- పర్యాటక మంత్రికి ముఖ్యమంత్రి ప్రశంస
- ప్రతిష్టాత్మక సంస్థతో ఎంఓయూపై అభినందనలు
- అమరావతిలో ‘క్రియేటివ్ సిటీ’ ఏర్పాటుకు ముందడుగు
అమరావతి (చైతన్య రథం): వెలగపూడి సచివాలయంలో జరుగుతున్న కలెక్టర్ల కాన్ఫరెన్స్లో భాగంగా పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ పనితీరును ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రత్యేకంగా అభినందించారు. ముంబయి పర్యటనలో రాష్ట్ర పర్యాటకరంగ ప్రగతికి మంత్రి కందుల దుర్గేష్ చూపిన చొరవను కొనియాడుతూ, “శెభాష్ దుర్గేష్.. వెల్ డన్, కీప్ ఇట్ అప” అంటూ ప్రశంసలు కురిపించారు.
వివరాల్లోకి వెళ్తే ముంబైలోని బాంబే ఎగ్జిబిషన్ సెంటర్లో జరిగిన 24వ ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ అమ్యూజ్మెంట్ పార్క్స్ అండ్ ఇండస్ట్రీస్ ఎక్స్పోలో పాల్గొన్న విశేషాలను మంత్రి కందుల దుర్గేష్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి వివరించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ పర్యాటకరంగానికి కల్పించిన పారిశ్రామిక హోదా, నూతన పర్యాటక పాలసీ 2024-29, ఇన్వెస్టర్లకు ప్రభుత్వం అందిస్తున్న రాయితీలపై జాతీయ, అంతర్జాతీయ ప్రతినిధులకు సమగ్రంగా వివరించానని తెలిపారు. ఈక్రమంలో ప్రముఖ సంస్థ ‘మోడ్రన్ మస్తీ ప్రైవేట్ లిమిటెడ’ ప్రతినిధులు ఏపీ పర్యాటకరంగ పురోగతిపట్ల ఆకర్షితులై విశాఖపట్నంలో రూ.100 కోట్లతో అమ్యూజ్మెంట్ పార్క్ ఏర్పాటుకు అప్పటికప్పుడు అక్కడే ఎంఓయూ కుదుర్చుకున్నారని మంత్రి దుర్గేష్ తెలిపారు. సినిమారంగం మరియు స్కిల్ డెవలప్మెంట్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగంపై ‘యూరోస’ సంస్థ ప్రతినిధులతో చర్చలు జరిపానన్నారు. ఈ సంస్థ ప్రతినిధులు త్వరలోనే ఆంధ్రప్రదేశ్లో పర్యటించనున్నట్లు మంత్రి దుర్గేష్ వెల్లడించారు. ఇప్పటికే ఒక పర్యాయం వీరితో సీఎం చంద్రబాబు చర్చించినట్టు గుర్తు చేశారు.
అమరావతి -గ్లోబల్ హబ్:
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ.. భవిష్యత్తు అంతా ‘క్రియేటివ్ ఎకానమీ’దేనని స్పష్టం చేశారు. ఈ దిశగా అమరావతిలో ఒక భారీ ‘క్రియేటివ్ సిటీ’ని ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు. ఇది ఏఐ ఫిల్మ్ ఇండస్ట్రీ, యూట్యూబ్, ఎలక్ట్రానిక్ మరియు డిజిటల్ కంటెంట్ సృష్టికి వేదికగా ఉంటుందన్నారు. అమరావతిని గ్లోబల్ క్రియేటివ్ హబ్గా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు రచిస్తున్నట్టు తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర పురోగతి కోసం నిరంతరం కృషి చేయాలని, పర్యాటక మరియు సాంస్కృతికరంగాల్లో ఏపీని అగ్రస్థానంలో నిలపాలని మంత్రి దుర్గేష్కు ముఖ్యమంత్రి చంద్రబాబు దిశానిర్దేశం చేశారు.














