఊరుకోబోరని వర్ల రామయ్య హెచ్చరించారు. సాయికృష్ణ తల్లి హైకోర్టును ఆశ్రయించి హెబియస్ కార్పస్ పిటిషన్ వేసి, ఫిర్యాదు చేయడంతో కూటమి ప్రభుత్వం తక్షణమే స్పందించింది. ప్రాథమిక చర్యల్లో భాగంగా మొదట పోలీస్ సీనియర్ అధికారులు కృష్ణలంక సర్కిల్ ఇన్స్పెక్టర్ (సీఐ)ని వీఆర్కు పంపించారు.
అయితే, సింగపూర్ పర్యటన ముగించుకుని వచ్చిన వెంటనే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.. పోలీస్ కమిషనర్, ఇంటెలిజెన్స్ డీజీలతో అత్యున్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. వీఆర్కు పంపడం సరిపోదని, బాధ్యుడైన కృష్ణలంక సీఐపై కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించడంతో ఆయన్ను వెంటనే సస్పెండ్ చేశారు. సస్పెన్షన్తోనే ఆగిపోకుండా, అసలు ఏం జరిగిందో నిష్పక్షపాతంగా తేల్చడం కోసం సీనియర్ ఐపీఎస్ అధికారి అయిన ఈస్ట్ గోదావరి జిల్లా ఎస్పీకి విచారణ బాధ్యతలు అప్పగించారు. సమగ్రమైన ఇన్వెస్టిగేషన్ జరిపి త్వరలోనే రిపోర్ట్ ఇవ్వాలని ఆదేశించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశించిన వెంటనే విచారణ ముమ్మరమైంది. కృష్ణలంక పోలీస్ స్టేషన్లో బాధ్యులైన వారిపై గట్టి సెక్షన్లతో కేసు రిజిస్టర్ చేశారు. క్రైమ్ నెంబర్ 107/26, సెక్షన్ 127 (బీఎనఎస్): రాంగ్ఫుల్ కన్ఫైన్మెంట్ (అక్రమ నిర్బంధం) కింద కేసు పెట్టారు. సెక్షన్ 103 (బీఎనఎస్) పాత ఐపీసీ 302 తరహాలోనే.. అత్యంత తీవ్రమైన మర్డర్ (హత్య) కేసు నమోదు చేశారు. సెక్షన్ 238 (బీఎనఎస్) సాక్ష్యాలను రూపుమాపాలని చూసినందుకు (స్క్రీనింగ్ ఆఫ్ ఎవిడెన్స్) కింద కూడా కేసు పెట్టారు. ఏసీపీ (అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్) దైవ ప్రసాద్ని ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్గా నియమించి, విచారణను చాలా సీరియస్గా ముందుకు తీసుకెళ్తున్నారు. బాధ్యులైన ఏ ఒక్క పోలీస్ అధికారిని కూడా వదిలిపెట్టేది లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఖరాఖండిగా చెప్పారు. చట్టబద్ధంగా కఠినమైన చర్యలు తీసుకుంటుంటే.. జగన్ రెడ్డి మాత్రం శవాల దగ్గరకు వెళ్లి మొసలి కన్నీరు కారుస్తున్నారని రామయ్య మండిపడ్డారు.
మీ హయాంలో దమనకాండ మరిచారా..
పెద్ద బాధ్యత గల నాయకుడిలా ఆ ఇంటికి వెళ్లి, ఆ తల్లిని పలకరించి, కన్నీళ్లు పెడుతున్న జగన్ రెడ్డీ… ఇదంతా పచ్చి డ్రామా కాదా? మొసలి కన్నీరు కాదా? అని వర్ల రామయ్య నిలదీశారు. మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు.. తన అక్కను వేధిస్తున్నారని ప్రశ్నించినందుకు, 14 ఏళ్ల గౌడ కులానికి చెందిన బాలుడు అమర్నాథ్ గౌడ్ను మీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు నలుగురు కలిసి పెట్రోల్ పోసి నడిరోడ్డుపై తగలబెట్టి చంపేశారు. అప్పుడు మీరు ముఖ్యమంత్రి పదవిలో ఉన్నారు కదా.. ఆ బాలుడి శవం దగ్గరకు ఎందుకు వెళ్ళలేదు జగన్ రెడ్డీ? ఆ ముద్దాయిలపై యాక్షన్ తీసుకోమని ఎందుకు మాట్లాడలేదు? అప్పుడు నీ గుండె ఎందుకు ద్రవించలేదు? ఆగస్టు 15న.. స్వాతంత్య్ర దినోత్సవం రోజే గుంటూరులో నడిరోడ్డు మీద రమ్య అనే చదువుకునే కాలేజీ అమ్మాయిని కత్తితో పొడిచి కిరాతకంగా చంపేశారు. కనీసం ఆ అమ్మాయి కుటుంబాన్ని పలకరించడానికి కూడా మీకు మనసు రాలేదు. అప్పుడు మీ బాధ్యత ఎటు పోయింది? అమర్నాథ్ గౌడ్ చనిపోతే వెళ్ళరు..
