- తెలుగుజాతి గర్వించే ఉద్విగ్న క్షణాలు
- ప్రజావిశ్వాసం ముందు ఓడిపోయిన విద్వేషపు రాజకీయం
- అమరావతి బిల్లును ఎదుర్కొనే దమ్ములేక సభనుంచి వైసిపి పరార్
- చారిత్రాత్మక అమరావతి బిల్లుకు లోక్ సభ ఆమోదముద్ర
(చైతన్యరథం ప్రతినిధి – అమరావతి) : అయిదుకోట్ల ప్రజల కోసం అమరావతి రైతులు చేసిన త్యాగం ఫలించింది… జయహో అమరావతి అంటూ 1631రోజులపాటు వారు చేసిన చారిత్రాత్మక ఉద్యమం విజయబావుటా ఎగురవేసింది. ఆంధ్రుల కలల రాజధాని అమరావతి గురించి పార్లమెంటులో చర్చ మొదలవ్వగానే వైకాపా ఎంపీలలో వణుకు మొదలైంది. అమరావతి అభివృద్ధిపై జరుగుతున్న సానుకూల చర్చను తట్టుకోలేక, అడ్డుకునే ధైర్యం లేక చివరకు తోకముడిచి సభ నుంచి బయటకు పారిపోయారు. ఇక ఏ దుష్టశక్తీ అడ్డుకోవడానికి వీల్లేకుండా ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆశలు, ఆకాంక్షలకు పార్లమెంటు ఆమోద ముద్ర వేసింది. యావత్ తెలుగుజాతి గర్వించే ఉద్విగ్న క్షణాలను 5కోట్ల ఆంధ్రులు ఆనందంతో ఆస్వాదించారు. తల్లి ఆశీర్వాదం ఉంటే ప్రకృతి కూడా తోడవుతుంది. ధర్మం వైపు పోరాటం ఉంటే.. దేశమే కదిలివస్తుంది. నేడు భారత లోక్సభ సాక్షిగా అదే జరిగింది. ఐదేళ్ల అణచివేత, 1631రోజుల రోజులపాటు నిద్రాగారాలు మాని ముళ్ల కంచెలు, పోలీసు బూట్ల చప్పుడు..
వీటన్నింటినీ తట్టుకుని నిలబడ్డ ‘అమరావతి’ మహిళల త్యాగం నేడు భారత పార్లమెంటు రికార్డుల్లో స్వర్ణాక్షరాలతో లిఖించబడింది. ఏపీ రాజధానిగా అమరావతి చట్టబద్ధత బిల్లుకు లోక్సభ ఆమోదం తెలిపింది. దీంతో ఈ బిల్లు రేపు రాజ్యసభ ముందుకు వెళ్లనుంది. ఈ బిల్లుపై చర్చ సందర్భంగా పలువురు మంత్రులు, ఎంపీలు మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ, సమాజ్వాదీ పార్టీ మద్దతు ఇచ్చాయి. ప్రస్తుత 18వ లోక్సభ 41 రాజకీయ పక్షాలు.. ఎన్నో భిన్నాభిప్రాయాల వేదిక, అయితే ఆంధ్రుల ఆత్మాభిమానం ‘అమరావతి’ బిల్లు ముందుకు రాగానే, ఆ 41 పార్టీలు తమ జెండాలను పక్కనపెట్టాయి. ఒకే ఒక్క ‘ఎజెండా’తో ముందుకు వచ్చాయి.. అదే అయిదుకోట్ల ఆంధ్రుల గుండెగొంతుక అమరావతి.
పార్లమెంటులో వైకాపా డ్రామాలు
లోక్సభ సాక్షిగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నైజం మరోసారి బయటపడింది. రాష్ట్ర ప్రయోజనాల కంటే రాజకీయ ప్రయోజనాలే ముఖ్యమని ఆ పార్టీ ఎంపీలు మరోసారి నిరూపించుకున్నారు. లోక్సభలో కీలక బిల్లుపై చర్చ జరుగుతుండగా, మద్దతు తెలపాల్సింది పోయి.. సభ నుంచి వాకౌట్ చేసి తమ బాధ్యత నుంచి తప్పించుకున్నారు. చిత్రమేమిటంటే.. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఆరోపణలు ఎదుర్కొంటూ, ప్రస్తుతం కేవలం బెయిలు మీద ఉన్న మిధున్ రెడ్డిని అడ్డం పెట్టుకుని వైకాపా అబద్ధాల రాజకీయం నడిపించే ప్రయత్నం చేసింది. సభలో వాస్తవాలను పక్కనపెట్టి, పచ్చి అబద్ధాలతో సభ్యులను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేసిన మిధున్, ఆ తర్వాత తన సహచర ఎంపీలతో కలిసి బయటకు నడిచారు. సీఎం రమేశ్ మీద వ్యక్తిగత దూషణలకు పాల్పడి సభాపతితో చివాట్లు తిన్నారు. ఆంధ్రుల కలల రాజధాని అమరావతి గురించి పార్లమెంటులో చర్చ మొదలవ్వగానే వైకాపా ఎంపీలలో వణుకు మొదలైంది. అమరావతి అభివృద్ధిపై జరుగుతున్న సానుకూల చర్చను తట్టుకోలేక, దాన్ని అడ్డుకునే ధైర్యం లేక చివరకు తోకముడిచి సభ నుంచి బయటకు పరారయ్యారు. రాష్ట్ర రాజధాని వంటి కీలక అంశంపై చర్చ జరుగుతుంటే పారిపోవడం అంటే.. ఏపీ అభివృద్ధిని అడ్డుకోవడమేనని రాజకీయ విశ్లేషకులు మండిపడుతున్నారు.
