- పునరుద్ధరణ దాటి ప్రగతి పథానికి ఏపీ
- సంక్షేమం అభివృద్ధి.. జోడెద్దుల సవారీ
- ఏడు శ్వేతపత్రాలతో పారదర్శకతకు పెద్దపీట
- సంక్షేమం అభివృద్ధి సమతుల్యతకు పదిసూత్రాలు
- సంపద సృష్టికి మా ప్రభుత్వం నిర్మాణాత్మక కృషి
- హెల్దీ వెల్దీ హ్యాపీ ఏపీ ప్రభుత్వ లక్ష్యం
- శాశ్వత రాజధానిగా అమరావతి..
- ప్రపంచంలోనే ఏపీకి ప్రత్యేక స్థానం
- బడ్జెట్ సెషన్స్ ప్రారంభ ప్రసంగంలో గవర్నర్ అబ్దుల్ నజీర్
అమరావతి (చైతన్యరథం): రాజధాని అమరావతి పునర్నిర్మాణం వేగంగా జరుగుతోందని గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ అన్నారు. ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా ఆయన ఉభయ సభలనుద్దేశించి ప్రసంగించారు. శాశ్వత రాజధానిగా గుర్తించే ప్రక్రియను కేంద్రం ప్రారంభించిందని వివరించారు. నేషనల్ క్వాంటమ్ మిషన్ ద్వారా అమరావతిలో సరికొత్త అధ్యాయం ప్రారంభించామని, ప్రపంచంలోనే రాష్ట్రానికి ప్రత్యేక స్థానం కల్పించేందుకు కృషి చేస్తున్నట్టు తెలిపారు. విశాఖపట్నం, విజయవాడ నగరాల్లో మెట్రో రైలు ప్రాజెక్టుల ద్వారా అద్భుతమైన ప్రజా రవాణా అందుబాటులోకి తెస్తామన్నారు. 175 నియోజకవర్గాల్లో ఎంఎస్ఎంఈ పార్కులు ఏర్పాటు చేసేందుకు కార్యాచరణ అమలు చేస్తున్నట్టు వివరించారు”. “ప్రజా సంక్షేమమనే కోణంలోనే ప్రతి నిర్ణయాన్నీ ప్రభుత్వం తీసుకుంటోంది. ఏడాదికి రూ.33వేల కోట్లతో సూపర్ సిక్స్ సహా ఇతర డీబీటీ కార్యక్రమాలు అమలు చేస్తోంది. 63.12 లక్షల మందికి ఎన్టీఆర్ భరోసా పింఛన్లు ప్రయోజనం కలిగిస్తున్నాయి. 66 లక్షల మందికి పైగా విద్యార్థులకు ‘తల్లికి వందనం’ ద్వారా ఆర్థిక సాయం అందుతోంది. స్త్రీశక్తి పథకంతో మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం అందుతోంది. అన్నదాత సుఖీభవ ద్వారా రూ.20వేలు చొప్పున 46.86 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరుతోంది. దీపం 2.0 పథకం ద్వారా 1.08 కోట్ల మంది పేద కుటుంబాలకు ఏడాదికి మూడు గ్యాస్ సిలెండర్లు ఉచితంగా ఇస్తున్నాం. మెగా డీఎస్సీ ద్వారా 15,941 ఉపాధ్యాయ పోస్టుల భర్తీతో పాటు…. 5,757 మంది కానిస్టేబుళ్ల రిక్రూట్మెంట్ కూడా ప్రభుత్వం పూర్తి చేసింది. ‘మత్స్యకార సేవలో’ పథకం ద్వారా 1.2 లక్షల మందికి రూ.20వేల చొప్పున ఆర్థిక సాయం అందుతోంది. లక్ష మందికి పైగా హ్యాండ్లూమ్, పవర్లూమ్లపై ఆధారపడిన చేనేత కుటుంబాలకు 200, 500 యూనిట్ల చొప్పున ఉచిత విద్యుత్ను ప్రభుత్వం అందిస్తోంది” అని గవర్నర్ నజీర్ వివరించారు.
