- రాష్ట్రవ్యాప్తంగా 9వ తరగతి విద్యార్థులకు క్లిక్కర్ విధానం అమలు
- లీప్ యాప్ వినియోగంపై తల్లిదండ్రుల్లో అవగాహన తీసుకురావాలి
- సమగ్రశిక్ష అధికారులతో రాష్ట్ర విద్య, ఐటి మంత్రి నారా లోకేష్ సమీక్ష
ఉండవల్లి: ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం నాణ్యత విషయంలో కఠినంగా వ్యవహరించాలని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ఆదేశించారు. ఉండవల్లి నివాసంలో సమగ్రశిక్ష అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. ఇరాన్ యుద్ధం కారణంగా పెట్రోలియం ఆధారిత ఉత్పత్తుల లభ్యత తగ్గడంతో స్టూడెంట్ కిట్ లపై ప్రభావంపై ఈ సందర్భంగా అధికారులు మంత్రికి వివరించారు. విద్యార్థి మిత్ర కిట్ నాణ్యత విషయంలో పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో క్లిక్కర్ ఆధారిత పునశ్చరణ విధానం పట్ల తల్లిదండ్రుల్లో సానుకూలత ఉందని ఈ సందర్భంగా అధికారులు మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై మంత్రి లోకేష్ స్పందిస్తూ.. రాష్ట్రవ్యాప్తంగా మొదట తొమ్మిదో తరగతి విద్యార్థులకు క్లిక్కర్ ఆధారిత అభ్యసన విధానాన్ని అమలుచేయాలని ఆదేశించారు. తదనంతరం ఇతర తరగతుల్లో క్లిక్కర్ విధానాన్ని ప్రవేశపెట్టాలని సూచించారు. లీప్ యాప్ లో విద్యార్థులకు ఉపయోగపడే పాఠ్యాంశాల వీడియోలు ఎన్ని చేశారో మంత్రి ఆరా తీశారు.
ఫీడ్ బ్యాక్ ఆటోమేషన్ చేయండి
ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం నాణ్యత విషయంలో కఠినంగా వ్యవహరించాలని అధికారులను మంత్రి ఆదేశించారు. మధ్యాహ్న భోజనం నాణ్యత విషయంలో సోమవారం నుంచి లీప్ యాప్ ద్వారా టీచర్, పేరెంట్ ఫీడ్ బ్యాక్ ను సేకరిస్తున్నట్లు అధికారులు వివరించారు. మంగళవారం వరకు 6,719 పాఠశాలల నుంచి అభిప్రాయ సేకరణ చేసినట్లు తెలిపారు. ఫీడ్ బ్యాక్ ప్రక్రియను ఆటోమేషన్ చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. లీప్ యాప్ ను ఎంతమంది తల్లిదండ్రులు వినియోగిస్తున్నారని మంత్రి ఆరా తీశారు. లీప్ యాప్ వినియోగం పట్ల తల్లిదండ్రుల్లో అవగాహనకు ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలని ఆదేశించారు. అభ్యసన ఫలితాల మెరుగుదలలో స్కూల్ మేనేజ్ మెంట్ కమిటీలు సమర్థవంతమైన పాత్ర పోషించాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా మంత్రి అభిప్రాయపడ్డారు. ఆర్టీఈ, ఆటిజం సపోర్ట్ సెంటర్స్ అంశాలపైనా సమావేశంలో చర్చించారు. ఫేజ్-1 కింద చినకాకాని, బాపట్లలో నిర్మాణం పూర్తైన ఆటిజం సపోర్ట్ సెంటర్స్ ప్రారంభానికి సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఫేజ్-2 కింద 28 ఆటిజం సెంటర్స్ ఈ ఏడాది జూన్ నాటికి, 95 సెంటర్స్ ఈ ఏడాది నవంబర్ నాటికి అందుబాటులోకి వస్తాయని అధికారులు వివరించారు. ఆటిజం సపోర్ట్ సెంటర్స్ నిర్వహణకు సంబంధించి నిష్ణాతులైన మానసిక వైద్యులు, కౌన్సిలర్ల శిక్షణకు నిమ్ హాన్స్ (NIMHANS) వంటి సంస్థల సహకారం తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. కేజీబీవీ అడ్మిషన్స్ స్టేటస్, 1095 బోధనేతర, 277 బోధన సిబ్బంది నియాకంపైనా సమావేశంలో చర్చించారు.
అమరావతి లైబ్రరీ తుది నమూనా ఆమోదం
ప్రజాప్రభుత్వం అమరావతిలో ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్న స్టేట్ సెంట్రల్ లైబ్రరీపైనా మంత్రి సమీక్షించారు, ఈ సందర్భంగా భవన తుది నమూనాను ఆమోదించారు. త్వరితగతిన పనుల ప్రారంభానికి చర్యలు తీసుకోవాలని, 2028 నాటికి పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో మానవవనరుల శాఖ కార్యదర్శి కోన శశిధర్, పాఠశాల విద్య డైరెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా, సమగ్రశిక్ష ఎస్పీడీ బి.శ్రీనివాసరావు, ఏపీఈడబ్ల్యూఐడీసీ ఎండీ సీఎన్ దీవన్ రెడ్డి, పబ్లిక్ లైబ్రరీస్ డైరెక్టర్ కృష్ణ మోహన్ తదితరులు పాల్గొన్నారు.