ఏకతాటిపైకి వచ్చిన 41 రాజకీయ పక్షాలు
భిన్నధృవాలుగా ఉండే ఎన్ డిఎ, ఇండియా కూటములు అమరావతి విషయంలో మాత్రం ఏకతాటిపైకి వచ్చాయి. ఎన్డీఏ కూటమిలోని 17 పార్టీలు జై అమరావతి అంటూ గర్వంగా నినదించాయి. ఇండియా కూటమిలోని 18 పార్టీలు కూడా ఆంధ్రుల ఆకాంక్షను గౌరవించాయి. స్వతంత్రులు, ఇతర 5 పార్టీలు సైతం రాజధాని రైతు త్యాగానికి సెల్యూట్ చేశాయి. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, హిమాలయాల నుంచి హిందూ మహాసముద్రం వరకు.. భారత ప్రజాస్వామ్య గొంతుకలన్నీ ఏకగ్రీవంగా “అమరావతి – ఆంధ్రుల ఏకైక రాజధాని” అని ముక్తకంఠంతో చాటిచెప్పాయి. సముద్రమంత మద్దతు ఉన్న చోట.. ఒక చిన్న విద్వేషపు చుక్క ఎంతటి అపహాస్యానికి గురవుతుందో లోక్సభలో అమరావతి బిల్లు ప్రవేశపెట్టిన సందర్భంగా అర్థమైంది. 41 పార్టీల ఈ మహా సభలో కేవలం వైకాపా మాత్రమే ఆంధ్రుల కలలకు అడ్డుపడింది. 11 పార్టీలు చర్చలో పాల్గొంటే, విధ్వంసమే ఎజెండా పనిచేసే వైకాపా ఎంపిలు మాత్రం తమ వంతు విషం కక్కి, మొహం చాటేసి, ప్రజల ఆకాంక్షను తృణీకరించి, సభను బహిష్కరించి పరారయ్యారు. రాష్ట్ర ప్రయోజనాల కంటే అహంకారమే మిన్న అనుకున్న వైకాపా వైఖరి నేడు దేశం ముందు నవ్వులపాలైంది. ఒకే ఒక్క పార్టీ వ్యతిరేకించి వాకౌట్ చేసి వెళ్లిపోయినా, 40 పార్టీల ఆశీర్వాదం అమరావతికి రక్షణ కవచంలా నిలిచింది.
ఇది కేవలం ఒక బిల్లు విజయం కాదు.. ఎకరాల భూమిని విజనరీ లీడర్ చంద్రబాబునాయుడును నమ్మి 33వేల ఎకరాలను కేవలం 58రోజుల్లో ప్రభుత్వానికి అందించిన 29వేలమంది అమరావతి రైతుల ఆత్మగౌరవ విజయం. ఎర్రటి ఎండలో రోడ్డెక్కిన తల్లుల పోరాటానికి దక్కిన గౌరవం. ఆనాడు కన్నీళ్లు తుడిచే నాథుడు లేకపోయినా, ఈనాడు భారత పార్లమెంటే వారికి సాష్టాంగ నమస్కారం చేసింది. అమరావతి ఇప్పుడు కేవలం ఒక రాష్ట్ర రాజధాని కాదు.. 140కోట్ల భారతీయులు ముద్దుగా పిలిచిన ప్రజా రాజధాని’. అమరావతి రైతుల త్యాగం ముందు విద్వేషపు రాజకీయం ఓడిపోయింది.. విశ్వాసం గెలిచింది. 41 పక్షాల ఆశీస్సులతో ఆంధ్రుడి ఆశయం సిద్ధించింది. చీకటి రోజులు ముగిశాయి.. దేవతల అమరావతి అజరామరం… ఇక ఏ దుష్టశక్తీ ఆంధ్రుడి గుండెల నుంచి అమరావతిని విడదీయలేదు…జయహో అమరావతి…!














