Telugu Desam

చంద్రబాబు పాలనంటే యువతకు గెలుపు ధీమా

తెలుగుదేశం పార్టీకి పునాది యువశక్తి. అలాగే ఏ రంగంలో అయినా ఉజ్వల భవిష్యత్తును అందుకోవాలనుకునే యువతకు మొదటి ఎంపిక తెలుగుదేశం పాలన. ఎందుకంటే కులం, మతం వంటి ఏ సంకుచిత భావాలకు తావు లేకుండా... కేవలం ప్రశాంతతో కూడిన ప్రగతి పూర్వక సమాజాన్ని కోరుకునే పార్టీ తెలుగుదేశం. అందునా అభివృద్ధికి బ్రాండ్ అంబాసిడర్ గా... సాంకేతిక పరిజ్ఞానం కలిగిన అరుదైన రాజకీయ వేత్తగా... మారుతున్న శాస్త్ర విజ్ఞానానికి అనువుగా ఎప్పటికప్పుడు తనను తాను తీర్చిదిద్దుకునే నిత్య విద్యార్థిగా పిలువబడే నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో... యువత భవితకు భరోసా ఇవ్వగలిగిన ఏకైక పార్టీగా తెలుగుదేశం పార్టీ గుర్తింపు తెచ్చుకుంది.

ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా...

