- ప్రజాస్వామ్య పరిరక్షణకు ఎన్టీఆర్ ఎనలేని కృషి: టీడీ జనార్దన్
- దుబాయ్లో ఘనంగా ‘ఎన్టీఆర్ సజీవ చరిత్ర’ ఆవిష్కరణ
దుబాయ్ (చైతన్యరథం): అన్న ఎన్టీఆర్ స్ఫూర్తితో ముందుకు సాగుదామని తెలుగు ప్రజలకు ఏపీ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పిలుపు ఇచ్చారు. దుబాయ్లో జరిగిన తెలుగువారి ఆత్మీయ సమ్మేళనంలో టీడీపీ పొలిట్బ్యూరో సభ్యుడు, రాజకీయ కార్యదర్శి టీడీ జనార్దన్, విక్రమ్ పూల రూపొందించిన ‘ఎన్టీఆర్ సజీవ చరిత్ర’ పుస్తకంతో పాటు దాని ఆడియో ఆవిష్కరణ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా మంత్రి నిమ్మల మాట్లాడుతూ తెలుగు జాతి గౌరవాన్ని ప్రపంచానికి చాటిన మహానేత అన్న ఎన్టీఆర్ అని కొనియాడారు. ముఖ్యంగా 1984లో జరిగిన చారిత్రాత్మక రాజకీయ పరిణామాలు, ప్రజల మద్దతుతో ఎన్టీఆర్ సాధించిన విజయం రాజకీయ చరిత్రలో చిరస్థాయిగా నిలిచాయని గుర్తు చేశారు. ఎన్టీఆర్ ఆశయాలు, పోరాట పటిమ నేటి తరానికి మార్గదర్శకమన్నారు.
టీడీపీ పొలిట్బ్యూరో సభ్యుడు టీడీ జనార్దన్ మాట్లాడుతూ ప్రజాస్వామ్య పరిరక్షణకు ఎన్టీఆర్ చేసిన కృషి అనిర్వచనీయమని పేర్కొన్నారు. ఆయన చూపిన స్ఫూర్తితో యువత సామాజిక బాధ్యతతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. అన్న ఎన్టీఆర్ అపూర్వమైన వ్యక్తిత్వాన్ని స్మరిస్తూ, 1984 నాటి కీలక రాజకీయ పరిణామాలను గుర్తు చేసుకున్నారు. ఎన్టీఆర్ స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకుని, పోరాట పటిమతో జీవితంలో ముందుకు సాగాలని ఆకాంక్షించారు. సినీ రాజకీయ రంగాల్లో ఎన్టీఆర్ చేసిన కృషిని, ఆయన నెలకొల్పిన ఉన్నత ప్రమాణాలను ప్రస్తావించారు. ఆంధ్రదేశానికి ఎంతోమంది ముఖ్యమంత్రులు పాలించిన అందరికి గుర్తుండిపోయేది ఒక్క ఎన్టీఆర్ మాత్రమేనని పేర్కొన్నారు. తెలుగునాట రాజకీయాల్లో ఎన్టీఆర్ ముందు ఎన్టీఆర్ తర్వాత అన్నట్టుగా పాలనా సాగిందని చెప్పారు. ఎన్టీఆర్ శత జయంతిని పురస్కరించుకుని తాము ఎన్టీఆర్ సిద్ధాంతాలను, భావజాలాన్ని ముందుతరానికి, తర్వాత తరానికి తెలియజెప్పాలని ఉద్దేశ్యంతో కమిటీ ఏర్పాటు చేసామని అందరి సహకార సమన్వయంతో ఎన్టీఆర్పై పలు పుస్తకాలు వెలువరిస్తున్నామన్నారు. ప్రత్యేకంగా అన్న ఎన్టీఆర్ యూట్యూబ్ ఛానల్ ఏర్పాటు చేశామని, భవిష్యత్తులో ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేపడతామని, ఎన్టీఆర్ పేరుని అజరామరం చేయడమే తన లక్ష్యమని పేర్కొన్నారు.
ఇదే కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ‘బిజినెస్ రిఫార్మర్`2025’ అవార్డు సందర్భంగా కేక్ కట్ చేసి హర్షం వ్యక్తం చేస్తూ శభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రవాసాంధ్ర వ్యాపారవేత్తలు పీవీ రమణ మూర్తి, నల్లూరి శేషయ్య, రవి గుత్తా, శ్రీనివాసరావు నార్ల విజయవంతంగా నిర్వహించారు. ఎన్ఆర్ఐ టీడీపీ` యూఏఈ కార్యవర్గానికి చెందిన అధ్యక్షుడు విశ్వేశ్వరరావు మోతుకూరి, ఉపాధ్యక్షుడు నిరంజన్ కాచర్ల, ప్రధాన కార్యదర్శి వాసు పొడిపిరెడ్డి, ట్రెజరర్ రాజా రవి, కిరణ్ కోడి, సోషల్ మీడియా ఇన్చార్జ్ హరి కల్లూరి, మీడియా కోఆర్డినేటర్ ప్రసాద్ దారపనేని, గల్ఫ్ కౌన్సిల్ సభ్యులు ఖాదర్ బాషా షేక్, సింగయ్య రామినేని, సురేంద్ర బెజవాడ, మధుసూధన్ కల్లూరి, మోహన్ మురళి, తదితరులు ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించడంలో కీలక పాత్ర పోషించారు.
