“జీరో పావర్టీ లక్ష్యంగా ప్రభుత్వం పాలన సాగిస్తోంది. ఫ్యామిలీ బెనిఫిట్ మేనేజ్మెంట్ సిస్టం ద్వారా ప్రతి కుటుంబానికీ అవసరమైన ప్రయోజనాలను అందిస్తున్నాం. త్వరలో ఫ్యామిలీ కార్డును అందించేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. పీ4 ద్వారా పేద, ధనికవర్గాల మధ్య తారతమ్యాలు తగ్గించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది. ఎవరూ ఆకలితో ఉండకూడదని 113 నియోజకవర్గాల్లో 205 అన్న క్యాంటీన్లను ఏర్పాటు చేసింది. త్వరలో మిగిలిన నియోజకవర్గాల్లోనూ గ్రామీణ అన్న క్యాంటీన్లను ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. అందరికీ గృహాలు అనే లక్ష్యంతో గృహాల నిర్మాణాన్ని ప్రభుత్వం చేపడుతోంది. ఎస్సీ వర్గీకరణ ద్వారా అన్ని వర్గాలకూ న్యాయం జరిగేలా చేస్తున్నాం. గిరిజన ప్రాంతాల అభివృద్ధికి ప్రాధాన్యత కల్పించేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తోంది. బీసీల అభ్యున్నతికి కోసం కృషి చేస్తున్న ప్రభుత్వం, వారికి మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రయత్నిస్తోంది. ఎంఎస్ఎంఈల ద్వారా బీసీ వర్గాలను బలోపేతం చేసేందుకు కార్యాచరణ చేపట్టింది. మైనారిటీలకు భద్రత, వారికి అభివృద్ధిలో భాగస్వామ్యం, విద్య, ఆర్థిక సహకారంతో మేలు చేకూరుస్తోంది. వర్ఫ్ ఆస్తుల పరిరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది” అని గవర్నర్ పేర్కొన్నారు.
“ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఐటీ, క్వాంటం కంప్యూటింగ్లాంటి రంగాల్లో దూసుకెళ్తుంది. ప్రముఖ పరిశ్రమల భాగస్వామ్యంతో రాష్ట్రానికి అంతర్జాతీయ గుర్తింపు వస్తోంది. అంతర్జాతీయ సంస్థలు ఏపీని పెట్టుబడులు, నాలెడ్జ్ ఎకానమీకి గమ్యస్థానంగా ఎంచుకున్నాయి. టెక్నాలజీని అందిపుచ్చుకోవటం ద్వారా యువతకు భవిష్యత్లో ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెంచేలా ప్రణాళికతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. ప్రజలకు వైద్య ఖర్చులు తగ్గించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. సంజీవని కార్యక్రమం ద్వారా ప్రజల ఆరోగ్య భద్రతను బలోపేతం చేస్తోంది. యూనివర్సల్ హెల్త్ పాలసీ ద్వారా రాష్ట్రంలో ప్రజలందరికీ ఉచిత ఆరోగ్య బీమా కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది. రాష్ట్రంలోని ప్రతీ వ్యక్తికి రూ.2.5 లక్షల వరకు సమగ్ర ఆరోగ్య బీమా కల్పించేందుకు ప్రభుత్వం ఈ పథకాన్ని అందుబాటులోకి తెస్తోంది. 1.43 కోట్ల పేద కుటుంబాలకు రూ.25 లక్షల వరకు నగదు రహిత వైద్యం అందుబాటులోకి తీసుకువస్తోంది.