చంద్రబాబు నాయుడు 1995లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టేనాటికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కేవలం 37 ఇంజనీరింగ్ కాలేజీల్లో 10,455 సీట్లు ఉండేవి. 2004 నాటికి 225 ఇంజనీరింగ్ కళాశాలల్లో 62,750 సీట్లు విద్యార్థులకు అందుబాటులోకి వచ్చాయి. అంతేకాదు ఎన్టీఆర్ హయాంలో ఎంసెట్ విధానాన్ని ప్రవేశపెడితే... చంద్రబాబు హయాంలో ఎంసెట్ ఆన్ లైన్ కౌన్సిలింగ్ విధానం అమలులోకి వచ్చింది. చంద్రబాబు కృషి ఫలితంగా దేశంలోనే మొదటి ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సంస్థ రాష్ట్రంలో ఏర్పాటైంది. వైద్యవిద్యలో కూడా 1180 సీట్ల నుండి 21 కాలేజీల్లో 2650 సీట్లు అందుబాటులో ఉండేలా చేసి విద్యార్థులకు విద్యావకాశాలు పెంచారు చంద్రబాబు. 1999లో అనంతపురంలో కొత్తగా ప్రభుత్వ వైద్య కళాశాల ఏర్పాటు చేసారు. అలాగే పీజీ సీట్లను కూడా 696 నుండి 1170 సీట్లకు పెంచారు. విజన్ 2020 స్పూర్తితో ఉన్నత విద్యలో ప్రైవేటు భాగస్వామ్యాన్ని పెంచారు.
ఇంటర్ మీడియట్ విద్యలోనూ 906 ప్రైవేటు జూనియర్ కాలేజీలను కొత్తగా అనుమతించారు. అలాగే 362 ప్రభుత్వ జూనియర్ కాలేజీలను ప్రారంభించారు. ఎంసెట్ కోచింగ్ ను జూనియర్ కాలేజీల టైం టేబుల్ లో అంతర్భాగం చేసారు.
చంద్రబాబు పాలన అనగానే యువత చెప్పుకునేది సాఫ్ట్ వేర్ ఉద్యోగాల గురించి. కలలో కూడా ఊహించనట్టుగా లక్షల్లో జీతాలిచ్చే ఉద్యోగాలు యువత సొంతం అయ్యాయంటే అది చంద్రబాబు కృషి ఫలితమే. విదేశాలు చూసి రావాలంటే లక్షలు ఖర్చుపెట్టాలి. అలాంటిది ఆఫీస్ పని మీద తెలుగు యువత అనేక దేశాలు కంపెనీ ఖర్చుతో చుట్టి వచ్చేస్తున్నారు. అంతలా యువత ప్రతిభకు పట్టం కట్టే రోజులను తెచ్చింది చంద్రబాబు నాయుడు. ప్రపంచవ్యాప్తంగా ఈ రోజు అనేక దేశాల్లో తెలుగు వాళ్ళు తమ సత్తా చాటుతున్నారంటే కారణం చంద్రబాబు ఇప్పించిన అవకాశాలు. ఆరోజు చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ లో సృష్టించిన ఐటీ విప్లవం మారుమూల గ్రామాల్లోని రైతు బిడ్డల్ని సైతం విదేశీ విమానాల్ని ఎక్కించింది. దేశంలో ఏ రాజకీయ నాయకుడు కూడా యువతకు ఇంతటి ఉజ్వల భవితను అందించలేదు. అది ఒకే ఒక్కడు చంద్రబాబుతోనే సాధ్యమైంది.
2002 ఆగస్టు 6న నాస్కామ్ విడుదల చేసిన గణాంకాల ఆధారంగా 2001-2002 సంవత్సరానికి ఐటీ ఆధారిత సర్వీసుల ద్వారా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అందుకున్న ఆదాయం రూ.690 కోట్లు. 1995-96 కాలంలో దేశంలో ఐటీ రంగానికి కేంద్రమైన బెంగళూరు ఆ ఏడాది రూ. 495 కోట్ల ఐటీ ఆధారిత సర్వీసుల ఆదాయాన్ని అందుకుని ఆంధ్రప్రదేశ్ తరువాత రెండవ స్థానంలో నిలిచింది. కేవలం ఆరేళ్ళలో ఆంధ్రప్రదేశ్ ఇలా అగ్రస్థానానికి ఎగబాకడం చంద్రబాబు దార్శనికత, కృషికి తోడు మన తెలుగు యువత ప్రతిభ నైపుణ్యాల ఫలితం.
నారా చంద్రబాబు నాయుడు హయాంలో హైదరాబాద్ నగరాన్ని సాఫ్ట్ వేర్ సిటీగా మార్చడం ఒక చరిత్ర. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన మైక్రోసాఫ్ట్, ఇన్ఫోటెక్, ఐబీఎం, ఒరాకిల్, మోటరోలా, సత్యం వంటి వందలాది సంస్థలు రాష్ట్రంలో కొలువై యువతకు లక్షలాది ఉద్యోగాలు ఇచ్చాయి. ఐటీ వినియోగ క్రమంలో ఈ-సేవా కేంద్రాల ఏర్పాటు ఒక అభ్యుదయ పరిణామం.
పారిశ్రామిక రంగ పరంగా చూస్తే... 2002లో దేశంలో అమలులో ఉన్న వివిధ ప్రాజెక్టుల్లో పెట్టుబడుల దృష్ట్యా గుజరాత్ తరువాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రెండవ స్థానంలో ఉందంటే దానికి కారణం చంద్రబాబు ప్రభుత్వం అమలుచేసిన సింగిల్ విండో చట్టం. 1995-2003 మధ్యకాలంలో రూ.1,37,869 కోట్ల పెట్టుబడులతో 3,240 పరిశ్రమలు ఏపీకి వచ్చాయంటే యువతకు ఉద్యోగ అవకాశాలు ఏ స్థాయిలో వచ్చాయో ఊహించండి.
ఇవి కాకుండా ప్రభుత్వ శాఖల్లో నియామకాలను భారీగా చేపట్టి నిరుద్యోగుల జీవితాల్లో ఆనందం నింపారు. 1995లో గ్రూప్ 1 మరియు 2, 1998 లో MPDO రిక్రూట్మెంట్, 1999 లో గ్రూప్ 1 మరియ 2, 2001 లో జూనియర్ లెక్చరర్ రిక్రూట్మెంట్, 2003 లో గ్రూప్ 1 , గ్రూప్ 2 నోటిఫికేషన్లు ఇచ్చారు. ఇవి కాకుండా పోలీస్, ఎస్ ఐ పోస్టులు అదనం. నాడు చంద్రబాబు కాలంలో ఏడాదికో డీఎస్సీ అన్నట్టుగా ఉండేది పరిస్థితి. ఆ తొమ్మిది సంవత్సరాల పాలనా కాలంలో సుమారు లక్షన్నర టీచర్ పోస్టులను భర్తీ చేసారు. దీనికి తోడు ఏపీలో మహిళలకు మూడో వంతు రిజర్వేషన్ ఇచ్చారు చంద్రబాబు. దాంతో ఎందరో ఆడపిల్లలు ప్రభుత్వ ఉద్యోగాలను పొంది వారి కుటుంబాలకు ధీమా కలిగించారు.

