- 46.85 లక్షల రైతుల ఖాతాల్లోకి రూ.2,670 కోట్ల జమ
- ఒక్కో రైతుకు ఏటా రూ.20 వేలు అందించి అండగా నిలిచాం
- వ్యవసాయానికి అండగా త్వరలో ఏఐ అగ్రానమిస్ట్ సేవలు
- గత పాలకులు తప్పులుచేసి గ్యాగ్ ఆర్డర్లు తెచ్చుకోవటం సిగ్గుచేటు
- పీఎం కిసాన్- అన్నదాత సుఖీభవ మూడోవిడత నిధుల విడుదలలో సీఎం చంద్రబాబు
గన్నవరం (చైతన్య రథం): రాష్ట్రంలోని రైతు సంక్షేమమే ధ్యేయంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోందని, ఏడాదిలో ప్రతి రైతుకు రూ.20 వేల ఆర్థిక సాయం అందించిన ఏకైక ప్రభుత్వం తమదేనని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గం సూరంపల్లిలో జరిగిన ‘పీఎం కిసాన్` అన్నదాత సుఖీభవ’ మూడో విడత నిధుల విడుదల కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. గౌహతీ నుంచి ప్రధాని మోదీ ప్రసంగాన్ని రైతులతో కలిసి వర్చువల్గా వీక్షించారు. ప్రధానమంత్రితో కలిసి సీఎం రాష్ట్రంలోని 46.85 లక్షల మంది రైతులకు రూ.2,670 కోట్లను నేరుగా వారి ఖాతాల్లోకి జమ చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. “ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినట్లుగా రైతులకు అండగా నిలుస్తున్నాం. కేంద్రం ఇచ్చే రూ.6 వేలకుతోడు, రాష్ట్ర ప్రభుత్వం రూ.14 వేలు కలిపి మొత్తం రూ.20 వేలు ఈ ఏడాది రైతులకు అందించాం. గత ప్రభుత్వం కేవలం రూ.7,500 ఇచ్చి చేతులు దులుపుకుంటే, మేము ఆ మొత్తాన్ని రెట్టింపుకంటే ఎక్కువ చేసి ఇస్తున్నాం. ఈ ఒక్క విడతలోనే రాష్ట్ర వాటాగా రూ.1,874 కోట్లు విడుదల చేశాం. మొత్తం మూడు విడతల్లో 2025-26 ఆర్ధిక సంవత్సరానికి రూ.8,985 కోట్లు జమ చేశాం. వచ్చేవారం రోజుల్లో ప్రతీ రైతు ఇంటికీ ప్రజాప్రతిధులు వచ్చి మీ యోగక్షేమాల్ని అడిగి తెలుసుకుంటారు. ప్రస్తుతం యుద్ధ ప్రభావంవల్ల అరటి, గుడ్లులాంటి వ్యవసాయ, పౌల్ట్రీ ఉత్పత్తులకు ఇబ్బంది ఏర్పడుతోంది. ప్రత్యామ్నాయ మార్కెట్లను పరిశీలిస్తున్నాం” అని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు.
అగ్రిటెక్ -భవిష్యత్ వ్యవసాయం
“నేను రైతు బిడ్డను, వ్యవసాయంపై నాకు పూర్తి అవగాహన ఉంది. పట్టిసీమ ద్వారా కృష్ణా డెల్టాకు సాగునీరు అందించి వ్యవసాయాన్ని సుస్థిరం చేశాం. ఇప్పుడు రాష్ట్ర జీవనాడి పోలవరం పూర్తికి కంకణం కట్టుకున్నాం. గత పాలకుల నిర్లక్ష్యంతో డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోయేలా చేశారు. ఇప్పుడు మళ్ళీ రూ.1000 కోట్లతో దానిని నిర్మిస్తున్నాం. వచ్చే గోదావరి పుష్కరాల నాటికి పోలవరం ప్రాజెక్టును జాతికి అంకితం చేస్తాం. వ్యవసాయంలో ఆధునీకరణ తీసుకురావడమే మా లక్ష్యం. డ్రోన్ల ద్వారా విత్తనాలు చల్లడం, డ్రిప్ ఇరిగేషన్ వంటి సాంకేతికతను ప్రోత్సహిస్తున్నాం. ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ తరహాలో ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ ఏర్పాటు చేయబోతున్నాం. ఇది రైతులకు ఆధునిక సాగు పద్ధతుల్లో మెరుగైన సలహాలిస్తుంది. అలాగే ఏలూరు జిల్లాలో 500 ఎకరాల్లో కోకో సిటీ ఏర్పాటు చేస్తాం. మేము అధికారంలోకి వచ్చిన 20 నెలల్లోనే రాష్ట్ర బ్రాండ్ ఇమేజ్ను తిరిగి తెచ్చాం. కేవలం ఆర్థిక సాయమే కాకుండా, 47 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించి 24 గంటల్లోనే నగదు జమ చేస్తున్నాం. ఆక్వా రైతులకు యూనిట్ విద్యుత్ ను రూ. 1.50 కే ఇస్తున్నాం. సంక్షేమ పథకాలైన తల్లికి వందనం, స్త్రీ శక్తి, ఉచిత గ్యాస్ సిలిండర్లను తప్పకుండా అమలు చేస్తున్నాం” అని ముఖ్యమంత్రి అన్నారు.
ధార్మిక సంస్థల పవిత్రతపై రాజీ లేదు
కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి పవిత్రమైన లడ్డూ ప్రసాదాన్ని కల్తీ చేసి గత పాలకులు ఘోర తప్పిదం చేశారని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. తప్పులు చేసి, పాపాలు చేసి, వాటి గురించి ఎవరూ మాట్లాడకూడదని కోర్టులకు వెళ్లి గ్యాగ్ ఆర్డర్లు తేవడం అలవాటుగా మార్చుకున్నారని ఆక్షేపించారు. వివేకా హత్య విషయంలోనూ ఇలాగే చేశారని .. తప్పు చేసిన వారు ప్రజల ముందు దోషులుగా నిలబడక తప్పదని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమానికి మంత్రి అచ్చెన్నాయుడు, ఎంపీ బాలశౌరి, స్థానిక ప్రజాప్రతినిధులు, రైతులు హాజరయ్యారు.















