- ఈ రోజు చరిత్రలో చిరస్మరణీయం
- టీమ్ -11 వినా.. యావత్ భారతం అమరావతికి అండ
- ‘చట్టబద్ధత’కు కృషిచేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు
- రాజధానిని పూర్తి చేసి.. ప్రధాని చేతుల మీదుగా ప్రారంభిస్తాం
- న్యూఢిల్లీలో మీడియా సమావేశంలో మంత్రి లోకేష్ స్పష్టీకరణ
ఢిల్లీ (చైతన్య రథం): ఈరోజు చరిత్రలో నిలిచిపోయే రోజు. ఐదు కోట్ల రాష్ట్ర ప్రజలు గెలిచిన రోజు. అమరావతి రైతులు అసాధారణ విజయం సాధించిన రోజు… అమరావతి మహిళల అద్వితీయ గెలుపు రోజు.. అని రాష్ట విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ మంత్రి నారా లోకేష్ భావోద్వేగంతో ప్రకటించారు. ‘అమరావతికి చట్టబద్ధత’ బిల్లుకు పార్లమెంట్ ఆమోదం లభించిన అనంతరం ఢిల్లీలో విలేకరులతో మాట్లాడుతూ… “ఆంధ్రులు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. తొలుత మనందరం మద్రాసు రాజధానిగా మద్రాసు స్టేట్లో ఉన్నాం. తర్వాత పొట్టి శ్రీరాములు చేసిన 58 రోజుల దీక్ష, ప్రాణత్యాగంతో భాషాప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడ్డాయి. అందులో భాగంగా కర్నూలు రాజధానిగా ఆంధ్రరాష్ట్రం ఏర్పాటైంది. మూడేళ్ల తరువాత ఒక ఒప్పందంవల్ల మళ్లీ తెలంగాణ, ఆంధ్ర కలిపి హైదరాబాద్ రాజధానిగా రాష్ట్రం ఏర్పాటైంది. 58 సంవత్సరాలు కష్టపడి, చెమటోడ్చి అటు తెలంగాణ, ఇటు ఆంధ్ర ప్రజలు కలసికట్టుగా హైదరాబాద్ను అభివృద్ధి చేసుకున్నాం. ఒక చీకటిరోజు పార్లమెంటులో ఎలాంటి చర్చా జరగకుండా టీవీలు కట్టేసి, తలుపులు మూసేసి ఆంధ్ర రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించారు” అంటూ మంత్రి లోకేష్ ఆంధ్ర రాష్ట్ర చరిత్రను ప్రస్తావించారు.
మెడపట్టి గెంటేశారన్న బాధ ఉంది..
“ఆనాడు చంద్రబాబునాయుడు ప్రతిపక్షనేతగా ఉన్న సమయంలో రెండు ప్రాంతాలకు న్యాయం చేసి ముందుకు వెళ్లండి, లేకపోతే విభజనవల్ల ఒక ప్రాంతం లబ్ధిపొందినా మరో ప్రాంతం తీవ్రంగా నష్టపోతుందని చెప్పారు. అయినా వినకుండా ఏకపక్షంగా ఆంధ్ర రాష్ట్రాన్ని విభజించారు. నేను పుట్టి పెరిగింది తెలంగాణాలోనే. హైదరాబాద్లో ప్రతి గల్లీ నాకు తెలుసు. అయితే ఆ రోజున కట్టుబట్టలతో మెడబట్టి బయటకు గెంటేశారన్న బాధ, ఆవేదన కలిగింది. రాజధాని ఎక్కడ పెట్టాలో తెలియదు. కూర్చునేదానికి సెక్రటేరియట్ లేదు. శాసనసభ సమావేశాలు నిర్వహించుకునేందుకు అసెంబ్లీ లేదు. హైకోర్టు లేదు. పదేళ్లు హైదరాబాద్ మీ రాజధాని. ఆ తర్వాత మీదారి మీరు వెతుక్కోండని సింపుల్గా చెప్పేశారు” అంటూ ఆనాటి పరిస్థితిని గుర్తు చేసుకున్నారు.
