పారిశ్రామికరంగంలో ఇదో ప్రగతి అడుగు
కేంద్రమంత్రులతో కలిసి నేడు సీఎం భూమిపూజ
రూ.1,35,964 కోట్ల పెట్టుబడితో ఉక్కు పరిశ్రమ
ప్రత్యక్షంగా, పరోక్షంగా లక్షమందికి ఉపాధి
ఏడాదికి 17.8 ఎంటి టన్నుల ఉక్కు ఉత్పత్తి
అమరావతి (చైతన్యరథం): ఆంధ్రుల హక్కు విశాఖ ఉక్కు కొడిగట్టకుండా రెండు చేతులూ అడ్డుపెట్టి పరిరక్షించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. నేడు మరో ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు శ్రీకారం చుడుతున్నారు. దీంతో `ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక అభివృద్ధిలో ఇదొక చారిత్రక అడగుగా నిలవనుంది. ఉక్కు ఉత్పత్తిలో అగ్రగామి సంస్థ ఆర్సెలార్ మిట్టల్ నిప్పాన్ స్టీల్ ఇండియా (ఏఎంఎనఎస్ ఇండియా) సంస్థ 17.8 మిలియన్ మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో రాష్ట్రంలో గ్రీన్ఫీల్డ్ ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ను నెలకొల్పుతోంది. దీనికి నేడు అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం రాజయ్యపేటలో కేంద్రమంత్రులతో కలిసి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు భూమిపూజ చేయనున్నారు. రూ.1,35,964 కోట్ల భారీ పెట్టుబడితో ఏర్పాటుకానున్న ప్రాజెక్ట్ ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా లక్షమందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించనున్నాయని అంచనా. 5,465 ఎకరాల్లో మొత్తం రెండు దశల్లో ఈ గ్రీన్ ఫీల్డ్ ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ ప్రాజెక్టు సాకారంకానుంది. మొదటి దశలో 7.3 మిలియన్ మెట్రిక్ టన్నులు, రెండో దశలో 10.5 మిలియన్ మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో ఉక్కు ఉత్పత్తిని సాగించే పరిశ్రమకు నేడు బీజం పడుతోంది.
క్యాప్టివ్ పోర్టుతో మరో 6 వేల ఉద్యోగాలు
స్టీల్ ప్లాంట్కు అనుబంధంగా 50 మిలియన్ మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో అదనంగా 316 ఎకరాల్లో క్యాప్టివ్ పోర్టును కూడా ఏఎంఎనఎస్ ఇండియా ఏర్పాటు చేయనుంది. దీనికోసం ప్రత్యేకంగా రూ.11,198కోట్ల పెట్టుబడి పెట్టనుంది. దీంతో మరో ఆరువేలమందికి ఉద్యోగాలు రానున్నాయి. ఏఎంఎనఎస్ ఇండియా ప్లాంట్ ఏర్పాటుతో విశాఖ ఎకనమిక్ రీజియన్ పరిశ్రమల హబ్గా రూపుదిద్దుకోనుంది. గ్రీన్ఫీల్డ్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటుద్వారా దేశంలో భారీగా పెరిగిన ఉక్కు మార్కెట్లో కీలకపాత్ర పోషించే అవకాశం ఏఎంఎనఎస్ ఇండియాకు లభించనుంది.
అన్నివిధాలా రాష్ట్ర ప్రభుత్వ సహకారం
ఈ ప్రాజెక్టు త్వరితగతిన నిర్మాణం పూర్తి చేసేందుకు ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తోంది. స్టీల్ ప్లాంట్ను ఎన్హెచ్-16తో కలిపేలా 4 లేన్ రహదారి విస్తరణ పనులు చేపట్టింది. కనెక్టివిటీ పెంచడంతోపాటు పరిశ్రమకు అవసరమయ్యే నీరు, విద్యుత్వంటి మౌలిక వసతులు శరవేగంగా కల్పిస్తోంది.