రమ్య చనిపోతే పలకరించరు..ఎందుకంటే అక్కడ మీకు రాజకీయ లబ్ధి లేదు! కానీ నేడు ఇక్కడ కాపు వర్గానికి అన్యాయం జరిగిపోయిందని అబద్ధాలు చెప్పి, వాళ్ళను రెచ్చగొట్టి, రాజకీయంగా వాడుకోవాలని చూస్తున్నారు. మీరొక కుల రాజకీయాల కుట్రదారులు. జగన్మోహన్ రెడ్డీ… కాపు వర్గాలను రెచ్చగొట్టడానికి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారే, మరి మీ సొంత నియోజకవర్గం పులివెందులలో నాగమ్మ అనే ఒక దళిత మహిళపై అత్యాచారం చేసి, దారుణంగా హత్య చేస్తే ఆ రోజు మీరు ఎందుకు వెళ్ళలేదు? నీ సొంత ఊరిలోనే ఒక దళిత మహిళకు అంత అన్యాయం జరిగితే, ఆ శవాన్ని చూడటానికి గానీ, ఆ కుటుంబ సభ్యులను పలకరించడానికి గానీ మీకు సమయం దొరకలేదా? అక్కడ మీకు రాజకీయ లబ్ధి దొరకదని వెళ్ళలేదా అని వర్ల రామయ్య నిలదీశారు.
న్యాయం చేస్తామని సీఎం చంద్రబాబు హామీ
కరోనా కష్టకాలంలో కనీసం మాస్క్ కావాలని అడిగినందుకు దళిత డాక్టర్ సుధాకర్ని ఏ రకంగా వేధించారో, మానసికంగా కుంగదీసి ఏ రకంగా బలవంతంగా చంపేశారో రాష్ట్ర ప్రజలందరూ చూశారన్నారు. ఆ రోజు డాక్టర్ సుధాకర్ కుటుంబ సభ్యులను పలకరించి, న్యాయం చేయడానికి జగన్ రెడ్డికి చేతులు రాలేదని, ఎందుకంటే అక్కడ ఆయనకు రాజకీయ లబ్ధి లేదని మండిపడ్డారు. వైసీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబు మాట్లాడే మాటలు వింటుంటే సిగ్గుచేటనిపిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరో చనిపోతే.. ఆ మృతదేహాన్ని ముందొక పోలీసు, వెనకొక పోలీసు మధ్యలో మోటార్ సైకిల్పై కూర్చోబెట్టుకుని తీసుకెళ్లి కాల్చేశారని అడ్డగోలు కల్పిత కథలు చెప్తారా? కావాలని కాపు వర్గాలను రెచ్చగొట్టడం కోసం, రాజకీయం కోసం ఇంత దిగజారుతారా అని వర్ల రామయ్య ప్రశ్నించారు. కాపులందరూ కూటమికి అనుకూలంగా ఉన్నారనే ఏడుపుతోనే వైసీపీ నేతలు ఈ రకమైన అసత్య ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. సాయికృష్ణ కుటుంబ సభ్యులు శుక్రవారం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని కలిశారు.
సీఎం ఈ సందర్భంగా వారికి స్పష్టమైన, నమ్మకమైన హామీ ఇచ్చారు. తప్పు చేసిన ఏ ఒక్క పోలీస్ అధికారిని కూడా వదిలిపెట్టే ప్రసక్తే లేదు. సాయికృష్ణ చనిపోవడానికి పోలీస్ అధికారులే కారణమని తేలితే, వాళ్లందరిపై చట్టబద్ధంగా అత్యంత కఠినమైన చర్యలు తీసుకుంటాం. మీ కుటుంబానికి పూర్తి న్యాయం జరుగుతుందని హామీ ఇచ్చారు. ప్రభుత్వం ఇంత సీరియస్గా యాక్షన్ తీసుకుంటూ.. ఒకవైపు సీనియర్ ఐపీఎస్ అధికారి (ఈస్ట్ గోదావరి ఎస్పీ), మరోవైపు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఏసీపీ దైవ ప్రసాద్లతో నిష్పక్షపాతంగా దర్యాప్తు జరిపిస్తుంటే, జగన్ రెడ్డి మాత్రం అబద్ధాలు చెప్తూ సమాజంలో అలజడి సృష్టించాలని చూస్తున్నారు. నేర ప్రవృత్తితో ఉన్న ఏ పోలీస్ అధికారినీ మా ప్రభుత్వం వదలదు. కాబట్టి, ప్రజలందరూ సమన్వయం పాటించాలని, జగన్ రెడ్డి ఆడుతున్న కుల రాజకీయాల ఉచ్చులో పడవద్దని కోరుతున్నాం. ప్రభుత్వం కచ్చితంగా న్యాయం చేస్తుంది, తప్పు చేసిన వాళ్లను బోనులో నిలబెడుతుందని వర్ల రామయ్య స్పష్టం చేశారు.
