అశాస్త్రీయ రాష్ట్ర విభజన దారుణం
“విభజన ఎంత దారుణంగా జరిగిందంటే `షెడ్యూల్ 9, 10 సంస్థలు ఇప్పటికీ అటు తెలంగాణ, ఇటు ఆంధ్ర రాష్ట్రానివో తేలని దుస్థితి నెలకొంది. అశాస్త్రీయంగా జరిగిన విభజనవల్ల ఇప్పుడు కూడా తెలుగు ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆనాడు హైదరాబాద్లోని శాసనసభలో ఏపీ అసెంబ్లీ సమావేశం జరిగింది. ఆ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చాలా స్పష్టంగా అటు ఉత్తరాంధ్రకు, ఇటు రాయలసీమకు సమదూరంలో రాజధాని ఉండాలి. ఆ రాజధాని అమరావతి అని ఆనాడు ప్రకటించారు. ఆ సమయంలో అభివృద్ధి వికేంద్రీకరణ చేసి చూపిస్తామని చెప్పారు. అందులో భాగంగా రైతులు ముందుకొచ్చారు. ప్రధానమంత్రి స్వయంగా వచ్చి అమరావతి పనులకు శంకుస్థాపన చేశారు. ఆనాడు రైతులకు తెలుగుదేశం, బిజెపి, జనసేన, చివరకు వైసీపీ కూడా భరోసానిచ్చాయి. అందరూ అమరావతికి సంపూర్ణ మద్దతు తెలిపారు. అందుకే ఐదు కోట్ల ఆంధ్రుల కోసం తమ భూములు రాజధాని కోసం ఇస్తున్నామని అక్కడి రైతులు చాలా స్పష్టంగా చెప్పారు” అని మంత్రి లోకేష్ పేర్కొన్నారు.
మూడు ముక్కలాటపై అలుపెరుగని పోరాటం
2019 ఎన్నికలకు ముందు మేము చాలా స్పష్టంగా ప్రజలకు చెప్పాం. పొరపాటున ప్రభుత్వం మారితే అమరావతి రాజధానిగా ఉండదు, తరలిస్తారని చెప్పాం. ఆనాటి ప్రతిపక్షనేత, ప్రస్తుత పులివెందుల ఎమ్మెల్యే జగన్ తాను ఇక్కడే ఇల్లు కట్టుకున్నాను. రాజధానిని ఎక్కడకూ తీసుకెళ్లనని చెప్పి ప్రజలను మోసగించారు. ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత రాజధానిపై అనేక ఆరోపణలు చేసి మూడుముక్కలాట మొదలుపెట్టారు. ఆరోజు శాసనసభలో మా ఎమ్మెల్యేలు పోరాడారు, కౌన్సిల్లో మాకు మెజారిటీ ఉంది. కౌన్సిల్ సాక్షిగా మేమంతా పోరాడాం. నేను కూడా ఆనాడు శాసనమండలిలో ఎమ్మెల్సీని. బిల్లును సెలక్ట్ కమిటీకి పంపించాలని సభ్యులమంతా కోరినా… అప్పటి లెజిస్లేటివ్ ఎఫైర్స్ మంత్రి బొత్స సత్యనారాయణ చైర్మన్ సంతకం లేకుండా బిల్లు పాసైందని చెప్పి, గవర్నర్ ఆమోదానికి పంపించారు. తెలిసో, తెలియకో గవర్నర్ ఆరోజు పర్మిషన్ ఇచ్చారు. మేము న్యాయపోరాటం చేయగా, వారు తప్పుచేశారని కోర్టు ఆక్షింతలు వేసింది.
రైతులను వెంటాడి వేధించారు
ఆరోజు నుంచి ప్రజారాజధాని కోసం ఉద్యమం మొదలైంది. పెద్దఎత్తున రైతులు, మహిళలు రోడ్డుపైకి వచ్చి 5కోట్ల ఆంధ్రుల కోసం పోరాడారు. ఉద్యమించినందుకు వారిని అన్నిరకాలుగా అవమానించారు. వారిపై దాడిచేశారు. శాంతియుతంగా వారు అమరావతినుంచి తిరుమలకు, సింహాచలానికి పాదయాత్ర చేయాలన్నా అనేక ఇబ్బందులు పెట్టారు. అవమానించారు. రాజధాని గ్రామాల్లో ప్రజలు స్వస్థలాల్లో తిరగాలంటే ఆధార్ కార్డు చూపించాల్సిన పరిస్థితులు కల్పించారు. ఐదేళ్లు 144వ సెక్షన్ పెట్టారు. ప్రజలను అన్నిరకాలుగా వేధించారు. 5కోట్ల ఆంధ్రులు అదంతా ప్రత్యక్షంగా చూశారు. అందుకే వారిలో ఆవేదన, బాధ కలిగాయి. ఆనాడు మేం చాలా స్పష్టంగా ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని అమరావతి, అభివృద్ధి వికేంద్రీకరణ చేసి చూపిస్తామని చెప్పాం. అదే నినాదంతో మేమంతా ఎన్డీయే కూటమిగా గత ఎన్నికల్లో కలసికట్టుగా పోటీచేశాం. అందుకే ప్రజలు 94శాతం మ్యాండేట్ మాకిచ్చారు. గత పాలకులు ఎక్కడ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ పెడతామని మాయమాటలు చెప్పారో అక్కడే విశాఖ ప్రజలు మా ఎంపీని అత్యధికంగా 5లక్షల ఓట్లకు పైగా భారీ మెజారిటీతో గెలిపించారు. విశాఖపట్నంతోపాటు శ్రీకాకుళం, విజయనగరం, హిందూపూర్, అనంతపూర్, చిత్తూరు జిల్లాల ప్రజలంతా అమరావతికే మద్దతుగా నిలిచారు. ఒకేరాష్ట్రం, ఒకే రాజధాని, అమరావతే మా రాజధాని అని తెలుగు ప్రజలు స్పష్టంచేశారు” అని లోకేష్ ఉద్వేగంతో ప్రకటించారు.