క్రీడాకారులకు స్ఫూర్తినిచ్చిన చంద్రబాబు పాలన:

క్రీడలకు చంద్రబాబు నాయుడు ఇచ్చిన ప్రోత్సాహం నభూతో నభవిష్యతి అనే చెప్పాలి. ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ స్పోర్ట్స్ అథారిటీ (శాప్) ద్వారా మూడంచెల కార్యక్రమాలకు రూపకల్పన చేసి రాష్ట్ర, జిల్లా, మండల స్థాయి విద్యాలయాలు, యువజన సంఘాలు, క్రీడా సంస్థలలో క్రీడా శిక్షణ ఇవ్వడం.. ఆ తర్వాత క్రీడా పోటీలు నిర్వహించి మెరికల్లాంటి క్రీడాకారులను గుర్తించి ప్రత్యేక శిక్షణ ఇవ్వడం ద్వారా యువతకు క్రీడల పట్ల ఆసక్తి పెరిగింది. అలాగే గుర్తింపు పొందిన జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో బంగారు పతకాలను గెలుచుకున్న ఎందరో విజేతలను నగదు బహుమతులిచ్చి ప్రోత్సహించడమే కాకుండా... వారిని సత్కరించి గౌరవించారు చంద్రబాబు.
2000వ సంవత్సరం ఒలింపిక్ పతకాన్ని తీసుకుని స్వరాష్ట్రంలో అడుగుపెట్టిన తెలుగుతేజం కరణం మల్లీశ్వరిని హైదరాబాద్ పురవీధుల్లో ఊరేగింపుగా తీసుకువెళ్లి గౌరవించిందే కాకుండా... అప్పట్లో రూ.10 లక్షల నగదును, ఇంటి స్థలాన్ని, ఇంటి నిర్మాణం కోసం మరో రెండున్నర లక్షల రూపాయలను అందించారు నాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు. అంతేకాదు ఆమెను తన నివాసానికి విందుకు కూడా ఆహ్వానించారు. క్రీడాకారుల పట్ల చంద్రబాబుకు ఉన్న గౌరవానికి ఇది నిదర్శనం. ఆనాడు చంద్రబాబు అందించిన ఈ ప్రోత్సాహం ఎందరో క్రీడాకారుల్లో ఉత్సాహం నింపింది.
అలాగే ప్రముఖ బాడ్మింటన్ క్రీడాకారుడు పుల్లెల గోపీచంద్ 2001లో 'ఆల్ ఇంగ్లాండ్ బాడ్మింటన్ ఛాంపియన్ షిప్' గెలుచుకుని వచ్చినప్పుడు ప్రభుత్వం తరపున గోపీచంద్ కు 25లక్షల రూపాయలు ఇచ్చారు చంద్రబాబు . దాంతో పాటు హైద్రాబాదులో ప్రపంచ స్థాయి బాడ్మింటన్ అకాడమీ ఏర్పాటుచెయ్యమని ప్రోత్సహిస్తూ 5 ఎకరాల భూమిని కూడా ఇచ్చారు. అకాడమీ ద్వారా గోపీచంద్ లాంటి క్రీడాకారులు మరింతమంది పుట్టుకురావాలని ఆయన ఉద్దేశ్యం. ఆయన అనుకున్నట్టుగానే ఆ తర్వాత అకాడెమీ నుంచి ఒక సైనా నెహ్వాల్, ఒక సింధు, శ్రీకాంత్, కశ్యప్ లాంటి వాళ్లు తయారయ్యారు.
2002లో 32వ జాతీయ క్రీడలను ఢిల్లీలో నిర్వహించాలని ఎన్నో ఒత్తిడిలు వచ్చినా చంద్రబాబు పట్టుబట్టి వాటిని ఏపీలో నిర్వహించుకునేలా నాటి ప్రధాని వాజపేయిని ఒప్పించారు. అలాగే 2003లో మొదటి ఆఫ్రో-ఆసియన్ గేమ్స్ ను కూడా హైదరాబాదులో నిర్వహించి నగరానికి క్రీడా రాజధానిగా ప్రపంచ గుర్తింపు తెచ్చారు చంద్రబాబు. ఈ క్రీడా పోటీల నిర్వహణ ద్వారా హైదరాబాద్, విశాఖ వంటి నగరాలకు అద్భుతమైన క్రీడా సౌకర్యాలు సమకూరాయి.
ఇక 2014లో విభజిత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయ్యాక...
రియో ఒలింపిక్స్ 2016లో దేశానికి రజత పతకం తెచ్చిన తెలుగు బాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధుకు రూ.3కోట్లు నగదును, గ్రూప్‌-1 ఉద్యోగాన్ని ఇచ్చి ప్రోత్సహించారు చంద్రబాబు. విషయం ఏంటంటే ప్రభుత్వంలోని ఏ రిక్రూట్‌మెంట్‌ అయినా ఏపీపీఎస్సీ లేదా ఎంప్లాయ్‌మెంట్‌ ఎక్సేంజ్‌ ద్వారా మాత్రమే జరగాలి. దీంతో పీవీ సింధును అధికారిగా నియమించాలంటే ఖచ్చితంగా నిబంధనలు సవరించాల్సి వచ్చింది. అందుకోసం అసెంబ్లీ సమావేశాల్లో పీవీ సిందుకు గ్రూపు వన్ ఉద్యోగం ఇచ్చేలా బిల్లుకు సవరణలు చేసి సభచే ఆమోదింప చేసుకున్నారు చంద్రబాబు.
రియో ఒలింపిక్స్‌లో భారత హాకీ జట్టు తరఫున ప్రాతినిథ్యం వహించిన తెలుగు తేజం వై.రజని... బ్యాడ్మింటన్‌ క్రీడాకారుడు కిదాంబి శ్రీకాంత్‌... కామన్వెల్త్‌ క్రీడల్లో బ్యాడ్మింటన్‌ టీమ్‌ విభాగంలో స్వర్ణం, డబుల్స్‌లో రజతం గెలిచిన తెలుగుతేజం ఆర్‌.సాత్విక్‌ సాయిరాజ్‌... అర్జున అవార్డు గ్రహీత... టెన్నిస్‌ క్రీడాకారుడు మైనేని సాకేత్‌, కోనేరు హంపి, సత్యగీత వంటి ఎందరో క్రీడాకారులకు నగదు బహుమతిలిచ్చి సత్కరించారు. వీరిలో కొందరికి ప్రభుత్వ ఉద్యోగాలను ఇచ్చారు. ఏపీలోనూ పుల్లెల గోపీచంద్‌ అకాడమీకి 12 ఎకరాలు కేటాయించారు చంద్రబాబు. క్రీడాకారులకు ప్రోత్సాహం పట్ల చంద్రబాబుకు ఉన్న నిబద్దత అలాంటిది.

