- నైపుణ్యం కలిగిన మానవ వనరులతోనే పోటీ సామర్థ్యం పెరుగుతుంది
- సుసంపన్న భవిష్యత్తు కోసం మానవ వనరులపై పెట్టుబడి పెట్టాలి
- ఏపీలో నైపుణ్యాభివృద్ధికి అత్యధిక ప్రాధానత్య
- స్పీడ్, బ్రాండ్ సీబీఎన్, డబుల్ ఇంజన్ బుల్లెట్ ట్రైన్ సర్కార్ ఏపీ ప్రత్యేకతలు
- యువతకు అవకాశాల కల్పనలో ఏపీతో భాగస్వాములు కావాలి
- విశాఖలో ‘డిజీ 100 ఎక్స్ ఏపీ’ సదస్సులో మంత్రి నారా లోకేష్
విశాఖపట్నం (చైతన్యరథం): ‘వికసిత్ భారత్ నిర్మాణమే మన లక్ష్యం. నైపుణ్యం కలిగిన మానవ వనరులతోనే పోటీ సామర్థ్యం పెరుగుతుంది. సుసంపన్న భవిష్యత్ కోసం మానవ వనరులపై పెట్టుబడి పెట్టాలి’ అని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. రాష్ట్రంలో ఉన్నత విద్య, డిజిటల్ పరివర్తన, ఆధునిక సాంకేతికత అంశాలపై విశాఖలోని రాడిసన్ బ్లూ రిసార్ట్లో శుక్రవారం జరిగిన ‘డిజీ 100 ఎక్స్ ఏపీ’ (Digii100x ANDHRA PRADESH) సదస్సు ముగింపు కార్యక్రమంలో మంత్రి లోకేష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… ‘మన దేశంలో విద్య, ఆవిష్కరణల భవిష్యత్తును తీర్చిదిద్దుతున్న అత్యుత్తమ మేధావుల మధ్య విశాఖపట్నంలో ఉండటం ఆనందంగా ఉంది. ఈ సభను చూస్తుంటే సంస్థలను తీర్చిదిద్దుతూ అవకాశాలను సృష్టిస్తూ ప్రతిభను పెంపొందిస్తూ కోట్లాది భారత యువత జీవితాలను ప్రభావితం చేస్తున్న నాయకులు కనిపిస్తున్నారు. మన పాత్రలు వేర్వేరుగా ఉన్నప్పటికీ మన లక్ష్యం ఒక్కటే. అదే బలమైన భారతదేశ నిర్మాణం. విద్యా రంగంలో భాగస్వామ్యం వహించడానికి ఇంతకంటే అద్భుతమైన సమయం మరొకటి లేదు.
నైపుణ్యం కలిగిన మానవ వనరులతోనే పోటీ సామర్థ్యం పెరుగుతుంది
‘ప్రపంచం అత్యంత వేగంగా మారుతోంది. కృత్రిమ మేధస్సు (ఏఐ) పరిశ్రమలను మార్చేస్తోంది. సాంకేతికత ఉద్యోగాలను పునర్ నిర్వచిస్తోంది. అనేక రంగాలు పూర్తిగా కొత్త రూపు దాలుస్తున్నాయి. ఈ వేగవంతమైన ప్రపంచంలో ఏ రాష్ట్రానికైనా, ఏ దేశానికైనా అత్యంత పెద్ద పోటీ సామర్థ్యం భూమి, సహజ వనరులు లేదా మూలధనం కాదు.. ప్రతిభ. అందుకే ఈ చర్చ విశాఖలో జరగడం ప్రత్యేక ఆనందం కలిగిస్తోంది. దశాబ్దాలుగా ఆంధ్రప్రదేశ్ దేశంలోని అత్యుత్తమ ప్రతిభ అందిస్తోంది. ఏపీ దశాబ్దాలుగా ఐటీ రంగంలో ముందంజలో నిలిచింది. చంద్రబాబు తన తొలి, రెండో పదవీకాలాల్లో చేపట్టిన సంస్కరణల ఫలితంగానే ప్రపంచవ్యాప్తంగా సిలికాన్ వ్యాలీ నుంచి సింగపూర్ వరకు, లండన్ నుంచి దుబాయ్ వరకు ఎక్కడ చూసినా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలకు చెందిన నిపుణులు.. బృందాలకు నాయకత్వం వహిస్తూ సంస్థలను నిర్మిస్తూ, పరిశోధనలను ముందుకు తీసుకెళ్తూ, ఆవిష్కరణలకు మార్గనిర్దేశం చేస్తూ కనిపిస్తారు. మన గొప్ప ఎగుమతి ఏదైనా ఉత్పత్తి కాదు. అది మన ప్రజలు. సుసంపన్న భవిష్యత్తును నిర్మించాలంటే వారిపై పెట్టుబడి పెట్టడం మన తొలి బాధ్యత కావాలి.’ అని లోకేష్ అన్నారు.