ప్రధాని ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు
ఎన్డీయే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత టీమ్-11 అనేక దుష్ప్రచారాలు చేసింది. ఇప్పుడు కూడా చేస్తుంది. మళ్లీ పొరపాటున అధికారంలోకి వస్తే మూడు రాజధానులు చేస్తామని ఇప్పుడు కూడా చెబుతున్నారు. వారి తప్పుడు ప్రచారం ఆంధ్ర రాష్ట్రానికి, అమరావతికి రావాల్సిన పెట్టుబడులు నెమ్మదించాయి. ఇప్పటికే చాలా నష్టపోయాం. మా భవిష్యత్తు ఏమిటని రైతుల్లో ఆందోళన వచ్చింది. అంధ్రప్రదేశ్కు అమరావతి ఏకైక శాశ్వత రాజధానిగా చట్టబద్ధత ఉండాలని రైతులంతా కోరారు. అందులో భాగంగా ఒక స్పెషల్ సెషన్ పెట్టుకుని, రోజంతా దీనిపై చర్చించాం. అమరావతే శాశ్వత రాజధానిగా ఉండాలని ఏక్రగీవంగా శాసనసభలో తీర్మానం చేసి పార్లమెంటుకు పంపించారు. ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా ప్రత్యేక శ్రద్ధ తీసుకొని పార్లమెంటులో బిల్లు పాస్ చేయించేందుకు చొరవచూపారు” అని మంత్రి లోకేష్ నేపథ్యాన్ని వివరించారు.
యావత్ భారతదేశం అండగా నిలబడింది
ఒకే ఒక్క పార్టీ తప్ప మొత్తం భారతదేశం ఆంధ్ర రాష్ట్రానికి అండగా నిలబడింది. చాలామంది ఈరోజు రాజ్యసభలో మాట్లాడుతూ… అమరావతికి మద్దతివ్వడం ప్రారంభం మాత్రమే. అంతా ఆంధ్రప్రదేశ్కు అండగా నిలబడాలని, ఇప్పటికే అనేక ఇబ్బందులు ఎదుర్కొంది. అయిదేళ్లు చాలా నష్టపోయింది. టీమ్-11 పార్టీ మినహా మేమంతా అండగా ఉంటామని అన్ని పార్టీలు కలసికట్టుగా మద్దతునిచ్చాయి. బిజెపి, జనసేన, జెడియు, అటుపక్కన కాంగ్రెస్, టిఎంసి, ఆప్, ఎస్పి… అందరూ ముక్తకంఠంతో ఏపీ శాశ్వత రాజధాని అమరావతి అని మాట్లాడారు. ఈరోజు కూడా రాజ్యసభలో కరెక్టుగా 11 పార్టీలు మాట్లాడాయి. గత పాలకులు చేసిన పొరపాట్లకుగాను 11నెంబర్ వారిని వెంటాడుతోంది. ఒకపార్టీ మాత్రం వాకౌట్ చేసింది. అది ప్యాషనో, మరేమిటో సిసిడి (క్రెడిట్ చోరీ డిజార్డర్) ఉన్న వ్యక్తిని మీరంతా అడగాలి. మొత్తం భారతదేశం ఈరోజు ఆంధ్రులకు అండగా నిలబడింది. ఇందుకు రాష్ట్ర ప్రజలంతా గర్వపడాలి. మాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటాం. తప్పనిసరిగా అమరావతి పనులు పూర్తిచేస్తాం. ప్రధానిమంత్రి మోదీజీని తీసుకెళ్లి నూతన రాజధానికి రిబ్బన్ కటింగ్ చేయించే బాధ్యత ఎన్డీయే ప్రభుత్వం తీసుకుంటుంది. ఐదు కోట్ల ఆంధ్రులు గర్వపడేవిధంగా అమరావతిని అభివృద్ధి చేస్తాం. రాజధానితోపాటు అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేసే బాధ్యత తీసుకుంటామని లోకేష్ వివరించారు.