క్యాన్సర్ సహా ఇతర ఖరీదైన చికిత్సలకు ఎలాంటి పరిమితి లేకుండా ప్రభుత్వం ఈ బృహత్ పథకాన్ని చేపడుతోంది. వృద్ధుల సంఖ్య పెరగడం వివిధ దేశాలకు సవాల్ గా మారింది. దీనిపై సరైన విధానాన్ని రూపొందించాలని సభను కోరుతున్నాను. అక్రమ మద్యం తయారీ నుంచి విముక్తి కల్పించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. గంజాయి నిర్మూలనలో పురోగతి సాధించింది. యువతకు నైపుణ్య శిక్షణ అందించి మెరుగైన ఉపాధి, ఉద్యోగ అవకాశాలు లభించేలా ప్రణాళికలు చేసింది. గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి కల్పనకు ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తోంది. వికసిత్ భారత్ జీ రామ్ జీ పథకం ద్వారా ఉపాధి రోజులను 100 నుంచి 125 రోజులకు పెంచారు. అభివృద్ధి వ్యూహంలో మహిళలే కేంద్ర బిందువులు, ఆర్థిక భాగస్వాములు, ‘స్వయం’ పేరుతో డ్వాక్రా మహిళలు రూపొందించిన ఉత్పత్తులకు బ్రాండింగ్ చేస్తోంది. ఏడాదికి లక్ష మంది మహిళలను పారిశ్రామికవేత్తలుగా ప్రభుత్వం తీర్చిదిద్దుతోంది. వచ్చే ఏడాది 5 లక్షల మంది మహిళలను పారిశ్రామికవేత్తలుగా మార్చాలన్న లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. అంగన్వాడీలను బలోపేతం చేసి, గర్భిణులు, పిల్లలకు పౌష్టికాహారం అందిస్తోంది. మిషన్ వాత్సల్య, మిషన్ శక్తి ద్వారా మహిళలకు న్యాయ సహకారం కూడా అందిస్తోంది” అని గవర్నర్ స్పష్టం చేశారు.
“ప్రాంతీయ సమానత్వానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ పోర్టులు, రోడ్లు, విమానాశ్రయాలు వంటి మౌలిక సదుపాయాలు, పరిశ్రమల పెట్టుబడులతో ప్రభుత్వం అభివృద్ధి చేస్తోంది. వ్యవసాయం, ఎంఎస్ఎంఈలు, సేవా రంగాలపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఆర్థిక క్రమశిక్షణ, పెట్టుబడుల్లో వేగం, మౌలిక వసతుల అభివృద్ధి వంటివి ఆర్థికకార్యకలాపాలకు దోహదపడుతున్నాయి. రాష్ట్రంలో సాగునీటి వ్యవస్థకు పోలవరం ప్రాజెక్టు వెన్నెముక. 2027 జూన్నాటికి ప్రాజెక్టును పూర్తి చేయాలని ప్రభుత్వం దృఢసంకల్పంతో ఉంది. కరవు ప్రభావిత ప్రాంతాలకు హంద్రీనీవా సుజల స్రవంతి ద్వారా ప్రభుత్వం నీరు అందిస్తోంది. నల్లమల సాగర్-నదుల అనుసంధానం ద్వారా పోలవరం నుంచి గోదావరి వరద జలాలను తరలించాలని ప్రభుత్వం సంకల్పించింది. వంశధార నుంచి దక్షిణ భారతదేశంలోని నదీ వ్యవస్థలను అనుసంధానించేలా ప్రభుత్వం కార్యాచరణ చేపడుతోంది.
గోదావరి పుష్కరాలను దృష్టిలో పెట్టుకుని మౌలిక వసతుల ఏర్పాటు, యాత్రికులకు వసతి, రవాణా వంటి ఏర్పాట్ల కల్పనపై ప్రభుత్వం దృష్టిసారించింది. 28 జిల్లాల సమగ్రాభివృద్ధికి మూడు రీజియన్లుగా విభజించి అభివృద్ధి ప్రణాళికల్ని అమలుచేసేలా కార్యాచరణ చేపడుతోంది. విశాఖ, తిరుపతి, అమరావతి కేంద్రాలుగా రీజియన్లు ఏర్పాటుచేసి ఈ ప్రణాళికలను అమలు చేస్తోంది. కేంద్ర బడ్జెట్లో ప్రకటించిన సిటీ ఎకనామిక్ రీజియన్లు ఈ ప్రణాళికలకు ఉపయోగపడతాయి. విజయవాడ, గుంటూరు, అమరావతి మధ్య రాజధాని నిర్మాణంతో లాజిస్టిక్స్, ప్రముఖ సంస్థల ఏర్పాటు, ఇతర ఆర్థిక లావాదేవీలతో ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతోంది. ఈ మూడు ప్రాంతాలు టైర్-2 నగర సమూహంగా ఎదుగుతున్నాయి. పోర్టు ఆధారిత అభివృద్ధి, ఆక్వా కల్చర్, తీర ప్రాంత సుస్థిరాభివృద్ధి, రాయలసీమలో ఉద్యాన పంటలు, గిరిజన ప్రాంతాల్లో విలువ ఆధారిత అభివృద్ధిపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. క్వాంటం కంప్యూటింగ్ సెంటర్తో అమరావతి కొత్త అధ్యాయాన్ని మొదలు పెట్టింది.
