- 100 రోజుల యాక్షన్ ప్లాన్తో నిరూపించాలి
- జలధారను కలెక్టర్లు సవాల్గా తీసుకోవాలి
- అమలుకు ఉపాధి హామీ నిధులు ఇంటిగ్రేట్ చేయండి
- జలధారతో భూమికి జలహారతి ఇవ్వాలి
- జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్లో సీఎం చంద్రబాబు
అమరావతి (చైతన్య రథం): జలధార- జలహారతి కార్యక్రమాన్ని అన్ని జిల్లాల కలెక్టర్లు, జిల్లాల యంత్రాంగం అత్యంత ప్రాధాన్యతాంశంగా తీసుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. సోమవారం తాడిపత్రిలో జలధార -జలహారతి కార్యక్రమాన్ని ముగించుకుని అమరావతికి చేరుకోగానే క్యాంప్ కార్యాలయంలో జలధార కార్యక్రమం అమలుపై అధికారులతో సమీక్షించారు. జిల్లాల కలెక్టర్ల సహా జిల్లాల్లోని వివిధ శాఖల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా జలధార కార్యక్రమం జరిగిన తీరుపై సీఎం ఆరా తీశారు. శ్రీకాకుళం జిల్లాలో సాగునీటి సంఘాల సభ్యులు భాగస్వామ్యం బాగుందని సీఎంకు అధికారులు వివరించారు. కార్యక్రమం మొదలు పెట్టిన తొలి రోజునే నంద్యాల, పశ్చిమ గోదావరి జిల్లాలు 100 రోజుల యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయడంపై ముఖ్యమంత్రి అభినందనలు తెలిపారు. నీటి సంరక్షణలో ఇప్పటికే తాను చేపట్టిన చర్యలను అన్నమయ్య జిల్లా కలెక్టర్ వీడియో కాన్ఫరెన్సులో వివరించారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ… “అన్నమయ్య జిల్లా కలెక్టర్ జలధార పేరుతో అద్భుతంగా నీటి సంరక్షణ చర్యలు చేపట్టారు. అన్నమయ్య కలెక్టర్ తీసుకున్న చొరవతో 8.59 మీటర్లమేర భూగర్భ జలాలు పెరిగాయి. 20 వేల బోర్లు రీ-ఛార్జ్ అయ్యాయి. ప్రతీ జిల్లా కూడా అన్నమయ్య జిల్లా మోడల్ ఫాలో కావాలి. ఈ కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేస్తే… కచ్చితంగా మార్పు కన్పిస్తుంది. సత్ఫలితాలు వస్తాయి. నీటి సంరక్షణతో రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి జరుగుతుందని నిరూపించాలి. ఈ కార్యక్రమాన్ని ప్రజా ఉద్యమంగా మలిచేందుకు.. వారి భాగస్వామ్యం ఉండేలా సాగునీటి సంఘాల సభ్యులు బాధ్యత తీసుకోవాలి” అని సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు.
జిల్లా కలెక్టర్లే టీమ్ లీడర్లు…
“జలధారతో జలహారతి కార్యక్రమానికి ఉపాధి హామీ పథకంతో అనుసంధానం చేసుకోవాలి. వీలైనంత వరకు నిధుల కొరత రానీయకుండా చూస్తాం. కార్యక్రమంలో నిధులకంటే చిత్తుశుద్ధి ముఖ్యం. కార్యక్రమాన్ని సక్సెస్ చేయడాన్ని జిల్లా కలెక్టర్లు బిగ్ ఛాలెంజ్గా తీసుకోవాలి. టీమ్ లీడర్లుగా కలెక్టర్లు వ్యవహరించి అందర్నీ భాగస్వాములను చేయాలి. ప్రజా భాగస్వామ్యంతోనే జలహారతి కార్యక్రమం సక్సెస్ అవుతుంది. కలెక్టర్లు ఏమేరకు చొరవ తీసుకుంటున్నారనేది ఈ కార్యక్రమంతో క్లారిటీ వస్తుంది. జలధార కార్యక్రమంలో చెరువులు చాలా కీలకం. ప్రతి చెరువునూ నింపాలి. మైనర్ బేసిన్లు, సబ్ బేసిన్లు, క్యాస్కేడ్లు, మైనర్ ఇరిగేషన్ ట్యాంకులు ఎన్ని ఉన్నాయో చూడాలి. వాటికి నీటి సౌకర్యం కల్పించాలి. వాటి సోర్సెస్ నుంచి నీరు రాకుంటే… దానికి కారణాలు వెలికి తీయాలి. ప్రతి చెరువునూ నింపాలి. భూగర్భ జలాలను పెంచాలి. ప్రతి కాల్వనూ బాగు చేయాలి. గుర్రపు డెక్క, సిల్ట్ తొలగింపువంటి అంశాలపై ఫోకస్ పెట్టాలి. ఇది జరిగితే వర్షాకాలంలో ముంపు బాధ తప్పుతుంది. ఇదే లక్ష్యంతో కలెక్టర్లు కార్యాచరణను సిద్దం చేయాలి. నీటి రక్షణతో వ్యవసాయం మెరుగవుతుంది. విద్యుత్ ఆదా అవుతుంది. స్వర్ణాంధ్ర పది సూత్రాలు కూడా నీటి సంరక్షణ చర్యలతో సక్సెస్ చేయవచ్చు. జిల్లాల జీఎస్డీపీ, రాష్ట్ర జీడీపీ పెరగడానికి ఈ కార్యక్రమం దోహదపడుతుంది” అని ముఖ్యమంత్రి వివరించారు. వీడియో కాన్ఫరెన్సులో సీఎస్ సాయి ప్రసాద్, ఇరిగేషన్, పంచాయతీరాజ్ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.