నవ్యాంధ్ర ముఖ్యమంత్రిగా...

ఉద్యోగాల కోసం, బంగారు భవిష్యత్తు కోసం యువత తన మీద పెట్టుకున్న నమ్మకాన్ని నారా చంద్రబాబు నాయుడు ఎప్పుడూ వమ్ము చేయలేదు. 2014లో హైదరాబాద్‌ లేకుండా నవ్యాంధ్ర ఏర్పడినపుడు, 'మనకు ఐటీ ఉద్యోగాలు ఎలా?' అంటూ బెంబేలు పడిన ఆంధ్రప్రదేశ్ యువతకు భరోసా ఇస్తూ... తన అయిదేళ్ల పాలనలో నవ్యాంధ్ర ఐటీ టర్నోవర్‌ను 10 రెట్లు పెంచడంతో పాటు, ఐటీ ఉద్యోగుల సంఖ్యను రెట్టింపు చేసారు చంద్రబాబు.
2012-13లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ఐటీ పరిశ్రమ టర్నోవర్‌ రూ.64,354 కోట్లు. అందులో విశాఖ-తిరుపతి-కాకినాడ-విజయవాడల్లోని కంపెనీల నుంచి జరిగిన వ్యాపారం రూ.1629 కోట్లే. అటువంటిది 2017-18లో ఆంధ్రప్రదేశ్‌ ఐటీ పరిశ్రమ వ్యాపారం రూ.17,500 కోట్లకు పెరిగింది. అంటే అయిదేళ్లలో నవ్యాంధ్ర ఐటీ రంగం 10 రెట్లకు పైగా అభివృద్ధి సాధించింది.
పరిశ్రమల విషయానికి వస్తే... పెట్టుబడులు పెట్టే వారికి ఏ బాదరబందీ లేకుండా 21 రోజుల్లో అనుమతులు ఇచ్చే సింగిల్ విండో విధానాన్ని ప్రవేశ పెట్టడంతో... రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు వచ్చిన వారికి ఏపీ స్వర్గధామంగా మారింది. దాంతో సులభతరం వాణిజ్యం ర్యాంకుల్లో నవ్యాంధ్ర ఏ ఏడాది చూసినా అగ్రస్థానాల్లోనే ఉండేది.
గత చంద్రబాబు ప్రభుత్వ హయాంలో పరిశ్రమల ఏర్పాటుకి చేసుకున్న ఒప్పందాల్లో 42 శాతం... పెట్టుబడుల ఒప్పందాల్లో 47 శాతం ఆచరణలోకి వచ్చాయని... మొత్తంగా యువతకు 9,56,263 ఉద్యోగాలు వచ్చాయని ప్రత్యర్థి పక్షమే ద్రువీకరించిందంటే... వాస్తవానికి ఎన్ని ఉద్యోగాలు వచ్చి ఉంటాయో ఊహించుకోవచ్చు.
శ్రీసిటీనే తీసుకుంటే పెప్సికో, ఇసుజీ, కెల్లాగ్స్‌, ఫాక్స్‌కాన్‌, హీరో, అపోలో టైర్స్‌... వంటి ఎన్నో ప్రతిష్టాత్మక కంపెనీలు గత తెలుగుదేశం హయాంలో నెలకొన్నాయి.
అలాగే ప్రపంచ ఆటో మొబైల్‌ దిగ్గజం కియా మోటార్స్‌ ఆగమనంతో అనంతపురం జిల్లా... పెనుకొండ ప్రాంతం రూపురేఖలే మారిపోయాయి.
ఇక ప్రభుత్వ ఉద్యోగ నియామకాల విషయానికి వస్తే... 2014 నుంచి 2019 మధ్య డీఎస్సీ ద్వారా 17, 589 ఉద్యోగాలను భర్తీ చేసారు. ఇవి కాకుండా వివిధ ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్లు ఇచ్చారు. పోలీస్ రిక్రూట్మెంట్ లు పూర్తి చేశారు.

