- ప్రతి కుటుంబంలో ఏఐ ప్రొఫెషనల్ ఉండాలనేది సీఎం విజన్
- ఏపీలో గూగుల్ పెట్టుబడి ప్రారంభం మాత్రమే..
- ఏపీలో అనుభవం, దార్శనికత కలిగిన సమర్థ నాయకత్వముంది
- మార్చిలో గూగుల్ డేటా సెంటర్కు శంకుస్థాపన
- శాన్ ఫ్రాన్సిస్కో బే ఏరియా కౌన్సిల్ సమావేశంలో మంత్రి లోకేష్
శాన్ ఫ్రాన్సిస్కో (చైతన్య రథం): దేశ ఏఐ విప్లవంలో ఆంధ్రప్రదేశ్ను అగ్రపథాన నిలుపుతామని విద్య, ఐటీ మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. ఏఐ యుగంలో నైపుణ్యాలు, విశ్వాసం, రంగాల మార్పును సమన్వయం చేయడం అనే అంశంపై (Aligning
skills, Trust and Sectoral Transformation in the AI Era) శాన్ ఫ్రాన్సిస్కోలోని సిలికాన్ వ్యాలీలో జరిగిన బే ఏరియా కౌన్సిల్ సమావేశంలో మంత్రి నారా లోకేష్ మాట్లాడారు. ‘‘దేశంలోనే యువ రాష్ట్రాలలో ఏపీ ఒకటి. ప్రస్తుతం ఏపీ 180 బిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ కలిగి ఉంది. భవిష్యత్లో ఏపీని 2.4 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే లక్ష్యం. 15 శాతం వృద్ధితోనే ఇది సాధ్యమవుతుంది. ఈ లక్ష్యాన్ని సాధించేందుకు క్లస్టర్ విధానంలో ముందుకెళ్తున్నాం. ఇందుకు ఆటోమోటివ్, రెన్యూవబుల్ ఎనర్జీ, ఎలక్ట్రానిక్స్, సీబీజీ, ఓట్స్, ఆక్వా, ఏఐవంటి దాదాపు 20 రంగాలను గుర్తించాం. ఆయా రంగాలను క్లస్టర్ విధానంలో అభివృద్ధి చేస్తాం. ఇందుకు కావాల్సిన ఎకో సిస్టమ్ను ఏర్పాటు చేస్తాం. కియా గ్లోబల్ ఉత్పత్తిలో 9 శాతం ఏపీనుంచే వస్తోంది. దేశంలో తయారయ్యే ఏసీల్లో 50 శాతం ఏపీనుంచే తయారవుతున్నాయి. వచ్చే 24 నెలల్లో దీనిని 70శాతానికి తీసుకెళ్తాం’’ అని పేర్కొన్నారు.
పునరుత్పాదక శక్తిలో దేశంలోనే టాప్-5లో ఏపీ
‘‘పునరుత్పాదక శక్తిలో దేశంలోనే టాప్-5లో ఏపీ నిలుస్తుంది. ఆయా రంగాల్లో ఏపీ నెం.1 లేదా 2వ స్థానంలో ఉండేలా కృషిచేస్తున్నాం. ఏపీలోనే ఎందుకు పెట్టుబడులు పెట్టాలనే వారికి మూడు కారణాలు చెబుతాను. ఏపీలో అనుభవం, దార్శనికత కలిగిన సమర్థ నాయకత్వం ఉంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అనుభవం కలిగిన నాయకుడు. ఆయనకు సుస్థిర ట్రాక్ రికార్డ్ ఉంది. ఏపీలో ఎన్నికైన ఎమ్మెల్యేల్లో 50శాతంమంది మొదటిసారి గెలిచినవారున్నారు. 25మంది మంత్రుల్లో 17మంది మొదటిసారి మంత్రులు. రెండో కారణం స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. ఇతర రాష్ట్రాలు ఇవ్వలేని వేగాన్ని నిరంతరంగా మేం అందిస్తాం. ఒక్కసారి మాతో ఒప్పందం కుదుర్చుకున్న తర్వాత అది మీ ప్రాజెక్ట్ కాదు.. మా ప్రాజెక్ట్. ప్రతి ఎంవోయూను ట్రాక్ చేస్తాం. నిశితంగా పర్యవేక్షిస్తాం. ఒక నిర్థిష్టస్థాయికంటే ఎక్కువ పెట్టుబడి ఉంటే ప్రత్యేక వాట్సాప్ గ్రూప్ ద్వారా ఫాలో అప్ చేస్తాం. దాదాపు 30 వాట్సాప్ గ్రూప్ల్లో నేను ఉన్నాను’’ అని మంత్రి లోకేష్ వివరించారు.