విద్యతోనే తదుపరి తరం నాయకులను ప్రేరేపించే అవకాశం
చాలా మంది నన్ను ఐటీ, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్ల శాఖ మంత్రిగా గుర్తిస్తారు. అది నా ఇండియా హ్యాట్. నేను మరో టోపీ కూడా ధరిస్తాను. దానిని నేను భారత్ హ్యాట్ అని పిలుస్తాను. అదే నా విద్యా శాఖ బాధ్యత. ముఖ్యమంత్రి శాఖల కేటాయింపుల సమయంలో నేను ఏ శాఖను కోరుకుంటానని అడిగినప్పుడు విద్యా శాఖ ఇవ్వాలని కోరాను. ఆ నిర్ణయం వెలువడినప్పుడు చాలా మంది విద్యా శాఖ వద్దని వారించారు. సంఘాలు, ఆరోపణలు, ప్రశ్నపత్రాలు, మూల్యాంకనాలు, వివాదాలు వంటి అనేక సవాళ్లు ఉంటాయని చెప్పారు. నేను మాత్రం అందుకే ఆ శాఖ అంటే ఇష్టం అని చెప్పా. ఎందుకంటే తదుపరి తరం నాయకులను ప్రేరేపించే అవకాశం విద్య ద్వారానే లభిస్తుంది. అందుకే నేను హెచఆర్డీ శాఖను ఎంచుకున్నాను. పిల్లలను నేను హృదయపూర్వకంగా ప్రేమిస్తాను. వారు చూపే ప్రేమ, ఆప్యాయత, నిజాయితీ నాకు ఎంతో ఆనందాన్నిస్తాయి. అందుకే విద్యా రంగం పట్ల నాకు ప్రత్యేక ఆకర్షణ ఏర్పడింది.
ఏపీలో నైపుణ్యాభివృద్ధికి అధిక ప్రాధానత్య ఇస్తున్నాం
నా దృష్టిలో విద్య అంటే కేవలం డిగ్రీ సర్టిఫికెట్ ఇవ్వడం కాదు. జీవితాంతం నేర్చుకునే ప్రక్రియలో ప్రభుత్వం, మనమందరం కలిసి భాగస్వాములు కావాలి. అందుకే మరో రెండువారాల్లో నైపుణ్యం పోర్టల్ను ప్రారంభించబోతున్నాం. పెద్ద ఎత్తున నైపుణ్యం కలిగిన మానవ వనరులను తయారుచేయగల రాష్ట్రాలదే భవిష్యత్. అందుకే ఏపీ వృద్ధి వ్యూహంలో నైపుణ్యాభివృద్ధి అత్యంత కీలకమైన అంశంగా ఉంది. మేం నిన్నటి ఉద్యోగాల కోసం విద్యార్థులను సిద్ధం చేయట్లేదు. ప్రస్తుతం సరికొత్తగా అభివృద్ధి చెందుతున్న ఏఐ, ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్, డేటా సెంటర్లు, సెమీ కండక్టర్లు, అడ్వాన్స్డ్ మ్యానుఫ్యాక్చరింగ్, ఏరోస్పేస్ వంటి రంగాల కోసం వారిని సిద్ధం చేస్తున్నాం. ఇక్కడే విద్య, ఆర్థికాభివృద్ధి ఒకదానితో మరొకటి అనుసంధానమై ఉంటాయి.