ప్రపంచంలో కొద్ది ప్రాంతాల్లో మాత్రమే అందుబాటులో ఉండే క్వాంటం కంప్యూటింగ్ వ్యవస్థలను ఏపీలో స్థాపించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అమరావతి పునర్నిర్మాణాన్ని ప్రభుత్వం వేగంగా చేపట్టింది. రాజధాని రైతుల్లో విశ్వాసం పెరిగింది. అమరావతిని శాశ్వత రాజధానిగా ఉండేలా చట్టబద్దత కల్పించేలా కేంద్ర ప్రభుత్వం కూడా ప్రక్రియ ప్రారంభించింది. విశాఖ, విజయవాడ నగరాల్లో మెట్రో రైల్ వ్యవస్థను ప్రభుత్వం అభివృద్ధి చేస్తోంది. కేంద్ర బడ్జెట్లో మూడు హైస్పీడ్ రైల్ కారిడార్లు ఏపీ మీదుగా వెళ్లనున్నట్టు ప్రకటించడం కీలకమైన అంశం. రాష్ట్ర ప్రభుత్వం 25కు పైగా కొత్త పాలసీలను ప్రకటించి రాష్ట్ర అభివృద్ధికి చర్యలు తీసుకుంటోంది. పారిశ్రామిక ప్రగతి కోసం 175 ఎంఎస్ఎంఈ పార్కులను ప్రభుత్వం అభివృద్ధి చేస్తోంది. విశాఖ-చెన్నై పారిశ్రామిక కారిడార్, కొప్పర్తి, ఓర్వకల్లు పారిశ్రామిక క్లస్టర్ల ద్వారా ప్రాంతీయ సమతుల్యతను ప్రభుత్వం సాధిస్తోంది. స్పేస్ సిటీ, ఏరోస్పేస్ సిటీ, ఎలక్ట్రానిక్ సిటీ, డ్రోన్ సిటీ, క్వాంటం వ్యాలీ, గ్రీన్ హైడ్రోజన్ సిటి, సెమీకండక్టర్ ఎకో సిస్టంలాంటివి ఏపీ అభివృద్ధికి కీలకం అవుతాయి” అని గవర్నర్ పేర్కొన్నారు.
“గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ అమ్మోనియా సహా పునరుత్పాదక ఇంధం ద్వారా క్లీన్ ఎనర్జీ ఉత్పత్తిపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఏపీని క్లీన్ ఎనర్జీ ఎకనామిక్ హబ్ మార్చడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోంది. విద్యుత్ వినియోగదారులపై భారం వేయకుండా రూ.4,498 కోట్ల మేర ట్రూ అప్ భారాన్ని ప్రభుత్వమే భరిస్తోంది. తొలిసారిగా ట్రూ డౌన్ విధానం ద్వారా ప్రజలపై యూనిట్కు 13 పైసల చొప్పున విద్యుత్ భారాన్ని తగ్గించింది. గతంలో తప్పుడు నిర్ణయాలతో ధ్వంసమైన ఏపీ విద్యుత్ రంగం ఇప్పుడు జాతీయ స్థాయిలో మోడల్గా అవతరించింది. తక్కువ ధరతో డేటా సెంటర్లకు విద్యుత్ అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. సీఐఐ సదస్సు ద్వారా రూ.13.25 లక్షల కోట్ల పెట్టుబడులకు 610 ఎంవోయూలు కుదిరాయి. వీటి ద్వారా 16.13 లక్షల మందికి ఉద్యోగాలు లభించే అవకాశం ఉంది. 14 ఎస్ఐపీబీల ద్వారా 8.74 లక్షల కోట్ల పెట్టుబడులకు ఆమోదాన్ని తెలిపి పరిశ్రమలు స్థాపించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. పర్యాటక రంగానికి పరిశ్రమహోదా ఇచ్చి ఆ రంగంలో పెట్టుబడులకు ఊతమిచ్చేలా చర్యలు చేపట్టింది. కేంద్ర బడ్జెట్లో అరకు లోయ, పులికాట్ సరస్సుల వద్ద టూరిజం అభివృద్ధి ప్రాజెక్టుల గురించి కూడా ప్రస్తావించారు.