మార్చిలో గూగుల్ డేటా సెంటర్కు శంకుస్థాపన
‘‘ఆదిత్య మిట్టల్తో నా మొదటి జూమ్ కాల్నుంచి 16 నెలల్లోనే దేశంలోనే అతిపెద్ద స్టీల్ ప్లాంట్ గ్రౌండ్ బ్రేక్ అవుతోంది. పర్యావరణ అనుమతులు, హియరింగ్స్, భూమి కేటాయింపు, ఆర్ అండ్ ఆర్ అన్నీ పూర్తయ్యాయి. గూగుల్తో మా సంభాషణ 13 నెలల్లోనే ముగిసింది. వచ్చే ఏడాది మార్చిలో గూగుల్కు శంకుస్థాపన చేయబోతున్నాం. ఈనెల 12న కాగ్నిజెంట్కు భూమిపూజ చేస్తున్నాం. మూడో కారణం ఏపీలో డబుల్ ఇంజన్ బుల్లెట్ ట్రైన్ సర్కార్ ఉంది. ప్రాంతీయ పార్టీ అయినప్పటికీ కేంద్రంలో కీలక పాత్ర పోషిస్తున్నాం’’ అని మంత్రి లోకేష్ ఉద్ఘాటించారు.
ఏఐ విప్లవంలో అగ్రపథాన ఏపీని నిలుపుతాం
‘‘ఏపీలో గూగుల్ పెట్టుబడి ప్రారంభం మాత్రమే. ఇవాళ గూగుల్ లీడర్ షిప్తో రెండు గంటలపాటు చర్చించాం. ప్రతి కుటుంబంలో ఏఐ నిపుణుడుండాలనేది సీఎం చంద్రబాబునాయుడి విజన్. విద్య, ఆరోగ్యం.. ఏ రంగమైనా ప్రతి కుటుంబం ఏఐ ఆధారిత యూజ్ కేస్ సృష్టించాలి. ఏపీలో కాన్వర్సేషనల్ ఏఐ ద్వారా స్కిల్ సెన్సెస్ చేపడుతున్నాం. ఏసీ రిపేర్ టెక్నీషియన్ నుంచి ఏఐ ఇంజనీర్ వరకు స్కిల్ అసెస్ చేస్తాం. దేశ ఏఐ విప్లవంలో ఆంధ్రప్రదేశ్ను అగ్రపథాన నిలపాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామని మంత్రి నారా లోకేష్ వివరించారు.
సమావేశంలో వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఏఐ డేటా, ఇన్నోవేషన్ హెడ్ ఆండ్రీ డూయెట్, ఫ్యూజన్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్ పార్టనర్ డేవిడ్ గెర్స్టర్, బెంజిమిన్ లార్సన్ (ఇనీషియేటివ్ లీడ్, ఏఐ సిస్టమ్స్ అండ్ సేఫ్టీ, సెంటర్ ఫర్ ఏఐ ఎక్స్ లెన్స్, వరల్డ్ ఎకనమిక్ ఫోరం), పీటర్ లీరో-మునోజ్ (ఎస్ వీపీ ఫర్ టెక్ ఇన్నోవేషన్ అండ్ పాలసీ, బే ఏరియా కౌన్సిల్), లూకే కోవాల్స్కీ (ఎస్ వీపీ కార్పోరేట్ ఆర్కిటెక్చర్, ఒరాకిల్), మాక్స్ లోబో (సీఈవో, ఆస్క్ మీడియా), విశాల్ మిశ్రా (జనరల్ పార్టనర్, క్లియన్ స్టోన్ వెంచర్స్), సీన్ రాండాల్ఫ్ (సీనియర్ డైరెక్టర్, బే ఏరియా కౌన్సిల్ ఎకనమిక్ ఇన్ స్టిట్యూట్), వివేక్ వాద్వా (సీఈవో, వియోనిక్స్ బయోసైన్సెస్), సోంగీ యూన్ (మేనేజింగ్ పార్ట్నర్, ప్రిన్సిపల్ వెంచర్ పార్టనర్స్) తదితరులు పాల్గొన్నారు.