ఏఐతో పెద్ద ఎత్తున ఉద్యోగాల కల్పన
ఈ రోజుల్లో విశ్వవిద్యాలయాలు కేవలం విద్యను బోధించే సంస్థలు మాత్రమే కాదు. అవి ప్రతిభను తీర్చిదిద్దే కేంద్రాలు, పరిశోధనకు చోదకశక్తులు, ఆవిష్కరణలకు వేదికలు, స్టార్టప్ల ఆవిర్భావానికి పునాదులుగా మారాయి. ప్రపంచంలో అత్యుత్తమ విద్యా సంస్థలు టాలెంట్, నాలెడ్జ్, ఎంటర్ప్రెన్యూర్లను తయారు చేస్తాయి. ఈ మూడు లక్ష్యాలను సాధించగల సంస్థలతో భాగస్వామ్యం వహించడానికి ఏపీ సిద్ధంగా ఉంది. మా లక్ష్యం కేవలం పట్టభద్రులను తయారు చేయడం కాదు. ప్రపంచస్థాయి పోటీకి తగిన పరిశోధన ఆధారిత, ఆవిష్కరణలతో నడిచే సంస్థలను నిర్మించడమే మా లక్ష్యం. ఏఐ యూనివర్సిటీలను రీప్లేస్ చేయలేదు. అయితే ఏఐను స్వాగతించే యూనివర్సిటీలే భవిష్యత్తును శాసిస్తాయి. ప్రతి పారిశ్రామిక విప్లవం ఎక్కువ సంఖ్యలో ఉద్యోగాలను సృష్టించింది. ఏఐ విషయంలో కూడా అదే జరుగుతుందని నమ్ముతున్నాను. ఏఐ ఆధారిత విద్య, పరిశోధన, పాలన, ఆవిష్కరణలకు ఏపీ ఒక ప్రయోగశాలగా మారాలని కోరుకుంటోంది. ఈ నేపథ్యంలో డేటా సెంటర్లు, కేబుల్ ల్యాండింగ్ స్టేషన్లు అత్యంత కీలకమైనవి. ఇకపై దేశ సంపద చమురు నిల్వలతో కాదు.. కంప్యూటింగ్ సామర్థ్యంతో లెక్కిస్తారు. ఆ దిశలో భారతదేశానికి మార్గదర్శకంగా ఆంధ్రప్రదేశ్ నిలవాలని మేము భావిస్తున్నాం. ఈ ప్రయాణంలో ఈ సభలో ఉన్న సంస్థలు కీలక పాత్ర పోషించాల్సి ఉంది.
స్పీడ్, బ్రాండ్ సీబీఎన్, డబుల్ ఇంజన్ బుల్లెట్ ట్రైన్ సర్కార్… ఏపీ ప్రత్యేకతలు
పెట్టుబడిదారులకు అవసరమైన ఎకో సిస్టమ్ను ఏపీ నిర్మిస్తోంది. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, బ్రాండ్ సీబీఎన్, డబుల్ ఇంజన్ బుల్లెట్ ట్రైన్ సర్కార్… ఇవీ ఏపీ ప్రత్యేకతలు. వృద్ధి, మౌలిక సదుపాయాల కల్పన, పెట్టుబడుల ఆకర్షణ, సమగ్ర అభివృద్ధి వంటి లక్ష్యాల పట్ల ఉమ్మడి నిబద్ధతతో రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కలిసి పని చేస్తున్నాయి. ఈ సమన్వయమే ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేకమైన ప్రయోజనాన్ని అందిస్తోంది. దాని ఫలితాలు ఇప్పటికే స్పష్టంగా కనిపిస్తున్నాయి. రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు తరలివస్తున్నాయి. గూగుల్ సంస్థ భారతదేశంలోనే అతిపెద్ద ప్రత్యక్ష విదేశీ పెట్టుబడి ఏపీలో పెట్టబోతోంది. ఇందుకు కేవలం 13 నెలల సమయం మాత్రమే పట్టింది. ఒక్క జూమ్ కాల్ ద్వారానే ఆర్సెలార్ మిట్టల్ ప్రాజెక్ట్ సాధించగలిగాం. నిర్మాణ పనుల ప్రారంభానికి కేవలం 17 నెలలే పట్టింది. ఏపీలో ఫైటర్ జెట్ ప్రాజెక్ట్ కోసం 36 రోజుల్లోనే 600 ఎకరాలు అప్పగించాం. ఒక్కసారి మాతో చేతులు కలిపిన తర్వాత అది మీ ప్రాజెక్ట్ కాదు.. మా ప్రాజెక్ట్.