రాష్ట్ర ముఖచిత్రాన్ని మార్చనున్న స్టీల్ ప్లాంట్
నక్కపల్లిలో ప్రతిష్టాత్మక అర్సెలార్ మిట్టల్ నిప్పన్ స్టీల్ ప్లాంట్ శంకుస్థాపన ఏర్పాట్లను గనులు భూగర్భ వనరులు ఎక్సైజ్ మంత్రి కొల్లు రవీంద్ర క్షేత్రస్థాయిలో పరిశీలించారు. వేదికపై ఏర్పాట్లు, గ్యాలరీలో సదుపాయాలను పరిశీలించి పలు సూచనలు చేశారు. పనుల పురోగతిపై సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. వాహనాల పార్కింగ్, ట్రాఫిక్ క్రమబద్ధీకరణ, భద్రతా ఏర్పాట్లపై చర్చించారు. శంకుస్థాపనకు కేంద్ర, రాష్ట్ర మంత్రులు, స్పీకర్, ఎమ్మెల్యేలు, భారీ సంఖ్యలో ప్రజలు హాజరుకానున్న నేపథ్యంలో భద్రతపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. భారీగా జన సమీకరణ జరిగే నేపథ్యంలో ఏర్పాట్లను దగ్గరుండి పరిశీలించారు. కార్యక్రమంలో హోంమంత్రి వంగలపూడి అనిత, ఎంపీ సీఎం రమేష్, ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి, జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్, జేసీ శౌర్యమన్ పటేల్, మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్య, ఏపీఐఐసీ చైర్మన్ మంతెన సత్యనారాయణ రాజు తదితరులు పాల్గొన్నారు.
సీఎం సభకు విస్తృత ఏర్పాట్లు
చందనాడ పంచాయతీ శివారు పాటిమీద గ్రామంలో ఆర్సెలార్ మిట్టల్- నిప్పన్ స్టీల్ప్లాంట్ భూమి పూజ, సీఎం బహిరంగ సభకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. సోమవారం జరిగే కార్యక్రమానికి సీఎం చంద్రబాబు, కేంద్ర, రాష్ట్ర మంత్రులు హాజరుకానున్నారు. ఇందుకోసం విశాలమైన సభావేదికను సిద్ధం చేశారు. వాహన పార్కింగ్కు సుమారు 10 ఎకరాల స్థలాన్ని కేటాయించారు. ప్రతిష్ఠాత్మకంగా జరిగే కార్యక్రమానికి అధికార యంత్రాంగం ముమ్మర ఏర్పాట్లు చేసింది. వీఐపీల భద్రతకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని, అదే సమయంలో సభకు వచ్చే సామాన్య ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకూడదని పోలీస్ అధికారులను హోంమంత్రి వంగలపూడి అనిత ఆదేశించారు. ఏర్పాట్లను కలెక్టర్ విజయకృష్ణన్, సీఎం ప్రోగ్రాం కో-ఆర్డినేటర్ సత్యనారాయణరాజు, ఎస్పీ తుహిన్ సిన్హాతో కలిసి పర్యవేక్షించారు.
సీఎం చంద్రబాబు టూర్ షెడ్యూల్
ముఖ్యమంత్రి చంద్రబాబు సోమవారం ఆర్సెలార్ మిట్టల్-నిప్పన్ స్టీల్ప్లాంట్ భూమి పూజకు హాజరుకానున్నారు. మధ్యా హ్నం 2 గంటలకు గుంటూరు జిల్లా ఉండవల్లి నుంచి ఆయన హెలీకాప్టర్లో బయలుదేరి మధ్యాహ్నం 3.30 గంటలకు నక్కపల్లి మండలం చందనాడ గ్రామానికి చేరుకుంటారు. 3.35 గంటలకు అక్కడ నుంచి రోడ్డు మార్గంలో బయలుదేరి 3.40 గంటలకు పాటిమీద గ్రామంలో స్టీల్ప్లాంట్ భూమి పూజ జరిగే స్థలానికి చేరుకుంటారు. 3.55 గంటల వరకు ప్లాంట్ ఏర్పాటు స్థలాన్ని, బ్లూప్రింట్లను సీఎం స్వయంగా పరిశీలిస్తారు. సాయంత్రం 5.28 గంటలకు స్టీల్ప్లాంట్కు భూమిపూజ చేసి శిలాఫలకాన్ని ఆవిష్కరిస్తారు. అనంతరం 5.30 గంటలకు రోడ్డు మార్గంలో బయలుదేరి చంద్రనాడ హెలీప్యాడ్కు చేరుకుంటారు. 5.40 గంటలకు హెలీకాప్ట్టర్లో బయలుదేరి 7.10 గంటలకు విజయ వాడ విమానాశ్రయానికి చేరుకుంటారు.

















