- ప్లానింగ్ కోసం ఆంధ్రా యూనివర్శిటీ సేవలు
- విశాఖ ఎకనామిక్ రీజియన్ సమగ్రాభివృద్ధికి మైక్రో ప్లానింగ్
- ఈస్ట్-వెస్ట్ కనెక్టివిటీపై దృష్టి సారించడం ద్వారా విశాఖ ప్రాంత అభివృద్ధి
- విశాఖ ఎకనామిక్ రీజియన్ అభివృద్ధి ప్రణాళికల సమీక్షలో సీఎం చంద్రబాబు
అమరావతి (చైతన్యరథం): విశాఖ ఎకనామిక్ రీజియన్ సమగ్రాభివృద్ధికి సూక్ష్మ స్థాయి ప్రణాళికలను రూపొందించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆదేశించారు. ఈ రీజియన్ పరిధిలోని అన్ని ప్రాంతాలను, అన్ని రంగాలను పరిగణలోకి తీసుకుంటూ పూర్తిస్థాయి అభివృద్ధి ప్రణాళిక చేయాలని సూచించారు. బుధవారం ఆయన క్యాంపు కార్యాలయంలో విశాఖ ఎకనామిక్ రీజియన్-వీఈఆర్ అభివృద్ధి ప్రణాళికలపై సమీక్షించారు. విశాఖ రీజియన్ పరిధిలో కొత్త ప్రాజెక్టులు.. సీఆర్జెడ్ రీ-క్లాసిఫికేషన్, వైజాగ్ బే సిటీ, బే-సిటీ అథారిటీ ఏర్పాటు వంటి అంశాలపై సమీక్షించారు. వీఈఆర్ పరిధిలో మొత్తంగా రూ.9.50 లక్షల కోట్ల వరకు పెట్టుబడులు వచ్చేందుకు అవకాశం ఉందని అధికారులు వివరించారు. ప్రైవేట్ రంగం నుంచి రూ.5.30 లక్షల కోట్ల పెట్టుబడులు, అలాగే రూ.3.50-4 లక్షల కోట్ల మేర ప్రభుత్వ ప్రాజెక్టుల కోసం ఖర్చు చేయాల్సి వస్తుందని అధికారులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఇప్పటికే గూగుల్ ఏఐ డేటా సెంటర్, ఆర్సెల్లార్ నిప్పన్ స్టీల్ప్లాంట్ వంటివి విశాఖ, ఉత్తరాంధ్ర కేంద్రంగా వచ్చిన అంశాన్ని అధికారులు ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఇప్పటికే విశాఖలో ఐటీ, డేటా సెంటర్ల సహా వివిధ రంగాలకు చెందిన ఎకో సిస్టం ఏర్పాటైందని…. దీనికి అనుగుణంగా వీఈఆర్ డెవలప్మెంట్ ప్లాన్ సిద్ధం చేస్తున్నామని… బేసిటీ ప్రాజెక్టును యాంకర్ ప్రాజెక్టుగా అభివృద్ధి చేపట్టేలా ప్రణాళికలను సిద్దం చేసినట్టు అధికారులు వివరించారు.
సీఆర్జెడ్ నిబంధనలకు అనుగుణంగా వీఈఆర్ ప్రాజెక్ట్
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ… ‘వీఈఆర్ సమగ్రాభివృద్ధికి సూక్ష్మస్థాయి ప్రణాళికలు రూపొందించాలి. శ్రీకాకుళం జిల్లాలోని మూలపేట పోర్టు మొదలుకుని రాజమహేంద్రవరంలోని అఖండ గోదావరి ప్రాజెక్టు వరకు ప్రతి ప్రాంతం.. ప్రతి టూరిజం స్పాట్, ప్రతి రంగాన్ని అభివృద్ధి చేసేలా… పెట్టుబడులు వచ్చేలా చేయడంతో పాటు అవసరమైన మేరకు ఎక్స్పీరియన్స్ జోన్లు ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలి. వివిధ ప్రాజెక్టులను అనుసంధానిస్తూ వీఈఆర్ ప్రగతి సాగేలా చూడాలి. వీఈఆర్ ప్రాజెక్టులో వైజాగ్ బే సిటీది కీలక పాత్ర. ఈ ప్రాజెక్టు ద్వారా రీజియన్ పరిధిలో పెద్ద ఎత్తున పట్టణాభివృద్ధి పనులు జరగాలి. ఇందుకు వివిధ పధకాల నిధులను కన్వెర్జెన్స్ చేసి ఈ ప్రాజెక్టు కోసం వినియోగించాలి. అలాగే కేంద్ర నిధులను మరింతగా రాబట్టే అంశంపై దృష్టి సారించాలి. వీఈఆర్ పరిధిలో ఉన్న ఆరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీల్లో అద్భుతమైన అభివృద్ధి జరగాలి. ఈ ప్రాజెక్టును వినియోగించుకుని ప్రతి ప్రాంతంలోనూ మౌలిక సదుపాయాల కల్పన పూర్తిస్థాయిలో జరగాలి. స్థానిక ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనులు చేపట్టాలి. ప్రాజెక్టులు రాబట్టాలి. పెట్టుబడుల సాధన ద్వారా వివిధ రంగాల్లో ఉద్యోగాలు కల్పించే దిశగా చర్యలు చేపట్టాలి.
