- పెట్టుబడుల మాదిరిగానే.. పేదల గురించీ ఆలోచించాలి
- వేధింపులు లేకుండా పన్ను వసూలు పెరగాలి
- ఏపీలో పనులు చేస్తూ… వేరే రాష్ట్రాల్లో పన్నులు కడతామంటే ఎలా…?
- విద్యార్థులకు గుర్తుండిపోయేలా యూనివర్శిటీల్లో స్నాతకోత్సవాలు
- 6వ జిల్లా కలెక్టర్ల కాన్ఫరెన్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు
అమరావతి (చైతన్య రథం): రాష్ట్ర ప్రభుత్వం పెద్దఎత్తున సంక్షేమ పథకాలు అందిస్తోందని.. ఆ పథకాలకు సంబంధించిన ఓనర్షిప్ తీసుకోవాల్సిన బాధ్యత ప్రజా ప్రతినిధులమీద ఉంటుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఈమేరకు వివిధ పథకాల లబ్దిదారులకు ప్రజా ప్రతినిధుల ద్వారా సంక్షేమ లేఖలు అందించాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. 6వ జిల్లా కలెక్టర్ల సమావేశం రెండోరోజున సూపర్ సిక్స్, సంక్షేమం, ఆదాయార్జన శాఖలు, విద్య, నైపుణ్యాభివృద్ధివంటి అంశాలపై సీఎం సమీక్షించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ… “సంక్షేమ పథకాల అమలుకు సంబంధించి ప్రతి లబ్దిదారునికి ప్రభుత్వం తరపున లేఖను అందించేలా చర్యలు తీసుకోవాలి. ప్రతీ లబ్దిదారుకూ ప్రతీ నెలా ఏం లబ్ది కలిగిందో తెలిసేలా చేయాలి. ఏ కుటుంబానికి ఏం లబ్ది కలిగిందో తెలిస్తే అంతా పారదర్శకంగా ఉంటుంది. ప్రభుత్వం అందించే పెన్షన్, ఉచిత సిలెండర్, తల్లికి వందనం, ఫీజు రీయింబర్సుమెంట్ లాంటివి లబ్దిదారులకు తెలియాలి.
పథకం అమలు చేసే ముందు… లబ్దిదారుని ఖాతాలో డబ్బులు జమ చేసే ముందు ప్రతి లబ్దిదారు కుటుంబానికి సంక్షేమ లేఖలు అందేలా చూడాలి. దీపం 2.0 పథకానికి డిజిటల్ ఓచర్ జారీ చేసే అంశాన్ని పరిశీలించాలి. డీబీటీ పథకాల్లో ప్రోగ్రామబుల్ వోచర్లను లబ్దిదారులకు ఇస్తే వారు వినియోగించుకుంటారు. మార్చి 9నాటికి 50.45 కోట్ల ప్రయాణాలను మహిళలు చేశారు. రూ.1775 కోట్లను ప్రభుత్వం ఆర్టీసీకి రీయింబర్సు చేసింది. డ్వాక్రా, మెప్మా సంఘాల సేవల్ని వినియోగించుకుని పీ`4 సహా జీరో పావర్టీ కార్యక్రమాన్ని సమర్ధవంతంగా చేపట్టాలి. కుటుంబ సాధికారిత సాధించేలా చర్యలు తీసుకోవాలి. సంపద సృష్టితోపాటు ప్రజలకు మెరుగైన జీవన ప్రమాణాలు అందేలా చూడాలి. సంక్షేమ పథకాల అమలుకు సంబంధించి క్యాలెండర్ విడుదల చేస్తాం. అన్నదాత సుఖీభవ ద్వారా రేపు మూడో విడత నిధులు విడుదల చేస్తున్నాం. అన్నా క్యాంటీన్ల ద్వారా 7.50 కోట్ల భోజనాలు ఇప్పటి వరకూ పేదలకు అందించగలిగాం. అంగన్ వాడీ, ఆశాలకు గ్రాట్యూటీ అమలు చేస్తున్నాం. రూ. వెయ్యి కోట్లతో రోడ్ల మరమ్మత్తులు చేపట్టాం.