ప్రతిష్టాత్మక విద్యాసంస్థలు

విభజన చట్టం ప్రకారం ఏపీలో కేంద్రం నెలకొల్పాల్సిన విద్యాసంస్థలను సాధించుకోడానికి ఎంతో పట్టుదలతో కృషి చేసిన చంద్రబాబు... ఆ ప్రతిష్టాత్మక సంస్థలను రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు ప్రతి జిల్లాలోనూ ఉండేలా శ్రద్ధ తీసుకున్నారు. ఇవి మాత్రమే కాకుండా మరికొన్ని విద్యాసంస్థలను, విశ్వవిద్యాలయాలను యువతకు అందుబాటులోకి తెచ్చారు చంద్రబాబు. ప్రజారాజధాని అమరావతి ప్రాంతంలోని విట్‌, ఎస్‌ఆర్‌ఎం, అమృత విశ్వవిద్యాలయాలు ఇందుకు ఉదాహరణ.

విదేశీ విద్యకు సాయం:

బడుగు వర్గాల పిల్లలు విదేశాలలో ఉన్నత చదువులు చదువుకుని అభివృద్ధిలోకి రావాలన్న ఆలోచనతో... గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో... ఎస్సీ, ఎస్టీలతో పాటు బీసీ, కాపు, ఈబీసీ, మైనారిటీ విద్యార్థులకు కూడా ఆర్థిక సహాయాన్ని అందించే పథకాలను అమలు చేసారు చంద్రబాబు. అంబేద్కర్ విదేశీ విద్యానిధి, ఎన్టీఆర్ విదేశీ విద్యాదరణ పేర్లతో అమలైన ఈ పథకాల కింద 15 దేశాల్లో పీజీ, పిహెచ్డి, ఎంబీబీఎస్ వంటి ఉన్నత చదువులు చదివేందుకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విధ్యార్థులకైతే రూ.15 లక్షలు... ఈబీసీ, కాపు విద్యార్థులైతే రూ.10 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందించేవారు. ఈ రకంగా మొత్తం 4528 మంది విద్యార్థులకు రూ.377.7 కోట్ల ఆర్థిక సాయాన్ని అందించారు.

నిరుద్యోగభృతి :

అర్హతలు కలిగిన దాదాపు 5 లక్షల మంది నిరుద్యోగ యువతకు ప్రతి నెల రూ.2 వేల నిరుద్యోగభృతిని ముఖ్యమంత్రి యువనేస్తం పథకం ద్వారా ఇచ్చారు చంద్రబాబు. పైగా వీరందరికీ వారికి ఇష్టమైన రంగాల్లో నైపుణ్య శిక్షణ ఇచ్చి ఉద్యోగార్హత పొందేలా చేశారు.
బీసీ కార్పొరేషన్, కాపు కార్పొరేషన్ తదితర కార్పొరేషన్ ల ద్వారా స్వయం ఉపాధి యూనిట్లు ఏర్పాటు చేసుకునేందుకు యువతకు ఆర్థిక సాయం అందించారు. ఎస్సీ యువతకు ఇన్నోవా వంటి వాహనాలు అందించి వారిని కార్ల యజమానులను చేసారు. యువతీ యువకులంతా జాబ్ కోరే స్థాయి నుంచి జాబ్ ఇచ్చేస్థాయికి ఎదగాలన్నది నారా చంద్రబాబు నాయుడు గారి ఆకాంక్ష.

Welcome Back!

Login to your account below

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Add New Playlist