ఈ మేరకు స్థానికంగా ఉండే యువతకు స్కిల్స్ అప్గ్రేడ్ చేయాలి. కోస్టల్ మేనేజ్మెంట్ ప్రణాళికలకు అనుగుణంగా ప్రాజెక్టులు చేపట్టాలి. పరిశ్రమలు, టౌన్షిప్ ఎకో సిస్టమ్, టూరిజం ప్రాజెక్టులను అందుబాటులోకి తీసుకురావాలి. దీంట్లో భాగంగా పీపీపీ ప్రాజెక్టులను అమల్లోకి తీసుకురావడంతో పాటు.. వాటికి వీజీఎప్ స్కీం అమలు చేసే అంశాలను పరిశీలించండి. సీఆర్జెడ్ నిబంధనలకు అనుగుణంగా వీఈఆర్ ప్రాజెక్టును పూర్తిచేద్దాం. జరుగుతున్న అభివృద్ధి.. చేపడుతున్న ప్రాజెక్టులు.. వీటివల్ల కలిగే ప్రయోజనాలు.. ఉద్యోగ-ఉపాధి అవకాశాలు వంటి అంశాలను ప్రజలకు ఎప్పటికప్పుడు చెప్పాలి. వీఈఎర్ అభివృద్ధి ప్రణాళికల్లో విద్యా సంస్థలను, యూనివర్శిటీలను కలుపుకుని వెళ్లాలి. ముఖ్యంగా ఆంధ్రా యూనివర్శిటీ సేవలను వినియోగించుకోవాలి.” అని ముఖ్యమంత్రి అన్నారు.
బే సిటీ కోసం ప్రత్యేక ఎగ్జిక్యూటివ్ కమిటీ
“బే సిటీ ప్రాజెక్టు అమలు కోసం ఎగ్జిక్యూటివ్ కమిటీని ఏర్పాటు చేయాలి. అన్ని ప్రాజెక్టులను అనుసంధానం చేస్తే మెరుగైన ఫలితాలొస్తాయి. జీసీసీ, ఫిన్టెక్, లాజిస్టిక్స్ ఇంటిగ్రేషన్ రంగాలపై దృష్టి సారించాలి. ఈస్ట్ టు వెస్ట్ కనెక్టివిటీపై ఇప్పుడు జాతీయ స్థాయిలో చర్చ జరుగుతోంది. ఇటీవలే ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఇదే అంశాన్ని ప్రస్తావించారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని ప్రాజెక్టుల రూపకల్పన, పెట్టుబడుల సాధన జరిగేలా ప్రణాళికలను సిద్ధం చేయండి. రోడ్-రైల్ ఇంటిగ్రేషన్ జరగాలి. కాకినాడ, విశాఖలతో పశ్చిమ భారత్లోని వివిధ ప్రాంతాలు అనుసంధానం కావాలి. ముఖ్యంగా నాలుగు ఎయిర్పోర్టులు, మÖడు పోర్టులు లింక్ చేస్తే అభివృద్ధి వేగంగా జరగడంతో పాటు పెట్టుబడులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. విశాఖలో జంతు ప్రదర్శనశాలను మరింత అభివృద్ధి చేసేలా చర్యలు చేపట్టాలి. విశాఖ అంతర్జాతీయ నగరంగా ఎదుగుతోంది. ఇలాంటి ప్రాంతంలో ఉన్న జంతు ప్రదర్శనశాల మంచి పర్యాటక ప్రాజెక్టు అవుతుంది.” అని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. సమీక్షలో చీఫ్ సెక్రటరీ సాయిప్రసాద్, ఆర్థిక, పరిశ్రమలు, పురపాలక, అటవీ, ఇంధన, పర్యాటక, విద్య, వైద్య శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
