వీటిని ఉపయోగించుకుని ఈ రంగంలో పెద్ద ఎత్తున ప్రాజెక్టులు సాధించేలా చర్యలు చేపట్టింది. సాగునీటి రంగం అభివృద్ధిలో కీలకంగా మారింది. తక్కువ వర్షపాతం కలిగిన అనంతపురంలాంటి ప్రాంతాలు హార్టీకల్చర్ హబ్గా మారుతున్నాయి. ‘పీఎం ప్రణామ్’ పథకం ద్వారా రసాయన ఎరువుల వినియోగం తగ్గించి భూసారాన్ని మెరుగుపరిచేలా ప్రభుత్వం కార్యాచరణ చేపట్టింది. పొగాకు, కోకోవంటి పంటలకు మార్కెట్ ఇంటర్వెన్షన్ ద్వారా రైతులను ప్రభుత్వం ఆదుకుంది. 2030 నాటికి అరకు కాఫీ, కోకో ప్రాసెసింగ్లో రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలబెట్టటమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోంది” అని వివరించారు.
“పరిపాలనా సంస్కరణలను తీసుకువచ్చి టెక్నాలజీ ద్వారా ప్రభుత్వం సులభరీతిలో సేవలు అందిస్తోంది. అలాగే డేటా ఆధారిత నిర్ణయాలను తీసుకుని వేగంగా సేవలు అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. వన్ ఫ్యామిలీ-వన్ ఎంట్రప్రెన్యూర్ కార్యక్రమం ద్వారా పారిశ్రామిక అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోంది. యువపారిశ్రామికవేత్తలు దీనిని అందిపుచ్చుకునేలా ప్రోత్సాహన్ని అందిస్తోంది. ప్రజలకు పాలనను మరింత దగ్గర చేసేందుకు 26జిల్లాలను 28కి ప్రభుత్వం పెంచింది. భూ రికార్డులను డిజిటలైజేషన్ ప్రక్రియ ద్వారా భద్రపరచడంతో పాటు సర్వే ప్రక్రియను పటిష్టంగా నిర్వహిస్తోంది. ల్యాండ్ టైటిలింగ్ యాక్టును రద్దు చేయటంతో పాటు 22 (ఎ) కింద పెట్టిన భూములను ప్రభుత్వం సమీక్షిస్తోంది. స్వచ్ఛాంధ్ర కార్యక్రమం ద్వారా పర్యావరణ పునరుద్ధరణ చర్యలు చేపట్టింది. గత పాలకులు వదిలివెళ్లిన చెత్తను తొలగించి సర్క్యులర్ ఎకానమీని కూడా ప్రోత్సహిస్తోంది.
‘మన మిత్ర’ వాట్సప్ ద్వారా ప్రజలకు చేరువగా ప్రభుత్వ సేవలను దగ్గర చేసింది. 18 ఏళ్ల వయసు లోపువారికి సామాజిక మాధ్యమాల వినియోగంపై నియంత్రణ విధించేలా చట్టం చేసే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోంది. ఆర్థిక ఒత్తిళ్లు, బాధ్యతలూ ఉన్నా క్రమశిక్షణతో పరిపాలన సాగిస్తోంది. 2025-26 అంచనాల ప్రకారం రాష్ట్ర జీఎస్టీపీ రూ.17.62 లక్షల కోట్లకు పెరిగింది. తలసరి ఆదాయం రూ.2.95 లక్షలకు చేరింది. వ్యవసాయంలో వృద్ధి 7.83 శాతం నమోదైంది. పరిశ్రమల రంగం 9.73 శాతం, సేవల రంగం 12.94 శాతం మేర వృద్ధిని నమోదు చేశాయి. హెల్తీ, వెల్డీ, హ్యాపీ ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోంది” అని గవర్నర్ అబ్దుల్ నజీర్ బడ్జెట్ ప్రసంగంలో వివరించారు.అంతకుముందు అసెంబ్లీ వద్దకు చేరుకున్న గవర్నర్కు సీఎం చంద్రబాబు, స్పీకర్ అయ్యన్నపాత్రుడు, శాసనమండలి చైర్మన్ మోషేరాజు స్వాగతం పలికారు.













