- తరలివస్తున్న భారీ ఔషధ తయారీ కంపెనీ
- రాంబిల్లి సెజ్లో బ్లూ జెట్ హెల్త్ కేర్ పరిశ్రమ ఏర్పాటు
- నేడు మంత్రి లోకేష్ చేతుల మీదుగా శంకుస్థాపన
- రూ.2,300 కోట్ల పెట్టుబడి.. 1,750 మందికి ఉద్యోగాల కల్పన
అమరావతి (చైతన్య రథం): కూటమి ప్రభుత్వ పాలనలో ఉత్తరాంధ్ర శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. అనేక ఐటీ, ఫార్మా కంపెనీల రాకతో ఈ ప్రాంత రూపురేఖలు పూర్తిగా మారిపోతున్నాయి. ఈ నేపథ్యంలో ఉత్తరాంధ్రకు మరో భారీ ఔషధ తయారీ కంపెనీ రానుంది. అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలంలోని ఇండస్ట్రియల్ పార్క్లో ప్రముఖ ఫార్మా సంస్థ బ్లూ జెట్ హెల్త్కేర్ లిమిటెడ్ పరిశ్రమకు విద్య, ఐటీ మంత్రి నారా లోకేష్ నేటి ఉదయం 10.30కు శంకుస్థాపన చేస్తారు. అనంతరం.. మధ్యాహ్నం 12.20కి సీతపాలెంవద్ద ఏర్పాటుచేసిన వేదికపై సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్స్తో సమావేశమవుతారు. ఇదిలావుంటే, రాంబిల్లి సెజ్లో బ్లూ జెట్ పరిశ్రమ ఫార్మాస్యూటికల్, ఇంటర్మీడియట్, కాంట్రాక్ట్ డెవలప్ మెంట్ తయారీ యూనిట్ను ఏర్పాటు చేస్తుంది. మహారాష్ట్రలో ప్రధాన కార్యాలయం కలిగి ఉన్న బ్లూ జెట్ హెల్త్ కేర్ లిమిటెడ్.. శాస్త్ర ఆధారిత ప్రత్యేక ఔషధ, ఆరోగ్య సంరక్షణ పదార్థాల రంగంలో ప్రఖ్యాత సంస్థగా పేరుగడించింది.
రూ.2,300 కోట్ల పెట్టుబడి.. 1,750మందికి ఉద్యోగాల కల్పన
జాతీయస్థాయిలో గుర్తింపువున్న బ్లూ జెట్ హెల్త్ కేర్ లిమిటెడ్ పరిశ్రమ ఏర్పాటుకు కూటమి ప్రభుత్వం అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలం, జడ్.చింతువ రెవెన్యూ పరిధి సీతపాలెంవద్ద సెజ్లో రెండో విడతగా సేకరించిన భూముల్లో 102.48 ఎకరాలను కేటాయించింది. ఎకరా రూ.40 లక్షలకు కేటాయించడంతోపాటు అదనపు ప్రోత్సహకాలు మంజూరు చేసింది. రూ.2,300 కోట్ల పెట్టుబడితో బ్లూ జెట్ హెల్త్ కేర్ పరిశ్రమను దశలవారీగా అభివృద్ధి చేయనున్నారు. 2028-29 ఆర్థిక సంవత్సరానికి సంస్థ తన కార్యకలాపాలను ప్రారంభించనుంది. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ద్వారా 1,750 మందికి ప్రత్యక్ష ఉద్యోగాలు రానున్నాయి. ఈ పెట్టుబడి స్థానిక పారిశ్రామిక పర్యావరణ వ్యవస్థను బలోపేతం చేయడంతోపాటు అనుబంధ పరిశ్రమలను ప్రోత్సహించి, రాష్ట్రాన్ని అధునాతన ఫార్మాస్యూటికల్ తయారీకి కీలక గమ్యస్థానంగా మార్చడంలో దోహదపడనుంది.