భారతదేశ పెట్టుబడుల్లో 25శాతం ఏపీకే
దేశానికి వస్తున్న పెట్టుబడుల్లో 25శాతం ఏపీకి వస్తున్నాయి. ఇది యాదృచ్ఛికం కాదు. స్పష్టమైన లక్ష్యం, దూరదృష్టి, వేగంతో ఏపీ ముందుకు సాగుతున్నందునే ఇది సాధ్యమవుతోంది. గాజు తయారీ, డ్రోన్లు, సిమెంట్, ఉక్కు, ఆటోమొబైల్, ద్విచక్ర వాహనాలు, కంప్రెస్డ్ బయోగ్యాస్ వంటి అనేక రంగాల్లో పెట్టుబడులు వస్తున్నాయి. ఇటీవల రాయల్ ఎన్ఫీల్డ్ కూడా తన తయారీ యూనిట్ను ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించింది. విద్య, ఆర్థికాభివృద్ధిని సమాంతరంగా నడిపిస్తున్నాం. ఇవి ఒకదానితో మరొకటి ముడిపడి ఉంటాయి. ఇదే ఆంధ్రప్రదేశ్ను ఇతర రాష్ట్రాల కంటే ప్రత్యేకంగా నిలబెడుతోంది. ప్రపంచంలోని వివిధ ప్రాంతాల విజయగాథల నుంచి నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఈ అభివృద్ధి ప్రయాణంలో భాగస్వాములు కావాలని మీ అందరినీ హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నా.
రాష్ట్రవ్యాప్తంగా 22 పారిశ్రామిక క్లస్టర్ల అభివృద్ధి
యువతకు అవకాశాల కోసం రాష్ట్రవ్యాప్తంగా 22 క్లస్టర్లను అభివృద్ధి చేస్తున్నాం. ఫిషరీస్, ఆక్వాకల్చర్, ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్, ఆటోమోటివ్ మ్యానుఫ్యాక్చరింగ్, గ్లాస్ మ్యానుఫ్యాక్చరింగ్, ఫార్మాస్యూటికల్స్, కెమికల్స్, ఏరోస్పేస్, ఎయిర్క్రాఫ్ట్ మ్యానుఫ్యాక్చరింగ్, డేటా సెంటర్స్ వంటి క్లస్టర్లను ఏర్పాటు చేస్తున్నాం. మీ నుంచి మరింత సూచనలు, సలహాలు కావాలి. ప్రభుత్వంగా మేం కేవలం మార్గదర్శకులం మాత్రమే. ఆవిష్కరణలు, పరిశోధనలను ప్రోత్సహిస్తూ భుజం భుజం కలిపి దేశానికి మరింత మెరుగైన సేవలు అందించేలా కలిసి పని చేయాలని మేం కోరుకుంటున్నాం. ఈరోజు నిర్వహించిన ఈ సమావేశం ఆ దిశలో తొలి అడుగు మాత్రమే. ఇంకా చాలా దూరం కలిసి ప్రయాణించాల్సి ఉంది. మీ అభిప్రాయాలు, సూచనలను మాతో పంచుకోండి. మాది పారదర్శకమైన ప్రభుత్వం. మీ అభిప్రాయాలను విలువైనవిగా భావిస్తాం. ‘విద్యార్థులు ఓటమికి కుంగిపోవద్దు. నేను తొలిసారి ఎమ్మెల్యేగా పోటీచేసినప్పుడు ఓడిపోయాను. కానీ వెనక్కి తగ్గలేదు. దానిని పాఠంగా తీసుకున్నా. కసితో పనిచేసి చివరకు ఏపీ చరిత్రలోనే మూడో అత్యధిక మెజార్టీతో విజయం సాధించా. అందుకే మేం కొత్త ఆలోచనలను, సూచనలను స్వాగతిస్తాం. మీ అభివృద్ధి ప్రయాణంలో భాగస్వాములుగా ఉండాలి’ అని
మంత్రి లోకేష్ కోరారు.
సదస్సులో డీజీ సంస్థ వ్యవస్థాపకుడు, సీఈవో హేమంత్ సహల్, విశాఖ ఎంపీ ఎం.శ్రీభరత్, అపోలో హాస్పిటల్స్ గ్రూపు జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ సంగీత రెడ్డి, కళాశాల విద్యా శాఖ కమిషనర్ నారాయణ భరత్ గుప్తా, శ్రీసిటీ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ చైర్మన్ శ్రీనిరాజు, వెల్లూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ శేఖర్ విశ్వనాథన్తో పాటు విద్యారంగ నాయకులు, వివిధ యూనివర్సిటీల ప్రతినిధులు, చాన్సలర్లు, వైస్ చాన్సలర్లు, విద్యావేత్తలు, వ్యవస్థాపకులు, పారిశ్రామికవేత్తలు, వివిధ సంస్థల సీఈవోలు, ఎండీలు, సీఎక్స్ వోలు పాల్గొన్నారు.













