- రూ.55.63 కోట్ల సీఎంఆర్ఎఫ్ నిధుల విడుదల
- 6,787 మంది పేద కుటుంబాలకు పెద్ద ఉపశమనం
- 21 నెలల్లో సీఎంఆర్ఎఫ్ ద్వారా రూ.1,241 కోట్ల సాయం
- ముఖ్యమంత్రికి టీటీడీ, దుర్గగుడి అర్చకుల ఆశీర్వచనం
అమరావతి (చైతన్య రథం): తెలుగు నూతన సంవత్సరం తొలి రోజన పేదల సంక్షేమానికి అధిక ప్రాధాన్యతనిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తొలి సంతకం చేశారు. గురువారం ఉగాది పర్వదినాన ముఖ్యమంత్రి సహాయ నిధి దస్త్రం పై తొలి సంతకం చేశారు. 6,787 మందికి లబ్ధి కలిగేలా రూ.55.63 కోట్ల ఆర్థిక సాయం విడుదలకు సీఎం ఆమోదం తెలుపుతూ సంతకం చేశారు. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేద కుటుంబాలకు ఈ సాయం ఎంతో ఉపశమనం కలిగించనుంది. ప్రభుత్వం ఏర్పడిన 21 నెలల కాలంలో ఫైనాన్సియల్ అసిస్టెన్స్, వైద్య సహాయం, ఎల్ఎసిల ద్వారా రాష్ట్రవ్యాప్తంగా మొత్తం రూ.1,241 కోట్లకుపైగా ప్రభుత్వం నేరుగా ఆర్థిక సాయం అందించింది. దీనిద్వారా 1,36,240 మంది పేదలకు లబ్ధి చేకూరింది. 2024లో 15,206మందికి రూ.184 కోట్లు, 2025లో 1,03,568 మందికి రూ .889 కోట్లు 2026 లో ఇప్పటికి వరకు రూ.17,466 మందికి రూ.169 కోట్లు మొత్తం రూ. 1,36,240 మందికి ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ప్రభుత్వం సాయం అందించింది. ఇప్పుడు తెలుగు సంవత్సరాదిన అదే ఒరవడిని కొనసాగిస్తూ… మరో 6,787 మందికి ప్రయోజనం చేకూర్చే రూ.55.63 కోట్లు విడుదల చేస్తూ దస్త్రంపై ముఖ్యమంత్రి సంతకం చేశారు. ఆర్థిక సవాళ్లు ఉన్నప్పటికీ, పేదల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ముఖ్యమంత్రి చంద్రబాబు వారి వైద్యపరమైన అవసరాల నిమిత్తం నిధులకు లోటు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. వైద్యం చేయించుకుని ఆర్థిక ఇబ్బందులు పడుతోన్న పేదలకు ముఖ్యమంత్రి సహాయ నిధితో ఆర్థిక ఇబ్బందులు తొలుగుతున్నాయి. అంతముందు క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఉగాది సందర్భంగా టీటీడీ, దుర్గగుడి అర్చకులు ఆశీర్వచనం అందించారు. కార్యక్రమంలో టీటీడీ అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరి, దుర్గగుడి ఛైర్మన్ బొర్రా రాధాకృష్ణ, ఈవో శీనా నాయక్ పాల్గొన్నారు.