పల్లె పండుగ కింద గ్రామీణ ప్రాంతాల్లో రూ.4 వేల కోట్ల వ్యయం చేశాం. సంక్షేమ పథకాలు లాస్ట్ మైల్ డెలివరికి చేరడమనేది లక్ష్యంగా కలెక్టర్లు పనిచేయాలి. సంక్షేమం, అభివృద్ధి సమతూకంగా జిల్లా కలెక్టర్లు పని చేయాలి. ప్రతీ ఒక్కరికీ ఇంటి స్థలం లేదా ఇంటిని మంజూరు చేసేలా చర్యలు తీసుకోవాలి. ఉగాదికి 2.50 లక్షల మందికి సామూహిక గృహప్రవేశాల కార్యక్రమాన్ని నిర్వహిస్తాం. ప్రతీ ఇంటికీ జేజేఎం కింద తాగునీటి కుళాయి ఇస్తాం… ప్రతి ఇంటికి ఇంటర్నెట్ అందేలా చర్యలు తీసుకుంటాం. సాలిడ్, లిక్విడ్ మేనేజ్మెంట్ ద్వారా గ్రామాలు పరిశుభ్రంగా ఉంచాలి. నెట్ జీరో కాన్సెప్టుగా ఘన వ్యర్ధాలను వేస్ట్ టూ ఎనర్జీ ప్లాంట్లకు తరలించాలి. తడి వ్యర్ధాలను కాంపోస్టు తయారు చేసేందుకు మళ్లించాలి. 500 పాఠశాలల్లో నెట్ జీరో కాన్సెప్టులో కిచెన్ గార్డెన్, బయోడైవర్సిటీలో భాగస్వాములను చేయాలి. వీ బీజీ రామ్ జీ కింద రూ.9773 కోట్లు ఏపీకి కేటాయించారు. ఇప్పుడు ఈ పథకం డిమాండ్ డ్రివెన్ కాదు… దీనికి అనుగుణంగా పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి. పెట్టుడులు గురించి ఎలా ఆలోచిస్తున్నామో… పేదలకు అందించే సంక్షేమం గురించి… వారికి కల్పించే సాధికారత గురించీ కలెక్టర్లు ఆలోచించాలి” అని సీఎం చంద్రబాబు సూచించారు.
ప్రతి రంగంలో వృద్ధి సాధించి జీఎస్డీపీ లక్ష్యాన్ని చేరుకోవాలి
“పన్ను ఎగవేతలు లేకుండా పటిష్టమైన కార్యాచరణ చేపట్టాలి. ఇండస్ట్రీ, సర్వీస్ సెక్టార్ అభివృద్ధి జరిగితే… ప్రభుత్వానికి పెద్ద ఎత్తున వస్తుంది. ప్రతీ రంగంలోనూ వృద్ధి సాధించటం ద్వారా జీఎస్డీపీ లక్ష్యాన్ని చేరుకోవాలి. కొందరు కాంట్రాక్టర్లు తమ కార్యాలయాలు వేరే రాష్ట్రాల్లో పెట్టుకున్నారు… పనులు మాత్రం మన రాష్ట్రంలో చేస్తున్నారు. టెండర్లు, వర్క్ ఆర్డర్లలోని కాంట్రాక్టర్ల నుంచి ఆదాయం రావటం లేదు. ఇది సరి కాదు. జాతీయ రహదారులు, రైల్వేలు, ఇతర ప్రాజెక్టుల పనుల్లో కాంట్రాక్టర్లు చెల్లించే పన్నులు మన రాష్ట్రంలో చెల్లించేలా చూడాలి. పన్ను వసూళ్ల విషయంలో అనవసరపు వేధింపులు వద్దు. పన్ను ఎగవేతలు ఉండకూడదు. పన్నుల పరిధిలో ఉన్నవారు తప్పించుకోవడానికి వీల్లేదు… పన్నులు చెల్లించేలా చూడాలి. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ వినియోగించి పన్ను ఎగవేతకు పాల్పడకుండా చర్యలు తీసుకోవాలి. పాఠ్యాంశాల్లో కాలానుగుణంగా మార్పులు రావాలి. ప్రస్తుత అవసరాలు, అభివృద్ధికి అనుగుణంగా పాఠ్యాంశాలు ఉండాలి. ఎన్సీఈఆర్టీ సహా వివిధ కేంద్ర ప్రభుత్వ సంస్థలను, విశ్వవిద్యాలయాలను సంప్రదించి అధ్యయనం చేయాలి.
వయోజన విద్యకు సంబంధించి అక్షరాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించటంలో కలెక్టర్లు పూర్తి శ్రద్ధ పెట్టాలి. జాతీయస్థాయి విద్యా సంస్థలు అనుసరిస్తున్న పాఠ్యాంశాలు… మన విశ్వవిద్యాలయాల్లో బోధిస్తున్న పాఠ్యాంశాలను సమీక్షించాలి. జాతీయ, అంతర్జాతీయ విద్యాబోధన ప్రమాణాల్లో ఎక్కడున్నామనేది అధ్యయనం చేయాలి. తమిళనాడు, కర్ణాటక, ఏపీ రాష్ట్రాలు ఉన్నత విద్యలో అగ్రస్థానంలో ఉన్నాయి. గత పాలనలో టీచర్లను కూడా రిక్రూట్ చేయలేకపోయారు. స్కిల్ డెవలప్మెంట్ను రీస్ట్రక్చర్ చేసి… ఉద్యోగావకాశాలు లభించేలా చర్యలు చేపట్టాలి. స్నాతకోత్సవాలను ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలి. విదేశాల్లో దీనిని అపురూమైన ఘట్టంగా నిర్వహిస్తారు. విద్యార్థులకు చిరస్థాయిగా గుర్తుండి పోయేలా విశ్వవిద్యాలయాల్లో కాన్వోకేషన్ ప్రక్రియ జరగాలి. ప్రాథమిక, మాధ్యమిక, ఉన్నత విద్యా సంస్థల రేటింగ్ ఎలా ఉందో పరిశీలించాలి” అని ముఖ్యమంత్రి ఆదేశించారు. సమావేశంలో మంత్రులు, వివిధ శాఖల ఉన్నతాధికారులు, జిల్లాల కలెక్టర్లు పాల్గొన్నారు.














